AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 3 January 2018

ఎకానమీ Economy బడ్జెట్ బేసిక్స్

బడ్జెట్ బేసిక్స్

ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో క్లిష్టమైన పదాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటిని సులభతర రీతిలోకి మారిస్తే- నెలవారీ బడ్జెట్‌లో సామాన్యుడు వినియోగించే పదాలే ఇవి.
ఇలాంటి కొన్ని ముఖ్య పదజాలం గురించి పరిశీలిద్దాం..

+ బడ్జెట్ పదజాలం 

వార్షిక ఆర్థిక నివేదిక
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్ అంటే వార్షిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల పట్టిక. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- ప్రభుత్వం ఖర్చుపెట్టే మొత్తాలు ఇందులో పొందుపరుస్తారు. ఆర్థిక సంవత్సరం మన దేశానికి ఏప్రిల్ నుంచి వరుసగా 12 నెలలు అంటే ఆ తదుపరి సంవత్సరం మార్చి వరకూ కొనసాగుతుంది. కొన్ని దేశాలు క్యాలెండర్ ఇయర్‌నే ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాయి. ‘క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు’ అన్న అంశం ప్రాతిపదికన పలు అంచనాలు, సవరణలతో ఈ బడ్జెట్ రూపొందుతుంది. బడ్జెట్ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలు సంచిలో తీసుకువచ్చేవారు కాబట్టే ఈ మాట వాడుకలోకి వచ్చింది.

మూలధన బడ్జెట్
మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి.

మూలధన వ్యయం
ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు ఇది.

బడ్జెట్ ఫండ్‌‌స 
బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్.. ఇలా మూడు భాగాలుగా ఉంటుంది.
వసూళ్లు-వ్యయాలు అంటూ రెండు విభాగాలుగా ఈ మూడూ భాగాలూ రూపొందుతాయి. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటెజెన్సీ ఫండ్ నుంచి వ్యయాలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

కన్సాలిడేటెడ్ ఫండ్: ప్రభుత్వానికి ఇది ఒక రకంగా ప్రాణం వంటిది. అన్ని రకాల ఆదాయాలు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీలు ఈ అకౌంట్‌లో చేరిపోతాయి. అలాగే ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులూ ఈ ఫండ్ నుంచే వెచ్చించాలి.

కంటింజెన్సీ ఫండ్: ఇది రూ.500 కోట్లతో ఏర్పాటైన నిధి. ఉన్నట్లుండి అనుకోకుండా ఏర్పడే ఖర్చులకు వినియోగించడానికి ఈ నిధిలోని ధనాన్ని రాష్ట్రపతి సంతకం ద్వారా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ నిధి నుంచి డబ్బును తిరిగి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది.

పబ్లిక్ అకౌంట్: ఈ అకౌంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా బ్యాంకర్‌లాగా పనిచేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి నిధుల వసూళ్లు ఈ అకౌంట్ కిందకు వస్తాయి.

రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు రెండింటినీ బడ్జెట్‌లో రెండు పద్దులుగా విభజిస్తారు. అందులో ఒకటి రెవెన్యూ అకౌంట్. రెండు క్యాపిటల్ అకౌంట్. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి వచ్చీ, పోయే నిధులను రెవెన్యూ బడ్జెట్ (రెవెన్యూ అకౌంట్) క్యాపిటల్ బడ్జెట్ (క్యాపిటల్ అకౌంట్)గా పరిగణించడం జరుగుతుంది.

రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: పన్నుల వంటి అన్ని రకాలు ఆదాయాలు ఇక వేతనాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటి అన్ని రకాల వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లోకి చేరతాయి.

క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయం వంటి అంశాల ద్వారా వచ్చే ఆదాయాలు, వడ్డీల ద్వారా ఆదాయాలు తెచ్చుకోడానికి ఉద్దేశించి ఇచ్చే రుణ వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లో చేరతాయి.

పబ్లిక్ డెట్
ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసం అప్పులు చేస్తుంది. అది నేరుగా ప్రజలపై భారంగానే భావిస్తారు. మొత్తం ప్రభుత్వ అప్పులను దేశ జనాభాతో భాగించగా వచ్చేదాన్ని దేశ ప్రజల తలసరి అప్పుగా అంటే ఒకొక్కరి తలమీద ఎంత అప్పు భారం ఉందన్న విషయం తెలుస్తుంది. ప్రభుత్వం దేశీయంగా, విదేశాల నుంచి కూడా అప్పులను స్వీకరిస్తుంది. ఈ మొత్తాన్ని పబ్లిక్ డెట్‌గా వ్యవహరిస్తారు.

ద్రవ్య లోటు
సాధారణంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని మించి వ్యయం చేస్తుంది. ఇలా అదనంగా కావల్సిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరిస్తుంది. ఆదాయం కంటే చేసిన అధిక వ్యయాలనే ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్)గా వ్యవహరిస్తారు.

రెవిన్యూ లోటు
ప్రభుత్వం తన రెవిన్యూ ఆదాయం కంటే అధికంగా రెవిన్యూ వ్యయాలను చేసినప్పుడు ఏర్పడే లోటును రెవిన్యూ లోటుగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రెవిన్యూలోటు సున్నాగా ఉండాలి. అలా ఉం టే ప్రభుత్వం చేసిన రెవిన్యూ వ్యయం కేవలం వినియోగానికి కాకుండా ఒక సంపదను సృష్టించినట్లు లెక్క.

జీడీపీలో లోటు శాతం
ద్రవ్యలోటు ఎంత ఉందన్నది శాతాల్లో లెక్కిస్తారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఈ లోటు శాతం ఎంత ఉందన్నది కీలకం. ఉదాహరణకు ప్రస్తుతం మన ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది.

ట్రెజ‌రీ బిల్స్
ఒక సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్న బాండ్లను ట్రెజరీ బిల్స్‌గా పేర్కొంటారు. వసూళ్ళు, చెల్లింపుల్లో వచ్చే తేడాలను సర్దుబాటు చేసుకోవడానికి ట్రెజరీ బిల్స్‌ను ఆశ్రయిస్తారు. ఈ బాండ్స్ కాలపరిమితి ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే వాటిని డెట్ సెక్యూరిటీస్‌గా పేర్కొంటారు.

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు ఆర్‌బీఐ సహకారాన్ని తీసుకుంటాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్ప కాలిక రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు.

ప్రణాళికా వ్యయం:
ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఈ ఖాతాలో ఉంటాయి.

ప్రణాళికేతర వ్యయం
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటక రంగాలు, విదేశీ వ్యవహారాలు, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ప్రణాళికేతర ఖాతాలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.

సంచిత నిధి
అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 
1. రెవెన్యూ వసూళ్లు-రెవెన్యూ వ్యయం. |
2. మూలధన వసూళ్లు-మూలధన వ్యయం.

ప్రభుత్వ ఖాతా 
సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. పార్లమెంటు అనుమతి లేకుండానే ఈ ఖాతాలోని నిధులను ఉపయోగించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు నుంచి, పీఎఫ్ (భవిష్య నిధి) నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది.

+ పన్నులు - రకాలు

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో పన్నులు కూడా ఒకటి. వివిధ శాఖలకు చేసే కేటాయింపులు పన్నుల వసూళ్ళపైనే ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం విధించే పన్నులను రెండు రకాలుగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులుగా విభజించవచ్చు.
పన్ను లక్షణాలు
ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు.
పన్ను చెల్లింపులో ప్రత్యక్ష ప్రతిఫలం ఉండదు.
ఇందులో త్యాగం ఇమిడి ఉంటుంది.
ప్రజల ప్రయోజనాల కోసమే పన్నులను విధిస్తారు.
పన్నులు నిర్బంధ చెల్లింపులు
ప్రత్యక్ష పన్నులు (డెరైక్ట్ ట్యాక్సెస్):
వ్యక్తులు, సంస్థలపై విధించే పన్నులను ప్రత్యక్ష పన్నులంటారు. అంటే, పన్ను తొలి, తుది భారాన్ని ఒకే వ్యక్తి/ సంస్థ భరిస్తే అది ప్రత్యక్ష పన్ను. ఈ పన్ను భారాన్ని ఇతరులకు బదిలీచేసే అవకాశం ఉండదు. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, వృత్తి పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఎస్టేట్ డ్యూటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వ్యయంపై పన్ను... ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు.

ఆదాయపు పన్ను
ఒక వ్యక్తి తన లేదా హిందూ అవిభక్త కుటుంబంలోని కర్త తన ఆదాయంపై చెల్లించే పన్ను. ఆదాయాన్ని బట్టి ఈ చెల్లించే పన్ను మారుతుంటుంది.

కార్పొరేట్ ట్యాక్స్
ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చే వాటిల్లో ఇదే ప్రధానమైనది. కంపెనీలు ఆర్జించిన లాభాలపై చెల్లించే పన్నును కార్పొరేట్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు.
మినిమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్
కొన్ని కంపెనీలు లాభాలను ఆర్జించినా పన్ను చెల్లించనవసరం ఉండదు. అటువంటి కంపెనీలు వాటి లాభాల్లో కనీసం చెల్లించాల్సిన పన్నుని మినమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్ (మ్యాట్)గా పేర్కొంటారు.

లావాదేవీలపై పన్ను
స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల క్రయవిక్రయాలు వంటి లావాదేవీలపై చెల్లించే పన్నుని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌గా పేర్కొంటారు.

క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్
షేర్లు, స్థిరాస్తి, వ్యాపారం వంటి విక్రయాలు చేసినప్పుడు పొందే లాభాలపై చెల్లించే పన్నును క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు.

గిఫ్ట్ ట్యాక్స్
1958లో ప్రవేశపెట్టారు. మొదట్లో బహుమతి దాతపై ఈ పన్ను విధించే వారు. 1990-91 నుంచి బహుమతి గ్రహీతల నుంచి వసూలు చేస్తున్నారు.

డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్
ఇన్వెస్టర్లు అందుకునే డివిడెండ్‌పై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు కానీ.. ఇచ్చే కంపెనీ డివిడెండ్ మొత్తంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.

వెల్త్ ట్యాక్స్ (సంపద పన్ను)
ఒక వ్యక్తి, హెచ్‌యూఎఫ్ లేదా సంస్థ వ్యక్తిగత ఆస్తి విలువ రూ.30 లక్షలు దాటితే, ఆ మొత్తం మీద ఒక శాతం పన్ను చెల్లించాలి.

పరోక్ష పన్నులు (ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్):
పన్ను తొలి భారం ఒకరిపైన, తుది భారం మరొకరిపైన పడితే, అంటే, పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాలు విధించే అమ్మకం పన్ను, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, వాహనాలపై పన్ను, వినోదపు పన్ను... ఇవన్నీ పరోక్ష పన్నులు.

కస్టమ్స్ సుంకం
వస్తువుల ఎగుమతి, దిగుమతులపై విధించే పన్ను. ఇది ప్రభుత్వం ఆదాయ వనరుగానే కాకుండా దేశీయ పరిశ్రమల రక్షణకు, చెల్లింపుల సమతౌల్యం (దిగుమతులు, ఎగుమతుల విలువల మధ్య అంతరం) లోటును తగ్గించేందుకు దిగుమతి సుంకం విధిస్తారు. ప్రభుత్వ రాబడిని, దేశంలో వస్తు లభ్యతను కల్పించేందుకు ఎగుమతి పన్ను విధిస్తారు.

ఎక్సైజ్ సుంకం
దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులపై ఈ సుంకాన్ని విధిస్తారు.

సర్వీస్ ట్యాక్స్
వివిధ సేవలపై ఈ పన్నును విధిస్తారు. ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల్లో సర్వీస్ ట్యాక్స్ ఒకటి.

జీఎస్‌టీ
ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నుల విధానాన్ని సమూలంగా మారుస్తూ ఏకీకృత పన్నుల విధానం ఉండే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)ని రూపొందించారు. ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. జీఎస్‌టీ వస్తే వినియోగదారులపై పరోక్ష పన్నుల భారం తగ్గుతుందని అంచనా. దీనిని ప్రపంచంలో తొలిసారిగా ఫ్రాన్స్‌లో అమలు చేశారు.

జీఎస్‌టీ ప్రయోజనాలు
సరళంగా, పారదర్శకంగా ఉంటుంది.
కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో వివిధ రకాల పన్నులను తగ్గిస్తుంది. వివిధ రకాల వస్తువులపై పన్ను రేటు తగ్గుతుంది. ప్రభుత్వానికి పన్ను రాబడులను పెంచుతుంది.

పన్నులు ఎవరు విధిస్తారు?
రాష్ట్ర ప్రభుత్వాలూ కొన్ని పన్నులను విధించుకోవచ్చు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఖర్చుచేసుకోవచ్చు. అవి అమ్మకం పన్ను (వ్యాట్), రాష్ట్ర ఎక్సైజ్ పన్ను, భూమి శిస్తు, వ్యవసాయ ఆదాయంపై పన్ను, వినోద పన్ను.

కొన్ని పన్నులను కేంద్రమే విధించి... ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచుతుంది. అవి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీలు, ఆదాయపు పన్ను. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు వీటి ఆదాయాన్ని రెండు ప్రభుత్వాలూ పంచుకుంటాయి.

కొన్ని పన్నులను విధించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. వీటి ద్వారా వచ్చే రాబడి మాత్రం రాష్ట్రప్రభుత్వాలకే చెందుతుంది. అవి... న్యూస్ పేపర్ల అమ్మకాలపై పన్ను, వ్యవసాయ భూమిని మినహాయించి ఇతర సంపదపై ఉండే ఎస్టేట్ డ్యూటీ, టెర్మినల్ ట్యాక్స్, రైల్వే సరకులు, ప్రయాణ ఛార్జీలపై డ్యూటీలు, అడ్వర్‌టైజ్‌మెంట్‌లపై వచ్చే పన్ను, బహుమతి పన్ను.

మరికొన్ని పన్నుల్ని కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది. కానీ, వాటి వసూలు బాధ్యత మాత్రం రాష్ట్రాలపై ఉంటుంది. అవి... స్టాంపు డ్యూటీలు, వ్యాట్ డ్రగ్స్, కాస్మోటిక్స్‌పై విధించే పన్నులు.

+ బడ్జెట్ రూపకల్పన

క్లుప్తంగా చెప్పుకోవాలంటే... రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్‌ల రూపకల్పన. రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన రెవెన్యూ బడ్జెట్ రూపొందితే, క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన క్యాపిటల్ బడ్జెట్ రూపొందుతుంది. కానీ ఈ మూడక్షరాల వెనుక ఆరు నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది.

సెప్టెంబర్ చివర్లో..
రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబర్ చివర్లో..
తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు.

డిసెంబర్..
ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

జనవరి..
పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు.
ముద్రణ ప్రక్రియ..
బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు.

ఫోన్ ట్యాపింగ్..
బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది.

సందర్శకులపై మూడో కన్ను..
ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సంద ర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు.

ఫిబ్రవరి చివర్లో..
బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

ఆహారంపై ఎంత జాగ్రత్తో..
ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. 
అత్యవసర సమయాల్లో..
ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు.

ఫిబ్రవరి 28/29..
సాధారణంగా ఈ రోజుల్లోనే ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు.

+ బడ్జెట్ పద్ధతులు..

బడ్జెట్ పద్ధతులు: కాలక్రమంలో వివిధ రకాల బడ్జెట్ తయారీ పద్ధతులు రూపొందాయి. వాటిలో చెప్పుకోదగ్గవి పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్, ప్రోగ్రాం బడ్జెటింగ్, జీరో బేస్డ్ బడ్జెటింగ్, ఇంక్రిమెంటల్ బడ్జెటింగ్‌లు.. వీటిలో ఒక్కో బడ్జెటింగ్ పద్ధతిని వివిధ దేశాలు అనుసరిస్తున్నాయి.
పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్
ఇందులో ప్రభుత్వ కార్యకలాపాలు, వ్యయాలు పొందుపరుస్తారు. ప్రభుత్వ వ్యయం, పథకాలు, కార్యకలాపాలను ప్రాజెక్టుల పరంగా చూపిస్తారు. వ్యయాల ఆధారంగా అంతర్గత నిర్వహణను మెరుగుపర్చడమే ఈ బడ్జెట్ ముఖ్య స్వభావం. అందుకే ఈ పద్ధతిలో మరింత మెరుగైన నిర్వహణ పద్ధతులు రూపొందించడం, ప్రమాణాలు,యూనిట్ వ్యయాలకు ప్రాధాన్యం ఉంటుంది. మళ్లీ ఇందులో ప్రభుత్వ లక్ష్యాలను బట్టి కొన్ని విధులుగాను, పథకాలు, కార్యకలాపాలుగాను విభజిస్తారు. ఇవన్నీ కొంత నిర్దిష్ట పని ప్రమాణాన్ని సాధించేందుకు నిధులు కేటాయిస్తారు. ఒక్కో మంత్రిత్వ శాఖ కొంత వ్యయంతో కొంత కాల వ్యవధిలో సాధించాల్సిన పనులు బడ్జెట్‌లో చూపిస్తారు. అమలు చేయాలనుకున్న పథకం పరిమాణం, వ్యయం రెండిటికీ ప్రాధాన్యం ఉంటుంది. ఇది వ్యయాలను, ప్రయోజనాలను ఒకేచోట చూపించే కొత్త రకం బడ్జెటింగ్ పద్ధతి. నిధుల కేటాయింపులు, నిర్ణయాలు తీసుకోవడంలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రోగ్రాం బడ్జెటింగ్
ఈ బడ్జెటింగ్ విధానంలో మొదట లక్ష్యాలను నిర్వచించుకుంటారు. వాటిలో నుంచి కొన్నింటిని ఎంపిక చేసుకుని, వాటిని సాధించే పథకాలను రూపొందిస్తారు. ఇందులో సాధించిన ఫలితాలను కొలిచే పద్ధతులు కూడా ఉంటాయి. ప్రణాళికను ప్రస్తుత సంవత్సరానికే పరిమితం చేయకుండా కొన్నేళ్లకు విస్తరింపచేసి, ప్రణాళిక మొత్తాన్ని కొంత కాల వ్యవధిలో పునఃపరిశీలన చేస్తుంటారు. ఈ పద్ధతిని ఒకే శాఖకు అమలు జరిపితే ప్రోగ్రాం బడ్జెటింగ్ అనీ, అన్ని శాఖలకు అమలుచేస్తే ప్లానింగ్ ప్రోగ్రాం బడ్జెటింగ్ అనీ పిలుస్తారు. రెండు పద్ధతుల వెనుక ఉండే సూత్రం మాత్రం ఒక్కటే. లక్ష్యాలు సాధించే ప్రత్యామ్నాయాలు ఎక్కువ ఉన్నట్లయితే వాటి ఉత్పాదకాలు, ఉత్పత్తుల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తారు. గణాంక పద్ధతులు ఉపయోగించి ప్రత్యామ్నాయాలు ఎంపిక చేసి పథకాల పనితీరును అంచనా వేసే ఈ పద్ధతి కొంత మెరుగైనదని చెప్పవచ్చు. 1960 దశకంలో అమెరికా రక్షణశాఖలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.

ఇంక్రిమెంట్ బడ్జెటింగ్
బడ్జెటింగ్‌లో వివిధ ఉద్దేశాల కోసం వ్యయాలను పెంచాలా, తగ్గించాలా అనే నిర్ణయాలు ఇందులో ఉంటాయి. కొత్త పథకాలను చేపట్టడం గురించి ఆలోచించకుండా, అమలులో ఉన్న పథకాలకు కేటాయింపులు ఎక్కువ చేయాలా, లేదా అనే విషయాలు ఇందులో నిర్ణయిస్తారు. చాలా పథకాలు ఒకసారి ప్రారంభించాక వాటికి అదనపు కేటాయింపులు అవసరమవుతాయి.

జీరోబేస్డ్ బడ్జెటింగ్
ఇటీవలి అన్ని దేశాల్లో ప్రభుత్వ వ్యయపరిమాణం బాగా పెరిగినందువల్ల.. ప్రభుత్వ వ్యయ ఉత్పాదకతను పెంచి, అనుత్పాదక వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల కొత్త బడ్జెటింగ్ పద్ధతులు రూపొందించుకోవాల్సిన అవసరం ఉత్పన్నమైంది. ఆ కారణంగానే జీరో బేస్ బడ్జెటింగ్ ఏర్పడింది. ఇందులో ప్రతి మేజర్ బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదనకు వివరంగా మొదటి నుంచి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అదనపు కేటాయింపుల బదులుగా యూనిట్‌లోని ద్రవ్య అవసరాలను మొత్తంగా పరిగణలోకి తీసుకుంటారు.

తొలిభారం (ఇంపాక్ట్): ప్రభుత్వం పన్ను విధించినపుడు దాన్ని మొదటగా చెల్లించిన వ్యక్తి భరించే భారమే తొలి భారం. తుదిభారం (ఇన్సిడెన్స్): చిట్టచివరిగా పన్ను భరించే వారిపై పడే భారం.

ఉదా: వినోదపు పన్ను తొలి భారాన్ని థియేటర్ యజమాని, తుది భారాన్ని ప్రేక్షకులు భరిస్తారు.

+ బడ్జెట్ - సందేహాలు

ఏప్రిల్ 1 లోపు బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఏమవుతుంది?
అన్ని సమస్యల్లాగే దీనికి కూడా ‘ఓటాన్ అకౌంట్’ అనే ఆల్‌టైమ్ పరిష్కారం ఒకటుంది. రాజ్యాంగంలో 116వ అధి కరణ ప్రకారం లోక్‌సభలో ఈ విషయంపై ఓటాన్ అకౌంట్ నిర్వహిస్తారు. దీని ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం పొందే వరకు రెండు నెలల కాలవ్యవధి ఉన్న తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర అవసరాల కోసం తయారుచేస్తారు.

ఆర్థిక మంత్రి ఇచ్చే బడ్జెట్ ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
లోక్‌సభలో ఆర్థికమంత్రి ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రసంగిస్తారు. ఆ ఉపన్యాసం రెండు భాగాలుగా ఉంటుంది. ఇతర ప్రతినిధులు ఎవరూ అంతరాయం కలిగించకపోతే ఆర్థిక మంత్రి చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి ప్రసంగాన్ని ముగిస్తారు. అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ప్రసంగాన్ని రెండు భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకోవడం అవసరం.

మొదటి భాగం
అన్ని రంగాల్లో ఉన్న ఆదాయ వ్యయాలను గురించి సంక్షిప్తంగా వివరిస్తారు.
కొత్త పథకాలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి చేయాల్సిన రంగాలు, అమలు చేయాల్సిన పనుల గురించి చెబుతారు.
వీటిని వివరించే ముందు అవసరమైన చోట గతేడాది బడ్జెట్ లెక్కలను కూడా ప్రస్తావిస్తారు.

రెండవ భాగం
ఇందులో అన్నీ పన్నులకు సంబంధించిన అంశాలే ఉంటాయి.
కొత్త పన్నులు, పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, పన్ను తగ్గింపు, పెంపుల అమలు వంటి వివరాలన్నీ ఉంటాయి.
ప్రతి అంశాన్నీ చదివేముందు దానికి మద్దతిచ్చే చట్టాన్ని పేర్కొంటారు. అలాగే దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలనూ ప్రస్తావిస్తారు.

ఆర్థిక రంగం, స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
బడ్జెట్, ఆర్థికరంగం, స్టాక్ మార్కెట్లు.. వీటన్నింటికీ ధనమే మూలం. బడ్జెట్ పూర్తిగా ద్రవ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి దీని ప్రభావం మిగతా వాటిపై కచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం ఎలాంటిదనే విషయం మాత్రం ఆర్థికమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. వివిధ రంగాలకు కేటాయించిన మొత్తం ఆధారంగా ఈ ప్రభావాన్ని నిర్ణయించవచ్చు. అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఆర్థికాభివృద్ధి, స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. అలా కాకుండా ఆకాశమంత అప్పుల చిట్టాను చూపిస్తే రెండూ ఢమాల్‌న కుప్పకూలిపోతాయి.

సగటు మనిషిపై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుంది? 
అవసరమైన వనరులను వాడుకున్నందుకు ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందే. పన్ను ఎంత కట్టాలి అని నిర్ణయించేది బడ్జెట్టే. కాబట్టి సామాన్యులపై బడ్జెట్ ప్రభావం ఉంటుంది. పన్నులు ఎక్కువ ఉంటే ఆర్థికభారం పెరిగినట్లు, లేదంటే తగ్గినట్లు. ఉన్న పన్నుల్లో ఏ ఒక్క పన్ను పెంచినా దాని ప్రభావం సామాన్యుడిపై కచ్చితంగా ఉంటుంది.

ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టడం అవసరమా?
అవసరమే, రాజ్యాంగంలో 112వ అధికరణ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31)లో ప్రభుత్వం చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయం లెక్కలను పార్లమెంట్ ముందు ఉంచాలి. దీన్ని ‘యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్’ అంటారు. ఇది రాజ్యాంగంలో బడ్జెట్‌కు మూలరూపం.

ఇతర దేశాల్లో కూడా ఇలాగే బడ్జెట్ ప్రవేశపెడతారా?
ఆర్థిక వ్యవస్థ సంక్షోభం లేకుండా సాగాలంటే బడ్జెట్ అవసరం. అన్ని దేశాలకు బడ్జెట్ తప్పనిసరి. కాకపోతే వారి రాజ్యాంగాలను అనుసరించి ప్రాధాన్యం ఉంటుంది. మనలాగే యూకే, హాంగ్‌కాంగ్, ఐర్లాండ్ దేశాలు బడ్జెట్ ఆమోదం కోసం ఒక సమయాన్ని అనుసరిస్తాయి. కానీ, అమెరికాలో విడిగా బడ్జెట్ డే అంటూ ఒకటి ఉండదు. అవసరమైనపుడు వారి కాంగ్రెస్ కార్యనిర్వాహక శాఖే ఖర్చులు, ఆదాయం లెక్కలు చూసుకుంటుంది.

పేదల బడ్జెట్‌గా పేరొందింది ఏది?
1986లో ఆర్థిక మంత్రిగా వీపీసింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘పేదల బడ్జెట్’గా పేర్కొంటారు. ఈ బడ్జెట్‌లో రైల్వేపోర్టర్లకు, రిక్షా కార్మికులకు సబ్సిడీలతో కూడిన రుణాలను ప్రకటించారు. చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటుచేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కోసం ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది?
ప్రతి ఏటా బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలాఖరున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2000 యూనియన్ బడ్జెట్ నుంచి మాత్రం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టే నూతన సంప్రదాయాన్ని యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టారు.
2016 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం యత్నిస్తోంది. జీఎస్‌టీ అమల్లోకి వస్తే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీలు జీఎస్‌టీలో విలీనమవుతాయి.)
మన దేశంలో వ్యాట్‌ను అమలు చేసిన తొలిరాష్ట్రం హర్యానా. 2003 ఏప్రిల్ 1 నుంచి అక్కడ వ్యాట్ అమల్లో ఉంది. చివరగా, ఉత్తర్‌ప్రదేశ్ 2008 జనవరి 1 నుంచి అమలు చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలూ వ్యాట్ పరిధిలోకి వచ్చాయి.

డాలర్‌తో రూపాయి విలువ ఎలా నిర్ణయిస్తారు?
వ్యాపార సంబంధమైన లావాదేవీలు చర్చకు వచ్చినప్పుడు కచ్చితంగా వచ్చే ప్రస్తావన డాలర్. బిజినెస్‌కు సంబంధించిన లాభాలు, నష్టాలు వేటినైనా డాలర్‌తోనే పోలుస్తారు. డాలర్‌తో రూపాయి విలువ మారకాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం..!

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న నష్టాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు భద్రత ఉన్న దేశాల్లో తమ పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపడంతో డాలర్ విలువ పెరుగుదల కనపడుతోంది.

ఆర్థిక విధానం
ప్రభుత్వం అమలు చేసే ఆర్థిక విధానాలు, ప్రభుత్వ రుణం, ప్రభుత్వ పన్నుల విధానంలో పాటిస్తున్న నియమాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వ విధానాలు కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తాయి.

అంతర్జాతీయ వాణిజ్యం
దేశీయంగా ఎగుమతులు తక్కువ స్థాయిలో ఉండటం, దిగుమతులు ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల మనం చెల్లించాల్సిన మొత్తం ద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతుంది. భారతదేశంలో అమలవుతోన్న పన్నుల విధానం, వాణిజ్య ప్రభావమూ దీనిపై ఉంటుంది.

స్పెక్యులేషన్
దేశీయ మార్కెట్లలో పెట్టుబడుల ప్రవాహం కూడా రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తుంది.

వడ్డీరేటు విధానం
ప్రభుత్వ ఆర్థిక విధానాలు మార్కెట్లలో పెట్టుబడులు పెంచే విధంగా, విదేశీ మారకాన్ని స్వాగతించేలా ఉంటే విదేశీ మారకం దేశంలోకి ప్రవహించడం ద్వారా రూపాయి విలువలో పెరుగుదల అవకాశం ఉంటుంది.

ఉన్నత సంస్థల ప్రభావం
దేశంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ సంస్థ తీసుకునే విధానాలు కూడా దేశీయ కరెన్సీపై ప్రభావితం చూపిస్తాయి. మన దేశంలో ఉన్నత స్థాయి సంస్థ రిజర్వు బ్యాంకు తీసుకునే విధానాలు రూపాయి మారకం విలువలో పెరుగుదల, తరుగుదలకు దోహదపడే అవకాశాలున్నాయి.
+ బడ్జెట్ రికార్డులు / విశేషాలు
మొదటి (1947) బడ్జెట్ వివరాలు
ఇప్పుడు బడ్జెట్ లెక్కలన్నీ వేలు, లక్షల కోట్లలోనే.. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కేంటి? అప్పుడు మన ఆదాయం ఎంత? రక్షణ శాఖ బడ్జెట్ ఎంత? ఆ వివరాలు తెలుసుకుందామా..

(అంకెలు రూ.కోట్లలో)
మంత్రి: ఆర్కే షణ్ముగం చెట్టి, 
తేదీ: 1947, నవంబర్ 26
రెవెన్యూ అంచనా: 171.15
రెవెన్యూ వ్యయం: 197.39
రెవెన్యూ లోటు: 26.24
రక్షణశాఖకు: 92.74
ఆదాయపు పన్ను ద్వారా ఆదాయం: 119
కస్టమ్స్ ఆదాయం: 50.5
ఫారెక్స్ నిల్వలు: 1,547
గణతంత్ర భారత దేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను జాన్ మతాయ్ 1950 ఫిబ్రవరి 28న సభలో ప్రవేశపెట్టారు.
స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఆర్‌కే షణ్ముగంశెట్టి. 1947-49 మధ్య బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆయన నెహ్రూతో విభేదాల కారణంగా పదవి నుంచి వైదొలిగారు.
1951-52లో రిజర్వు బ్యాంకు గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ప్రధానమంత్రిగా కొనసాగుతూ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి జవహర్‌లాల్ నెహ్రూ. 1958-59లో ఆర్థికశాఖను కూడా పర్యవేక్షించిన ఆయన ఈ రికార్డు సాధించారు. ఆ తర్వాత ఇదే బాటలో ఇందిరాగాంధీ 1970లో, రాజీవ్ 1987లో ప్రధానులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌లు ప్రవేశపెట్టి అనంతర కాలంలో రాష్ట్రపతి పదవిని అధిష్టించినవారు ఇద్దరున్నారు. 1980-82 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆర్.వెంకట్రామన్, 1974-75లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత 1982-84 మధ్య, 2009-12 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
1991-92లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఏడాది తుది, తాత్కాలిక బడ్జెట్లను రెండు పార్టీలకు చెందిన, వేర్వేరు ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టడం గమనార్హం. తాత్కాలిక బడ్జెట్‌ను బీజేపీ నేత యశ్వంత్‌సిన్హా, తుది బడ్జెట్‌ను మన్మోహన్‌సింగ్ ప్రవేశపెట్టారు.
అతి తక్కువకాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన రికార్డు బీజేపీ నేత జశ్వంత్‌సింగ్ పేరిట ఉంది. ఆయన కేవలం 13 రోజుల పాటే కొనసాగారు.

మరికొన్ని విశేషాలు
పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ కూడా లీకయింది. కానీ అది 1950లో. అప్పట్లో బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతిభవన్‌లో ముద్రించేవారు. ఆ తర్వాత మింటో రోడ్‌లోకి మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నా

No comments:

Post a Comment