AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2017

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2017
2018 మార్చిలో చంద్రయాన్-2  ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్ మిషన్.. చంద్రయాన్-2పై కేంద్ర అంతరిక్ష, అణు, ఇంధనశాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. చంద్రయాన్-2 ప్రయోగం 2018 మార్చిలో ఉంటుందని ప్రకటించారు. జీఎస్‌ఎల్వీ ఎంకే-2 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరుగుతుంది. 
ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుని ఉపరితలంపై సంచరించగల ఒక మోటార్ జెడ్ రోబోట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి ఒక రోవర్ చంద్రుడిపై చక్రాలతో నడుస్తూ మృత్తిక, రాళ్ళ నమూనాలను సేకరించి వాటి రసాయన విశ్లేషణలను జరిపి, చంద్రుడి చుట్టూ ఎత్తయిన కక్ష్యలో పరిభ్రమించే చంద్రయాన్-2కు అందిస్తుంది. చంద్రయాన్-2 నుంచి సమాచారం గ్రౌండ్‌స్టేషన్‌లోని యాంటెనా అందుకుంటుంది. 2020 కల్లా చంద్రుడిపైకి ఒక మానవ సహిత ప్రయోగాన్ని చేపట్టాలని కూడా ఇస్రో భావిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చంద్రయాన్ - 2
ఎప్పుడు : 2018లో 
ఎవరు : ఇస్రో 
ఎందుకు : చంద్రుడి ఉపరితల వాతావరణాన్ని పరిశోధించేందుకు 

చైనాలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభంప్రపంచంలోనే తొలి పర్యావరణహిత, హైడ్రోజన్‌తో నడిచే ట్రామ్‌ను చైనా అక్టోబర్ 27న ప్రారంభించింది. దీని ద్వారా నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్‌‌సలోని తంగ్షన్‌లో కమర్షియల్ సర్వీసులను అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ట్రామ్‌లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్‌ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న ట్రామ్ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభం 
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎక్కడ : చైనాలో 
ఎందుకు : ప్రజా రవాణా కోసం 

‘డెత్ జోన్’లోకి వెళ్లే డ్రోన్లను పరీక్షించిన చైనాఎక్కువ ఎత్తుకు వెళ్లే గూఢచార డ్రోన్‌ను చైనా విజయవంతంగా పరీక్షించింది. క్రికెట్ బ్యాట్ సైజులో ఉండే ఈ డ్రోన్ రక్షణ రంగంలో ఎంతగానో సహాయపడనుంది. సముద్రమట్టానికి 20 కిలోమీటర్ల ఎత్తు పైనుంచి అంతరిక్ష సమీప ప్రాంతం ప్రారంభమవుతుంది. అక్కడ గాలి పలుచగా ఉండటం, చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో ఆ జోన్‌ను డ్రోన్లకు ‘డెత్ జోన్’గా పరిగణించేవారు. తక్కువ గాలి ఉండటంతో అక్కడ డ్రోన్ ఎగరడం సాధ్యం కాదు. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డ్రోన్‌లోని బ్యాటరీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు విఫలమయ్యే ప్రమాదముంది. అయితే చైనా తయారు చేసిన ఈ డ్రోన్ ఆ పరిస్థితులను తట్టుకుంటుంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎక్కువ ఎత్తుకు వెళ్లే డ్రోన్లను పరీక్షించిన చైనా 
ఎప్పుడు : అక్టోబర్ 31 
ఎందుకు : గూఢచర్యం కోసం

రోబోలకు అనువైన ‘చర్మం’ మనుషుల రోజువారీ పనులను చేసేందుకుగాను రోబోలకు దానికనుగుణంగా ఉండే చర్మాన్ని పరిశోధకులు రూపొందించారు. ఈ చర్మాన్ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ)కి చెందిన 45 మంది ప్రొఫెసర్లు తయారు చేసినట్లు యూడబ్ల్యూ ప్రొఫెసర్ జోనాథన్ పోస్నర్ తెలిపారు. ఈ చర్మాన్ని తొడిగిన రోబోలు మనుషుల రోజువారీ పనులను తేలికగా, ఆటంకాలు లేకుండా చేసేస్తాయని చెప్పారు. వస్తువుల స్వభావాలను బట్టి ఈ చర్మం రోబోలకు సంకేతాలు అందిస్తుందని, దానికి తగ్గట్లుగా రోబో పనిచేస్తుందని పోస్నర్ తెలిపారు. ఈ చర్మం అక్టోబర్ నెలాఖరు నుంచి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రోబోలకు అనువైన చర్మాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు 
ఎప్పుడు : అక్టోబర్ 18 
ఎవరు : యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ 
ఎందుకు : మనుషుల రోజువారీ పనులను చేసేందుకుగాను 

అంతరిక్ష కేంద్రంలో ‘అలమర’అంతరిక్ష కేంద్రంలోకి అత్యాధునిక అలమర (వస్తువులు దాచి ఉంచుకునే పెట్టె)ను శాస్త్రవేత్తలు త్వరలో తీసుకువెళ్లనున్నారు. హెచ్‌టీవీ-7గా పిలిచే ఈ అలమరను 2018 చివరి కల్లా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశపెట్టనున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెల్లడించింది. సైంటిస్టులు అంతరిక్ష కేంద్రంపైకి పరిశోధనలకు అవసరమయ్యే పరికరాలను తీసుకువెళుతుంటారు. అయితే అక్కడ మరిన్ని వస్తువులు దాయడానికి వీలుగా ఆధునిక పరికరాలతో అలమరను తయారు చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది అలమరలను పొందుపరిచే వీలున్నట్లు నాసా వెల్లడించింది. ఈ అలమరలను బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్నట్లు తెలిపింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతరిక్ష కేంద్రంలోకి హెచ్‌టీవీ - 7 అలమర 
ఎప్పుడు : 2018 చివరి నాటికి 
ఎవరు : నాసా 
ఎందుకు : పరిశోధనలకు కావాల్సిన వస్తువులను దాయడానికి 

95% ప్లాస్టిక్ వ్యర్థాలకు పది నదులే కారణం ప్రపంచ వ్యాప్తంగా కేవలం పది నదుల ద్వారానే 88-95 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయని తేలింది. ఈ జాబితాలో గంగా, సింధు సహా 8 నదులు ఆసియాలో ఉండగా, మరో రెండు నదులు ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నాయి. సరైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు పాటించకపోవడంతో ఏటా 5 ట్రిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ సముద్రంలో చేరుతోందని ఈ పరిశోధనలో పాల్గొన్న జర్మనీకి చెందిన శాస్త్రవేత్త డా.క్రిస్టియన్ ష్మిత్ తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా 57 నదుల్లో, 79 చోట్ల నమూనాలు సేకరించామన్నారు. 
ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌లో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్‌‌స, వియత్నాం, శ్రీలంకల వాటాయే 50 శాతానికిపైగా ఉంటుందన్నారు. 
వ్యర్థాలను చేరవేస్తున్న తొలి 10 నదులు: యాంగ్జీ, సింధు, యెల్లో రివర్, హైహీ (ఆసియా); నైలు (ఆఫ్రికా); గంగా, పెరల్, అముర్ (ఆసియా); నైజర్ (ఆఫ్రికా), మెకాంగ్ (ఆసియా). 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 95% ప్లాస్టిక్ వ్యర్థాలకు పది నదులే కారణం 
ఎప్పుడు : అక్టోబర్ 18 
ఎవరు : జర్మనీ శాస్త్రవేత్త డా.క్రిస్టియన్ ష్మిత్

భూమికి సమీపంగా ‘2012 టీసీ4’ ఉల్క  శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగానే ‘2012 టీసీ4’ ఉల్క భూమికి సమీపంగా దూసుకెళ్లింది. అంటార్కిటికా మీదుగా అక్టోబర్ 12న ఈ శకలం భూమిని దాటుకుంటూ వెళ్లిపోయింది. ఐదేళ్ల క్రితం అమెరికాలోని హవాయి హలియకల అబ్జర్వేటరీలోని పాన్-స్టార్స్ టెలిస్కోప్ ద్వారా ‘2012 టీసీ4’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత ఈ శకలం సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అదృశ్యమైంది. మళ్లీ ఈ ఏడాది జూలైలో చంద్రుని కక్ష్యలో కనిపించింది. 
భూమికి ఎంత దగ్గరగా..యాభై నుంచి వంద అడుగుల పరిమాణంలో ఉన్న ఈ శకలం గంటకు దాదాపు 16,000 మైళ్ల వేగంతో అంటే సెకనుకు 4.5 మైళ్ల వేగంతో అంటార్కిటికాకు 27 వేల మైళ్ల ఎత్తు నుంచి దూసుకెళ్లింది. ఇది ఎంతో దూరంలో ఉంది కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంతరిక్ష ప్రమాణాల ప్రకారం భూమి-చంద్రుడి మధ్యలో ఎనిమిదో వంతు దూరంలోనే ఉన్నట్లుగా భావించాలి. 
ఎదుర్కోగలమా ? భూమిపై పడే ఉల్క లేదా గ్రహ శకలాన్ని ఉపగ్రహంతో పేల్చేసే సామర్థ్యం మనకుంది. 2004లో ‘డీప్ ఇంపాక్ట్’ మిషన్ సందర్భంగా నాసా అదే చేసింది. ఇటువంటి ఉల్కలను గురి చూసి కొట్టడం కొంత కష్టం. పెద్ద పరిమాణంలో ఉన్న శకలాన్ని గుర్తించడంతో పాటు సరిగ్గా మధ్యలో రాకెట్‌తో ఢీకొట్టించడమన్నది కొంతమేర సవాలుగా నిలిచినప్పటికీ, 100 నుంచి 200 మీటర్ల వైశాల్యమున్న శకలాల్ని మాత్రం పేల్చేసేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధంగానే ఉన్నాయని శాస్త్రవేత్త డెట్‌లెఫ్ చెప్పారు. 

ఒంగోలు జాతి వృద్ధి కోసం టెస్ట్‌ట్యూబ్ విధానంఒంగోలు జాతి ఆవుల సంతతిని పెంచేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం పిండ మార్పిడి ప్రక్రియ(ఐవీఎఫ్) ద్వారా టెస్ట్ ట్యూబ్ దూడలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందుకుగానూ దేశవ్యాప్తంగా 15 లేబొరేటరీలను ఎంపిక చేయగా.. అందులో గుంటూరు జిల్లా లాం ఫాంలోని పిండోత్పత్తి జీవసాంకేతిక ప్రయోగశాల కూడా చోటు దక్కించుకుంది. 
ఐవీఎఫ్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. రాష్ట్రంలో 2.5 లక్షల వరకు ఆవులుంటాయని అంచనా. వీటిలో అనుకూలమైన వాటిని ఎంపిక చేసి, సమాచారం అందిస్తే.. పిండ మార్పిడి చేస్తారు. 
ఒంగోలు జాతి సంరక్షణ ఎందుకు?ఒంగోలు జాతి ప్రపంచంలోనే పేరెన్నికగన్న పశువులు. ఇవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా అధికం. ఒక ఈత కాలంలో 2,500 లీటర్ల వరకు పాలిస్తాయి. ఇది గుర్తించిన బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో తదితర దేశాలు మన దేశం నుంచి వీటిని దిగుమతి చేసుకోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో మన దేశంలో ఒకప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఒంగోలు జాతి పశువుల సంఖ్య.. క్రమేపీ తగ్గిపోయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం వీటిని సంరక్షించాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఒంగోల్ జాతి ఆవుల వృద్ధి కోసం టెస్ట్‌ట్యూబ్ విధానం 
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 15 పరిశోధనశాలల్లో 

అంతరిక్ష రేడియేషన్‌పై నాసా కొత్త సాంకేతికత 
భూమి నుంచి అంగారకుడికి చేరుకోవడంలో ముఖ్యమైన అడ్డంకి అంతరిక్ష రేడియేషన్‌ను అడ్డుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్త సాంకేతికతను రూపొందిస్తోంది. దీంతో అంగారకుడిపైకి సురక్షితంగా, విజయవంతంగా చేరుకునే వీలు కలుగనుంది. భూమిపై రేడియేషన్ కన్నా అంతరిక్ష రేడియేషన్ చాలా ప్రమాదకరమైనదని నాసా పేర్కొంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) రక్షిత భూఅయస్కాంత క్షేత్రంలోనే ఉన్నప్పటికీ అక్కడి వ్యోమగాములు భూమిపై కన్నా పది రెట్ల ఎక్కువ రేడియేషన్‌కు గురవుతున్నారని చెప్పింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతరిక్ష రేడియేషన్‌ను అడ్డుకునేందుకు కొత్త సాంకేతికత రూపకల్పనపై దృష్టి 
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : నాసా 

నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ కిల్తాన్ సముద్రపు అడుగు భాగం లో ఉన్న సబ్‌మెరైన్లనైనా గుర్తించి, మట్టుపెట్టే అధునాత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్.. భారత నౌకాదళంలో చేరింది. ఈ మేరకు అక్టోబర్ 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డులో యుద్ధ నౌకను ప్రారంభించారు. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 
ప్రాజెక్టు-28 కింద నిర్మించ తలపెట్టిన నాలుగు యాంటీ సబ్‌మెరెన్ యుద్దనౌకల్లో ఐఎన్‌ఎస్ కిల్తాన్ మూడోది. ఐఎన్‌ఎస్ కమోర్తా, ఐఎన్‌ఎస్ కద్మత్ నౌకలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో నాలుగో యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరత్తి కూడా సిద్ధం కానుంది. 1971లో ఇండో పాక్ యుద్ధ సమయంలో నిరుపమాన సేవలందించిన యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్‌ను 1987లో డీ కమిషన్ చేశారు. మళ్లీ ఇదే పేరుతో నౌకను సిద్ధం చేశారు. 
కిల్తాన్ ప్రత్యేకతలు 
  • ఐఎన్‌ఎస్ కిల్తాన్.. ఐఎన్‌ఎస్ కమోర్తా కంటే శక్తిమంతమైంది. తొలిసారి పూర్తిస్థాయి కార్బన్ ఫైబర్ కాంపొజిట్ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు.
  • అన్ని ప్రధాన ఆయుధాల్ని, సెన్సార్లను సముద్రపు జలాల్లో ట్రయల్ రన్ నిర్వహించి.. షిప్ యార్డ్ ద్వారా నౌకాదళానికి అప్పగిస్తున్న మొదటి యుద్ధ నౌక.
  • సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం వల్ల సముద్ర జలాల్లో వెళ్తున్నప్పుడు సబ్ మెరైన్‌లు సైతం దీని ధ్వనితరంగాలను కనిపెట్టడం దాదాపు అసాధ్యం.
  • 109 మీటర్ల పొడవు, 3,500 టన్నుల బరువున్న ఐఎన్‌ఎస్ కిల్తాన్ 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. నిరాటంకంగా 3,450 నాటికల్ మైళ్లు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం.
  • భారీ టార్పెడోలు, ఏఎస్‌డబ్ల్యూ రాకెట్లు, 76 మిమీ క్యారిబర్ మీడియం రేంజ్ తుపాకీలు, క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ కలిగిన 2 మల్టీ బ్యారెల్ తుపాకీలున్న సెన్సార్ సూట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.
  • మిస్సైల్ డెకోయ్ రాకెట్లు, ఎలక్ట్రానిక్ సపోర్ట్ మేజర్ వ్యవస్థ, ఎయిర్ సర్వైవలెన్‌‌స రాడార్ వ్యవస్థతో పాటు ఏఎస్‌డబ్ల్యూ హెలికాప్టర్ కూడా ఇందులో ఉంటుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐఎన్‌ఎస్ కిల్తాన్ జలప్రవేశం 
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ 
ఎక్కడ : విశాఖపట్నం 
ఎందుకు : ప్రాజెక్టు - 28లో భాగంగా 

ఏపీ పరిధిలోని నల్లమలలో 45 పెద్ద పులులుఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ నుంచి కర్నూలు జిల్లా ఆత్మకూరు వరకు సుమారు 3.50 లక్షల చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో 45 పెద్ద పులులు ఉన్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. నల్లమలలో పులుల సంరక్షణ కోసం గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలో 24 బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి 120 మంది గిరిజన యువకులను ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చి ముఖ్యమైన ప్రాంతంలో కాపలాగా ఏర్పాటు చేశారు. వీరికి వైర్‌లెస్ వాకీ టాకీలు అందించి, పులులు సంచరించే ముఖ్య ప్రాంతాల వద్ద, చెట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. వారం రోజుల క్రితం పులులను లెక్కించటంతో 45 లెక్క తేలినట్లు మార్కాపురం డీఎఫ్‌ఓ జయచంద్రారెడ్డి అక్టోబర్ 14న వెల్లడించారు. చిరుత పులులు సుమారు 100 వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏపీ పరిధిలోని నల్లమలలో 45 పెద్ద పులులు 
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : ఏపీ అటవీశాఖ

తొమ్మిదో గ్రహం ‘ప్లానెట్ 9’ ఉండొచ్చు: నాసాఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని గ్రహమైన ‘ప్లానెట్ 9’ఉందని, బహుశా భూమి ద్రవ్యరాశి కన్నా 10 రెట్లు, సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఉన్న దూరం కన్నా 20 రెట్ల దూరం ఉండొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మన సౌర కుటుంబంలో ఆచూకీ తెలియకుండా పోయిన ‘సూపర్ ఎర్త్’ఈ ప్లానెట్ 9 కావొచ్చని భావిస్తున్నారు. ప్లానెట్ 9 భూమి ద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉన్నా.. యురేనస్, నెప్ట్యూన్ కన్నా తక్కువగా ఉందని వివరించారు. 
ప్లానెట్ 9 ఉందనడానికి 5 రకాల రుజువులు ఉన్నాయని గుర్తించినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ కొన్‌స్టాంటిన్ బాటీజిన్ తెలిపారు. ప్లానెట్ 9 మన సౌర కుటుంబం దిశగా దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట వంగి ఉండొచ్చని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి ఎలిజబెత్ బెయిలీ పేర్కొన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్లానెట్ - 9 ఉండొచ్చని వెల్లడి 
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : నాసా 

ఎన్‌ఆర్‌ఓఎల్-52 ఉపగ్రహాన్ని ప్రయోగించిన యూఎస్ రహస్య గూఢచర్య ఉపగ్రహం ఎన్‌ఆర్‌ఓఎల్-52 ను అమెరికా అట్లాస్ - 5 రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కానవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం దేని కోసం పనిచేస్తుంది తదితర వివరాలను అమెరికా ప్రకటించలేదు. అయితే.. ఇది క్షిపణులకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు, అణు పేలుళ్ల గుర్తింపు, ఫోటోలతో నిఘా, రాఢార్ మేనేజింగ్ వంటి పనుల్ని నిర్వహిస్తుందని సమాచారం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎన్‌ఆర్‌ఓఎల్-52 ఉపగ్ర హ ప్రయోగం 
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : అమెరికా

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ఆదిత్య-ఎల్ 1 సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నద్ధమవుతోంది. ఇందుకోసం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. భారత ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతిరావడంతో 2018-19లో దీనిని ప్రయోగించే అవకాశం ఉంది. 
బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలో ఆదిత్య-ఎల్1ను తయారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉపగ్రహంలో యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలను (పేలోడ్‌‌స) అమర్చి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు-1 (ఎల్-1)లోకి చేరుస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడ్ని నిరంతరం పరిశీలించడానికి వీలవుతుంది. 
సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్య గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ (అంటే 999726.85 డిగ్రీల సెల్సియస్) వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడంలేదు. దీంతో సౌర గోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై ఆదిత్య-ఎల్1 ద్వారా పరిశోధనలు చేయడానికి ఇస్రో నడుం బిగించింది. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు కాంతి మండలం (ఫొటోస్ఫియర్), వర్ణ మండలాలను (క్రోమోస్ఫియర్) అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు. వచ్చే ఏడాదికల్లా దీనిని సిద్ధం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆదిత్య - ఎల్ 1ను రూపొందించనున్న ఇస్రో 
ఎక్కడ : బెంగళూరులో 
ఎందుకు : సూర్యుడిపై పరిశోధనలకు

రక్తదానం ప్రోత్సాహానికి ఫేస్‌బుక్‌లో సౌకర్యం 
 రక్తదాతలతో ప్రజలు, బ్లడ్ బ్యాంక్‌లు, ఆస్పత్రులు సులువుగా అనుసంధానమయ్యేలా తన వెబ్‌సైట్లో ఫేస్‌బుక్ కొత్త సదుపాయాన్ని పొందుపరిచింది. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సదుపాయం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. రక్తం అసవరమున్న వారు ఒక ప్రత్యేక మెసేజ్‌లో బ్లడ్ గ్రూప్, ఆస్పత్రి పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాల్ని పొందుపరిచి పోస్ట్ చేయాలి. వెంటనే ఫేస్‌బుక్ సమీపంలోని రక్తదాతల వివరాల్ని సేకరించి వారికి అందచేస్తుంది. అలాగే ఖాతాదారుల న్యూస్ ఫీడ్‌లో రక్తదాతగా నమోదు చేయించుకోవాలని కూడా మెసేజ్‌ను ప్రదర్శిస్తుంది. తొలుత ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో దీన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రక్తదాన ప్రోత్సాహానికి ప్రత్యేక సౌకర్యం 
ఎప్పుడు : సెప్టెంబర్ 28 
ఎవరు : ఫేస్‌బుక్ 
ఎక్కడ : భారత్‌లో 

గురుత్వ తరంగాలను మళ్లీ గుర్తించిన శాస్త్రవేత్తలు విశ్వంలో జనించి కోట్లాది కాంతి సంవత్సరాలు ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాలను నాలుగోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణ బిలాలు ఢీకొన్న సమయంలో ఈ శక్తిమంతమైన తరంగాలు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ తరంగాలను అమెరికాలోని వాషింగ్టన్, లూసియానాల్లోని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లు, యూరప్‌లోని ఇటలీలో ఏర్పాటు చేసిన విర్గో అబ్జర్వేటరీ తొలిసారి సంయుక్తంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రెండు కృష్ణబిలాలు ఢీకొన్న అనంతరం ఏర్పడ్డ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 53 రెట్లు ఎక్కువ. 
ఎప్పుడు కనుగొన్నారు ఈ తరంగాలను 2015 సెప్టెంబర్‌లో తొలిసారి, అదే ఏడాది డిసెంబర్‌లో రెండోసారి గుర్తించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో మూడోసారి గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. తాజాగా ఆగస్ట్ 14న లిగో శాస్త్రవేత్తలు, యూరప్‌కు చెందిన విర్గో పరిశోధకులతో సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. 
భారతీయుల కీలక పాత్ర 
గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లిగో ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 13 కేంద్రాల్లో 67 మంది భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు లిగో-ఇండియాకు నేతృత్వం వహిస్తున్న సంజీవ్ దురంధర్ తెలిపారు. సీఎంఐ-చెన్నై, ఐసీటీఎస్- బెంగళూరు, ఐఐఎస్‌ఇఆర్-కోల్‌కతా, ఐఐఎస్‌ఇఆర్-తిరువ నంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్‌ఆర్‌సీఏటీ ఇండోర్, టీఐఎఫ్‌ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ తదితర చోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 4వ సారి గురుత్వాకర్షణ తరంగాల గుర్తింపు 
ఎవరు : లిగో శాస్త్రవేత్తలు, యూరప్‌కు చెందిన విర్గో పరిశోధకులు 
ఎక్కడ : భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో 

చైనా సైన్యంలోకి జే - 20 యుద్ధ విమానం శత్రువుల రాడార్లకు చిక్కకుండా దాడిచేసే సామర్థ్యం కలిగిన స్టెల్త్ ఫైటర్ జే-20 అనే యుద్ధ విమానాన్ని చైనా సైన్యంలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దీని సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఇప్పటిదాకా పలు రకాల పరీక్షలు నిర్వహించినట్లు చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. జే-20 చైనా దేశపు నాలుగోతరం యుద్ధవిమానం. 2011లో దీనిని తొలిసారిగా పరీక్షించారు. మరోవైపు ఈ విమానాలను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ ఆసక్తి కనబరుస్తోంది. 

అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అమెరికా, రష్యా ఒప్పందం చంద్ర మండల కక్ష్యలో తొలి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో సహకారానికి అమెరికా, రష్యా సెప్టెంబర్ 27న ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంగారకుడిపైకి మానవులను పంపడం, అంతరిక్ష పరిశోధనలను మరింత లోతుగా ర్వహించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ ఒడంబడిక చేసుకున్నారు. అంతరిక్ష కేంద్రాన్ని నాసా సారథ్యంలో ఏర్పాటు చేస్తారు. 

ప్రపంచంలోనే తొలి ఉభయచర సముద్ర డ్రోన్ ప్రపంచంలోనే తొలి మానవ రహిత ఉభయచర విమాన డ్రోన్‌ను చైనా తయారుచేసింది. ఇది జలాంతర్గాములను గుర్తించడంతోపాటు దీవులకు సరుకులను చేరవేయగలదు. షాంఘైలోని యూవీఎన్ ఇంటలిజెన్స్ సిస్టమ్స్ అనే ప్రైవేట్ సంస్థ ఈ వైమానిక వాహనాన్ని రూపొందించింది. యూ650 వాహనాల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఆ కంపెనీ సెప్టెంబర్ 25న ప్రకటించింది. 

అంగారకుడిపై సౌర తుపాను 
అంగారక గ్రహంపై సెప్టెంబర్ 11న బలమైన సౌర తుపాను సంభవించినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తుపాను వల్ల గ్రహంపై రేడియేషన్ స్థాయిలు రెట్టింపయ్యాయని తెలిపారు. తుపాను సమయంలో ఏర్పడిన కాంతి పుంజం నాసా ప్రయోగించిన మావెన్ ఆర్బిటర్ గతంలో పరిశీలించిన కాంతి పుంజాల కన్నా 25 రెట్లు ప్రకాశవంతమైందని వివరించారు. మావెన్ ఆర్బిటర్ 2014 నుంచి అంగారక గ్రహం వాతావరణానికి, సౌర గాలులకు మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తోంది.

No comments:

Post a Comment