AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2014

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2014
అత్యంత అధిక స్థాయికి CO2 ఉద్గారాలు
శిలాజ ఇంధనాలను మండించడం, పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా 2013లో ప్రపంచంలో అత్యధికంగా 35.3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది 2012 కంటే 0.7 బిలియన్ టన్నులు అధికం. డిసెంబర్ 17న ‘పీబీఎల్ నెదర్లాండ్స్ ఎన్విరాన్‌మెంటల్ ఏజెన్సీ, ఐరోపా కమిషన్ జాయింట్ రీసెర్చ్ సెంటర్’.. ‘ట్రెండ్స్ ఇన్ గ్లోబల్ ఇై2 ఎమిషన్స్-2014’ నివేదికను విడుదల చేసింది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల ఇంధన అవసరాలు పెరుగుతుండటం ఉద్గారాల పెరుగుదలకు కారణమని నివేదిక తెలిపింది. ఉద్గారాల విడుదలలో చైనా (29 శాతం), అమెరికా (15 శాతం), ఐరోపా యూనియన్ (11 శాతం), భారత్ (6 శాతం) ముందున్నాయి.
జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 18న చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి ప్రయోగం చేపట్టారు. ఈ రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ అట్మాస్పియరిక్ రీఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్ (కేర్)ను ప్రయోగించారు. భూమికి 126 కి.మీ. ఎత్తులో రాకెట్ నుంచి క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది) విడిపోయింది. తర్వాత పారాచూట్ సహాయంతో బంగాళాఖాతంలో దిగింది. ఈ ప్రయోగం మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు, బరువైన ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించేందుకు తోడ్పడుతుంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 (ఎల్‌వీఎం 3) రాకెట్ ఎత్తు 43.43 మీటర్లు, బరువు 630.58 టన్నులు.
సూపర్ ఎర్త్‌ను గుర్తించిన నాసా కెప్లర్ మిషన్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సూపర్ ఎర్త్‌ను గుర్తించినట్లు డిసెంబర్ 19న శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది భూమికి దాదాపు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనికి హెచ్‌ఐపీ116454బిగా పేరు పెట్టారు. ఇది వ్యాసంలో భూమి కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
గ్లైడ్ బాంబును పరీక్షించిన భారత్
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన వెయ్యి కిలోల గ్లైడ్ బాంబును డిసెంబర్ 19న పరీక్షించారు. ఇది విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. వాయుసేనకు చెందిన విమానం ద్వారా బాంబును తీసుకెళ్లి ఒడిశా తీరంలోని బంగాళాఖాతంలో జారవిడిచారు.
నూతన వరి వంగడం ఎంటీయూ-1156
ఆంధ్రప్రదేశ్,పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎంటీయూ-1156 పేరిట కొత్త వరి వంగడాన్ని డిసెంబర్ 16న విడుదల చేసింది. వరిలో ఐదు నుంచి పది శాతం అదనంగా దిగుబడి పెంచాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. ఇది దాళ్వాకు అనువుగా ఉంటుందని, 120 రోజుల కాల పరిమితిలో కోతకు వస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

పినాక మార్క్-2 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పినాక మార్క్-2 రాకెట్‌ను భారత్ డిసెంబర్ 9న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ప్రూఫ్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (పీఎక్స్‌ఈ)లో ఈ ప్రయోగం నిర్వహించారు.

జీశాట్-16 ప్రయోగం విజయవంతం 
సమాచార ఉపగ్రహం జీశాట్-16ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబరు 7న ఏరియన్-5 ద్వారా జీశాట్-16ను ప్రయోగించారు. 3,181.6 కిలోల బరువున్న జీశాట్-16ను 36వేల కి.మీ ఎత్తులో భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. తొలిసారి జీశాట్ ఉపగ్రహంలో అత్యధికంగా 48 ట్రాన్స్ పాండర్లను అమర్చారు. ఇందులో 12 కేయూ, 24 సీ బ్యాండ్, 12 ఎక్స్‌టెండెడ్ సీ బ్యాండ్ ట్రాన్స్ పాండర్లు ఉన్నాయి. ట్రాన్స్‌పాండర్ల వల్ల డీటీహెచ్ వీడియో ప్రసారాల్లో నాణ్యత పెరుగుతుంది. 

అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతంఖండాంతర క్షిపణి అగ్ని-4ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) డిసెంబరు 2న ఒడిశాలోని బాలాసోర్ వద్ద విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలను మోసుకుపోగల ఈ క్షిపణి 4,000 కి.మీ దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలదు. అగ్ని-4ను పరీక్షించడం ఇది నాలుగోసారి. 

హయబుస-2ను ప్రయోగించిన జపాన్జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌ప్లోరర్ హయబుస-2ను డిసెంబరు 3న విజయవంతంగా ప్రయోగించింది. సొంతంగా రూపొందించిన హెచ్ 02-ఎ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ఎక్స్‌ప్లోరర్ నాలుగేళ్లపాటు ప్రయాణించి 2018లో 1999 జేయూ అనే గ్రహశకలంపై దిగుతుంది. ఈ గ్రహశకలం పై రాళ్లు, ధూళిని సేకరించి 2020లో తిరిగి భూమికి చేరుతుంది. 

అంగారక యాత్ర వ్యోమనౌకను పరీక్షించిన అమెరికా అంగారక యాత్రకు మానవులను పంపే ప్రయత్నంలో అమెరికా డిసెంబరు 5న చేపట్టిన వ్యోమనౌక పరీక్ష విజయవంతమైంది. ఒరియన్ అనే వ్యోమనౌకను కేప్ కెనవరాల్‌లోని వైమానిక స్థావరం నుంచి డెల్టా-4 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. అది నిర్దేశిత రీతిలో కక్ష్యలోకి వెళ్లి తిరిగి భూమిని చేరింది. ఈ ప్రయోగంలో ఉష్ణ కవచం, పారాచూట్ సాయంతో వ్యోమనౌక క్షేమంగా తిరిగి భూమికి చేరడం వంటి వాటిని పరీక్షించారు. చంద్రుడికి వెలుపల వ్యోమగాములను తరలించే ప్రధాన లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2030లో అంగారకుడి మీదకు మానవసహిత యాత్రను చేపట్టాలని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయత్నిస్తోంది.

No comments:

Post a Comment