AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday 2 January 2018

ప్రపంచం World 21వ ప్రపంచ పర్యావరణ సదస్సు

21వ ప్రపంచ పర్యావరణ సదస్సు

గ్లోబల్ వార్మింగ్, విపత్తు ప్రభావాలు, వాతావరణ మార్పుల నుంచి పుడమిని రక్షించడంతోపాటు వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు 21వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 21)ను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి 195 దేశాల నేతలు, 40 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. హరిత గృహ వాయువుల గాఢతను తగ్గించి భూ సగటు ఉష్ణోగ్రతలను (పారిశ్రామిక విప్లవానికి ముందటి ఉష్ణోగ్రతలతో పోల్చితే) 2 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు నిర్దిష్ట గడువును విధించడానికి ప్రపంచ దేశాలు ఈ వార్షిక సదస్సులో అంగీకరించాయి. వాతావరణ మార్పులపై ఇంతటి పాలనాపరమైన చైతన్యం గతంలో ఎప్పుడూ రాలేదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ పేర్కొన్నారు.
సమగ్ర ఒప్పందానికి మోదీ పిలుపు
సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరులో ప్రపంచ దేశాల మధ్య సమానత్వ భావన, బాధ్యతల పంపిణీ కోసం సమగ్ర, నిష్పాక్షిక, దీర్ఘకాలిక ఒప్పందాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. ‘వాతావరణ మార్పు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్. ఇది భూతాపం ఫలితమే. పారిశ్రామిక యుగంలో శిలాజ ఇంధనాల భారీ వినియోగ పర్యవసానాలను ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత పురోగతి సాధించేందుకు కర్బన విస్తృతి (కార్బన్ స్పేస్)లో వాటికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలపై ఉంది. ప్రస్తుత కర్బన ఉద్గారాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏమాత్రం కారణం కాదు’ అని మోదీ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన రుగ్వేదంలోని సూక్తిని, మహాత్మాగాంధీ నమ్మిన సిద్ధాంతాన్ని ఉటంకించారు. ‘ప్రకృతితో కలిసి జీవించడం తప్ప దాన్ని ధ్వంసం చేయడం భారత సంస్కృతి కాదు. ఇది భారతీయులు అనాదిగా పాటిస్తున్న జీవన విధానం’ అని పేర్కొన్నారు. సాంకేతికత, పురోగతిలో ఇతర దేశాలకూ భాగస్వామ్యం కల్పించాలని ప్రధాని మోదీ అభివృద్ధి చెందిన దేశాలకు విజ్ఞప్తి చేశారు.

‘పరంపర’ ఆవిష్కరణ
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో మన దేశ సంప్రదాయాలను వివరించే పరంపర అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నూతన పరికల్పనలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభం
కాప్-21 సందర్భంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ మిషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ సౌర విద్యుత్‌ను అందరికీ అందుబాటులోకి తేవడం; నాణ్యమైన జీవనాన్ని అందించడం; పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నివాసాలను ఏర్పాటు చేయడం విశ్వజనీన ఆకాంక్షలని తెలిపారు. వీటిని నెరవేర్చేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. మిషన్ ఇన్నోవేషన్‌లో భారత్‌తో కలిసి నడిచేందుకు అమెరికా, చైనా సహా 19 దేశాలు అంగీకరించాయని ప్రధాని వెల్లడించారు.

2030 నాటికి ఉద్గారాల తీవ్రత 33 శాతం తగ్గింపు 
భారత్ 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను స్థూల దేశీయోత్పత్తిలో 33 శాతం (2005 నాటి స్థాయిలతో పోల్చితే) తగ్గించనుందని మోదీ తెలిపారు. 2022 నాటికి 40 శాతం విద్యుత్‌ను శిలాజేతర ఇంధనాల నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. పెద్దమొత్తంలో గ్రీన్‌హౌస్ ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే భారత్‌లో తలసరి ఉద్గారాల విడుదల చాలా తక్కువ. తలసరి పరంగా చూస్తే ఈ విషయంలో భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో నిలుస్తుంది.

ఇండియా పెవిలియన్ ప్రారంభం
సదస్సుకు ముందు ఏర్పాటు చేసిన భారత పెవిలియన్‌ను మోదీ ప్రారంభించారు. వాతావరణ మార్పుల విషయంలో భారత్ స్థానం గురించి తెలిపే ఎన్నో విషయాలు పెవిలియన్‌ను సందర్శించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై పోరుకు భారత్ సారథ్యం వహిస్తుందని, ఈ మేరకు ప్రాథమిక నిధి కింద రూ.175 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ ఇంధన ప్రణాళిక సౌర విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించిందని, 2022 నాటికి భారత్ 100 గిగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని వివరించారు.

‘జల, వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని’ ప్రకటించిన పారిస్ సదస్సు
మానవ సుస్థిర అభివృద్ధికి కీలకమైన నీటి వ్యవస్థలను వాతావరణ మార్పుల ప్రభావం నుంచి కాపాడాల్సిన ఆవశ్యకతను తెలిపే ‘జల, వాతావరణ మార్పు అనుసరణ ఒప్పందాన్ని’ పారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు డిసెంబర్ 2న ప్రకటించింది. వాతావరణ మార్పులపై ‘లిమా టు ప్యారిస్ యాక్షన్ అజెండా’ పేరిట నిర్వహించిన ‘వాటర్ రీసెలైన్స్ ఫోకస్’ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. దీనికి భారత్ సహా పలు దేశాలు; ప్రపంచవ్యాప్తంగా ఉన్న 290 నదీ తీర ప్రాంత సంస్థలు; వ్యాపార, పౌర సమాజాలు మద్దతు తెలిపాయి. నీటి వ్యవస్థలను రక్షించేందుకు మెరుగైన భూగర్భ జల నిర్వహణను చేపట్టనున్నట్లు భారత్ పేర్కొంది. నీటి వ్యవస్థల రక్షణకు ఏ దేశం ఏ ప్రణాళికలను, నీటి నిర్వహణ వ్యవస్థలను, నీటి కొలమానాలను అనుసరిస్తున్నాయి?, నిధులను ఏవిధంగా సమీకరిస్తున్నాయి?, ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నాయి? అనే విషయాలను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

అభివృద్ధి చెందిన దేశాలే అధిక వాటా ఇవ్వాలి
వాతావరణ మార్పుపై పోరుకు అన్ని దేశాలు సమానంగా ఆర్థిక సాయం చేయాలన్న వాదనను అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి వ్యతిరేకించింది. సమాన వాటా భరించాలనడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని హెచ్చరించింది. అభివృద్ధి చెందిన దేశాలు అధిక భారం మోయాలని డిమాండ్ చేసింది. వందకుపైగా దేశాలు గల ఈ కూటమిలో భారత్ కూడా సభ్య దేశం. అభివృద్ధి చెందుతున్న దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు, వాతావరణ మార్పునకు అనుగుణంగా మారేందుకు ఏటా పది వేల కోట్ల డాలర్ల చొప్పున 2020 వరకు సాయం చేయనున్నట్లు పారిశ్రామిక దేశాలు 2009లో పేర్కొన్నాయి. కానీ ఆ హామీని నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో పారిస్ సదస్సు చట్టబద్ధమైన సమగ్ర ఒప్పందాన్ని రూపొందించాలని, ఆర్థిక సాయం అనే అంశాన్ని అందులో పొందుపరచాలని ప్రధాని మోదీ కోరారు. ఒప్పంద ముసాయిదా రూపకల్పనకు ఏడీపీ (అడహక్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ద దర్బన్ ప్లాట్‌ఫాం) కృషి చేస్తోంది. ఏడీపీని 2011లో డర్బన్ (దక్షిణాఫ్రికా)లో కాప్17 సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఒప్పంద ప్రణాళిక సమావేశ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ - 1992) అధికార పరిధికి లోబడి ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ సోలార్ కూటమి ప్రారంభం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌లు సంయుక్తంగా అంతర్జాతీయ సోలార్ కూటమిని పారిస్‌లో ప్రారంభించారు. 121 ఉష్ణమండల దేశాలు సౌరశక్తిని ఒడిసిపట్టుకునేలా చేయడమే ఈ కూటమి ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. రానున్న ఐదేళ్లలో ప్రాథమిక శక్తివనరుల పరిశోధనలో పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు భారత్, మరో 17 దేశాలు మిషన్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

పారిస్ ప్యాకేజీకి 196 దేశాల గ్రీన్‌సిగ్నల్
వాతావరణ మార్పులపై పోరు దిశగా నాలుగేళ్ల (2011) నుంచి జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. 48 పేజీలతో కూడిన పారిస్ ముసాయిదా ఒప్పందానికి 196 దేశాలు డిసెంబర్ 5న ఆమోదం తెలిపాయి. ఈ ముసాయిదా ఒప్పందంపై ఇక ఆయా దేశాల మంత్రులు చర్చలు జరిపి తుది ఒప్పందాన్ని రూపొందిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మెజారిటీ దేశాలు ‘పర్యావరణ రక్షణ ఉమ్మడి బాధ్యతలో స్థాయి భేదాలు’ అనే అంశంపై ఎటూ తేల్చుకోలేకపోయాయి. ఒకే ఆలోచనా ధోరణి గల అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున మలేసియా; జీ77, చైనా గ్రూప్ తరఫున దక్షిణాఫ్రికా అభిప్రాయాలను వెల్లడించాయి. వాతావరణ మార్పుల ఉపశమన చర్యలు, ఆర్థిక సాయం, అనుసరణ, అంగీకారం, సమీక్ష, శుద్ధ సాంకేతికత పంపకం, సామర్థ్య నిర్మాణం తదితర అంశాల్లో తుది ఒప్పందం అన్ని దేశాలను సమానంగా పరిగణనలోకి తీసుకోవాలని, బాధ్యతల్లో స్థాయీ భేదాలను చూపాలని ఆ రెండు దేశాలు పునరుద్ఘాటించాయి. మొత్తం మీద ముసాయిదా ఒప్పందం రూపకల్పన వరకు జరిగిన చర్చలు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు అనుకూలంగా సాగకుండా అభివృద్ధి చెందిన దేశాలు అడ్డుకున్నాయి. ఉమ్మడి బాధ్యతలో స్థాయీ భేదాలపైన స్పష్టత రాకుండా చేయడంలో కూడా అవి సఫలీకృతమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రుల స్థాయి చర్చలు కీలకంగా మారనున్నాయి. చిన్న దేశాల మంత్రులు ఈ చర్చల్లో పాల్గొనకపోవడం వల్లే కోపెన్‌హాగెన్ సదస్సు (2009) ఫలితం లేకుండా ముగిసింది.


No comments:

Post a Comment