AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 10 February 2018

జాతీయం 2014 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం

జాతీయం 2014 సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం 

జనవరి 2014 జాతీయం
గణతంత్ర అతిథి షింజో 
భారత 65వ గణతంత్ర దినోత్సవాలకు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జపాన్‌కు చెందిన ఓ ప్రధాని భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఇదే ప్రథమం. 

క్షమాభిక్ష జాప్యమైతే మరణశిక్షను తగ్గించొచ్చు: సుప్రీం 
మరణశిక్ష పడిన నేరస్తుడికి క్షమాభిక్ష ప్రసాదించడంలో కారణాల్లేని జాప్యాన్ని ప్రదర్శిస్తే వారి శిక్షను జీవితఖైదుగా తగ్గించేందుకు ప్రాతిపదికగా తీసుకోవచ్చని సుప్రీంకోర్టు జనవరి 21న పేర్కొంది. మరణశిక్ష పడిన 15 మంది ఖైదీల పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న నేరస్తుల మరణశిక్షను కూడా వారి పరిస్థితి ఆధారంగా జీవిత ఖైదుకు తగ్గించవచ్చని కోర్టు పేర్కొంది. మరణశిక్ష అమలు, క్షమాభిక్ష పిటిషన్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వాధికారులకు మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు జారీ చేసింది. 

జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ప్రారంభం
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్- ఎన్‌యూహెచ్‌ఎం) పథకాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ బెంగళూర్‌లో జనవరి 20న ప్రారంభించారు. పట్టణ పేద ప్రజలకు సమర్థంగా ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2015 మార్చి నాటికి 50 వేలకు పైగా జనాభా ఉండే 779 పట్టణాలకు పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 220 మిలియన్ల మందికి ఆరోగ్య సేవలు అందుతాయి. 

2005 ముందునాటి నోట్లు ఉపసంహరణ
2005 సంవత్సరానికి ముందు ముద్రించిన అన్ని కరెన్సీ నోట్లనుఉపసంహరించుకుంటున్నట్లు భారత రిజర్వ్‌బ్యాంక్ (ఆర్‌బీఐ) జనవరి 22న ప్రకటించింది. రూ. 500, రూ. 1000 నోట్లతోపాటు అన్ని పాతనోట్లను ఏప్రిల్ 1 నుంచి ఉపసంహరిస్తారు. ప్రజలు పాతనోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చు. 2005 నుంచి నోట్ల వెనుకవైపు మధ్యలో, కింది భాగంలో సంవత్సరాన్ని ముద్రిస్తున్నారు. దీని ఆధారంగా 2005కు ముందున్న నోట్లను సులువుగా గుర్తించవచ్చు. నల్లధనం, నకిలీనోట్లను అరికట్టే చర్యల్లో భాగంగా ఈ పాతనోట్లను తొలగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

ఢిల్లీలో నవకల్పన కేంద్రం 
జాతీయ నవకల్పన మండలి (నేషనల్ ఇన్నోవేటివ్ కౌన్సిల్- ఎన్‌ఐసీ)ని జనవరి 23న ఎన్‌ఐసీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి సలహాదారుడు శ్యామ్ పిట్రోడా ప్రారంభించారు. దేశంలో ఇది మూడో ఎన్‌ఐసీ కేంద్రం. ఇప్పటికే బెంగళూరు, కోల్‌కతాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.

అండమాన్‌లో పడవ మునక
అండమాన్ తీరం వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ 2014, జనవరి 26న ప్రమాదవశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోయింది. రోస్ దీవి నుంచి ఉత్తర అఖాతంవైపు ప్రయాణిస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. ఆక్వా మెరైన్ అనే ఈ పడవలో 25 మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుండగా, మితిమీరిన సంఖ్యలో ప్రయాణికులను ఓవర్‌లోడ్ చేసిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. 

అగ్ని-4పరీక్షవిజయవంతం 
అణ్వాయుధాలను మోసుకుపోగల సామర్థ్యం ఉన్న అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ జనవరి 20న ఒడిశా వీలర్ ఐలాండ్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని ఈ క్షిపణి ప్రయోగించిన 20 నిమిషాల్లోనే విజయవంతంగా ఛేదించింది. దీంతో సైన్యానికి అప్పగించేందుకు వీలుగా క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైందని డీఆర్‌డీఓ ప్రకటించింది. ఈ క్షిపణి 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అలాగే 850 కిలోమీటర్లు పైకి వెళ్లి తిరిగి వాతావర ణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 

చిలకా సరస్సుకు ఐక్యరాజ్య సమితి పర్యాటక ప్రాజెక్టుగా గుర్తింపు
ఒడిశాలోని చిలక సరస్సును సుస్థిర పర్యాటక రంగం, జీవనోపాధి వనరుల అభివృద్ధి, పక్షుల వలస కొనసాగింపునకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యునెటైడ్ నేషన్స్ ఆఫ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఎంపిక చేసింది. చిలకా సరస్సుతో కలిపి ఎనిమిది ప్రాంతాలను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఆసియాలో ఈ సరస్సు ఒక్కటే యూఎన్ ప్రాజెక్టుకు ఎంపికవడం విశేషం. ఈ ప్రాజెక్టు కింద చిలకా అభివృద్ధి ప్రాజెక్టుకు సహాయం చేస్తారు. సరికొత్త పర్యాటక కార్యక్రమాలు, జీవనోపాధి చర్యలు చేపట్టడం ద్వారా వలస పక్షుల పరిరక్షణకు అభివృద్ధి వ్యూహాలు అమలు చేస్తారు. 

జైనులకు మైనారిటీ హోదా 
జైనులకు మైనారిటీ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ 2014 జనవరి 20న నిర్ణయం తీసుకుంది. మన దేశంలో దాదాపు 50 లక్షల మంది జైనులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 10 శాతం మంది ముంబైలోనే ఉన్నారు. ఇప్పటివరకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదాను కలిగి ఉన్నారు.

బెంగళూరులో ద్విచక్ర అంబులెన్సు సేవలు
క్షతగాత్రులు, అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించాల్సిన రోగుల కోసం బెంగళూరులో సరికొత్త అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించి సకాలంలో ఆసుపత్రులకు చేరేలా కర్ణాటక ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. బెంగళూరులో ఓ వైద్యుడు తన ద్విచక్ర వాహనానికి ప్రాథమిక చికిత్స సామాగ్రి పెట్టెతో ప్రమాదాలు జరిగిన చోటుకే వెళ్లి వైద్యం చేసేవారు. ఆ వైద్యుని స్ఫూర్తితోనే ద్విచక్ర అంబులెన్సులు ప్రవేశపెట్టడానికి నిర్ణయించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు.

పన్నెండో ప్రవాసీ భారతీయ దివస్
12వ ప్రవాసీ భారతీయ దివస్ న్యూఢిల్లీలో జనవరి 7నుంచి 9 వరకు జరిగింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివిధ రంగాల్లో సేవలందించిన 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులందుకున్న వారిలో మహాత్మా గాంధీ మనుమరాలు, దక్షిణాఫ్రికా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఇలాగాంధీ, భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్ లీసా మారియా సింగ్, ఫిజిలోని రామకృష్ణ మిషన్, వర్గీస్, వాసుదేవన్‌చంచ్లానీ, వికాస్ చంద్ర, సన్యాల్ తదితరులున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మలేసియా సహజవనరులు, పర్యావరణ మంత్రి దాతు సెరి జి. పళనివేల్ హాజరయ్యారు. 

పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం 
అణ్వస్త్ర సామర్థ్యం గల పృథ్వి -2 క్షిపణిని భారత్ జనవరి 7న ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వెయ్యి కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు. 2003లో పృథ్విని సైన్యంలో ప్రవేశపెట్టారు. 

అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిర్మించిన ప్లాట్‌ఫామ్ నెంబర్-1 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా రికార్డుల్లోకెక్కింది. దీని పొడవు 1,355.40 మీటర్లు. ఈ విషయూన్ని నార్త్ ఈస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ ఏకే ఆటల్ జనవరి 9న వెల్లడించారు.

జాతీయ యువ విధానానికి కేంద్రం ఆమోదం 
జాతీయ యువజన విధానాన్ని (నేషనల్ యూత్ పాలసీ-ఎన్‌వైపీ) జనవరి 9న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్‌వైపీ-2003 స్థానంలో కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్య, నైపుణ్యం అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమ స్థాపన, ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం, క్రీడలు, సామాజిక విలువలను పెంపొందించడం, సామాజిక భాగస్వామ్యం, రాజకీయాలు, ప్రభుత్వాల్లో పాలుపంచుకోవడం, సమ్మిళత సామాజిక న్యాయం వంటి అంశాలపై ఈ విధానం దృష్టి సారిస్తుంది. దేశంలోని 15-29 ఏళ్ల యువతకు ఈ విధానం వర్తిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరు దేశ జనాభాలో 27.5 శాతం ఉన్నారు.

మహిళా ఉద్యోగినులకు ఎస్‌బీఐ కానుక
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మహిళా ఉద్యోగులకు రెండేళ్ల సెలవును తీసుకోవడానికి అవకాశం కల్పించింది. భార్యలేని లేదా విడాకులు తీసుకున్న పురుషులకూ ఈ వెసులుబాటు కల్పించింది. పిల్లల చదువు, తల్లిదండ్రులు, అత్తమామల ఆరోగ్యసంరక్షణ వంటి ఎలాంటి అవసరాలకైనా రెండేళ్లపాటు సెలవులు తీసుకోవచ్చని ఎస్‌బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. 

కౌమార ఆరోగ్యం కోసం కేంద్రం కొత్త పథకం 
కౌమారదశలో ఆరోగ్య, ఆహార, ఇతర సాంఘిక సమస్యలను అధిగమించేందుకు 10-19 ఏళ్ల లోపు వారికోసం కేంద్రం కొత్తపథకాన్ని ఆరంభించింది. దీనికి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే) అని నామకరణం చేసింది. పథకం కింద దేశంలోని 34.3 కోట్ల మంది కౌమార బాలబాలికలకు పోషకాహారం, ప్రత్యుత్పత్తి అవ గాహన, శారీరక, మానసిక ఆరోగ్యం, లైంగిక వేధింపులు, అసాంక్రమిక వ్యాధులతోపాటు జీవనశైలిసమస్య లాంటి పలు అంశాల్లో సాయపడుతుంది. 

విదేశీ మదుపుదారులకు వెసులుబాటు
విదేశీ మదుపుదారులు భారత్‌లో షేర్లు లేదా రుణ పథకాలలో తాము పెట్టిన పెట్టుబడులను విక్రయించి నిష్ర్కమించే అవకాశం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ విదేశీప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయంతో దేశంలోకి మరింత ఎక్కువగా ఎఫ్‌డీఐ నిధులు రావడానికి తోడ్పడుతుందని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. మార్పు చేసిన నిబంధనల ప్రకారం ఎఫ్‌డీఐ ఒప్పందాలలో ఇక మీదట ఐచ్ఛికంతో కూడిన షరతులు ఉంటాయి. ఇందులో కనీస లాకిన్ కాలంతోపాటు ప్రతిఫలాలపై ఎటువంటి హామీ లేకపోవడం వంటివాటికి చోటు కల్పించారు.

పదోన్నతి ఉద్యోగి మౌలిక హక్కు : సుప్రీం
పదోన్నతి ఉద్యోగి మౌలిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతి పొందడానికి ఆ ఉద్యోగికి తగిన అర్హతలున్నాయని నిర్ధారించినపుడు తప్పనిసరిగా కల్పించాలని జస్టిస్ ఎ.కె. పట్నాయక్, జస్టిస్ జె.ఎస్. ఖేహర్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మేజర్ జనరల్ హెచ్ ఎం సింగ్‌కు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి పదోన్నతినివ్వాలంటూ సదరు ఎంపిక బోర్డు చేసిన సిఫారసును మంత్రివర్గం నియమించిన కమిటీ తోసిపుచ్చడంపై ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

దేవయాని బహిష్కరణ
అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయానిని జనవరి 10న బహిష్కరించింది. వీసా కేసులో విచారణ గడువును పొడిగించాల్సిందిగా దేవయాని చేసిన విజ్ఞప్తిని అమెరికా కోర్టు తోసిపుచ్చుతూ నేరాభియోగం మోపింది. అయితే కోర్టు నేరం నమోదు చేసిన నేపథ్యంలో ఈ హోదాను రద్దు చేయాల్సిందిగా అమెరికా కోరడం... అందుకు భారత్ నిరాకరించడంతో ఆమెను తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో దేవయాని న్యూయార్క్ నుంచి భారత్‌కు వచ్చేశారు. ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ అమెరికా దౌత్యవేత్త ఒకర్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. 

విశాఖ ఉక్కుకు మరో కీర్తి
నవరత్న హోదాగల విశాఖఉక్కు (రాష్ట్రీయఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ -ఆర్‌ఐఎన్‌ఎల్) సిగలో మరో కలికితురాయి వచ్చిచేరింది. వర్క్ ప్లేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచి 5ఎస్ ధ్రువీకరణపత్రం సాధించింది. దేశంలోని ఉక్కు పరిశ్రమ రంగంలో ఈ ధ్రువీకరణ పొం దిన తొలి పరిశ్రమగా విశాఖ ఉక్కు ఘనత దక్కించుకుంది. 

రాష్ట్రంలో గేమ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన 
గేమింగ్ యానిమేషన్ మీడియాఎంటర్‌టైన్‌మెంట్ (గేమ్) ప్రాజెక్టుకు హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గ్‌లో జనవరి 8న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో గేమింగ్, యానిమేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, యానిమేషన్ వెబ్ డిజైనింగ్, ఇ- ఎడ్యుకేషన్,ఇ-లెర్నింగ్, పీసీ, మొబైల్ గేమింగ్, కాన్సోల్ గేమింగ్,ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమింగ్‌లకు సదుపాయాలు కల్పిస్తారు. 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 350 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇటువంటి పార్క్‌ను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి.

లోక్‌పాల్‌కు రాష్ట్రపతి ఆమోదం
లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసినట్లు జనవరి 1న సంబంధిత వర్గాలు ప్రకటనను విడుదల చేశారుు. లోక్‌పాల్ బిల్లుకు గతేడాది డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

నూతన భూసేకరణ చట్టం
నూతన భూసేకరణ చట్టం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. 1894 నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన ఈ సరికొత్త చట్టంతో భూములు కోల్పోయే రైతులు, గిరిజనులు సహా భూములు కోల్పేయే వారికి పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం అందుతాయి, ఆయా విషయాల్లో పూర్తిగా పారదర్శకతను పాటించాల్సి ఉంటుంది.

పంచాయతీ సవూవేశాల ప్రత్యక్ష ప్రసారం
కర్ణాటకలో గ్రామపంచాయతీల సమావేశాలను వచ్చే మార్చి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తొలిదశలో వెయ్యి గ్రామ పంచాయతీలను లోకల్ కేబుల్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించారు.

ఉత్తరాది గ్రిడ్‌తో అనుసంధానమైన దక్షిణాది గ్రిడ్
షోలాపూర్-రాయచూర్ మధ్య 765 కేవీ సామర్థ్యం గల విద్యుత్తు సరఫరా మార్గాన్ని జనవరి1న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో నేషనల్ గ్రిడ్‌తో దక్షిణాది గ్రిడ్ అనుసంధానమైంది. ఇప్పటి వరకు ఉత్తర, తూర్పు, పశ్చిమ, ఈశాన్య గ్రిడ్‌ల మధ్య మాత్రమే అనుసంధానం ఉండేది. దక్షిణాది గ్రిడ్ అనుసంధానం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు వీలు కలుగుతుంది. గ్రిడ్ అనుసంధానం లేకపోవడంతో మిగులు విద్యుత్ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొరత ఉన్న దక్షిణాదికి విద్యుత్ సరఫరా వీలయ్యేది కాదు. రాయచూర్ లైన్ నుంచి కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు విద్యుత్ లైన్ల అనుసంధాన త ఉండటంతో ఇకమీదట రాష్ట్రానికి ఉత్తరాది నుంచి విద్యుత్తు సరఫరా సులభతరమవుతుంది.

మాల్దీవుల అధ్యక్షుడు యామీన్ భారత పర్యటన
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ భారత పర్యటనలో జనవరి 2న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ నుంచి చేసుకునే దిగుమతుల కోసం 25 మిలియన్ డాలర్ల రుణాన్ని మాల్దీవులకు అందజేస్తామని ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు. అలాగే మాల్దీవుల పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను తీర్చేందుకు భారత్ అంగీకరించింది. ఇరుదేశాల మధ్య ఆరోగ్య రంగంలో పరస్పర సహకార అవగాహనపై సంతకాలు జరిగాయి. మాలేలోని ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని పొడిగించారు. ఇదిలాఉండగా మాలే విమానాశ్రయం ఆధునికీకరణకు సంబంధించిన భారత కంపెనీ జీఎంఆర్ ప్రాజెక్టును గత మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేయగా-ఆ విషయంపై యామీన్ ఎటువంటి హామీఇవ్వలేదు.

భాష, సాంస్కృతికశాఖ ఏర్పాటు 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాష, సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఈ శాఖను మంత్రి వట్టి వసంతకుమార్‌కు కేటాయించారు. 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఈ శాఖను ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. సాంస్కృతిక శాఖ కార్యకలాపాలతోపాటు భాషకు సంబంధించిన కార్యక్రమాలను కొత్తశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం చలన చిత్రాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న నాటక రంగాభివృద్ధి, ప్రాచీన భాషాకేంద్రం, కొత్తగా పునరుద్ధరించిన సాహిత్య సంగీత, లలిత కళల అకాడమీ, ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న తెలుగు అకాడెమీలు కొత్తశాఖ పరిధిలోకి వస్తాయి. రెండో అధికార భాషైన ఉర్దూ వ్యవహారాలు కూడా ఈ శాఖ పరిధిలోనే ఉంటాయి.

రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా జస్టిస్ గోపాలకృష్ణ
రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షునిగా జస్టిస్ తామడ గోపాలకృష్ణను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న నియమించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ గోపాలకృష్ణ ఐదేళ్లపాటు లేదా ఆయనకు 67ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగుతారు. 

రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు ఎల్.వెంకట్రామ్‌రెడ్డి (88) జనవరి 3న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, వాలీబాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. రాష్ట్రంలో 50 క్రీడాసంఘాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు.

AIMS DARE TO SUCCESS 

ఫిబ్రవరి 2014 జాతీయం
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన విధించేందుకు కేంద్ర కేబినెట్ 2014 ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచేందుకు నిర్ణయించింది. రాష్ర్ట విభజనకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో, దీనికి నిరసనగా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 19న సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండేందుకు నిరాకరించడం, త్వరలో సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో కేంద్రం రాష్ర్టపతి పాలనకు నిర్ణయించింది. రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించడం ఇది రెండోసారి. తొలిసారి 1973లో పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తడంతో రాష్ర్టపతి పాలన విధించారు. ఇది 1973 జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు కొనసాగింది. ఆంధ్ర రాష్ర్టంలో ప్రభుత్వానికి మెజార్టీ లేకపోవడంతో 1945 నవంబర్ నుంచి 1955 మార్చి 29 వరకు రాష్ర్టపతి పాలన విధించారు.

రచయిత జానుమద్ధి హనుమచ్ఛాస్త్రి మృతి 
ప్రముఖ రచయిత జానుమద్ధి హనుమచ్ఛాస్త్రి (90) కడపలో 2014 ఫిబ్రవరి 28న మరణించారు. రచయితగా, వ్యాసకర్తగా, గ్రంథాలయ పరిరక్షకుడిగా జానుమద్ధి ప్రసిద్ధులు. ఈయన కడపలోని సీపీ బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ వ్యవస్థాపకుడు. 1976లో బ్రౌన్ స్మారక ట్రస్టును ఏర్పాటు చేశారు. 1987లో బ్రౌన్ గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 2005లో 20 వేల గ్రంథాలను, రూ. 20 లక్షల నిధులతో పాటు సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించారు. 
ఆయన మాసీమ కవులు, రాఘవ జీవిత చరిత్ర, ఎందరో మహానుభావులు, విదురుడు, త్యాగమూర్తులు, సీపీ బ్రౌన్ బయోగ్రఫీ, ఆలోకనం లాంటి 41 పుస్తకాలు, మూడు వేలకు పైగా వ్యాసాలు రాశారు.

విజయవాడలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
విజయవాడలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ 2014 ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. రూ.109 కోట్లతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తారు. దీంట్లో అందించే మూడేళ్ల కోర్సుకు ఏటా 50 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఇలాంటి మరో మూడు సంస్థలకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిని అసోంలోని జొర్హత్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, హర్యానాలోని కురుక్షేత్రలో ఏర్పాటు చేస్తారు. ఈ నాలుగు విద్యాసంస్థల ఏర్పాటుకు రూ. 434 కోట్ల వ్యయం అవుతుంది.

నౌకాదళాధిపతి డి.కె.జోషి రాజీనామా
నౌకాదళాధిపతి అడ్మిరల్ డి.కె.జోషి 2014 ఫిబ్రవరి 26న తన పదవికి రాజీనామా చేశారు. యుద్ధనౌకలు తరచూ ప్రమాదాలకు గురి అవుతుండడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. 1959లో జనరల్ కె. సుబ్బయ్య తిమ్మయ్య తర్వాత రాజీనామా చేసిన మొదటి భారతీయ సైనిక కమాండర్ జోషి. ప్రభుత్వం ఆమోదించింది కూడా జోషి ఒక్కడి రాజీనామానే. ఫిబ్రవరి 26న జలాంతర్గామి ఐఎన్‌ఎస్-సింధురత్నలో ప్రమాదం జరిగి ఇద్దరు సిబ్బంది మరణించడంతో వెంటనే అడ్మిరల్ జోషి రాజీనామా చేశారు. 2013 ఆగస్టులో ఐఎన్‌ఎస్-సింధురక్షక్‌లో జరిగిన ప్రమాదంలో 18 మంది సిబ్బంది మరణించారు. జోషి స్థానంలో నౌకాదళ ఉప ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ ఆర్.కె.ధోవన్‌కు తాత్కాలిక ప్రధానాధికారి బాధ్యతలు అప్పగించారు.

ఓఎన్‌జీసీ అధిపతిగా దినేష్ సరాఫ్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా దినేష్ కె. సరాఫ్ (56) 2014 ఫిబ్రవరి 26న నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఓఎన్‌జీసీ విదేశీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశీ లిమిటెడ్ ఎండీగా ఉన్నారు. 

కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడి నియామకం
ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 26న నియమించింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఈ సంస్థను 1960 లో తెలుగువారైన పద్మభూషణ్ మోటూరు సత్యనారాయణ ప్రారంభించారు. హిందీ భాషాభివృద్ధి, హిందీ భాష బోధన నాణ్యత మెరుగుపర్చేందుకు, హిందీ ఉపాధ్యాయుల శిక్షణ, భాషా పరిశోధన, భారతీయ భాషలకు సంబంధించిన అధ్యయనాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. యార్లగడ్డ ప్రస్తుతం కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా వ్యవహరిస్తున్నారు.

చెన్నైలో తొలి పోస్టాఫీస్ ఏటీఎం
దేశంలో తొలి పోస్టాఫీస్ ఏటీఎంను చెన్నైలో 2014 ఫిబ్రవరి 27న కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రారంభించారు. ఈ ఏటీఎంను ప్రస్తుతం పోస్టాఫీస్ ఖాతాదారులు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుంది. ఆరు నెలల తర్వాత బ్యాంకు ఏటీఎంగా వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది 1000, వచ్చే సంవత్సరం మరో 1800 పోస్టల్ ఏటీఎంలను ప్రారంభించనున్నారు.

సెంట్రల్ విజిలెన్‌‌స కమిషనర్‌గా రాజీవ్
సెంట్రల్ విజిలెన్‌‌స కమిషన్ (సీవీసీ) కమిషనర్‌గా రాజీవ్‌ను రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ 2014 ఫిబ్రవరి 27న నియమించారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు సీవీసీని రాష్ర్టపతి నియమిస్తారు. 

చాందీ ప్రసాద్‌కు గాంధీ శాంతి బహుమతి 
2013 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతికి ప్రముఖ గాంధేయవాది, పర్యావరణవేత్త చాందీ ప్రసాద్ భట్ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన ఉన్న కమిటీ చాందీప్రసాద్‌ను ఎంపిక చేసింది. ఈయన చిప్కో ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. ఈ ఉద్యమ పోరాటానికి ఆయనకు 1982 లో రామన్ మెగసెసె అవార్డు లభించింది. 2005 లో పద్మభూషన్ అవార్డును కూడా అందుకున్నారు.

ఎన్నికల వ్యయపరిమితి పెంపు
లోక్‌సభ, శాసనసభ ఎన్నికల వ్యయపరిమితిని పెంచేందుకు కేంద్ర కేబినెట్ 2014 ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. లోక్‌సభ వ్యయపరిమితిని పెద్ద రాష్ట్రాల్లో రూ. 70 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ. 54 లక్షలకు పెంచారు. ఇది ప్రస్తుతం పెద్ద రాష్ట్రాల్లో రూ. 40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ. 22 లక్షలుగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రానగర్ హావేలీ, డామన్ డయ్యూ, పాండిచ్చేరి, లక్షదీవుల్లో లోక్‌సభ వ్యయపరిమితి రూ. 54 లక్షలుగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల వ్యయాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ. 16 లక్షల నుంచి రూ. 28 లక్షలకు పెంచారు. చిన్న రాష్ట్రాల్లో రూ. 8 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. 

సిక్కింకు జాతీయ పర్యాటక అవార్డు
2012-13 సంవత్సరానికి జాతీయ పర్యాటక అవార్డు సిక్కిం రాష్ట్రానికి లభించింది. గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుల అమలులో ఉత్తమ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశిథరూర్... సిక్కిం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 18న న్యూఢిల్లీలో అవార్డును ప్రదానం చేశారు. సిక్కిం రూ. 140 కోట్లతో అనేక పర్యాటక సౌకర్యాలను అభివద్ధి చేసింది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక రాష్ట్రాలతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఒప్పందాలు కుదుర్చుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తోంది. ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సంయుక్తంగా నిలిచాయి.

రాజీవ్ హంతకులకు శిక్ష తగ్గింపు
మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురికి విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గిస్తూ ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారి క్షమాభిక్ష పిటిషన్‌పై 11 ఏళ్లుగా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం వల్ల శిక్ష తగ్గిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. క్షమాభిక్ష జాప్యం జరిగినందువల్ల తమ శిక్షను పునస్సమీక్షించాలంటూ నిందితులైన సంతన్, మురుగన్, పెరారివాలన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇదిలాఉండగా ఈ కేసులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 19న నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై సుప్రీం స్టే విధించింది. 1991లో రాజీవ్‌గాంధీ హత్య జరిగిన తరువాత 1998లో టాడాకోర్టు దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఈ శిక్షను 1999లో సుప్రీం ఖరారు చేసింది. 

ఒడియా భాషకు ప్రాచీన హోదా
ఒడియా భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. దీంతో ఈ హోదా ఉన్న భాషల సంఖ్య ఆరుకు చేరింది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఇప్పటి వరకు ఈ హోదా ఉంది. ఈ హోదా దక్కితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆర్థిక సాయం అందుతుంది. స్కాలర్స్‌కు రెండు అవార్డులు ఏర్పాటు చేసి అందించవచ్చు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో భాషా పీఠాల ఏర్పాటుకు వీలుంటుంది. 

ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతి
కేంద్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరానికి ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతిని ఎంపిక చేసింది. తిరుమల-తిరుపతి దేవస్థానం వల్ల తిరుపతికి ఈ గుర్తింపు లభించింది. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి నుంచి టీటీడీ అధికారి ఈ అవార్డును అందుకున్నారు. 2010-11లో హైదరాబాద్, 2011-12లో వరంగల్ ఉత్తమ వారసత్వ నగరాలుగా ఎంపికయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ విభజనకు లోక్‌సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడనుంది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఫిబ్రవరి 18న ఆమోదం తెలపగా, రాజ్యసభ ఫిబ్రవరి 20న ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొనసాగుతాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం సందర్భంగా రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధులతో పూర్తి చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ తొలి ఏడాది ఆదాయ లోటు కేంద్ర బడ్జెట్ నుంచి భర్తీ చేస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను లోక్‌సభ ఆమోదించినందుకు నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 19న తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా 39 నెలలు పనిచేశారు. 2010 నవంబర్ 25న నాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య స్థానంలో ఎన్నికయ్యారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి 2014 ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. శాసనసభ రద్దుకు సిఫార్సు చేశారు. వెంటనే శాసనసభకు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. దీంతో రాష్ర్టపతి పాలన విధించాలని గవర్నర్ చేసిన సిఫార్సును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ర్టపతి ఆమోదంతో ఫిబ్రవరి 17 నుంచి రాష్ర్టపతి పాలన అమల్లోకి వచ్చింది. జన లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టలేకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. 70 మంది సభ్యులు ఉన్న సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు 42 మంది వ్యతిరేకించారు. సభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ 2013 డిసెంబర్ 28న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం 48 రోజులు కొనసాగింది.

న్యూఢిల్లీలో ప్రపంచ ఆగ్రో - ఫారెస్ట్రీ కాంగ్రెస్
న్యూఢిల్లీలో 2014 ఫిబ్రవరి 10న ప్రపంచ అటవీ వ్యవసాయ (ఆగ్రో-ఫారెస్ట్రీ) సమావేశం జరిగింది. అధిక పెట్టుబడులను ఆకర్షించేందుకు అటవీ వ్యవసాయ విధానంలో కొత్త విధానాలు అవలంభించాలని రాష్ర్టపతి సూచించారు. ఈ రంగం పర్యావరణ పరంగా సుస్థిర ఆహార ఉత్పత్తి విధానంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. వ్యవసాయం, అటవీ పంటలను సమీకృతం చేయడం వల్ల భూమి క్షీణతను అరికట్టడమే కాకుండా గ్రామీణ ప్రజలకు అవసరమైన కలప, వంటచెరకును అందించవచ్చని పేర్కొన్నారు. రాష్ర్టపతి ఏడు రాష్ట్రాలకు కృషి కర్మణ్ అవార్డులు ప్రదానం చేశారు. 2012-13లో ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఉత్తమ పనితీరు కనబరిచిన మధ్యప్రదేశ్, ఒడిశా, మణిపూర్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఈ అవార్డులు దక్కాయి.

చిరుధాన్యాల ఉత్పత్తిలో మంచి ఫలితాలను సాధించినందుకు ఆంధ్రప్రదేశ్‌కు కూడా కృషి కర్మణ్ అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ర్టపతి నుంచి రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అందుకున్నారు.

ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం నాలుగో దశ ప్రారంభం
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ జాతీయ ఎయిడ్‌‌స నియంత్రణ కార్యక్రమం నాలుగో దశను 2014 ఫిబ్రవరి 12న ప్రారంభించారు. ఇందుకు * 14,295 కోట్లు కేటాయించారు. తొలిసారి ఎయిడ్‌‌స నియంత్రణకు అంతర్జాతీయ దాతలు, సంస్థలు అందించే నిధుల కంటే ప్రభుత్వం అందించే నిధులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ మద్దతు 63 శాతంగా... అంటే * 11,934 కోట్లు ఉంది. 

పద్మశ్రీ అవార్డు గ్రహీత సిల్వెరిన్ స్వెర్ మృతి
మేఘాలయ మొదటి పద్మశ్రీ అవార్డు గ్రహీత సిల్వెరిన్ స్వెర్(103) షిల్లాంగ్‌లో 2014 ఫిబ్రవరి 1న మరణించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అనేక హోదాల్లో పని చేశారు.

జమ్మూలో 101 సైన్స్ కాంగ్రెస్
2014 ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు జమ్మూ విశ్వవిద్యాలయంలో జరిగిన 101 సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. సైన్‌‌స కాంగ్రెస్‌లో మన్మోహన్‌సింగ్ ప్రసంగించడం ఇది ఏడోసారి.

*9,000 కోట్లతో చేపట్టే శాస్త్ర, సాంకేతిక ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు. వాటిలో *4,500 కోట్లతో చేపట్టే నేషనల్ మిషన్ ఆన్ హైపర్ఫార్మెన్‌‌స కంప్యూటింగ్, *1,450 కోట్లతో తమిళనాడులో ఏర్పాటు చేసే న్యూట్రినో ఆధారిత అబ్జర్వేటరీ, * 3,000 కోట్లతో జాతీయ భౌగోళిక సమాచార వ్యవస్థ ఉన్నాయి. ప్రఖ్యాత విదేశీ శాస్త్రవేత్తలు భారత్‌లో ఏడాది పాటు పనిచేసేందుకు 25 జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసినందుకు హోమీ జె. బాబా స్మారక అవార్డును రీసెర్‌‌చ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి. సతీష్ రెడ్డికి ప్రదానం చేశారు. 

7వ వేతన సంఘం చైర్మన్‌గా అశోక్ కుమార్ 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏడో వేతన సంఘం చైర్మన్‌గా జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 4న నియమించింది. 50 లక్షల మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, 30 లక్షల మంది పెన్షనర్ల చెల్లింపులపై వేతన సంఘం సిఫార్సులు చేస్తుంది. రెండేళ్లలో ఈ సంఘం తన నివేదికను సమర్పిస్తుంది. ఈ సిఫార్సులు 2016 జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం పే స్కేళ్లను సవరించేందుకు ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది.

‘బ్రహ్మోస్’ క్షిపణి పరీక్ష విజయవంతం
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్‌ని సాల్వో మోడ్ పద్ధతిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) 2014 ఫిబ్రవరి 7న విజయవంతంగా పరీక్షించింది. అరేబియా సముద్రంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రికండ్ నుంచి రెండు క్షిపణులతో నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. సాల్వో మోడ్ పద్ధతిలో ఒకేసారి సమాంతరంగా క్షిపణులను ప్రయోగిస్తారు. బ్రహ్మోస్ 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఘన, ద్రవ ఇంధనాలతో పనిచేసే బ్రహ్మోస్‌ను ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఇండో-రష్యన్ సంస్థ ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ దీన్ని నిర్మించింది.

సీబీఐ అదనపు డెరైక్టర్‌గా అర్చనా రామసుందరం
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అదనపు డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అర్చనా రామసుందరం 2014 ఫిబ్రవరి 7న నియమితులయ్యారు. మహిళా అధికారి ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. ఈమె తమిళనాడు కేడర్‌కు చెందిన అధికారి. ఆమె గతంలో తమిళనాడు అదనపు డెరైక్టర్ జనరల్‌గా పనిచేశారు.

2013-14లో జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతం
2013-14 సంవత్సర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను కేంద్ర గణాంక కార్యాలయం 2014 ఫిబ్రవరి 7న విడుదల చేసింది. 2013-14లో వృద్ధి రేటు 4.9 శాతంగా సీఎస్‌ఓ అంచనా వేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు 2013-14లో వృద్ధికి తోడ్పడ్డాయి. 2012-13లో వృద్ధి రేటు 4.5 శాతంగా పేర్కొంది. ఇది దశాబ్ద కాలంలో అతి తక్కువ.
తలసరి ఆదాయం 2004-05 ధరల్లో వాస్తవ ప్రాతిపదికన 2013-14లో * 39,961 ఉండొచ్చని అంచనా. ఇది 2012-13లో * 38,856. ఈ పెరుగుదల 2.8 శాతం మాత్రమే ఉంది. తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2013-14లో *74,920 ఉంటుందని సీఎస్‌ఓ అంచనా వేసింది. ఇది గతేడాది *67,839 కంటే 10.4 శాతం ఎక్కువ.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమణ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2014 ఫిబ్రవరి 8న నియమితులయ్యారు. ఈయన 2013 సెప్టెంబర్ 3 నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు.

73వ రాజ్యాంగ సవరణ వర్తింపునకు జమ్మూ కాశ్మీర్ ఆమోదం
జమ్మూకాశ్మీర్ పంచాయతీ రాజ్ చట్టం 1989కు 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తింపచేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన 2014 ఫిబ్రవరి 8న జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఇందువల్ల పంచాయతీలకు ప్రణాళికలు రూపొందించడం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, నిధు ల వినియోగంలో స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్ కల్పించేందుకు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు పడుతుంది. పంచాయతీలకు పోటీచేసే అభ్యర్థుల వయసును 25 నుంచి 21కి తగ్గించొచ్చు.

జాతీయ అటవీ వ్యవసాయ విధానానికి కేబినెట్ ఆమోదం
జాతీయ అటవీ వ్యవసాయ (ఆగ్రోఫారెస్ట్రీ) విధానానికి కేంద్ర కేబినెట్ 2014 ఫిబ్రవరి 6న ఆమోదం తెలిపింది. ప్రతికూల విధానాలు, చట్టపరమైన అడ్డం కులు, పెట్టుబడుల లేమి, అందు బాటులో లేని మార్కెట్ వంటి సమస్యలను అధిగమించడానికి, గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఈ విధానాన్ని రూపొందించారు. ఈ విధానం కింద రైతులకు రుణాలు, బీమా సౌకర్యాలు కల్పిస్తారు. ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తారు. * 200 కోట్లతో నేషనల్ ఆగ్రోఫారెస్ట్రీ మిషన్, నేషనల్ ఆగ్రోఫారెస్ట్రీ బోర్డులను ఏర్పాటు చేస్తారు.

సివిల్స్‌కు రెండు అవకాశాలు పెంచిన కేంద్రం
సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు మరో రెండు అవకాశాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సంబంధించి 2014 ఫిబ్రవరి 10న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2014 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి అమల్లోకి వస్తుంది. ఓసీ అభ్యర్థులు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు వరకు నాలుగుసార్లు మాత్రమే ఈ పరీక్షలు రాయొచ్చు. వెనుకబడిన వర్గాల వారు ఏడుసార్లు రాయొచ్చు. వీరికి మూడేళ్లు సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాయొచ్చు. వీరికి వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంది. ప్రస్తుతం కల్పించిన రెండు అవకాశాల వల్ల అన్ని వర్గాల వారికి రెండేళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.

రాష్ర్టం నుంచి రాజ్యసభకు ఆరుగురు
రాజ్యసభకు రాష్ర్టం నుంచి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. 2014 ఫిబ్రవరి 7న జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి పోటీ నుంచి విరమించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎం.ఎ. ఖాన్, కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బిరామిరెడ్డి, తెలుగుదేశం నుంచి సీతారామలక్ష్మి, జి. మోహన్‌రావు, టీఆర్‌ఎస్ నుంచి కె. కేశవరావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటు వేశారు.

రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
2014-15 సంవత్సరానికి *1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2014 ఫిబ్రవరి 10న శాసనసభకు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వచ్చే ఆర్నెల్ల కాలానికి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆర్నెల్ల కాలానికి *79,460 కోట్లు కేటాయించారు. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.
మొత్తం బడ్జెట్: *1,83,129 కోట్లు
ప్రణాళికేతర వ్యయం: * 1,15,179 కోట్లు
ప్రణాళికా వ్యయం: * 67,950 కోట్లు
ద్రవ్యలోటు: 
* 25,402 కోట్లు(జీఎస్‌డీపీలో 2.6 శాతం)
రెవెన్యూ మిగులు: * 474 కోట్లు
ప్రధాన కేటాయింపులు: వ్యవసాయం, 
అనుబంధ రంగాలు: * 6,685.33 కోట్లు
గ్రామీణాభివృద్ధి: * 13,661.77 కోట్లు
నీటిపారుదల: * 23,311.98 కోట్లు
సాధారణ విద్య: * 22,123.09 కోట్లు
సంక్షేమం: * 11,650.85 కోట్లు
సాధారణ సేవలు: * 62,678.74 కోట్లు

అఖిల భారత సర్వీసులకు రెండేళ్ల తర్వాతే బదిలీ 
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు కనీసం రెండేళ్లు ఒకచోట పనిచేసేటట్లు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలను కేంద్ర సిబ్బంది శిక్షణా మంత్రిత్వశాఖ జనవరి 31న విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగోన్నతి, డెప్యుటేషన్‌పై ఇతర రాష్ట్రాలకు బదిలీ, పదవీ విరమణ, రెండు నెలలకు మించి శిక్షణ లాంటి పరిస్థితులలో తప్ప వారిని బదిలీ చేసేందుకు వీలులేదు. ఒకవేళ రెండేళ్లలోపు బదిలీ చేయాల్సి వస్తే రాష్ట్ర పరిధిలో ఏర్పాటయ్యే సివిల్ సర్వీసెస్ బోర్డు ద్వారా చేయాల్సి ఉంటుంది. మూడు నెలల క్రితం సివిల్ సర్వెంట్ల కనీస ఉద్యోగ కాలం రెండేళ్లు ఉండాలని, రాజకీయ ఒత్తిడి నుంచి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్డు సూచించడంతో కొత్త మార్గదర్శకాలను కేంద్రం రూపొందించింది. 

రాజస్థాన్‌లో అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్రం
ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్రాన్ని రాజస్థాన్‌లో ఏర్పాటు చేయడానికి భెల్, పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ సహా ఆరు ప్రభుత్వ రంగసంస్థలు సంకల్పించాయి. 4 వేల మెగావాట్ల సామర్థ్యం ఉండే ఈ కేంద్రం ఏర్పాటుకు మొదటి దశలో రూ.7,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు భెల్ సంస్థ తెలిపింది. 

న్యూఢిల్లీలో జాతీయ వక్ఫ్ అభివృద్ధి సంస్థ
కొత్త ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ వక్ఫ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ (జాతీయ వక్ఫ్ అభివృద్ధి కార్పోరేషన్ -నవాడ్కో)ను ప్రధాని మన్మోహన్‌సింగ్ జనవరి 29న న్యూఢిల్లీలో ప్రారంభించారు. వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి, వనరుల సమీకరణకు రూ. 500 కోట్ల మూలధనంతో 2013, డిసెంబర్ 31న ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 4.9 లక్షల రిజిస్టర్‌‌డ ఆస్తులతో భారత్ ప్రపంచంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు కలిగి ఉందని ప్రధాని మన్మోహన్ తెలిపారు. వీటిని సక్రమంగా అభివృద్ధి చేస్తే ఏటా రూ.1,200 కోట్ల ఆదాయం వస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు. 

ముంబైలో మోనోరైలు సేవలు
దేశంలోనే మొట్టమొదటి మోనోరైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వృథ్వీరాజ్ చౌహాన్ మొదటిదశను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వడాలా-చెంబూర్‌ల మధ్య 8.93 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ముంబైలో మొత్తం 19.17 కి.మీ మోనోకారిడార్ నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద మోనోకారిడార్. జపాన్‌లోని ఒసాకా నగరంలోని 23.8 కి.మీ. పొడవైన మోనోరైలు మార్గం ప్రపంచంలో అతి పొడవైనది. దక్షిణ ముంబైలోని జాకోబ్ సర్కిల్ నుంచి తూర్పు ముంబైలోని చెంబూర్‌కు మోనోరైలు రవాణామార్గం అనుసంధానమవుతుంది. ఈ 19.17 కి.మీ మోనోరైలు మార్గాన్ని రూ. 3వేల కోట్లతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మిస్తోంది.

రాష్ట్రంలో ఓటర్లు... 6.23 కోట్లు
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.23 కోట్లకు చేరిందని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 1న ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఓటర్లున్నారని తెలిపింది. 2013 జనవరి 15న సవరించిన జాబితా ప్రకారం 5.81 కోట్ల మంది ఓటర్లు కాగా తాజాగా ఈ సంఖ్య 6.23 కోట్లకు పెరిగింది.

AIMS DARE TO SUCCESS 

మార్చి 2014 జాతీయం
మహిళల కోసం ‘నిర్భీక్’ రివాల్వర్
ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన నిర్భీక్ అనే రివాల్వర్‌ను ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్చి 25న కాన్పూర్‌లో ఆవిష్కరించింది. 2012లో ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన నిర్భయ ఉదంతం నేపథ్యంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ రివాల్వర్‌ను తయారు చేసింది. మహిళలు తమను తాము కాపాడుకునేందుకు తయారు చేసిన ఈ రివాల్వర్ 525 గ్రాముల బరువు, 177.8 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. 50 అడుగులు (15 మీటర్ల) దూరంలోని లక్ష్యాలను కాలుస్తుంది. దీన్ని మహిళలు తమ పర్సులలో, హాండ్ బ్యాగుల్లో తీసుకువెళ్లేందుకు వీలుగా ఉంటుంది. దీని ధర రూ. 1,22,360. 

ప్రకృతి విపత్తుల బారినపడే నగరాల జాబితా: ఏడో స్థానంలో కోల్‌కతా
ప్రపంచంలో ప్రకృతి విపత్తుల బారినపడే 616 నగరాల పరిస్థితులపై స్విస్ రే అనే సంస్థ మార్చి 26న ఓ నివేదిక విడుదల చేసింది. ప్రకృతి విపత్తుల ప్రమాదాలు గల నగరాల జాబితాలో కోల్‌కతా ఏడో స్థానంలో ఉందని తెలిపింది. భా రత్ నుంచి కోల్‌కతా నగరం ఒక్కటే ఈ జాబితాలో ఉంది. ఈ ప్రమాదాలు ఎదుర్కొనే నగరాల్లో టోక్యో(జపాన్) మొదటి స్థానం, మనీలా (ఫిలిప్పీన్స్) రెండోస్థానం, పెరల్ రివర్ డెల్టా (చైనా) మూడో స్థానం, ఒసాకా -కోబె(జపాన్) నాలుగో స్థానంలో ఉన్నాయి. ఐదో స్థానంలో జకార్తా (ఇండోనేషియా), నగోయా (జపాన్) ఆరో స్థానంలో ఉన్నాయి. 

పోలియో రహిత దేశంగా భారత్
భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యు.హెచ్.ఒ) మార్చి 27న అధికారికంగా ప్రకటించింది. డబ్ల్యు.హెచ్.ఒ భారత్‌తో కలిపి మొత్తం 11 దేశాలను పోలియో వైరస్ రహిత దేశాలుగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికార పత్రాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ న్యూఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి నుంచి అందుకున్నారు. 1995 నుంచి ముమ్మరంగా చేపట్టిన పోలియో నిర్మూలన కార్యక్రమాల వల్ల ప్రభుత్వం పోలియోను రూపుమాపగలిగింది. 

ఖలిస్తాన్ ఉగ్రవాది భుల్లర్‌కు శిక్ష తగ్గింపు 
ఖలిస్తాన్ ఉగ్రవాది దేవేందర్‌పాల్ సింగ్ భుల్లర్‌కు విధించిన మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చుతూ సుప్రీంకోర్టు మార్చి 31న తీర్పునిచ్చింది. భుల్లర్ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకునేందుకు విపరీతమైన జాప్యం జరగడం, ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. 1993లో అప్పటి యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఎస్.భిట్టాను హత్యచేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని యూత్‌కాంగ్రెస్ కార్యాలయం ఎదుట భుల్లర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఆ దాడిలో 9మంది చనిపోగా భిట్టా తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఈ కేసులో భుల్లర్‌ను దోషిగా నిర్ధారించిన హైకోర్టు, సుప్రీంకోర్టులు కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించాయి. 

‘టార్క్’ ఏర్పాటు 
పన్ను చెల్లింపుదారుల్లో విశ్వసనీయతను పెంచి, ఆదాయపన్ను నిబంధనలను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా పన్నుల పరిపాలనా సంస్కరణల కమిషన్ (టాక్స్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్ కమిషన్-టార్క్)ను కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి సలహాదారైన పార్థసారథి షోమ్ టార్క్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పన్నుల విషయంలో నిర్మాణాత్మక సంస్కరణలు, నిబంధనలపై దష్టి పెట్టేందుకు టార్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 

అక్కంపల్లిలో పురాతన గుహలు 
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అక్కంపల్లిలో ప్రాచీన మానవుల నివాసంగా ఉన్న గుహల సముదాయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ గుహలలో ఉన్న చిత్రలేఖనం 7 వేల సంవత్సరాల క్రితం నాటి నాగరికత, సంస్కతులను ప్రతిబింబిస్తున్నాయి. ఇందులోని ఐదు గుహలలో మూడు సహజ సిద్ధమైనవి కాగా రెండు రాళ్లు మలచినవిగా ఉన్నాయి.

హైకోర్టులలో 25 శాతానికి పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య
దేశంలోని అన్ని హైకోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను కేంద్రం 25 శాతానికి పెంచింది. పెండింగ్‌లో ఉన్న 40 లక్షల కేసులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖమంత్రి కపిల్ సిబాల్ మార్చి 19న హైకోర్టుల్లో భర్తీ చేయాల్సిన ఖాళీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపవలసిందిగా అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. 25 శాతానికి పెంచితే ప్రస్తుతం ఉన్న న్యాయ మూర్తుల సంఖ్య 906 నుంచి 1112కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 49 నుంచి 61కి చేరుతుంది.

సామాజిక భద్రత పథకాలకు ఆధార్ తప్పనిసరికాదన్న సుప్రీం
సామాజిక భద్రత పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్ కార్డు ఉండాలన్న నోటిఫికేషన్లను వెంటనే విరమించుకోవాలని సుప్రీంకోర్టు మార్చి 24న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యుత్, గ్యాస్, కుళాయి కనెక్షన్లు వంటి సేవలు పొందడానికి ఆధార్ కార్డు చట్టబద్ధం కాదని జస్టిస్ బీఎస్ చౌహాన్,జస్టిస్ జె. చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ సమాచారాన్ని సీబీఐతో పంచుకోవాలన్న గోవా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా స్టే విధించింది.

తూర్పు తీరానికి సుమేధ నౌక
ఐఎన్‌ఎస్ సుమేధ నౌక మార్చి 23న తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రమైన విశాఖకు చేరింది. గోవా షిప్‌యార్డులో మార్చి7న ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్‌చోప్రా దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు నౌకాదళంలో ఇటువంటి నౌక చేరడం ఇది తొలిసారి. ఇది మూడో తరం ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ విభాగంలో మూడో నౌక. ఈ నౌక యాంటీ పైరసీ, పెట్రోలింగ్, ఫ్లీట్ సపోర్ట్ ఆపరేషన్స్, మారిటైమ్ సెక్యూరిటీ, ఎస్కార్ట్ ఆపరేషన్స్, నేవీ ఆస్తుల పరిరక్షణ వంటి విధులను నిర్వహిస్తుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సదుపాయమున్న ఈ నౌకలో పలు రకాల ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. నౌకలో రెండు బోట్లు ఉంటాయి. ఆటోమేటిక్ పవర్‌మేనేజ్‌మెంట్ విధానంలో కమాండర్ నేతత్వంలో పనిచేసే ఈ నౌకలో 9మంది అధికార్లు,వందమంది సెయిలర్లు ఉన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేయాలన్న సుప్రీం 
ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను సంవత్సరంలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మార్చి 10న కిందిస్థాయి కోర్టులను ఆదేశించింది. అభియోగాలు నమోదైన సంవత్సరంలోగా విచారణ ముగించాలని పేర్కొంది. ఏడాదిలోగా విచారణ పూర్తికాకపోతే దిగువ కోర్టులు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. విచారణలో జాప్యం వల్ల కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు తమ పదవుల్లో కొనసాగుతున్నారని జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

డ్రాపౌట్ల సంఖ్య 8 కోట్లు
భారత్‌లో ప్రాథమిక విద్య పూర్తికాక ముందే బడి మానే స్తున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని యూనిసెఫ్ ప్రతినిధి లూయిస్-జార్జెస్ ఆర్సెనాల్ట్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పిల్లలు వివిధ కారణాల వల్ల మధ్యలోనే స్కూలు డ్రాపౌట్లుగా మారారని తెలిపారు. ప్రాథమిక విద్య (ఎనిమిదో తరగతి వరకూ) పూర్తి కాకుండానే బడి మానేస్తున్న పిల్లల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందన్నారు.

10వ యంగ్ ఇండియన్ సదస్సు
10వ యంగ్ ఇండియన్ సదస్సు న్యూఢిల్లీలో మార్చి 15న ప్రారంభమైంది. ‘ఇండియా-ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే ఇతివృత్తంతో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కు చెందిన యంగ్ ఇండియన్స్ (వైఐ) సంస్థ ఈ సదస్సును నిర్వహించింది.

విద్వేషం చిమ్మే నేతలను బుక్ చేయండి: సుప్రీం
కులం, మతం, ప్రాంతం, జాతి ఆధారంగా నేతలు చేసే విద్వేష ప్రసంగాలు సమాజానికి విఘాతకరమని.. అలాంటి ప్రసంగాలు చేసే రాజ కీయ, సంఘ, మత సంస్థల నేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీలు లేదా నేతలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే... ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేయాలా? అన్న అంశాన్ని పరిశీలించాలని లా కమిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కోరింది. నేతల విద్వేష ప్రసంగాలు ప్రజస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయని స్వచ్ఛంద సంస్థ ప్రవాసీ భలాయ్ సంఘటన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు మార్చి 12న విచారించింది. 

ఎన్నికల్లో నల్లధనం నియంత్రణకు ‘గ్రిడ్’ 
రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నల్లధనాన్ని నియంత్రించడంలో భాగంగా రెవెన్యూ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక నిఘా వ్యవస్థ(గ్రిడ్)ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ విధమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గురించి ఇది ఎప్పటికప్పుడు ఈసీకి తెలియజేస్తుంది. తద్వారా నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. 

యూఐడీఏఐకి నిలేకని రాజీనామా
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్ పదవికి నందన్ నిలేకని మార్చి 13న రాజీనామా చేశారు. యూఐడీఏఐ చైర్మన్‌గా నిలేకని 2009 జూన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిలేకని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేశారు.

16వ లోక్‌సభ ఎన్నికల్లో 81.46 కోట్ల ఓటర్లు
దేశంలో 16వ లోక్‌సభను ఎన్నుకొనేందుకు 81.46 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 16వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5న ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభలోని 543 స్థానాలకు ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు తొమ్మిది విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ మే 16న జరుగుతుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసన సభలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అందరు అభ్యర్థులను తిరస్కరించేందుకు ఉద్దేశించిన బటన్‌ను తొలిసారిగా బ్యాలెట్ బాక్సుపై కల్పిస్తున్నారు.
మొత్తం 81.46 కోట్ల ఓటర్లలో పురుషులు 42.67 కోట్లు, మహిళలు 38.79 కోట్లు ఉన్నారు. 2009-14 మధ్యకాలంలో కొత్తగా 10 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 2009లో ఓటర్ల సంఖ్య 716,985,101 కాగా 2014లో ఈ సంఖ్య 814,591,184. ప్రస్తుతం మొత్తం ఓటర్లలో 2.9 శాతం అంటే 2.3 కోట్ల మంది 18-19 వయసు వారున్నారు. మొత్తం ఓటర్లలో సగం మంది ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఉన్నారు. 

ఢిల్లీ సెంట్రల్ పార్‌‌కలో అత్యంత ఎత్తైన జెండా
అత్యంత ఎత్తైన జెండా స్తంభాన్ని ఢిల్లీలోని సెంట్రల్ పార్‌‌కలో కురుక్షేత్ర పార్లమెంట్ సభ్యుడు నవీన్ జిందాల్ మార్చి 7న ఆవిష్కరించారు. ఈ స్తంభం ఎత్తు 207 అడుగులు. స్తంభంపై ఎగురవేసిన జెండా పొడవు 90 అడుగులు, వెడల్పు 60 అడుగులు, బరువు 35 కేజీలు. దేశంలో అత్యంత పెద్దదైన జాతీయ పతాకంగా ఇది రికార్డుకెక్కింది.
ఇలాంటి స్మారక పతాకాలను ఏర్పాటు చేయడాన్ని నవీన్ జిందాల్ చైర్మన్‌గా గల ఫ్లాగ్ ఫౌండేషన్ 2009లో ప్రారంభించింది. ఢిల్లీ సెంట్రల్ పార్‌‌కలో ఏర్పాటు చేసింది 46వ స్మారక పతాకం. తొలిసారి 207 అడుగుల ఎత్తుగల స్మారక పతాక స్థూపాన్ని హర్యానాలోని కైథల్‌లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ ఫౌండేషన్ దేశంలో 12 పతాక స్థూపాలను ఏర్పాటు చేసింది. మరో 11 దేశాల్లో కూడా ఇటువంటి స్థూపాలను నిర్మించింది. 

సాహిత్య అకాడమీకి 60 ఏళ్లు
కేంద్ర సాహిత్య అకాడమీకి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా మార్చి 10 నుంచి 15 వరకు ఫెస్టివల్ ఆఫ్ లెటర్‌‌స పేరుతో ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ వేడుకలు నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని సంస్కతులకు, భాషలకు వేదికైన కేంద్ర సాహిత్య అకాడమీ 1954 మార్చి 12న ఏర్పాటైంది.

ఆంధ్రప్రదేశ్ విభజన తేదీగా జూన్ 2
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడే తేదీ (అపాయింటెడ్ డే)గా జూన్ 2ను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 4న నోటిఫికేషన్ జారీ చేసింది. అపాయింటెడ్ డే నుంచి రాష్ర్ట విభజన అమల్లోకి వస్తుంది. తెలంగాణ 29వ రాష్ర్టంగా ఏర్పడుతుంది.

ఓబీసీ జాబితాలో జాట్ కులస్థులు
ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) జాబితాలో జాట్ కులస్థులను చేర్చాలని కేంద్ర కేబినెట్ 2014 మార్చి 1న నిర్ణయించింది. దీంతో జాట్ కులస్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ పొందేందుకు అవకాశముంటుంది. బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో తొమ్మిది కోట్ల మంది ఓబీసీ పరిధిలోకి వస్తారు.

సీబీడీటీ చైర్మన్‌గా ఆర్.కె.తివారీ
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్‌‌డ (సీబీడీటీ) చైర్మన్‌గా ఆర్.కె. తివారీ 2014 మార్చి 3న బాధ్యతలు స్వీకరించారు. ఆదాయపు పన్ను శాఖలో అత్యున్నత అథారిటీ సీబీడీటీ.

బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ మృతి
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ (74) హైదరాబాద్‌లో 2014 మార్చి 1న మరణించారు. 1996లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999 - 2000లో వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అవినీతి కేసులో 2012లో సీబీఐ కోర్టు విధించిన శిక్ష అనుభవించారు. బీజేపీకి తొలి దళిత జాతీయ అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు.

AIMS DARE TO SUCCESS 

ఏప్రిల్ 2014 జాతీయం
రోడ్డు ప్రమాదాలపై కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు 
రోడ్డు ప్రమాదాల నివారణపై సుప్రీం కోర్టు సత్వర చర్యలు అత్యవసరమని ఏప్రిల్ 22న వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదాల నివారణ చర్యలను సూచించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. రోడ్ల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల నివేదికలను అధ్యయనం చేసి కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది. 

గోవాలో మైనింగ్‌పై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు
గోవాలోని అన్ని ఖనిజాల తవ్వకంపై 19 నెలలుగా ఉన్న నిషేధాన్ని సుప్రీం కోర్టు ఏప్రిల్ 21న ఎత్తేసింది. ఏటా 20 మిలియన్ టన్నుల పరిమితితో కూడిన ఇనుప ఖనిజాన్ని తవ్వుకోడానికి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ అనుమతించింది. జస్టిస్ ఎం.బి.షా నేతృత్వంలోని సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ సిఫార్సుల ఆధారంగా అత్యున్నత న్యాయస్థానం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. గతంలో గోవాలోని అక్రమ మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయనే అంశంపై 2012 సెప్టెంబరులో నిషేధం విధించింది. 

రాజీవ్‌గాంధీ హంతకుల విడుదలపై స్టే పొడిగించిన సుప్రీంకోర్టు
మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఏప్రిల్ 25న పొడిగించింది. జైల్లో ఉన్న ఏడుగురు నిందితులకు శిక్ష తగ్గించే అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. నిందితులకు శిక్ష తగ్గింపు తమిళనాడు ప్రభుత్వం పరిధిలోకి రాదని, అది చట్ట వ్యతిరేకమన్న కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుని పై నిర్ణయానికి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు -రాష్ర్టపతి పాలన పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దుకు, రాష్ర్టపతి పాలన ఏప్రిల్ 30 తర్వాత పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 25న నిర్ణయించింది. రాష్ర్టంలో మార్చి 1 నుంచి అమల్లో ఉన్న రాష్ర్టపతి పాలన ఏప్రిల్ 30న ముగుస్తుంది. ప్రకరణ 356 సెక్షన్-3 ప్రకారం రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనను పార్లమెంట్ 60 రోజుల లోపు ఆమోదించాల్సి ఉంటుంది. శాసనసభ రద్దు వల్ల పార్లమెంట్ రాష్ర్టపతి పాలన మరో రెండు నెలలు పొడిగించేందుకు అవకాశముంటుంది. ప్రస్తుతం 16వ పార్లమెంటుకు సాధారణ ఎన్నికలు జరగుతుండటంతో పార్లమెంటుకు సభ్యులు హాజరు కావడం వీలుకాని పరిస్థితి నెలకొంది. 

హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తించిన సుప్రీం కోర్టు
హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఏప్రిల్ 15న తీర్పు ఇచ్చింది. వారిని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పరిగణించాలని, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు తోడ్పడే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొంది. హిజ్రాలు శస్త్ర చికిత్స ద్వారా స్త్రీ లేదా పురుషునిగా మారినప్పుడు కూడా వారికి తగిన గుర్తింపు పొందే హక్కును కూడా కల్పిస్తున్నట్లు సుప్రీం తీర్పునిచ్చింది. 

నావికాదళ అధిపతిగా రాబిన్ కే ధోవన్
భారత నావికాదళ అధిపతిగా అడ్మిరల్ రాబిన్ కే ధోవన్ ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు. డి.కె. జోషి స్థానంలో 22వ నావికాదళ అధిపతిగా ధోవన్ నియమితులయ్యారు. ఇటీవలి కాలంలో నౌకాదళంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ జోషి ఫిబ్రవరి 26న రాజీనామా చేశారు. ధోవన్ 25 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

ముంబైలో డబుల్ డెక్కర్ ప్లై ఓవర్ ప్రారంభం
దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ముంబైలో ఏప్రిల్ 18న ప్రారంభమైంది. సాంతాక్రజ్- చెంబూర్ లింక్‌రోడ్ (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రాజెక్ట్ ముంబై తూర్పు-పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. దీంతో ఈ ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి పట్టే సమయం 90 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుంది. ఆరున్నర కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి రూ. 454 కోట్లు ఖర్చయింది.

ఇటానగర్‌కు తొలి ప్యాసింజర్ రైలు
అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు తొలి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 7న చేరింది. ఈ రైలు డెకర్‌గావ్ (అసోం) నుంచి ఇటానగర్‌కు సమీపం లోని నహర్‌లగున్‌కు చేరింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ 2008 జనవరి 31న ప్రకటించిన ప్యాకేజీలో ఈ రైలు సౌకర్యాన్ని కల్పించారు. త్వరలో భారత రాజధాని న్యూఢిల్లీతో అనుసంధానిస్తూ రైల్వే సర్వీసులను ప్రవేశపెడతామని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి నబమ్‌తుకీ ప్రకటించారు.

దేశంలోకి ప్రవేశించిన ‘హార్ట్‌బ్లీడ్ వైరస్‌‘
అత్యంత ప్రమాదకరమైన హార్ట్‌బ్లీడ్ వైరస్ భారత్‌లో ప్రవేశించింది. ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తోంది. హార్ట్‌బ్లీడ్ వైరస్‌తో లక్షలాది పాస్‌వర్‌‌డలు, క్రెడిట్‌కార్డ్ నంబర్లు, ఇతర కీలక సమాచారాన్ని హ్యాకర్లు తేలిగ్గా చేజిక్కించుకోగలుగుతారు. హ్యాకింగ్‌పై పోరాడుతున్న భారత కంప్యూటర్ అత్యవసర స్పందనా బృందం ఈ వైరస్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అనుమానిత ఈ-మెయిళ్లు, సందేశాలు,ఆడియో, వీడియో క్లిప్‌లు, ఈ-లింకులను వెంటనే తొలగించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందేశాలు వచ్చిన వెంటనే వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని, ఓపెన్ ఎస్.ఎస్.ఎల్ ను 1.0.1జి వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో పాటు యాంటీ వైరస్,ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవాలని సైబర్ భద్రతా సంస్థ సూచిస్తోంది.

ఉత్తమ రైల్వే స్టేషన్లు
దక్షిణ మధ్య రైల్వే జోన్ వ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో విజయవాడ ఉత్తమస్టేషన్‌గా ఎంపికైంది. అదే విధంగా పునర్నిర్మించిన ప్రాంగణాల్లో ఉత్త మ స్టేషన్ పురస్కారానికి కాచిగూడ రైల్వేస్టేషన్ ఎంపికైంది. 59వ రైల్వే వారోత్సవాల సందర్భంగా ఈ అవార్డులను ప్రక టించినట్లు రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు.

సీమాంధ్ర రాజధాని ఎంపికకు నిపుణుల కమిటీ 
సీమాంధ్ర రాజధాని ఎంపికకు కేంద్ర హోంశాఖ మార్చి 28న ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మాజీ కార్యదర్శి కె.శివరామకష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ ఆగస్టు 31, 2014లోగా తమ నివేదికను సమర్పించనుంది. ఈ బందంలో ఇతర సభ్యులు కె.టి.రవీంద్రన్, జగన్‌షా, ఆరోమర్ రేవీ, రతిన్‌రాయ్.

AIMS DARE TO SUCCESS 

మే 2014 జాతీయం
పద్మనాభ ఆలయ సంపద లెక్కింపు
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయ సంపద లెక్కింపును మే 28న ప్రారంభించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మాజీ కాగ్ వినోద్ రాయ్ నేతృత్వంలో నియమితులైన ప్రత్యేక బృందం లెక్కింపు పూర్తయ్యాక నివేదికను సుప్రీంకోర్టుకు అందిస్తారు.

ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా ఆర్‌జీఐఏ
హైదరాబాద్, శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ) ద్వితీయ ఉత్తమ ఎయిర్‌పోర్ట్ అవార్డ్ కైవసం చేసుకొంది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ (ఏసీఐ)-2014 సంవత్సరానికిగాను ఈ అవార్డు ప్రదానం చేసింది. మే 28న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.

తొలి పొగాకు రహిత గ్రామం గరిపెమ 
దేశంలో తొలి పొగాకు రహిత గ్రామంగా నాగాలాండ్‌లోని గరిపెమా అనే పల్లె రికార్డులకెక్కింది. మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గరిపెమను పొగాకు రహిత గ్రామంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఊరిలో మద్యం, పొగాకు ఉత్పత్తుల విక్రయం, వినియోగం నిషేధిస్తూ గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు.

ఫోర్బ్స్ శక్తివంత మహిళల జాబితా
ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన 100 మంది మహిళల జాబితాలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచర్‌లకు స్థానం లభించింది. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలకు చోటుదక్కింది. భట్టాచార్యకు 36వ ర్యాంకు, కొచర్‌కు 43వ ర్యాంకు లభించాయి. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా 92వ స్థానంలో నిలిచారు. పెప్సీకో చీఫ్ ఇంద్రా నూయి 13వ స్థానంలో, సిస్కో చీఫ్ టెక్నాలజీ, స్ట్రాటజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో ఉన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ ఎల్లెన్ (రెండో స్థానం), మానవతావాది మెలిండా గేట్స్ (3), హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బారా (7), అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బెర్గ్(9) తొలి పది స్థానాలో ఉన్నారు.

పోలవరం ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి మే 29న ఆమోదించారు. ఇందుకు సంబంధించి గత యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌కు ఎన్‌డీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలవనున్నాయి. ఈ ఏడు మండలాల్లో 211 గ్రామాలు ఉన్నాయి. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టడానికి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించాలని కేంద్రం నిర్ణయించింది. పోలవరంగా పిలిచే ఇందిరాసాగర్ ప్రాజెక్ట్‌ను బహుళ ప్రయోజనార్థం గోదావరి నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద నిర్మిస్తున్నారు. 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు , 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దీని లక్ష్యం. విశాఖపట్నం, ఇతర కొన్ని ప్రాంతాలకు 25 టీఎంసీల తాగునీటి సౌకర్యం కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల కలుగుతుంది. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానంతో 80 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు కల్పిస్తారు.

ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్
ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవీన్‌పట్నాయక్ (67) తన 21 మంత్రి వర్గ సభ్యులతో మే 21న రాష్ట్ర గవర్నర్ ఎస్.సి. జమీర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా ఒడిశా చరిత్రలో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతకుముందు నవీన్ తండ్రి బిజూపట్నాయక్, హరేకృష్ణ మహతాబ్, జేబీ పట్నాయక్‌లు వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. నవీన్ పట్నాయక్ బిజు జనతాద ళ్ పార్టీకి చెందిన వారు.

గుజరాత్ సీఎంగా ఆనందీబెన్‌పటేల్
గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ (73) బాధ్యతలు చేపట్టారు. మే 22న గవర్నర్ కమలా బెనీవాల్ సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా కొనసాగిన నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో ఆనందీబెన్‌ను నియమించారు. ఈమె మోడీ కొలువులో ఇప్పటిదాకా రెవెన్యూ మంత్రిగా వ్యవహరించారు. ఆనందీ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1987లో టీచర్‌గా పనిచేస్తున్న కాలంలో నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను రక్షించేందుకు సరోవర్ ప్రాజెక్ట్‌లోకి దూకి ప్రదర్శించిన సాహసంతో ఆమె వెలుగులోకి వచ్చారు.

ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు
ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలైన బాలికగా మన రాష్ట్రానికి చెందిన మాలావత్ పూర్ణ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మరో తెలుగు విద్యార్థి ఆనంద్‌కుమార్ ఈ సాహస యాత్రలో పాల్గొని దక్షిణాది రాష్ట్రాలనుంచి ఎవరెస్ట్‌ను ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడిగా ఘనతను సాధించాడు. 13 సంవత్సరాల 11 నెలల వయసున్న పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కాగా, 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా అన్నపురెడ్డిపల్లి గురుకులంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో డార్జిలింగ్‌లోని 17వేల అడుగుల ఎత్తున్న మౌంట్ రినాక్ శిఖరాన్ని ఎక్కి రికార్డు సృష్టించారు. వీరి ప్రతిభను గుర్తించిన సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల సొసైటీ భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చింది. మూడునెలల శిక్షణ అనంతరం వీరిద్దరినీ ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధం చేశారు.

ఐదోసారి సిక్కిం సీఎంగా చామ్లింగ్
సిక్కిం ముఖ్యమంత్రిగా పవన్‌చామ్లింగ్ (63) ఐదోసారి అధికార పగ్గాలు చేపట్టారు. రాజధాని గ్యాంగ్‌టక్‌లో గవర్నర్ శ్రీనివాస్ దాదాసాహెబ్ సమక్షంలో మే 24న చామ్లింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. చామ్లింగ్ సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ పార్టీ (ఎస్‌డీఎఫ్) వ్యవస్థాపకుల్లో ఒకరు. ఎస్‌డీఎఫ్ 1999 నాటి నుంచి జరిగిన ఐదు శాసనసభ ఎన్నికల్లోనూ వరుసగా విజయకేతనం ఎగురవేస్తూ వచ్చింది.

భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ
భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర భాయ్ దామోదర్‌దాస్ మోడీ (63) మే 26న ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మోడీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాధినేతలు.. నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, బంగ్లాదేశ్ స్పీకర్ షిరిన్ చౌదరి, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, మారిషస్ ప్రధాని రాంగులాం నవీన్, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు కర్జాయ్, మల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూం, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్‌గే హాజరయ్యారు. మోడీతోపాటు 45 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 23 మంది కేబినెట్ మంత్రులు కాగా, 10 మంది స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులు ఉన్నారు. ఇందులో ఏడుగురు మహిళలు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా 8 మంత్రి పదవులు లభించాయి. ఆ తర్వాత మహారాష్ట్రకు 6, బీహార్‌కు 5, మధ్యప్రదేశ్‌కు 4 పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్, గోవా, ఢిల్లీ రాష్ట్రాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు లభించాయి. కొత్త రాష్ట్రం తెలంగాణకు ప్రాతినిధ్యం లభించలేదు. మోడీ 1950, సెప్టెంబర్ 17న గుజరాత్ రాష్ట్రంలోని వాద్‌నగర్ (మోహ్‌సానా జిల్లా)లో జన్మించారు.

కాశ్మీర్ డీజీపీగా రాజేంద్రకుమార్ 
జమ్మూ-కాశ్మీర్ కొత్త డీజీపీగా రాజేంద్రకుమార్ (57) నియమితులయ్యారు. ఈ మేరకు మే 21న ఆ రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర కుమార్ జమ్మూ-కాశ్మీర్ కేడర్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 

ప్రధాన సమాచార కమిషనర్‌గా రాజీవ్ మాథుర్
కేంద్ర సమాచార శాఖ ఆరో ప్రధాన కమిషనర్ (సీఐసీ)గా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ రాజీవ్ మాథుర్ మే 22న బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన మాథుర్ సమాచార కమిషనర్‌గా 2012లో నియమితులయ్యారు. ఇంతకు ముందు సీఐసీగా ఉన్న సుష్మాసింగ్ మే 21న రాజీనామా చేశారు.

16వ లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం
16వ లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ 282 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. మే 16న వెలువడిన ఎన్నికల ఫలితాలలో బీజేపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల కంటే 10 స్థానాలను అదనంగా సాధించింది. ఆ పార్టీకి చెందిన ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి 3,71,784 ఓట్ల మెజారిటీతోనూ, వడోదర నుంచి 5,70,128 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి 336 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్, మిత్రపక్షాలు ఘోరపరాజయం చవిచూశాయి. స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ తర్వాత ఒక పార్టీ లోక్‌సభ ఎన్నికలలో ఇతర పార్టీల మద్దతు లేకున్నా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ సాధించడం ఇదే తొలిసారి. తొలిసారి ప్రవేశపెట్టిన నోటా (ఎవరికీ కాదు)కు దేశ వ్యాప్తంగా 60 లక్షల ఓట్లు వచ్చాయి. 16వ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలిచిన సీట్లు: భారతీయ జనతాపార్టీ 282; కాంగ్రెస్ 44; శివసేన 18; సీపీఐ 1; సీపీఎం 9; నేషన లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 6; శిరోమణి అకాలీదళ్ 4; అన్నాడీఎంకే 37; తణమూల్ కాంగ్రెస్ 34; జేడీఎస్ 2; జేడీ యూ 2; ఆమ్‌ఆద్మీ పార్టీ 4; ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ 2; ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2; ఆర్‌ఎస్‌పీ 1; తెలంగాణ రాష్ట్ర సమితి 11; ఎల్‌జేపీ 6; ఆర్‌జేడీ 4; పీడీపీ 3; కేరళకాంగ్రెస్ (ఎం) 1; ఎస్పీ 5; ఆర్‌ఎల్‌ఎస్‌పీ 3; స్వాభిమాన్ పక్ష 1; స్వతంత్రులు 3; ఏఐయూడీఎఫ్ 3; తెలుగుదేశం 16; అప్నాదళ్ 2; వైఎస్సార్‌సీపీ 9; బిజూ జనతాదళ్ 20; జేఎంఎం 2; ఎన్‌పీపీ 1; ఎఐఎంఐఎం 1; ఎస్‌డీఎఫ్ 1; నాగా పీపుల్స్ ఫ్రంట్ 1; పీఎంకే 1; సమదురాజ్యం కాంగ్రెస్ 1.

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా జెలియాంగ్
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ పగ్గాలు చేపట్టారు. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ నేతృత్వంలోని డెమోక్రాటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ మే 17న శాసనసభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా జెలియాంగ్‌ను ఎన్నుకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నైపూ రియో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన స్థానంలో జెలియాంగ్‌ను ఎన్నుకొన్నారు. జెలియాంగ్ ప్రస్తుతం గనులు, భూగర్భ వనరులు, ప్రణాళిక శాఖల మంత్రిగా ఉన్నారు. 

బీహార్ సీఎం జీతన్‌రాం ఝాంఝీ 
బీహార్ నూతన ముఖ్యమంత్రిగా జీతన్‌రాం ఝాంఝీ (68) మే 20న ప్రమాణ స్వీకారం చేశారు. జీతన్‌రామ్ గత నితీశ్ కుమార్ క్యాబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ జేడీయూ పరాజయానికి బాధ్యత వహిస్తూ నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో జీతన్‌రాంను ఎన్నుకున్నారు. 

ఒడిశాలో బీజేడీ ప్రభంజనం
ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతత్వంలోని బిజూజనతాదళ్ వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు 117 సీట్లను గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 16, బీజేపీ 10, ఎన్సీపీ 4 స్థానాలకు పరిమితమయ్యాయి. ఇక లోక్‌సభ స్థానాలకు వస్తే మొత్తం 21కిగాను 20 స్థానాలు బీజేడీ ఖాతాలో పడ్డాయి. 

అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం
అరుణాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలకు కాంగ్రెస్ 42 స్థానాల్లో గెలుపొందింది. దీంతో వరుసగా మూడోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నబమ్‌తుకీ రెండోసారి ఆ పదవిలో కొనసాగనున్నారు. 

సిక్కింలో అధికారంలోకి ఎస్.డి.ఎఫ్
సిక్కిం శాసనసభకు ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్.డి.ఎఫ్) తిరిగి అధికారంలోకి వచ్చింది. 32 స్థానాలుగల శాసనసభలో ఎస్.డి.ఎఫ్ 22 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ చామ్లింగ్‌కు వరుసగా ఐదోసారి అధికారపీఠాన్ని అధిరోహించే అవకాశం వరించింది.

టి.ఐ.ఇ సిలికాన్ వ్యాలీతో ఒడిశా ఒప్పందం
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మే 14న టి.ఐ.ఇ సిలికాన్ వ్యాలీతో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ఒడిశా రాష్ట్రాన్ని ఐటీ హ బ్‌గా మార్చి, అమెరికా పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. దీన్ని అనుసరించి శాంతాక్లారా (కాలిఫోర్నియా) లోని సిలికాన్ వ్యాలీ కేంద్ర కార్యాలయంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక నిపుణుడు ఉంటాడు. టి.ఐ.ఇ సిలికాన్ వ్యాలీ... ప్రొఫెషనల్స్, ఎంటర్ ప్రెన్యూర్లు సభ్యులుగా ఉండే లాభాపేక్ష లేనటువంటి గ్లోబల్ నెట్‌వర్క్. ఈ సంస్థను 1992లో ఏర్పాటు చేశారు. టి.ఐ.ఇ అంటే టాలెంట్, ఐడియాస్, ఎంటర్ ప్రై జ్. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. విశ్వమంతటా స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థను పెంచడమే టి.ఐ.ఇ. ముఖ్య ఉద్దేశం. 

ప్రజావేగుల రక్షణ బిల్లు -2011కు రాష్ట్రపతి ఆమోదముద్ర
ప్రజావేగుల రక్షణ బిల్లు -2011కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 13న ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మంత్రులతో సహా ప్రభుత్వ సేవకులు తమ అధికారాన్ని ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయడం, అవినీతికి పాల్పడేవారి సమాచారాన్ని ఇచ్చే వ్యక్తులను ప్రోత్సహిస్తూ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. దేశంలో అవినీతిని నిరోధించేందుకు సమాచారా హక్కు చట్టానికి ఈ బిల్లు అనుబంధంగా ఉంటుంది. లోక్‌సభ ఈ బిల్లును 2011లో ఆమెదించింది. 2012లో రాజ్యసభ పరిశీలనకు రాగా ఫిబ్రవరి 21, 2014న ఆమోదం లభించింది.

15వ లోక్‌సభ రద్దు 
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 15వ లోక్‌సభను మే 18న రద్దుచేశారు. కేబినెట్ సూచనల మేరకు లోక్‌సభను రద్దు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో మే 17న రాష్ట్రపతితో చివరిసారి భేటీ అయిన కేంద్ర కేబినెట్ , 15వ లోక్‌సభను రద్దు చేయాలని సూచించింది. రాజ్యాంగంలోని 85వ అధికరణంలో క్లాజ్ (2), సబ్‌క్లాజ్ (బి) ప్రకారం తనకు గల అధికారాల మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో బీజేపీ 282 సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటుకు అర్హత సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2009-2014 కాలంలో 345 రోజులు మాత్రమే సమావేశమై 1,331 గంటలు పనిచేసింది. 15వ లోక్‌సభ నిర్ణీత సమయంలో 63 శాతం సమయాన్ని మాత్రమే వినియోగించుకుంది.

2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి 63 సీట్లతోను, సీమాంధ్రలో తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ కూటమి 106 సీట్లతో విజయం సాధించాయి. మే 16న వెలువడిన అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలలో టీఆర్‌ఎస్, టీడీపీలు మెజారిటీ సీట్లను కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటు కు అర్హత సాధించాయి. సీమాంధ్రలో కాంగ్రెస్, వామపక్షాలకు ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. కాగా సీమాంధ్రలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్‌సీపీ కేవలం 1.96 శాతం ఓట్లతో వెనుకబడి అతిపెద్ద ప్రతిపక్షంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాలకు, 294 శాసనసభ స్థానాలకు రెండు విడతల్లోవేర్వేరుగా పోలింగ్ జరిగింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, 119 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. కాగా సీమాంధ్ర ప్రాంతంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు మే 7న పోలింగ్ జరిగింది. 
ఎన్నికల ఫలితాలు: తెలంగాణ; అసెంబ్లీ/లోక్‌సభ; తెలంగాణ రాష్ట్ర సమితి: 63/11; కాంగ్రెస్: 21/2; తెలుగుదేశం, బీజేపీ కూటమి: 20/2; వామపక్షాలు: 2/0; వైఎస్సార్‌సీపీ: 3/1; ఇతరులు: 10/1. సీమాంధ్ర: అసెంబ్లీ/లోక్‌సభ: తెలుగుదేశం, బీజేపీ కూటమి: 106/17; వైఎస్సార్‌సీపీ: 67/8; ఇతరులు: 2/0

డబుల్‌డెక్కర్ రైలు
దక్షిణ మధ్య రైల్వే మొట్టమొదటి డబుల్‌డెక్కర్ రైలు సర్వీసును కాచిగూడ- గుంటూరు మధ్య మే 13న కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించింది. ప్రయాణీకుల అవసరాల మేరకు ఈ రైలును భవిష్యత్‌లో విజయవాడ, విశాఖపట్నం వరకు పొడిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ డబుల్‌డె క్కర్ రైలులో 10 బోగీలకు 1200 సీట్లు ఉన్నాయి.

జల్లికట్టు ఆటపై సుప్రీం నిషేధం
తమిళనాడులో శతాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న ఎద్దుల వికృత క్రీడ జల్లికట్టుపై సుప్రీం కోర్టు మే 7న నిషేధం విధించింది. జంతువులు సహా జీవులన్నింటికీ సహజ సిద్ధమైన గౌరవ మర్యాదలు ఉంటాయని, ప్రశాంతంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు కల్పించడంతోపాటు వాటిని మనం గౌరవించాల్సి ఉందని జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. జంతువులను హింసించకుండా భారతీయ జంతు సంక్షేమ బోర్డు చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఆదేశించింది.

విద్యాహక్కు చట్టం మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించదు
ఉచిత నిర్బంధ విద్యా చట్టం మేరకు చిన్నారులకు వర్తించే విద్యాహక్కు చట్టం మైనారిటీ విద్యాసంస్థలకు వర్తించదని సుప్రీంకోర్టు మే 6న ఇచ్చిన ఓ తీర్పులో స్పష్టం చేసింది. మైనారిటీ విద్యాసంస్థల విషయంలో ఈ హక్కు రాజ్యాంగ విరుద్ధమైనదిగా, సంస్థలకున్న హక్కును హరించేదిగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని పాఠశాలల్లోనూ 25 శాతం సీట్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే 2009 నాటి ఈ చట్టం ఎయిడెడ్ మైనారిటీ పాఠశాలలకూ వర్తిస్తుందని 2010లో సుప్రీం ఇచ్చిన తీర్పు సరికాదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. 

మాతృ భాష తప్పనిసరికాదు: సుప్రీం
ప్రాధమిక విద్యాభ్యాసానికి పాఠశాలల్లో మాతృ భాషను ప్రభుత్వం తప్పనిసరి చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భాషాపరమైన అల్పసంఖ్యాకులపై బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్దరాదని తెలిపింది. రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. ప్రాథమిక విద్యను నేర్చుకునేందుకు మాతృ భాషను తప్పనిసరి చేయడం ద్వారా ఒత్తిడి తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మే 6న స్పష్టం చేసింది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు విధిగా కన్నడ మాధ్యమంలోనే బోధించాలని 1994లో కర్ణాటక ప్రభుత్వం అప్ప ట్లో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రై వేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు సుప్రీంను ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది.

రికార్డు సృష్టించిన 2014 ఎన్నికలు
పోలింగ్ శాతంలో 2014 లోక్‌సభ ఎన్నికలు రికార్డు సృష్టించాయి. భారతదేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నమోదైన ఎన్నికలుగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో 66.38శాతం పోలింగ్ నమోదు చేసి.. మాజీప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 నాటి లోక్‌సభ ఎన్నికల రికార్డు (64.01శాతం)ను అధిగమిం చాయి. సార్వత్రిక సమరం ముగిసింది. 2014 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 7న ప్రారంభమై దేశవ్యాప్తంగా 9 విడతల్లో మే 12తో ముగిశాయి. 2009 నాటి ఎన్నికల్లో పోలింగ్ శాతం 55.29 మాత్రమే కావడం గమనార్హం.

అసోంలో తీవ్రవాదుల దాడి 
అసోంలో మే 1, 2 తేదీల్లో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ సొంగ్ బిజిత్ (ఎన్‌డీఎఫ్‌బీఎస్)కు చెందిన మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 32 మంది మరణించారు. బోడో టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ కోక్రాఝుర్, బక్సా జిల్లాల్లో సాయుధ తీవ్రవాదులు మైనారిటీ వర్గాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. స్వతంత్ర బోడోలాండ్ కోసం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ సొంగ్ బిజిత్ కొన్నేళ్లుగా పోరాటం చేస్తోంది.

భారత్‌లో వాతావరణ సమతుల్యతకు ముప్పు
భారత్‌లో అతివృష్టి, అనావృష్టి పరిణామాలతో వాతావరణ సమతుల్యతకు విఘాతం వాటిల్లుతోందని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఇటీవలి దశాబ్దాల్లో దక్షిణాసియా రుతుపవనాల సీజన్‌లో ముఖ్యంగా మధ్య భారతదేశంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని వీరి పరిశోధనలో తేలింది. భారత్‌లో వెట్ స్పెల్స్ (కొద్దిరోజులపాటు వర్షాలు కురవడం), డ్రై స్పెల్స్ (కొద్ది రోజులపాటు వర్షాభావం) లాంటి పరిస్థితులు భవిష్యత్‌లో క్రమంగా పెరుగుతాయని శాస్త్రవేత్తల బృందం వివరించింది. 

టాప్ 100లో ఐఐటీ గువహటి
ప్రతిష్ఠాత్మక గువహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంతర్జాతీయంగా అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా స్థానం సంపాదించింది. ఈ జాబితాలో తొలిసారిగా చోటు సంపాదించిన ఏకైక భారతీయ విద్యా సంస్థగా ఐఐటీ గువహటి నిలిచింది. 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 100 సంస్థల జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజీన్ విడుదల చేసింది. పోర్చుగల్‌కు చెందిన లిస్బన్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీతో కలిసి ఐఐటీ గువహటి 87వ ర్యాంకును పంచుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పొహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వరుసగా మూడో ఏడాది కూడా జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.

AIMS DARE TO SUCCESS 

జూన్ 2014 జాతీయం
హోమీబాబా నివాసం వేలం
భారత అణు ఇంధన కార్యక్రమ పితామహుడు హోమీ జే బాబాకు చెందిన మూడంతస్తుల భవనం మెహ్రాన్ గిర్‌ను జూన్ 18న వేలం వేశారు. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ బంగళా రూ. 372 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే కొన్నవారి వివరాలను గోప్యంగా ఉంచారు. దీనికి ప్రస్తుతం కస్టోడియన్‌గా ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్‌ఫామింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ) ఈ వేలాన్ని నిర్వహించింది. అయితే ఈ బార్క్ శాస్త్రవేత్తలు ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బాంబే హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని చారిత్రక కట్టడంగా ప్రకటించాలని కోరుతున్నారు.

ప్రపంచ చారిత్రక స్థలంగా రాణీ కీ వావ్
గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఇటీవల బయటపడ్డ రాణీ కీ వావ్ బావిని ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేరుస్తూ దోహాలో జూన్ 22న వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆమోదించింది. ఏడు భూగర్భ అంతస్తులున్న ఈ బావికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో చోటు కల్పించింది. సిద్దార్థ జైసింగ్ అనే రాజు 11వ శతాబ్దంలో ఈ బావిని నిర్మించాడు. ఇందులో గంగాదేవి ఆలయం ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో కులూ జిల్లాలో గల గ్రేట్‌హిమాలయన్ నేషనల్‌పార్క్‌కు కూడా చోటు లభించింది. ప్రస్తుతం ఆమోదించిన ప్రదేశాలతో కలిసి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా 1001కు చేరింది. 

చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ల రాజీనామా 
చత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ శేఖర్‌దత్ జూన్ 18న తన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అందజేశారు. ఆయన పదవీకాలం జనవరి 2015లో ముగియాల్సి ఉంది. శేఖర్‌దత్ జనవరి 23, 2010లో చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. జూన్ 17న ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి కూడా రాజీనామా చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్‌గా కోడెల 
ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్‌గా డాక్టర్ కోడెల ప్రసాదరావు (టీడీపీ), డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్ధ ప్రసాద్ (టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ధర్మవరం పట్టుచీరకు జాతీయ గుర్తింపు
అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు, పావడాలకు భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు పత్రం లభించింది. ధర్మవరంలో తయారైన పట్టుచీరలను ఇతర ప్రాంతాల వారు కొనుగోలు చేసి తమ లోగోలను అతికించి విక్రయించేవారు. వాటికి తావివ్వకుండా ప్రభుత్వం ఇక్కడి పట్టుచీరల నాణ్యత, కళలను గుర్తించి జాతీయ పత్రం ఇవ్వడం శుభపరిణామం. 

తెలంగాణ తొలి అడ్వొకేట్ జనరల్‌గా రామకృష్ణారెడ్డి
తెలంగాణ తొలి అడ్వొకేట్ జనరల్‌గా కె. రామకృష్ణారెడ్డి జూన్ 23న బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా తెలంగాణ తొలి అదనపు అడ్వొకేట్ జనరల్‌గా జె. రామచంద్రరావు కూడా బాధ్యతలు చేపట్టారు. 

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టాటా 
తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడానికి టాటాగ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జూన్ 23న ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు.

నర్మదా డ్యామ్ ఎత్తు పెంపునకు అనుమతి
గుజరాత్‌లో వివాదాస్పద నర్మదా డ్యామ్ ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.72 మీటర్లకు(455 అడుగులకు) పెంచుకునేందుకు నర్మదా నియంత్రణ అథారిటీ(ఎన్‌సీఏ) జూన్ 12న అనుమతి మంజూరు చేసింది. 1961 ఏప్రిల్ 5న జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ఈ డ్యామ్.. ముంపు ప్రాంతాలు, పునరావాస సమస్యలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రాజెక్టు పూర్తవుతోంది. ఎనిమిదేళ్ల కిందట డ్యామ్ ఎత్తును 121.92 మీటర్లకు పెంచుకునేందుకు ఎన్‌సీఏ అనుమతి ఇవ్వగా.. అది సరిపోదని, మరింత పెంచాలని గుజరాత్ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,450 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లకు పంపిణీ చేస్తారు. దీని ద్వారా గుజరాత్‌లో 17.92 లక్షల హెక్టార్లకు, రాజస్థాన్‌లో 2.46 లక్షల హెక్టార్లకు నీరందే అవకాశముంటుంది. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద కాంక్రీటు గ్రావిటీ డ్యామ్(పరిమాణంలో). మొదటిది అమెరికాలోని గ్రాండ్ కూలీ ప్రాజెక్టు. అలాగే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్పిల్ వే డిశ్చార్జి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

విద్యుత్ ఉత్పత్తిలో ఆర్‌ఏపీఎస్-5 రికార్డు
విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం (ఆర్‌ఏపీఎస్)-5వ రియాక్టర్ అంతరాయం లేకుండా 678 రోజులపాటు పని చేసి ఆసియా స్థాయిలో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జూన్ 11 నాటికి ప్రతి రోజు 220 మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో పనిచేసింది. ఇటువంటి సామర్థ్యాన్ని ఆసియాలోనే తొలిసారి ఒక అణు రియాక్టర్ ప్రదర్శించింది. ఆర్‌ఏపీఎస్-5 ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. 2009, డిసెంబర్ 22న దీన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 2010, ఫిబ్రవరి 4 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. గతంలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలోని 160 మెగావాట్ల రెండో యూనిట్ 2009, జూలై నుంచి 2011, మార్చి వరకు 590 రోజులపాటు నిరంతరాయంగా పని చేసింది.

తెలంగాణ రాష్ట్ర పండుగలుగా బోనాలు, బతుకమ్మ 
బోనాలు, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 16న ప్రకటించింది. ఇక నుంచి ఈ రెండు పండుగలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది.

ఏపీలో తగ్గిన అటవీ విస్తీర్ణం
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 281 చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం తగ్గిందని జూన్ 10న విడుదలైన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని 46,389 చ.కి.మీ. అడవుల్లో 281 చ.కి.మీ. అడవులు క్షీణించినట్లు నివేదిక తెలిపింది. దేశంలో మైనింగ్ కోసం ఎక్కువగా అడవులను వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అత్యధిక అటవీ భూమి ఉంది.

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్) ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు.

లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఎన్నిక
బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ 16వ లోక్‌సభ స్పీకర్‌గా జూన్ 6న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీరా కుమార్ తర్వాత సభాపతి స్థానాన్ని అధిష్టించిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. ఈమె ఇండోర్ (మధ్యప్రదేశ్) లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

వస్త్రాల ఎగుమతిలో రెండో స్థానంలో భారత్
జర్మనీ, ఇటలీలను అధిగమించి భారత్ వస్త్రాల ఎగుమతిలో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంది. అయితే, చైనా కంటే వెనుకబడి ఉంది. అప్పెరల్ ఎక్స్‌పోర్‌‌ట ప్రమోషన్ కౌన్సిల్ (ఎఇపీసీ) జూన్ 2 విడుదల చేసిన లెక్కల ప్రకారం 2013లో భారత వస్త్రాల ఎగుమతులు 40 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. ఇటలీ ఎగుమతులు 36 బిలియన్ డాలర్లు, జర్మనీ ఎగుమతులు 35 బిలియన్ డాలర్లు. చైనా ఎగుమతులు భారత్ కంటే 274 బిలియన్ డాలర్లుగా ఎక్కువ. ఈ వస్త్రాలలో బట్టలకు వాడే దారం, కాటన్, సిల్క్, ఉన్ని, సింథటిక్‌తో చేసిన రెడీమేడ్ దుస్తులు ఉన్నాయి.

కేఎన్‌పీపీ రికార్డు
తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి రికార్డు సృష్టించింది. కేఎన్‌పీపీలోని ఒకటో యూనిట్‌లో జూన్ 7న మధ్యాహ్నం నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి మొదలైందని, దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం ఇంత సామర్థ్యంతో పనిచేయడం ఇదే తొలిసారి అని ప్లాంటు డెరైక్టర్ ఆర్‌ఎస్ సుందర్ వెల్లడించారు. కాగా, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కూడంకుళం ప్లాంటును మూసివేయాలంటూ రెండేళ్లుగా స్థానిక ప్రజలు పోరాడుతున్నారు. కేఎన్‌పీపీ దేశంలో నిర్మించిన 21వ అణువిద్యుత్ రియాక్టర్. తొలి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ కూడా ఇదే.

29వ రాష్ట్రంగా తెలంగాణ
2014 జూన్ 2న దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అదే రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే ఆయనతోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ తొలి ఉన్నతాధికార్లు:
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి: రాజీవ్‌శర్మ
డీజీపీ: అనురాగ్‌శర్మ 

తెలంగాణ భౌగోళిక స్వరూపం:
విస్తీర్ణం: 1.14 లక్షల చదరపు కిలోమీటర్లు
జనాభా: 3.50 కోట్లు (సుమారుగా)
జిల్లాలు: 10, మండలాలు: 459 
గ్రామాలు: 8,400
లోక్‌సభ స్థానాలు: 17
రాజ్యసభ స్థానాలు: 7
అసెంబ్లీ స్థానాలు: 119
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు (జెడ్పీటీసీ): 443
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ): 6,525

ఆంధ్ర, తెలంగాణలకు ఉమ్మడి హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటిదాకా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న పేరును హైకోర్టు ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్‌గా మార్చినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ మే 30న ప్రకటించారు. జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా పరిగణిస్తారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా సూచన మేరకు ‘‘హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’’గా మార్చారు.

AIMS DARE TO SUCCESS 

జూలై 2014 జాతీయం
రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శనశాల
జూలై 25 నాటికి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఒక ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఇందులో మాజీ రాష్ట్రపతుల ఫైబర్ గ్లాస్ ప్రతిమలు, విదేశీ పర్యటనల సందర్భంగా వారు బహుమతులుగా స్వీకరించిన కళాఖండాలను ఉంచారు. ఈ సందర్భంగా ‘వింగ్‌డ్ వండర్స్’ అనే పుస్తకాన్ని, రాష్ట్రపతి భవన్‌లో 2012, ఆగస్టు నుంచి జరిగిన సంగీత, నృత్య కార్యక్రమాల సమాహారమైన ‘ఇంద్రధనుష్’ అనే మరో పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 

మరో రెండు క్షిపణి ప్రయోగ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులలో కొత్తగా మరో రెండు క్షిపణి ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ జూలై 25న లోక్‌సభకు తెలియజేశారు. వీటి కోసం కృష్ణా జిల్లాలోని నాగాయలంక, అండమాన్‌లోని రుట్లాండ్ దీవిని డీఆర్‌డీవో ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. 

టీసీఎస్ రికార్డు
టాటా గ్రూప్‌నకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీల విలువ జూలై 23న రూ. 5లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయగా కంపెనీగా రికార్డు సృష్టించింది. తొలిసారి 2004లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టీసీఎస్ తొలిసారి 84 బిలియన్ డాలర్ల(రూ.5,06,703 కోట్లు) విలువను అందుకున్న ఒక దేశీ కంపెనీగా నిలిచింది. టీసీఎస్.. టాటా సన్స్ డివిజన్‌గా 1968లో ఏర్పాటైంది. 1995లో ప్రత్యేక కంపెనీగా టాటా సన్స్ నుంచి విడివడింది.

హిజ్రాలకు పథకాల్లో థర్డ్ జెండర్ ఆప్షన్
వివిధ స్కాలర్‌షిప్/ఫెలోషిప్ పథకాల్లో హిజ్రాలకు (ట్రాన్స్‌జెండర్) థర్డ్ జెండర్‌గా నమోదు చేసుకునేలా ఆప్షన్ ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు యూజీసీ పథకాల్లో ఈ అవకాశం కల్పించాలని తెలిపింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి జస్పాల్ ఎస్.సంధు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, జైనులను మైనారిటీలుగానే పరిగణించాలని పేర్కొన్నారు.

బ్రెయిలీ లిపిలో సర్దార్ జీవిత చరిత్ర
భారత ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవిత చరిత్రను సాయిబాబా గౌడ్ బ్రెయిలీ లిపిలో రచించారు. ఈ పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోడీ జూలై 23న ఢిల్లీలో ఆవిష్కరించారు. సాయిబాబా గౌడ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అంధుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. 

మై గవ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ప్రధాని 
పరిపాలనలో ప్రజలను మరింత భాగస్వామ్యుల్ని చేసేందుకు ఝడజౌఠి.జీఛి.జీ అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రధాని నరేంద్రమోడీ జూలై 26న ప్రారంభించారు. గంగానది ప్రక్షాళన, నైపుణ్యాల అభివృద్ధితోపాటు పలు అంశాలపై పౌరుల ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వెబ్‌సైట్‌ను రూపొందించారు.

భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు జీఎస్‌ఐ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా భీమిలి ఎర్రమట్టి దిబ్బలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియో హెరిటేజ్ సైట్)గా గుర్తించింది. ఈ దిబ్బలు సుమారు 20 వేల ఏళ్ల కిందట ఏర్పడ్డాయి.

దక్షిణ ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్‌గా కేసీఆర్
కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించే దక్షిణ ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కేంద్ర ప్రభుత్వం నియ మించింది. ఈ మండలికి చైర్మన్ కేంద్ర హోం శాఖమంత్రి.

సాహితీ విమర్శకుడు చేరా కన్నుమూత
ప్రముఖ తెలుగు భాషా వేత్త , సాహితీ విమర్శకుడు చేకూరి రామారావు (79) హైదరాబాద్‌లో జూలై 22న కన్నుమూశారు. చేరాగా సుపరిచితుడైన రామారావు ఖమ్మం జిల్లాకు చెందినవారు.

జాతీయ ఆకృతి సంస్థ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
జాతీయ ఆకృతి సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 17న ఆమోదముద్ర వేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక పార్లమెంట్ చేసిన తొలి చట్టం ఇదే . ఈ చట్టంతో జాతీయ ప్రాధాన్యమున్న సంస్థగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే జాతీయ ఆకృతి సంస్థకు గాంధీనగర్‌లో శాఖ, బెంగళూర్‌లో శాటిలైట్ కేంద్రం ఉంది. దీంతోపాటు పోలవరం బిల్లుకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలకు చెందిన 200కుపై గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

ఖనిజాన్వేషణకు సాంకేతిక పరిజ్ఞానం
భూగర్భంలోని ఖనిజాల అన్వేషణకు జాతీయ భూభౌతిక పరిశోధనా కేంద్రం (ఎన్‌జీఆర్‌ఐ) ఆధునిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భూమిలోపల ఉన్న సహజ వనరులను గుర్తించాలంటే ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ విధానం డ్రిల్లింగే. ఈ విధానం వ్యయప్రయాసలతో కూడింది. దీనికి పరిష్కారంగా 3-డీ హై రిజల్యూషన్ సిస్మిక్ సర్వే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఖర్చు తగ్గటంతోపాటు వనరులను సమర్థంగా గుర్తించవచ్చు. ఈ తరహా పరిజ్ఞానం ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌లలో మాత్రమే ఉంది. ఈ పరిజ్ఞానానికి అవసరమైన పరికరాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా వినియోగించే ఈ విధానంతో పదిరెట్లకు పైగా ఖర్చు తగ్గటంతోపాటు అనేక ప్రయోజనాలున్నాయి.

పంచాయతీలకు ఇంటర్నెట్ ప్రాజెక్ట్ సర్వే పూర్తి 
గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ (ఎన్‌ఓఎఫ్‌ఎన్.) ప్రాజెక్ట్ కింద చేపట్టిన సర్వే పూర్తయింది. దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామపంచాయతీలకు 2017 నాటికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్, స్పెషల్ పర్సన్ వెహికల్ సంస్థలు ప్రాజెక్టును రూపొందించాయి. ఈ ప్రాజెక్టును చేపట్టేముందు రాజస్థాన్‌లోని ఆజ్మీర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, త్రిపురలలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తారు.

దేశంలో అటవీ విస్తీర్ణం 21.23 శాతం 
2011 నుంచి అటవీ విస్తీర్ణం 5,871 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు 13వ భారత అటవీ నివేదిక 2013 తెలిపింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ జూలై 8న దీన్ని విడుదల చేశారు. దేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం 69.79 మిలియన్ హెక్టార్లుగా నివేదిక పేర్కొంది. ఇది దేశ విస్తీర్ణంలో 21.23 శాతం. వృక్షాల విస్తీర్ణం 91,266 చదరపు కిలోమీటర్లు. 1988 జాతీయ అటవీ విధానం భూభాగంలో అటవీ వృక్షాల విస్తీర్ణం 33 శాతంగా ఉండాలని లక్ష్యాన్ని నిర్ణయించింది. పశ్చిమబెంగాల్‌లో గరిష్టంగా అటవీ విస్తీర్ణం (3,816 చ.కి.మీ) పెరిగింది. తర్వాత స్థానాల్లో ఒడిశా (1,444 చ.కి.మీ), కేరళ (622 చ.కి.మీ) ఉన్నాయి. ముంపు, ఖనిజాల త వ్వకం, పోడు వ్యవసాయం కారణంగా నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అటవీవిస్తీర్ణం తగ్గిందని నివేదిక వెల్లడించింది. 

పోలవరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014కు జూలై 11న లోక్‌సభ, జూలై 14న రాజ్యసభ ఆమోదించాయి. పోలవరంగా పిలిచే ఇందిరాసాగర్ ప్రాజెక్టును బహుళ ప్రయోజనార్థం గోదావరి నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద నిర్మిస్తున్నారు. 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించారు.

దేశంలో అత్యంత వేగవంతమైన రైలు 
దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఢిల్లీ-ఆగ్రాల మధ్య విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేసే ఈ రైలుని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జూలై 3న ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఆగ్రాకు ప్రయాణ కాలం 120 నిమిషాలు. దీన్ని మరింత తగ్గించాలనే లక్ష్యంతో ఈ రైలును ప్రవేశపెట్టారు. నవంబర్ నుంచి ఈ రైలు సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 

దరఖాస్తులో మూడో వర్గాన్ని చేర్చిన ఫెర్గూసన్
దేశంలో మొదటిసారిగా పూణెకు చెందిన ఫెర్గూసన్ కాలేజీ దరఖాస్తు ఫారాల్లో మూడో లింగవర్గాన్ని (థర్డ్ జెండర్) జతచేసింది. 2014-15 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నిమిత్తం చేపట్టిన ప్రక్రియలో ఈ మార్పులను చేసింది. హిజ్రాలను (లింగమార్పిడి) మూడో లింగవర్గంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 15న ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఫెర్గూసన్ కాలేజీ ఈ నిర్ణయం తీసుకుంది. 

రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా ఒంటె 
రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెను తమ రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. తగ్గిపోతున్న ఒంటెల సంఖ్యను అడ్డుకునేందుకు జూలై 1న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటెల అక్రమ రవాణా, వథ నివారణకు కొత్త చట్టాన్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఆహార భద్రత కార్యక్రమంలో ఒంటె పాలను కూడా రాజస్థాన్ రాష్ట్రం చేర్చనుంది. 1997లో 6.68 లక్షలున్న ఒంటెల సంఖ్య 2008 నాటికి 4.30 లక్షలకు పడిపోయింది.

ముగిసిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
లడఖ్‌లో మూడో విడత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జూన్ 29న ముగిశాయి. ఇందులో ఇరాన్, కొరియాకు చెందిన పలు చిత్రాలను ప్రదర్శించారు. బాలీవుడ్ చిత్రం కాఫిరోన్ కి నమాజ్ (ద వర్జిన్ ఆర్గ్యుమెంట్స్) అత్యధికంగా నాలుగు అవార్డులను పొందగా, ఇరాన్‌కు చెందిన వెట్ లెటర్స్ మూడు అవార్డులను అందుకుంది.

ఉధంపూర్- కాట్రా రైలు మార్గం ప్రారంభం
జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్-కాట్రా రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్రమోడీ జూలై 4న ప్రారంభించారు. ఈ మార్గం వల్ల వైష్ణోదేవీ ఆలయానికి చేరుకోవడం సులభమవుతుంది. 26 కిలోమీటర్ల ఈ రైలు మార్గాన్ని రూ.1,132.74 కోట్లతో నిర్మించారు. ఇదే పర్యటనలో నియంత్రణ రేఖవద్ద 240 మెగావాట్ల యూరి-2 జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. 

2011-12లో భారత్‌లో పేదరికం 29.6శాతం
2011-12లో భారత్‌లో పేదరికం 29.6 శాతం ఉన్నట్లు రంగరాజన్ కమిటీ పేర్కొంది. కమిటీ పేదరికంపై తన నివేదికను ఇటీవల కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. రోజుకు పట్టణంలో రూ.47, గ్రామాల్లో రూ. 32 కంటే తక్కువ ఖర్చు చేసేవారిని పేదవారిగా రంగరాజన్ కమిటీ పేర్కొంది. 2009-10లో 38.2 శాతంగా ఉన్న పేదరికం 2011-12 నాటికి 29.6 శాతానికి తగ్గినట్లు కమిటీ తెలిపింది. గతంలో టెండూల్కర్ కమిటీ 21.9 శాతం పేదరికం ఉందని పేర్కొంది. దీనిపై విమర్శలు తలెత్తడంతో 2013లో కేంద్రం రంగరాజన్ కమిటీని నియమించింది. 

మహిళలపై నేరాల్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం
జాతీయ నేర గణాంకాల సంస్థ (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో-ఎన్‌సీఆర్‌బీ) జూలై 1న విడుదల చేసిన నివేదిక ప్రకారం 2013లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2013లో ఆంధప్రదేశ్‌లో మహిళలపై 32,809 నేరాలు జరిగాయి. కాగా ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలోనూ, పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలోనూ నిలిచాయి. 2012లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 28,171 కేసులు నమోదయ్యాయి. కాగా సైబర్ నేరాల్లో రెండో స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. మొత్తం నేరాల విషయానికి వస్తే.. 2.34 లక్షల నేరాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

ఎర్రచందనం వేలానికి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి
ఆంధ్రప్రదేశ్‌లో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలానికి కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ జులై 4న అనుమతించింది. ఎర్రచందనం వేలం వల్ల దాదాపుగా రూ. 1,600 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఎర్రచందనం వృక్షాలు అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నందున దీని అమ్మకానికి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అనుమతి పొందింది.

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా స్వామిగౌడ్ 
తెలంగాణ రాష్ట్ర తొలి శాసనమండలి ఛైర్మన్‌గా స్వామిగౌడ్ (టీఆర్‌ఎస్) జూలై 2న ఎన్నికయ్యారు. ప్రస్తుతం దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జమ్ముకాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో శాసనమండలి వ్యవస్థ అమల్లో ఉంది.

AIMS DARE TO SUCCESS 

ఆగష్టు 2014 జాతీయం
పంచాయత్ సశస్తికరణ్ అభియాన్
రాజీవ్ గాంధీ పంచాయత్ సశస్తికరణ్ అభియాన్ కింద 2013, 2014లకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌తో పాటు 5 రాష్ట్రాలకు అవార్డులు ప్రకటించింది. దీనికి రూ. కోటి చొప్పున నిధులు అందిస్తారు. 

డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 20న డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. దీని కింద ప్రభుత్వ సేవలను ప్రజలకు ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ప్రజలు తాజా సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2018 వరకు దశలవారీగా అమలు చేస్తారు. అన్ని మంత్రిత్వ శాఖల ప్రాజెక్టులు ఈ ప్రోగ్రామ్ పరిధిలోకి వస్తాయి. 

చెన్నైకు 375 వసంతాలు
తమిళనాడు రాజధాని చెన్నై ఆగస్టు 22 నాటికి 375వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1639 ఆగస్టు 22న ఈ నగరం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని తమకు అప్పగించేలా నాటి రాజులతో బ్రిటీషర్లు ఒప్పందం కుదుర్చుకోవడంతో నాటి మద్రాస్ ఆవిర్భవించింది. ఆ తర్వాతి ఏడాదే...అంటే 1640లో బ్రిటీషర్లు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్ట్ ఇండియా కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. నేటి చెన్నై నగరాన్ని మొదట చెన్నప్పనాయకన్ అని పిలిచేవారు. ఆ తర్వాతి కాలంలో అదే చెన్నపట్నంగా, మద్రాస్‌గా మారి చివరకు చెన్నైగా స్థిరపడింది.1996లో నాటి డీఎంకే సర్కారు ఈ నగరం పేరును మద్రాస్ నుంచి చెన్నైగా మార్చింది. ప్రపంచంలోనే రెండో అతిపొడవైన మెరీనా బీచ్ చెన్నైలోనే ఉంది.

ఆగ్రాలో ప్రపంచంలోనే అతి ఎత్తై గుడి 
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో 70 అంతస్థులతో 213 మీటర్ల ఎత్తై చంద్రోదయ మందిర నిర్మాణ పనులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ ఆగస్టు 18న ప్రారంభించారు. ఆలయనిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తై గుడిగా చంద్రోదయ మందిరం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. 

నివాసయోగ్య ప్రాంతాల్లో ఢిల్లీకి 111వ స్థానం
అంతర్జాతీయ నివాసయోగ్య ప్రాంతాల్లో దేశ రాజధాని ఢిల్లీ111వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్లోబల్ లివబులిటి సంస్థ సర్వే పేర్కొంది. మొదటి స్థానాన్ని వరుసగా నాలుగోసారి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరం సొంతం చేసుకొంది. తర్వాతి స్థానంలో వియన్నా (ఆస్ట్రియా) నిలిచింది. 

ఉమ్మడి యంత్రాంగం ఏర్పాటు 
సరిహద్దు వివాదంపై హింస చెలరేగకుండా అరికట్టేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయానికి ఉమ్మడి యంత్రాంగం ఏర్పాటుకు అసోం, నాగాలాండ్ ఆగస్టు 21న నిర్ణయించాయి. వివాదాస్పద ప్రాంతంలో హింసాత్మక సంఘటనలకు కారణమవుతున్న చారిత్రక సమస్యలను పరిష్కరించుకోవాలని అంగీకరించాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సమక్షంలో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, నాగాలాండ్ ముఖ్యమంత్రి టి.ఆర్.జెలియాంగ్ ఆ మేరకు అంగీకారానికి వచ్చారు. ఆగస్టు 12-13 తేదీల్లో వివాదాస్పద ప్రాంతంలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో గోలాఘాట్ జిల్లాలో తొమ్మిది మంది అస్సామీలు మరణించారు.

వేంపల్లి గంగాధర్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఆతిథ్యం
రాష్ట్రపతి భవన్‌లో విశిష్ట ఆతిథ్యానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కడప జిల్లాకు చెందిన రచయిత వేంపల్లి గంగాధర్ ఎంపికయ్యారు. ఈయన సెప్టెంబర్ 8 నుంచి 26 వరకు రాష్ట్రపతి భవన్‌లో విడిది చేస్తారు. గంగాధర్ రైతులు, మహిళలు, రాయలసీమ కరువుపై పలు రచనలు చేశారు. ఆయన రాసిన మొలకల పున్నమికి 2011లో యువ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 

రాజమండ్రి విమానాశ్రయానికి టంగుటూరి పేరు
రాజమండ్రి విమానాశ్రయానికి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 23న ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి జయంతిని ప్రభుత్వం ఆగస్టు 23న అధికారిక పండుగగా నిర్వహించింది. 

జమ్మూకాశ్మీర్‌లో పర్యటించిన మోడీ
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 12న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. లేహ్‌లో నిమూబజ్గో జల విద్యుత్ ప్రాజెక్ట్‌ను, లేహ్-కార్గిల్-శ్రీనగర్ విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రారంభించారు. లేహ్‌లో సైన్యం, వైమానిక దళాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్ము, కాశ్మీర్‌లో రహదారుల నిర్మాణానికి రూ. 8వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. 1999లో కార్గిల్‌లో పాక్ సైన్యం చొరబాటు తర్వాత ఆ ప్రాంతాన్ని భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి. 

జ్యుడీషియల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్ బిల్లు-2014ను ఆగస్టు 13న లోక్‌సభ ఆమోదించింది. దీంతోపాటు కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే 99వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును రాజ్యసభ ఆగస్టు 14న ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ రద్దవుతుంది. ఆరుగురు సభ్యులు గల జ్యుడీషియల్ నియామకాల జాతీయ కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటవుతుంది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, మరో ఇద్దరు ప్రముఖులతోపాటు న్యాయశాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. 

పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాని ఓటు
పదేళ్ల తర్వాత లోక్‌సభలో బిల్లుపై ప్రధానమంత్రి ఓటువేశారు. జడ్జీల నియామకానికి గతంలో నియమించిన కొలీజియం వ్యవస్థ రద్దుచేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు13న ఓటు వేయడంతో పదేళ్ల తర్వాత ప్రధానమంత్రి లోక్‌సభలో ఓటుహక్కు వినియోగించుకున్నట్టయింది. గత పదేళ్ల యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆయన తన పదవీకాలమంతా లోక్‌సభలో ఓటు వేయడం కుదరలేదు.

షహీద్ గౌరవం
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు, అధికారులకు షహీద్ గౌరవం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

1000 మందికి 927 మందే
దేశంలో ఆరేళ్ల లోపు వయసున్న బాలల్లో ప్రతి వెయ్యిమంది బాలురకు 927 మంది బాలికలు మాత్రమే ఉన్నారని, స్వాతంత్య్రం తర్వాత ఈ నిష్పత్తి అత్యధికంగా తగ్గడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

రక్షణ, రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి 
రక్షణ రంగంలో 49 శాతం, రైల్వేల్లో కొన్ని విభాగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న అంగీకరించింది. రక్షణ రంగంలో ప్రస్తుతం 26 శాతం వరకు అనుమతి ఉంది. రైల్వేల్లో హైస్పీడ్ రైళ్ల వ్యవస్థ, సబర్బన్ కారిడార్లు, సరకు రవాణా లైన్ల వంటి విభాగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించింది.

బాల నేరస్థుల విచారణపై జువెనైల్ జస్టిస్ బోర్డుకు అధికారం 
తీవ్రమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 16-18 ఏళ్ల మధ్య ఉన్న వారిని సంస్కరణ గృహానికి పంపాలా లేదా సాధారణ కోర్టులో విచారించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం జువెనైల్ జస్టిస్ బోర్డుకు అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బాలనేరస్థుల చట్టం ప్రకారం మైనర్లు ఎంత తీవ్ర నేరాలకు పాల్పడినా వారిపై కోర్టులో విచారణ జరపడానికి వీలులేదు. వారికి గరిష్ట శిక్షగా మూడేళ్ల నిర్బంధం మాత్రమే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి మరణశిక్ష విధించడానికి వీలులేదు. ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో మైనర్ కూడా నిందితుడుగా ఉన్న సంఘటనతో బాల నేరస్థుల చట్టాన్ని సవరించాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. 

దేశంలో విద్యుత్ సౌకర్యం లేనివారు 40 కోట్ల మంది
దేశంలో మూడింట ఒక వంతు మందికి విద్యుత్ సౌకర్యం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 7న లోక్‌సభకు తెలిపారు.ప్రస్తుతం ఎనిమిది కోట్ల గృహాలకు విద్యుత్ సౌకర్యం లేదు. అంటే 40 కోట్ల మందికి విద్యుత్ అందుబాటులో లేదని ప్రకటించారు. దేశంలో విద్యుత్ లేని గ్రామాల సంఖ్య 12,468. వీటిలో అత్యధికంగా బీహార్‌లో 6,882 గ్రామాలున్నాయని మంత్రి వివరించారు. 

మిజోరం గవర్నర్ బేనీవాల్ తొలగింపు
మిజోరం గవర్నర్ కమలా బేనీవాల్‌ను తొలగిస్తూ ఆగస్టు 6న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కమలా బేనీవాల్ ఆ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు. కాగా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ గోవా గవర్నర్‌గా ఆగస్ట్ 7న అదనపు బాధ్యతలు స్వీకరించారు.

భారత్‌లో పర్యటించిన అమెరికా మంత్రులు
అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, వాణిజ్యమంత్రి పెన్నీ ప్రిట్జికర్‌లు భారత్‌లో పర్యటించారు. సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించాలని ప్రధాని నరేంద్రమోడీని కోరారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు అధ్యక్షుడు ఒబామా ఆసక్తితో ఉన్నారని మోడీకి తెలిపారు. 

గ్యాస్ ధరలపై సురేశ్‌ప్రభు కమిటీ 
గ్యాస్ ధరల నియంత్రణపై సమీక్షించేందుకు సురేశ్‌ప్రభు నేతృత్వంలోని కమిటీని కేంద్రం జూలై 24న నియమించింది. ప్రభు.. వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. కమిటీలో సురేశ్‌ప్రభుతోపాటు ప్రతాప్ భాను మెహతా ఉన్నారు. 

రాష్ట్రీయ గోకుల్ మిషన్ ప్రారంభం 
కేంద్ర ప్రభుత్వం జూలై 28న రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే జాతీయ స్థాయి పథకాన్ని ప్రారంభించింది. స్వదేశీ పశు వీర్య సేకరణ, పశు సంతతి అభివృద్ధ్ధి ఈ పథకం లక్ష్యం. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ దీన్ని ప్రారంభించారు. 12వ ప్రణాళికలో భాగంగా ఈ పథకం కింద రూ. 500 కోట్లను వెచ్చించనున్నారు. 

జీవ వైవిధ్య సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడో విడత ప్రదర్శన 
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ జీవ వైవిధ్య సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడో విడత ప్రదర్శన యాత్రను న్యూఢిల్లీలో జూలై 28న ప్రారంభించారు. భారత జీవవైవిధ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రైలు ప్రదర్శనను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ చేపట్టాయి. 2012లో హైదరాబాద్‌లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ రైలు నడుస్తోంది. 194 రోజులపాటు 20 రాష్ట్రాల్లో ప్రయాణించి 2015 ఫిబ్రవరి 4న గాంధీనగర్‌కు చేరుకుంటుంది. 56 చోట్ల ఆగుతుంది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు సందర్శిస్తారని అంచనా. ప్రపంచంలో అత్యధికులు సందర్శించిన రైలు ఇదే. భారత్.. ప్రపంచ భూభాగంలో 2.5 శాతం, ప్రపంచ జనాభాలో 17 శాతం, ప్రపంచ జీవ వైవిధ్యంలో 8 శాతం కలిగి ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా అల్లూరి జయంతి
అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 31న ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా అల్లూరి జయంతి జూలై 4న ప్రభుత్వం తరపున అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

గోండు లిపి మొదటి వాచకం ఆవిష్కరణ
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో జూలై 31న గోండు లిపిలో రాసిన మొదటి వాచకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్‌లేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన పలువురు దీనికోసం కృషి చేశారు. 

మెట్రో పొలిస్-2014 వేదిక హైదరాబాద్ 
మెట్రో పొలిస్ సదసు ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనుంది. గతంలో సిడ్నీ వేదికగా మెట్రోపొలిస్ సదస్సును నిర్వహించారు. 

అతిపెద్ద బంగారు డిపాజిట్ 
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన బంగారు ఆభరణాలు, కానుకలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు 2న జమ చేసింది. తిరుపతి వచ్చిన ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు 1800 కిలోల బంగారాన్ని తితిదే కార్య నిర్వహణాధికారి ఎం. జి. గోపాల్ అందజేశారు. దీంతో ఇంతపెద్ద మొత్తం బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసిన మొదటి సంస్థగా తితిదే రికార్డు సృష్టించింది. దీనికి ఒకశాతం బంగారాన్ని వడ్డీ కింద ఎస్‌బీఐ చెల్లిస్తుంది.

AIMS DARE TO SUCCESS 

సెప్టెంబరు 2014 జాతీయం
మేక్ ఇన్ ఇండియా ప్రారంభం 
మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో ప్రారంభించారు. భారత దేశాన్ని అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

జయలలితకు నాలుగేళ్ల జైలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (66)కు బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 27న నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. అలాగే ఆమె దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ, ఇళవరసిలకు నాలుగేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా విధించింది. 1991-1996 కాలం లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి రూ.66.65 కోట్లు ఆస్తులున్నాయన్న కేసులో ఆమెకు ఈ శిక్ష పడింది. దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవితోపాటు పదేళ్లు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. 

స్వచ్ఛ్ భారత్‌కు కేబినెట్ ఆమోదం
స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 24న ఆమోదించింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఆరుబయట మల విసర్జనను నిర్మూలించడం, వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్లను నిర్మించడం దీని లక్ష్యం. 

ఎన్‌టీటీ రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీం 
పన్నులకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు జాతీయ పన్ను ట్రైబ్యునల్ (ఎన్‌టీటీ)చట్టాన్ని ఏర్పాటు చేస్తూ 2005లో పార్లమెంట్ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 25న తీర్పునిచ్చింది. 

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద ల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటించింది. దీనికోసం రూ. 500 కోట్లు కేటాయించింది. 

సీఐఐ కార్యవర్గం
భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కార్యవర్గం సెప్టెంబర్ 24న ఎన్నికైంది. ఆంధ్రప్రదేశ్ చైర్మన్‌గా సురేష్ చిట్టూరి, వైస్ చైర్మన్‌గా అమర్‌రాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడైన డాక్టర్ రామచంద్ర ఎన్. గల్లా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలికో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సీఎఫ్‌ఓ వనితా దాట్ల చైర్ పర్సన్‌గా, పెన్నార్ గ్రూప్ చైర్మన్ జేవీ నృపేందర్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ పేరు మార్పు
ఆరోగ్యశ్రీ పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీ ఆర్ ఆరోగ్య సేవగా మారుస్తూ సెప్టెంబర్ 27న ఉత్తర్వులు జారీచేసింది. పేదలకు ఉచిత కార్పోరేట్ వైద్యం అందించే లక్ష్యంతో 2007లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. చికిత్సకు అయ్యే వ్యయ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు పెంచారు. 

కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని సెప్టెంబర్ 27న ప్రభుత్వం ప్రారంభించింది. కాకతీయ వైద్య కళాశాలలో తాత్కాలికంగా దీన్ని ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సురేశ్ చందాను ప్రభుత్వం నియమించింది.

నేషనల్ ఆయుష్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎమ్) ను ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 15న ఆమోదించింది. అ్గ్ఖఏ అనే ఈ పదం మొదటి అక్షరాలైన ఆయుర్వేదం, యోగ అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతిలను సూచిస్తుంది. సుదూర ప్రాంతాలలో నివసించేవారి ఆరోగ్య అవసరాలను తీర్చడమే ఆయుష్ లక్ష్యం. 

శిశు మరణాల్లో భారత్ అగ్రస్థానం
శిశు మరణాల విషయంలో గతం కంటే పరిస్థితి మెరుగుపడినా భారత దేశమే అగ్రస్థానంలో ఉంది. 2013లో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన అయిదేళ్లలోపు శిశుమరణాలపై ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 16న నివేదికను విడుదల చేసింది. 2013లో దేశంలో ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 41 మరణాలు నమోదయ్యాయని ఐరాస తెలిపింది. 

శిశుమరణాల తగ్గింపునకు ప్రత్యేక కార్యాచరణ
శిశుమరణాలు తగ్గించే లక్ష్యంతో భారత నవజాత శిశు కార్యాచరణ ప్రణాళిక (ఐఎన్‌ఏపీ)ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సెప్టెంబర్ 18న ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి 1000 జననాలకు 29 గా ఉన్న శిశు మరణాలను, 2030 నాటికి ఒక అంకెలోకి తీసుకువచ్చేందుకు దీన్ని చేపట్టారు. కేరళలో నవజాత శిశుమరణాల రేటు 7గా ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో దేశవ్యాప్తంగా మరణించే వారి సంఖ్యలో 56 శాతం సంభవిస్తున్నాయి. 

టీసీఎస్‌లో అత్యధిక మహిళా ఉద్యోగులు 
దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మహిళలకు అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తోంది. ఈ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సంఖ్య లక్షకు దాటింది. దీంతో మహిళలు పనిచేస్తున్న అతిపెద్ద దేశీయ ప్రైవేటు సంస్థగా టీసీఎస్ గుర్తింపు పొందింది.

అందరికీ విద్యుత్ ఒప్పందంపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ఒప్పందం
అందరికీ విద్యుత్తు (పవర్ ఫర్ ఆల్-పీఎఫ్‌ఏ) అందించే కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందంపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో సంతకాలు చేశాయి. ఎన్‌టీపీసీ రూ. 20వేల కోట్లతో 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టును విశాఖ పట్టణం జిల్లా పుడిమడకలో నెలకొల్పనుంది. ప్రపంచంలో అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నారు. కేంద్రానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పోరేషన్‌తో ఒప్పందం జరిగింది. ఈ సౌర విద్యుత్తు కేంద్రాలను కడప, కర్నూలు,అనంతపురాల్లో ఏర్పాటు చేస్తారు. చిత్తూరు జిల్లా మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ ఆటోమోబైల్ ప్రాజెక్టును స్థాపించనుంది. 

తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిభా పురస్కారం
శాస్త్ర సాంకేతికతను వినియోగించుకొని అనూహ్య ఫలితాలను సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ప్రతిభా (మెరిట్) పురస్కారాన్ని అందజేసింది. ‘కనిష్ట ప్రభుత్వం - గరిష్ట పాలన’ పేరుతో నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ రూపొందించిన ఈ-పీడీఎస్ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వినియోగించుకొంది. దీంతో ఆధార్ కార్డుల సీడింగ్‌ను చేపట్టి మూడు నెలల వ్యవధిలో 10.13 లక్షల కార్డులను రద్దు చేసి 16.54 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆదా చేసింది. ఈ-పీడీఎస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి అనూహ్య ఫలితాన్ని సాధించినందుకు కేంద్రం ఆర్డర్ ఆఫ్ మెరిట్ పేరుతో అవార్డును సెప్టెంబర్ 20న ఢిల్లీలో అందించింది.

వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న సుప్రీం
అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 12న తీర్పునిచ్చింది. సమాన అవకాశాలు, రక్షణ, పూర్తి భాగస్వామ్యం కల్పిస్తూ వికలాంగుల చట్టం 1995లో ఆమోదం పొందినప్పటికీ అమలు కాలేదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. 

హైకోర్టులో ఐదుగురు శాశ్వత న్యాయమూర్తులు
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ ఎ. రాజశేఖరరెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ సరసా వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ చల్లా. కోదండరామ్‌లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా సెప్టెంబర్ 5న వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. 

తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్ 9న ప్రకటించారు. కాళోజీ శత జయంతి వేడుకల్లో భాగంగా వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ నిర్మించనున్న కాళోజీ కళా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రానిక్స్ విధానం 
ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబ ర్ 9న కొత్త ఎలక్ట్రానిక్స్ విధానం 2014-2020 ప్రకటించింది. ఈ విధానం ద్వారా రూ. 30వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది. 

ఆంధ్రాలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ (స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్)ను ఏర్పాటు చేసింది. దీనికి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐటీ రంగ నిపుణులు గంటా సుబ్బారావును, సంచాలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణలను నియమిస్తూ సెప్టెంబర్ 10న ఉత్తర్వులు జారీచేసింది.

భారత్‌లో అత్యధిక ఆత్మహత్యలు 
2012లో ఆగ్నేయాసియాలో జరిగిన ఆత్మహత్యల్లో అత్యధికంగా భారత్‌లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సెప్టెంబర్ 4న విడుదల చేసిన నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 8.04 లక్షల మంది బలవన్మరణాలు నమోదవగా వీరిలో భారతీయుల సంఖ్య 2,58,077. ప్రపంచం మొత్తం మీద 40 నిమిషాలకు ఒక ఆత్మహత్య చోటు చేసుకుంటుందని పేర్కొంది. 

బంగారుతల్లి పథకం పేరు మార్పు
బాలికా సంరక్షణ కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బాలికల సాధికారత కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద పేదింట్లో అమ్మాయి పుట్టిన దగ్గరి నుంచి డిగ్రీ పూర్తి చేసేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. 

రాజ్యసభ కమిటీ చైర్మన్‌గా సుబ్బరామిరెడ్డి 
రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్‌గా టి సుబ్బరామిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభ నుంచి వచ్చే వివిధ బిల్లులను ఈ కమిటీ నిశితంగా పరిశీలించాకే, రాజ్యసభలో ప్రవేశపెడతారు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన బిల్లులపై ఈ కమిటీ ఏమైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేయవచ్చు. 

ఆరోగ్యశ్రీ ట్రస్టుకి ఫిక్కీ పురస్కారం
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) పురస్కారాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు దక్కించుకుంది. ఆరోగ్య పరిరక్షణలో చూపిన చొరవ, కృషి అసాధారణ సేవల విభాగాల్లో ఈ అవార్డును బహుకరిస్తారు. 

అక్కినేని పేరుతో అమెరికాలో పోస్టల్ స్టాంపు
దివంగత అక్కినేని నాగేశ్వరరావు ముఖచిత్రంతో కూడిన స్టాంపును అమెరికా పోస్ట్ సర్వీసు విడుదల చేయనుంది. ఆయన జయంతి సెప్టెంబర్ 20న డల్లాస్‌లో స్టాంపు విడుదల చేయనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆగస్టు 31న ప్రకటించింది. అమెరికా పోస్ట్ సర్వీసు తొలిసారి భారతీయ నటుడి స్టాంపును విడుదల చేయనుంది. 

విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 4న శాసనసభలో ప్రకటించారు. రాజధాని అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా, మరో 14 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.

కనీస పెన్షన్ రూ. 1000
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలోని పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ రూ. 1,000గా నిర్ణయిస్తూ కేంద్రం ఆగస్టు 29న నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే సామాజిక భద్రత పథకాల కింద ఈపీఎఫ్ చందాదారుల వేతన పరిమితిని రూ. 15,000గా నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. 

స్మార్ట్ హెరిటేజ్ సిటీగా వారణాసి 
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరాన్ని స్మార్ట్ హెరిటేజ్ సిటీగా రూపొందించేందుకు భారత్-జపాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందంపై ఆగస్టు 30న భారత రాయబారి దీపా వాద్వా, క్యోటో నగర మేయర్ దైసా కడోకోవాలు సంతకాలు చేశారు. దేశంలో 100 స్మార్ట్ సిటీల కార్యాచరణకు వారణాసితో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వారణాసిని క్యోటో నగరం తరహాలో స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతారు. 

కాలదోషం పట్టిన చట్టాల సమీక్ష 
ప్రభుత్వ పాలనలో ఇబ్బందికరంగా పరిణమించిన.. నిరుపయోగ, కాలదోషం పట్టిన చట్టాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 27న కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని కార్యాలయ కార్యదర్శి ఆర్.రామానుజం, పాలనా విభాగం మాజీ కార్యదర్శి వీకే భాసిన్ ఇందులో ఉంటారు. ఈ కమిటీ దేశంలోని చట్టాలను పరిశీలించి.. వాటిల్లో గత పది, పదిహేనేళ్లుగా సరిగా అమల్లో లేని, కాలదోషం పట్టిన చట్టాలను గుర్తిస్తుంది.

డాట్ భారత్ డొమైన్‌ను ప్రారంభించిన కేంద్రం 
దేవనాగరి లిపిలో కొత్త డొమైన్ డాట్ భారత్‌ను కేంద్రం న్యూఢిల్లీలో ఆగస్టు 27న ప్రారంభించింది. ఈ డొమైన్ హిందీ, బోడో, డోగ్రీ, కొంకణ్, మైథిలీ, మరాఠీ, నేపాలీ, సింధీ వంటి ఎనిమిది భాషల్లో ఉంటుంది. సామాజిక మీడియాతో ప్రజల్ని అనుసంధానించేందుకు, ముఖ్యంగా ఇంగ్లిష్ పరిచయం లేనివారికి ప్రాంతీయ భాషల్లో విషయాలు అందించడమే లక్ష్యంగా డాట్ భారత్ (.ఆజ్చిట్చ్ట) ను సృష్టించారు. 

నలందాలో తరగతులు ప్రారంభం
ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, పలు దేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో 821 సంవత్సరాల తర్వాత మళ్లీ లాంఛనంగా సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ వర్సిటీని పునరుద్ధరించాలని 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు. పార్లమెంటు ఆమోదించిన నలందా వర్సిటీ చట్టం ద్వారా ఈ వర్సిటీ తిరిగి ఉనికిలోకి వచ్చింది. ఆరో శతాబ్దంలో గుప్తుల కాలంలో ప్రారంభమైన నలందా విశ్వవిద్యాలయాన్ని టర్కీ సైన్యం 1193లో కొల్లగొట్టి ధ్వంసం చేయడంతో మూతపడింది. నలందా యూనివర్సిటీని లాంఛనంగా సెప్టెంబర్ 14న ప్రారంభిస్తారు.

బాపు మృతి
ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాపు (81) చెన్నైలో ఆగస్టు 31న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని కంతేరు. బాపు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలిచిత్రం సాక్షి (1967). 2013లో బాపుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

ఏపీ రాజధానిపై హోంశాఖకు నివేదిక 
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆగస్టు 27న న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు నివేదిక అందించింది. కమిటీ ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి వివిధ ప్రాంతాల్లో పలువురి అభిప్రాయాలను సేకరించి నివేదిక సిద్ధం చేసింది. రాజధాని ఏర్పాటుపై ఆయా ప్రాంతాల్లో అనుకూల, ప్రతికూలత నివేదికలను సిద్ధం చేసింది.

AIMS DARE TO SUCCESS 

అక్టోబరు 2014 జాతీయం
జాతీయ ఐక్యతా దినోత్సవంగా పటేల్ జయంతి 
భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31ని జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్)గా కేంద్రం ప్రకటించింది. 

బొగ్గు గనుల కేటాయింపు ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
బొగ్గు గనులను ఇ-వేలం ద్వారా ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు రూపొందించిన ఆర్డినెన్స్‌ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్టోబరు 21న ఆమోదించారు. దీన్ని కేంద్ర కేబినెట్ అక్టోబరు 20న ఆమోదించింది. బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలపై స్పందిస్తూ 1993 నుంచి జరిగిన 214 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు కంపెనీల వినియోగానికి ఇ-వేలం ద్వారా బొగ్గు గనులు కేటాయిస్తారు. 

విదేశాల్లో నల్లధనం ఉన్న వారి పేర్లను వెల్లడించిన కేంద్రం
విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా ధనం దాచిన వారి పేర్లను కేంద్రం అక్టోబరు 27న సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇందులో డాబర్ ఇండియా ప్రమోటర్ ప్రదీప్ బర్మన్, రాజ్‌కోట్‌కు చెందిన పంకజ్ చిమన్‌లాల్, గోవా గనుల సంస్థకు చెందిన రాధా సతీష్ టింబ్లోతోపాటు ఒక కంపెనీ సహా ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి.

భారత్‌లో యూఎన్ ఉమెన్ ప్రచారం ప్రారంభం
మహిళల హక్కులు, లింగ సమానత్వం పెంపొందించడంలో పురుషుల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో యూఎన్ ఉమెన్ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి అక్టోబరు 11న ప్రారంభించింది. 2030 నాటికి లింగ అసమానత్వాన్ని అంతమొందించేందుకు హి ఫర్ షి ఉద్యమాన్ని చేపట్టింది. 

శ్రమయేవ జయతే ప్రారంభం
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబరు 16న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీని కింద ఐదు పథకాలను ప్రారంభించారు. 1. శ్రమ సువిధ పోర్టల్: ఇందులో ప్రతి కార్మికుడికి ప్రత్యేక కార్మిక గుర్తింపు సంఖ్య ఉంటుంది. 2. ర్యాండమ్ ఇన్‌స్పెక్షన్ పథకం: పరిశ్రమల తనిఖీ పారదర్శకంగా ఉండేందుకు ఈ పథకాన్ని కార్మిక శాఖ రూపొందించింది. 3. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్): ఉద్యోగ భవిష్య నిధి సభ్యుల కోసం సార్వత్రిక ఖాతా సంఖ్య (యూనివర్సల్ అకౌంట్ నంబర్) శాశ్వతంగా ఒకటే ఉంటుంది. 4. అప్రెంటీస్ షిప్ ప్రోత్సాహన యోజన: యువతలో నైపుణ్యాల వృద్ధి కోసం ఉద్దేశించిన పథకమిది. 5. సవరించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా: అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఆరోగ్య భద్రత కోసం ఇచ్చిన కార్డులకు రెండు సామాజిక భద్రత పథకాలను చేరుస్తారు. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు పెట్టే ఇన్‌స్పెక్టర్ రాజ్ విధానాన్ని రద్దు చేశారు.

సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికలు
పొగ తాగటం వల్ల అనర్థాలను హెచ్చరిస్తూ సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం స్థలంలో చట్టబద్ధమైన హెచ్చరికలను విధిగా ముద్రించాలని తయారీ కంపెనీలను కేంద్ర ఆరోగ్యశాఖ అక్టోబర్ 15న ఆదేశించింది. సిగరెట్ పెట్టెపై 60 శాతం స్థలంలో ధూమపానం వల్ల కలిగే నష్టాలపై రేఖా చిత్రాలు, 25 శాతం స్థలంలో హెచ్చరికలను ముద్రించాలంటూ స్పష్టం చేసింది. 

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు
మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు అక్టోబరు 15న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు 122 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. హర్యానాలో 90 స్థానాలకు 47 స్థానాలు గెలుచుకొని పూర్తి మెజారిటీ సాధించింది. మహారాష్ట్రలో బీజేపీ-122, శివసేన -63, కాంగ్రెస్-42, ఎన్‌సీపీ- 41, స్వతంత్రులు -7, ఇతరులు-12 గెలుచుకున్నారు. హర్యానాలో బీజేపీ-47, ఐఎన్‌ఎల్‌డి-19, కాంగ్రెస్-15, హెచ్‌జేసీ-2, ఇతరులు-7 స్థానాలు సాధించారు. 

తెలంగాణలో ఐదు స్మార్ట్ సిటీలు
తెలంగాణ రాష్ట్రంలోని.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలను స్మార్‌‌ట సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదించనుంది. 

జలవనరుల శాఖ సలహాదారుగా శ్రీరాం
తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా అక్టోబర్ 16న నియమితులయ్యారు. గంగానదీ ప్రక్షాళన, నదుల అభివృద్ధి, వాటి అనుసంధానం, సాగునీటి సరఫరా వంటి అంశా ల్లో కేంద్ర జలవనరుల శాఖకు ఆయన సలహాలు ఇస్తా రు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం..‘నీటి నిర్వహణ లో గుజరాత్ విజయగాథ’, ‘గోదావరి, కృష్ణాలను విని యోగిస్తూ తెలంగాణకు వాటర్‌గ్రిడ్’,‘దేశానికి నీటి నిర్వహణలో కొత్త పద్ధతులు అనివార్యం’ వంటి గ్రంథాలను రచించారు. అలాగే జాతీయ నీటి విధానం-2012 రూపకల్పనలో భాగస్వామిగా వ్యవహరించారు.

మెట్రో పొలిస్ ప్రపంచ కాంగ్రెస్-2014
హైదరాబాద్‌లో 11వ మెట్రో పొలిస్ ప్రపంచ కాంగ్రెస్ అక్టోబర్ 6 నుంచి 10 వరకు జరిగింది. సదస్సును అక్టోబర్ 7న గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అధికారికంగా ప్రారంభించారు. ఆసియా ఖండంలో ఈ సదస్సు జరగడం ఇదే తొలిసారి. ‘అందరి కోసం నగరాలు’ అనే ఇతి వృత్తం తో యువత, అందరికీ నివాసం, నగరాల్లో జీవనం అనే అంశాలపై సదస్సు సాగింది. తర్వాత సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా 2017లో జరగనుంది.

అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అక్టోబర్ 9న అంతర్జాతీయ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. భారత నిర్మాణంలో రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. 

జాతీయ మానసిక ఆరోగ్య విధానం 
మొట్టమొదటి జాతీయ మానసిక ఆరోగ్య విధానా(నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ ఆఫ్ ఇండియా)న్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అక్టోబర్ 10న ప్రారంభించారు. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, మానసిక అనారోగ్యం నుంచి కోలుకొనేలా చేయడం, ప్రతి వ్యక్తి తన పూర్తి జీవిత కాలం అనుభవించడం ఈ పాలసీ ఉద్దేశం.

ఎంపీ ఆదర్శ గ్రామ పథకం ప్రారంభం
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ జయంతిని పురస్కరించుకొని ఎంపీ ఆదర్శగ్రామ పథకం (సాంసద్ ఆదర్శ గ్రామ్ యోజన-ఎస్‌ఏజీవై)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. పథకం కింద ప్రతీ ఎంపీ 2019 నాటికి తన నియోజకవర్గంలోని ఏవైనా మూడు గ్రామాల్లో సదుపాయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.

పని చేయడానికి ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో భారత్‌కు 18వ స్థానం 
పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో భారత్ 18వ స్థానంలో నిలిచింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో అమెరికా మొదటి స్థానంలో, రెండు మూడు స్థానాల్లో బ్రిటన్, కెనడా ఉన్నాయి. 

హుదూద్ పెను తుపాను
హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. అక్టోబర్ 12న విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన హుదూద్ పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో ఈ సముద్ర తీర నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించింది. రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి తుపాను తాకిడికి గురయ్యాయి. ఈ తుపాన్‌కు హుదూద్ అనే పేరును ఒమన్ సూచించింది. హుదూద్ అనేది ఇజ్రాయిల్ జాతీయ పక్షి. ఈ పేరును ఒమన్ దేశం సూచించింది. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల్లో కనిపిస్తుంది.

40 ఏళ్లలో 52 శాతం నశించిన వన్యజీవులు
1970 నుంచి 2010 మధ్య కాలంలో 52 శాతం వన్యప్రాణులు నశించాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యు.డబ్ల్యు. ఎఫ్)రూపొందించిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్‌లో పేర్కొంది. క్షీరదాలు, పక్షులు, చేపలు, సరీసృపాలు, ఉభయచరాలు గత 40 ఏళ్లలో 52 శాతం వరకు క్షీణించాయి. 

స్వచ్ఛ్ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని
స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 2న న్యూఢిల్లీలో ప్రారంభించారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ పేరుతో ఐదేళ్లపాటు ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. ఆరుబయట మలవిసర్జన నిర్మూలించడం, వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లను నిర్మించడం, సఫాయి కార్మిక వ్యవస్థను అరికట్టడం, పట్టణ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఆరోగ్యకరమైన పారిశుధ్య అలవాట్లకు సంబంధించి, పారిశుధ్యానికి ఆరోగ్యానికి ఉన్న సంబంధంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. జాతీయ స్థాయిలో చేపట్టే కార్యక్రమానికి రూ.62,009 కోట్లు ఖర్చు చేస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 14,623 కోట్లను అందజేస్తుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభం
రూ. 2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో దీన్ని ప్రారంభించారు. ఈ సుజల కేంద్రాలలో 46 కేంద్రాలతో తూర్పుగోదావరి తొలిస్థానంలో నిలవగా, రెండో స్థానంలో 36 కేంద్రాలతో పశ్చిమ గోదావరి ఉంది.

రైతు సాధికారిక సంస్థ ఏర్పాటుకు ఆం.ప్ర. మంత్రి మండలి ఆమోదం
రైతు రుణ మాఫీతో పాటు ఇతర అంశాల పర్యవేక్షణకు రైతు సాధికారిక సంస్థ (ఫార్మర్ ఎంపవర్‌మెంట్ కార్పోరేషన్) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి అక్టోబర్ 1న ఆమోదం తెలిపింది. అక్టోబర్ 22 నుంచి ఈ సంస్థ పనిచేస్తుంది. రైతు రుణ మాఫీకి సంబంధించి కార్పోరేషన్ ద్వారా తొలి దశలో 20 శాతం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని నాలుగేళ్లలో 20 శాతం చొప్పున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించనుంది. ఈ కాలానికి రైతులకు హామీ ఇస్తూ 10 శాతం వార్షిక వడ్డీతో రాయితీ సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. డ్వాక్రా రుణమాఫీ అమలుకు కూడా మరో కార్పోరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 

తెలంగాణ శకటానికి మొదటి బహుమతి
మైసూర్‌లో అక్టోబర్ 4న జరిగిన దసరా ఉత్సవాల్లో తెలంగాణ శకటానికి మొదటి బహుమతి లభించింది. ఈ ఉత్సవాల్లో తొలిసారి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించింది. ఇందులో అలంపూర్ జోగులాంబ గుడి, బతుకమ్మతో పాటు వరంగల్‌కు చెందిన పేరిణి నృత్యాలు, కరీంనగర్‌కు చెందిన ఒగ్గుడోలు, డ్రమ్ముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

AIMS DARE TO SUCCESS 

నవంబరు 2014 జాతీయం
ఖాట్మండు-ఢిల్లీ బస్సు ప్రారంభం
భారత ప్రధాని నరేంద్రమోదీ, నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కొయిరాలా నవంబరు 25న ఖాట్మండు-ఢిల్లీ మధ్య బస్సును ఖాట్మండులో ప్రారంభించారు. ఈ బస్సుకు పశుపతి నాథ్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. అదే రోజు ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ-ఖాట్మండు బస్సు సర్వీసును ప్రారంభించారు. రెండు దేశాల మధ్య బస్సు సేవలు ప్రారంభం కావడం ఇదే మొదటిసారి. 

హార్‌‌నబిల్ ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని
ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో డిసెంబరు 1న నాగాలాండ్ రాజధాని కోహిమలో పర్యటించారు. వార్షిక హార్న్‌బిల్ ఉత్సవాలను ప్రారంభించారు. త్రిపురలోని ఉదయ్‌పూర్‌లో నిర్మించిన పలతానా విద్యుత్ ప్రాజెక్టులో 750 మెగావాట్ల రెండో యూనిట్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. 

మేఘాలయకు తొలి ప్యాసింజరు రైలు 
మేఘాలయకు తొలిసారిగా రైలు అనుసంధానాన్ని కల్పిస్తూ మెందిపథర్-గౌహతి ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 29న ప్రారంభించారు. అలాగే మిజోరంలోని భాయ్బ్రీ-సాయ్‌రంగ్ మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చడానికి శంకుస్థాపన చేశారు. 

గుజరాత్‌లో జాతీయ భద్రతా దళం కేంద్రం
జాతీయ భద్రతా దళం కేంద్రాన్ని (ఎన్‌ఎస్‌జీ) గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు సమీపంలోని రందేశన్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. 2008 ముంబైలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం నేపథ్యంలో 2009లో ముంబై, చెన్నై, కోల్‌కత, హైదరాబాద్‌లలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రందేశన్‌లో నెలకొల్పే ఐదో ఎన్‌ఎస్‌జీ కేంద్రం వచ్చే ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి రానుంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జపాన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనలో నవంబరు 28న టోక్యోలో ఆ దేశ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశమయ్యారు. నూతన రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటామని అబే తెలిపారు. ఐదురోజుల పర్యటనలో జపాన్ ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలతో పలు ఒప్పందాలు జరిగాయి. జపాన్ కంపెనీ సుమిటోమితో విద్యుత్ ఉత్పత్తి, రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ రంగాల్లో ఒప్పందాలు చేసుకుంది.

దేశంలో తొలి ఎబోలా కేసు నమోదు
దేశంలో తొలి ఎబోలా కేసు ఢిల్లీలో నమోదైంది. లైబీరియా నుంచి ఢిల్లీకి వచ్చిన 26 ఏళ్ల భారత్‌కు చెందిన వ్యక్తికి ఎబోలా సోకినట్లు అధికారులు గుర్తించారు. బాధితుణ్ని ఢిల్లీ విమానాశ్రయం లోనే ఉంచి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 

2 జీ దర్యాప్తు నుంచి రంజిత్‌సిన్హా ఉద్వాసన
2 జీ కుంభకోణం కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాను సుప్రీంకోర్టు నవంబరు 20న తొలగించింది. కొంతమంది నిందితులను రంజిత్‌సిన్హా కేసునుంచి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే అభియోగాలపై స్పందిస్తూ ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. 

టైమ్ అత్యుత్తమ ఆవిష్కరణగా మంగళ్‌యాన్
భారత్ చేపట్టిన మంగళ్‌యాన్‌ను ఈ ఏడాది అత్యుత్తమ ఆవిష్కరణగా టైమ్ పత్రిక అభివర్ణిం చింది. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి చేరుకోవడం సాంకేతిక అధ్బుతమని, అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు సాధించని ఘనతను భారత్ సెప్టెంబరు 24న సొంతం చేసుకుందని ప్రశంసించింది. 

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ నవంబరు 20న ఆమోదించింది. ప్రస్తుతమున్న రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్‌జీజీవీవై) స్థానంలో దీన్ని చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడమే పథకం ప్రధాన లక్ష్యం. 

గోవాలో అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం
45వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం గోవాలోని పనాజీలో నవంబరు 20న ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగే ఈ చిత్రోత్స వాల్లో 79 దేశాలకు చెందిన 178 చిత్రాలను ప్రదర్శిస్తారు. ప్రారంభ చిత్రంగా ఇరాన్‌కు చెందిన ద ప్రెసిడెంట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌కు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేశారు. భారతీయ సినిమాకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్‌కు జాతీయ పురస్కారం
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖకు 2012-13 జాతీయ ప్రతిభ పురస్కారం లభించింది. నవంబరు 18న ఢిల్లీలో జరిగిన రెడ్‌క్రాస్ జాతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి దీన్ని అందుకున్నారు. 

ఏయూకి ఇందిరాగాంధీ ఎన్‌ఎస్‌ఎస్ పురస్కారం
జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్)లో భాగంగా ఆంధ్ర విశ్వ విద్యాలయం మూడు విభాగాల్లో జాతీయ పురస్కారాలను అందుకుంది. నవంబరు 19న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా ఏయూ వైస్ ఛాన్స్‌లర్ జీఎస్‌ఎన్ రాజు వీటిని అందుకున్నారు.

పీఆర్ కండ్రిగను దత్తత తీసుకున్న సచిన్ 
క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టం రాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నవంబరు 16న ఆ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

పింఛనుదారులకు జీవన్ ప్రమాణ్
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులు పింఛను పొందేందుకు ఉద్దేశించిన జీవన్ ప్రమాణ్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 10న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇప్పటిదాకా పింఛనుదారులు ఏటా నవంబరులో నేరుగా సంబంధిత అధికారుల ఎదుట హాజరవడం లేదా జీవన ధ్రువ పత్రాన్ని అందజేయాల్సి వచ్చేది. ఇకపై ఆధార్ సంఖ్య, బయోమెట్రిక్ వివరాలతో కూడిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పిస్తే సరిపోతుంది. 

ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఆయుష్
ప్రాచీన వైద్య విధానాలకు పెద్దపీట వేసే ఉద్దేశంతో ఆయుష్‌ను ప్రత్యేక మంత్రిత్వశాఖగా మోదీ ప్రభుత్వం గుర్తించింది. ఆ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా)గా శ్రీపాద యశోనాయక్‌ను నియమించారు. గతంలో ఆరోగ్య మంత్రిత్వశాఖలో అంతర్భాగంగా ఆయుష్ ఉండేది. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వీటన్నింటినీ కలిపి ఆయుష్‌గా వ్యవహరిస్తారు.

వల్లభాయ్ పటేల్ పేరిట జాతీయ గృహ నిర్మాణ పథకం
పట్టణాల్లో కొత్తగా ఇళ్ల నిర్మాణాల కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ గృహ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు నవంబరు 13న ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాల పిట్ట
తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్ర పక్షిగా పాల పిట్టను ఎంపిక చేసింది. రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నవంబరు 17న తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, పౌరాణిక నేపథ్యం ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు తెలిపారు.

తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి వి.నాగిరెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 11న నియమించింది. ఆయన ఐదేళ్ల పాటు కొనసాగుతారు.

తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఇ-ఇండియా అవార్డు 
రాష్ట్రంలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఉత్తమ ఇ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్-2014 అవార్డు లభించింది. నవంబరు 15న త్రివేండ్రంలో జరిగిన గవర్నెన్స్ సదస్సులో పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఏపీ రాజధాని సలహా కమిటిలో సింగపూర్ ప్రతినిథి
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యునిగా సింగపూర్‌కు చెందిన ఖూ తెంగ్ చెయ్‌ని ప్రభుత్వం నియమించింది. ఖూ తెంగ్ చెయ్ సింగపూర్ అభివృద్ధి ప్రణాళికా విభాగంలో ముఖ్యుడు. 

విశాఖ ఉక్కుకు రాజభాష పురస్కారం
విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్)లో రాజభాష హిందీని పటిష్టంగా అమలు చేస్తున్నందుకు ఇందిరాగాంధీ రాజభాష పురస్కారం వరించింది. నవంబరు 15న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సంస్థ సీఎండీ మధుసూదన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 9న కొత్తగా 21 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇందులో నలుగురు కేబినెట్, ముగ్గురు సహాయ స్వతంత్ర ప్రతిపత్తి, 14మంది సహాయ మంత్రులు ఉన్నారు. దీంతో మంత్రి వర్గసభ్యుల సంఖ్య 66కు చేరింది. మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ, సురేశ్ ప్రభుకు రైల్వే , జగత్ ప్రకాశ్ నడ్డాకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, చౌదరి బీరేందర్ సింగ్‌కు గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయమంత్రిగా కార్మిక, ఉపాధి కల్పన శాఖ. ఆంధ్రప్రదేశ్ నుంచి వై.సుజనా చౌదరికి సహాయ మంత్రిగా సైన్స్, టెక్నాలజీ శాఖను కేటాయించారు. 

ఢిల్లీ అసెంబ్లీ రద్దు
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ నవంబరు 4న సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదించారు. నవంబరు 11 లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. ఈమేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజబ్‌జంగ్ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీలను కోరగా, ఎన్నికలకే మొగ్గు చూపారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. 

జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని 
సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని ప్రధాని నరేంద్రమోదీ దత్తత తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు తమ నియోజక వర్గం నుంచి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని మోడల్ గ్రామంగా రూపొందించడమే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ప్రధాన లక్ష్యం. 

ఢిల్లీలో ప్రపంచ ఆయుర్వేద సదస్సు
ప్రపంచ ఆయుర్వేద ఆరో సదస్సుకు ఢిల్లీ వేదికైంది. దీనికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ ఆయుర్వేద వైద్యానికి భారత్ ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు. 

పొగాకు ఉత్పత్తులపై బీహార్ నిషేధం
పొగాకు, దాని ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీ నవంబరు 7న ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ తప్పనిసరి: గుజరాత్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. దీని ప్రతిపాదన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లి ఆమోదించారు. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోతే అలాంటి వారికి శిక్ష తప్పదన్నది ఈ బిల్లులోని సారాంశం. 

ఆంధ్రప్రదేశ్‌లో హరిత పథకం 
వ్యవసాయాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరిత అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. హరిత పూర్తి రూపం.. హార్మోనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఫర్ ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎజెండా. వ్యవసాయం, సాగునీటి పారుదల, రెవెన్యూ శాఖల చొరవతో వ్యవసాయాన్ని మెరుగుపరచడమే హరిత పథకం లక్ష్యం. 

ఇంటర్నెట్ వినియోగదారుల్లో హైదరాబాద్‌కు ఆరో స్థానం
దేశంలో అత్యధిక అంతర్జాల వినియోగదారులున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. భారత ఇంటర్నెట్, సెల్‌ఫోన్ సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశం మొత్తం మీద 24.3 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని తేలింది. వీరిలో 1.64 కోట్ల మందితో ముంబయి అగ్ర స్థానం, 1.21 కోట్ల మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచాయి. 

తెలంగాణలో ఆసరా పథకం ప్రారంభం
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందించే ఆసరా పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నవంబరు 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ప్రారంభించారు. పథకం కింద వృద్ధులు, వితంతువులు, మరనేత, కల్లుగీత కార్మికులతోపాటు ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ. 1000, వికలాంగులకు రూ. 1,500లు అందజేస్తారు.

న్యూఢిల్లీలో సార్క్ విద్యా మంత్రుల సదస్సు
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) విద్యా మంత్రుల, అధికారుల రెండో సదస్సు న్యూఢిల్లీలో అక్టోబరు 31న జరిగింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విద్యా నాణ్యతను మెరుగుపరచుకోవడంలో పరస్పరం సహకరించుకోవాలని సదస్సు నిర్ణయించింది. 

కర్ణాటకలో 12 నగరాలకు కొత్త పేర్లు
59వ కర్ణాటక రాజ్యోత్సవంలో అక్టోబరు 31న రాష్ట్ర ప్రభుత్వం 12 నగరాలకు కొత్త పేర్లను ప్రకటించింది. బెంగ ళూర్‌ను బెంగళూరు, మంగుళూర్‌ను మంగళూరు, బెల్గామ్‌ను బెలగావీ, గుల్బర్గాను కలబురగి, మైసూర్‌ను మైసూరు, హుబ్లీని హుబ్బలీగా పిలుస్తారు.

భారత మత్స్యకారులకు ఉరిశిక్ష విధించిన శ్రీలంక 
భారత్‌కు చెందిన ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక లోని కొలంబో హైకోర్టు అక్టోబరు 30న ఉరిశిక్ష విధించింది. 2001లో భారత్ నుంచి శ్రీలంకకు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేశారన్న అభియోగాలపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణకు ఇండియా టుడే అవార్డు 
తెలంగాణ రాష్ట్రం ఇండియా టుడే అవార్డుకు ఎంపికయింది. మౌలిక వనరులున్న అతిపెద్ద రాష్ట్రం (బిగ్ బెస్ట్ స్టేట్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)గా తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. కేంద్ర సాంకేతిక,సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అవార్డును న్యూఢిల్లీలో అందుకున్నారు. 

ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మె.వా. విద్యుత్తు
1000 మెగావాట్ల విద్యుత్తును ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు తెలంగాణ ఒప్పందం కుదుర్చుకొంది. నవంబరు 3న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్, కేసీఆర్‌ల సమక్షంలో ఇంధన శాఖ కార్యదర్శులు రాయ్‌పూర్‌లో సంతకాలు చేశారు. 

రాష్ట్ర ఉత్సవంగా ‘సంజీవయ్య’ జయంతి
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి రోజైన ఫిబ్రవరి 14న రాష్ట్ర ఉత్సవంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 30న ఉత్తర్వులు జారీ చేసింది. 

అరేబియా సముద్రంలో నీలోఫర్ తుపాను 
అరేబియా సముద్రంలో ఏర్పడిన నీలోఫర్ తుపాను నవంబరు 1న గుజరాత్‌లో కచ్ జిల్లాలోని నాలియా గ్రామం వద్ద తీరం దాటింది. దీనివల్ల సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. నీలోఫర్ కారణంగా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడ్డాయి.

AIMS DARE TO SUCCESS 

డిసెంబరు 2014 జాతీయం
రా, సీఆర్‌పీఎఫ్‌లకు కొత్త సారథులు
భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతిగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 19న రాజిందర్ ఖన్నాను నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గ ఎంపికల కమిటీ ఖన్నా నియామకానికి ఆమోదం తెలిపింది. ఖన్నా డిసెంబర్ 31 నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆర్‌ఏఎస్ కేడర్‌కు చెందిన ఖన్నా 1978 బ్యాచ్ అధికారి. హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) ప్రకాశ్‌మిశ్రాను సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది.

లోక్‌సభలో జీఎస్‌టీ బిల్లు
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ డిసెంబర్ 20న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రవేశపన్ను, ఆక్ట్రాయ్, సేవా పన్ను వంటి అనేక పన్నులు ప్రత్యేకంగా లేకుండా ఒకటే పన్ను విధానాన్ని 2016, ఏప్రిల్ నుంచి అమలు చేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని తీసుకొచ్చారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తొలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి డిసెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త సర్వీస్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులు ఆరేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారు.

ఏపీ సీఆర్‌డీఏ బిల్లుకు శాసన సభ ఆమోదం
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 22న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతమున్న విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ రద్దవుతుంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే రాజధాని ప్రణాళిక, నిర్మాణం, పాలనకు సంబంధించి సీఆర్‌డీఏ ఏర్పాటవుతుంది. రాజదాని ప్రాంత పరిధిలో భూ సమీకరణ పథకం, పట్టణ ప్రణాళిక పథకం, ప్రత్యేక ప్రాంత అభివృద్ధి పథకం పర్యవేక్షణ అధికారం సీఆర్‌డీఏకి ఉంటుంది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటారు.

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి’ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 18న ఉత్తర్వులు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్‌అఫీషియో వైస్‌చైర్మన్‌గా ఆర్థికమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకొని, సమగ్రాభివృద్ధి సాధించేందుకు వీలుగా ప్రణాళిక మండలి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తుంది.

ఆత్మహత్యాయత్నం నేరమనే సెక్షన్ తొలగింపు!
ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించవద్దని, దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఐపీసీ)లోని 309వ సెక్షన్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్ చేసిన సిఫార్సుపై దేశంలోని 18 రాష్ట్రాలతో పాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు సానుకూలంగా స్పందించాయని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 10న రాజ్యసభలో వెల్లడించింది.

నెలలో ఒక రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్
2015 నుంచి నెలలో ఒక రోజును ‘స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ డే’గా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నిర్ణయించారు.

రాజధాని భూ సమీకరణ ప్యాకేజీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చేపట్టే భూ సమీకరణ విధానాన్ని; రైతులకు, భూ యజమానులకు అందించే ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 8న ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద జరీబు (నదీతీర ప్రాంత భూములు), జరీబ్ అసైన్డ్ భూముల రైతులకు ఎకరాకు రూ.50 వేల కౌలును పదేళ్ల పాటు చెల్లిస్తారు. దీన్ని ఏటా రూ.5 వేలు పెంచుతారు. మెట్ట, మెట్ట అసైన్డ్ భూముల రైతులకు ఎకరాకు రూ.30 వేలు చెల్లిస్తారు. ఏటా రూ.3 వేలు పెంచుతారు.

‘ది వీక్’ ఉమన్ ఆఫ్ ది ఇయర్‌గా రుక్మిణీరావు
తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త వి.రుక్మిణీరావును ‘ది వీక్’ మ్యాగజైన్ ఉమన్ ఆఫ్ ది ఇయర్-2014గా ఎంపిక చేసింది. ఆమె గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన మహిళల సంక్షేమం కోసం కృషి చేశారు. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్), గ్రామ్యా తదితర స్వచ్ఛంద సంస్థల్లో భాగస్వామిగా పనిచేస్తున్నారు.

ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారత్‌కు 30వ స్థానం
ఈ ఏడాది ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారత్‌కు 30వ స్థానం లభించింది. అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌస్ సంస్థ ఫ్రీడమ్ ఆన్ ద నెట్ -2014 అనే నివేదికను డిసెంబరు 4న విడుదల చేసింది. 65 దేశాల జాబితాలో 42 స్కోరుతో భారత్ పాక్షిక స్వేచ్ఛ గల దేశంగా, చైనా 87 స్కోరుతో స్వేచ్ఛ లేని దేశంగా గుర్తింపు పొందింది. ఐస్‌లాండ్ పూర్తి స్వేచ్ఛగల దేశంగా ఉంది. 

రెండో జాతీయ లోక్ అదాలత్
డిసెంబరు 6న నిర్వహించిన రెండో జాతీయ లోక్ అదాలత్‌లో దేశ వ్యాప్తంగా 1.25 కోట్ల కేసులు పరిష్కారమైనట్లు జాతీయ న్యాయ సేవల సంస్థ తెలిపింది. మూడు వేల కోట్ల రూపాయల నష్ట పరిహారం పంపిణీ జరిగింది. అన్ని రాష్ట్రా ల్లో సగటున 6 శాతం పెండింగ్‌లో ఉన్న కేసులు తగ్గాయి. 

ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి ఖాతా 
ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి ఖాతా పథకాన్ని కేంద్రం డిసెంబరు 4న ప్రారంభించింది. ఈ ఖాతాను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో తెరవొచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలకు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 ఏళ్లు పూర్తయ్యాక పథకం ముగుస్తుంది. 14 ఏళ్లు పూర్తయేంత వరకే డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. చిన్న మొత్తాల సేకరణ లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. 

జాతీయ సుపరిపాలన దినోత్సవంగా వాజ్‌పేయి జన్మదినం 
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబరు 25ను జాతీయ సుపరిపాలనా దినంగా నిర్ణయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. 

సుప్రీంకోర్టులో సామాజిక న్యాయ ధర్మాసనం ఏర్పాటు
సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సామాజిక న్యాయ ధర్మాసనం (సోషల్ జస్టిస్ బెంచ్)ను డిసెంబరు 3న ఏర్పాటు చేసింది. ఈ బెంచ్ ముఖ్యంగా మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాలకు చెందిన కే సులను విచారిస్తుంది. ఈ బెంచ్ డిసెంబరు 12 నుంచి ప్రతి శుక్రవారం 2 గంటలకు సమావేశమవుతుంది. 

తపాలా సంస్కరణలపై సుబ్రమణియన్ కమిటీ నివేదిక
మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో నియమించిన కమిటీ తపాలా సంస్కరణలపై డిసెంబరు 4న కేంద్రానికి నివేదిక సమర్పించింది. బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్ సేవలను ప్రారంభించడానికి పోస్టల్‌శాఖ కింద హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసి, తపాలా సేవలను మరింత విస్తరించాలని సూచించింది. 

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే డిసెంబరు 8న బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. భోస్లే తండ్రి బాబా సాహెబ్ అనంతరావ్ భోస్లే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. దేశంలోని రాష్ట్ర న్యాయవాదుల మండళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటి వరకు అత్యంత పిన్నవయస్కుడు జస్టిస్ భోస్లేనే. 

తెలంగాణ సాంస్కృతిక సారథిగా రసమయి
తెలంగాణ సాంస్కృతిక సారథిగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం డిసెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలపై ప్రచారం, కళాకారులకు శిక్షణ ఇవ్వడానికి సాంస్కృతిక సారథిగా సమన్వయ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారు.
AIMS DARE TO SUCCESS 

No comments:

Post a Comment