AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2014

సైన్స్ & టెక్నాలజీ ఏప్రిల్ 2014
బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బ్లాక్-3 రకానికి చెందిన ఆధునీకరించిన అణ్వాయుధ సామర్థ్యం గల సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ను రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో ఏప్రిల్ 7న సైన్యం పరీక్షించింది. 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ క్షిపణి విజయవంతమైంది. ఈశాన్యప్రాంత రాష్ట్రాల్లో చైనా చొరబాటును ఎదుర్కొనేందుకు పర్వత ప్రాంతాల్లో వినియోగించడానికి అనువుగా బ్లాక్-3 రకానికి చెందిన క్షిపణిని తీర్చిదిద్దారు. ఈశాన్య రాష్ట్రాల్లో చైనా దుశ్చర్యలను అడ్డుకొనేందుకు భారత్ మౌంటెయిన్ స్ట్రైక్ కార్ప్స్ ను పశ్చిమ బెంగాల్‌లోని పానాఘర్‌లో తొలిసారిగా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం పరీక్షించిన బ్రహ్మోస్‌ని ఇక్కడే మొహరిస్తారు. బ్రహ్మోస్‌ను ఇప్పటికే సైన్యానికి అప్పగించారు. దీన్ని ఉపరితలం, జలాంతర్గామి, ఆకాశం నుంచి ప్రయోగించేందుకు అనువుగా రూపొందించారు. బ్రహ్మోస్‌ను భారత్- రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది 290 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.

నింగికెగిసిన ఆకాశ్
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన ఆకాశ్ క్షిపణిని భారత్ ఏప్రిల్ 26న ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించింది. ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించడానికి అనుగుణంగా రూపొందించిన ఈ క్షిపణి 25 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. 60 కిలోల వార్ హెడ్‌ను మోసుకెళుతుంది. మధ్య శ్రేణికి చెందిన క్షిపణి యుద్ధవిమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గగనతలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను నాశనం చేస్తుంది. ఒక ఆకాశ్ వ్యవస్థ ఏకకాలంలో పలు లక్ష్యాలపై దాడి చేస్తుంది. 
విజయవంతమైన బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్‌‌స వ్యవస్థ
శత్రు క్షిపణులను అడ్డుకునే బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్‌‌స (బీఎండీ) వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఏప్రిల్ 27న జరిపిన దీర్ఘ శ్రేణి క్షిపణులను ముందుగా, ఆకాశంలోనే పేల్చివేసే పృథ్వీ డిఫెన్‌‌స వెహికల్ (పీడీవీ) ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి రక్షణ శాఖ ఈ ప్రయోగం నిర్వహించింది. పీడీవీ ఇంటర్‌సెప్టర్ క్షిపణితో పాటు బాలిస్టిక్ క్షిపణి తరహాలో రూపొందించిన లక్ష్యాన్ని కూడా ప్రయోగంలో వినియోగించారు. బంగాళాఖాతంలో నిలిపిన నౌకల నుంచి ముందుగా లక్ష్యాన్ని ప్రయోగించారు. తర్వాత ప్రయోగించిన పీడీవీ లక్ష్యాన్ని ఛేదించింది. 2000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగల బాలిస్టిక్ క్షిపణులను పీడీవీ 120 కి.మీ. కంటే ఎత్తులో ఉండగానే గుర్తించి ధ్వంసం చేస్తుంది.

భూమిలాంటి గ్రహం కెప్లర్-186ఎఫ్
జీవం ఉనికి ఉండే భూమి పరిమాణంలోని మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘గోల్డ్‌లాక్స్ జోన్’లో ఉన్న ఈ గ్రహంలో ద్రవ రూపంలో నీరు, జీవం ఉనికికి కావాల్సిన వాతావరణం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ గ్రహాన్ని నాసాకు చెందిన కెప్లర్ స్పేస్ టెలీస్కోప్‌తో గుర్తించారు. దీన్ని కెప్లర్-186ఎఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఇది భూమి నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలోని ‘హంసరాశి’లో ఉంది. సౌరమండలంలో కాకుండా విశ్వంలో మరో చోట భూమి పరిమాణంలో ఓ గ్రహం ఉన్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. గతంలో విశ్వంలో భూమిని పోలిన అనేక గ్రహాలను గుర్తించినప్పటికీ భూమి కంటే అవన్నీ దాదాపు 40 శాతం పెద్దగా ఉన్నట్లు తేలింది. తాము గుర్తించిన కెప్లర్-186ఎఫ్ గ్రహం భూమితో అనేక రకాల పోలికలు కలిగిఉందని పరిశోధకులు చెబుతున్నారు. భూమిలాంటి గ్రహాల ఉనికిని కనుగొనడంలో ఈ కొత్తగ్రహం ఆవిష్కరణ ముఖ్యమైన ముందడుగుగా వారు పేర్కొన్నారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ 24 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట నుంచి ఏప్రిల్ 4న చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ 24 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఉపగ్రహాన్ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండో ఉపగ్రహం ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)-1బీ. ఇది విజయవంతమైన 26వ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగం. షార్ నుంచి 42వ ప్రయోగం. ఐర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1బీ పది సంవత్సరాల పాటు పనిచేస్తుంది. రూ. 1,600 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. దీని బరువు 1,432 కిలోలు. రాకెట్ బరువు 320 టన్నులు. రాకెట్ ఎత్తు 44.5 మీటర్లు. గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థ నిర్మాణం కోసం భారత్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ప్రయోగించింది. ఈ వ్యవస్థ ద్వారా నౌకలు, విమానాల గమనాలను, వాటి భౌగోళిక స్థానాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. సొంత ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత్‌కు ఏడు ఉపగ్రహాల అవసరం ఉంటుంది. ఇందులో భాగంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్- 1ఏ ఉపగ్రహాన్ని ఇంతకుముందే ప్రయోగించింది. 

విండోస్ ఎక్స్‌పీకి సెలవుసుదీర్ఘకాలం పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎక్స్‌పీకి తెరపడింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దీనికి ఏప్రిల్ 8 నుంచి సాంకేతిక సహకారాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. ఫలితంగా ఇకపై సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు పెయిడ్ రూపంలో గానీ ఉచితంగా గానీ సపోర్ట్ లభించదు. ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌నకు ఆన్‌లైన్‌లో టెక్నికల్ కంటెంట్ అప్‌డేట్ కూడా లభించదు. విండోస్ ఎక్స్‌పీని తొలిసారిగా 2001 అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన ఆపరేటింగ్ సిస్టమ్‌తో పోలిస్తే విండోస్ ఎక్స్‌పీ మూడు తరాల పాతది. 2012 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన విండోస్ 8 మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్.

ముగిసిన ఇన్సాట్-3ఇ కాలంకమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్-3ఇ జీవిత కాలం ముగియడంతో పని చేయడం ఆగిపోయిందని ఏప్రిల్ 2న ఇస్రో ప్రకటించింది. ఈ ఉపగ్రహం కక్ష్యలో 10 సంవత్సరాల 6 నెలలు పాటు విధులు నిర్వర్తించింది. 15 ఏళ్ల వినియోగం కోసం మూడో తరానికి చెందిన ఈ ఉప గ్రహాన్ని 2003 సెప్టెంబర్‌లో ప్రయోగించారు.

No comments:

Post a Comment