AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు డిసెంబరు 2014

క్రీడలు డిసెంబరు 2014
ప్రపంచకప్ ప్రచారకర్తగా సచిన్
2015 వన్డే క్రికెట్ ప్రపంచకప్ ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 22న ప్రకటించింది. 2011 ప్రపంచకప్‌నకు కూడా సచిన్ ప్రచార కర్తగా పనిచేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రపంచకప్ టోర్నమెంట్ జరగనుంది.
లార్డ్స్‌లో 2019 ప్రపంచకప్ ఫైనల్
2019 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనున్నట్లు డిసెంబర్ 17న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్.. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆతిథ్యమిచ్చింది. 2017లో జరిగే మహిళల ప్రపంచకప్ ఫైనల్ కూడా లార్డ్స్ మైదానంలో జరగనుంది.
వరల్డ్ చాంపియన్స్‌గా జొకోవిచ్, సెరెనా
2014 సంవత్సరానికి పురుషుల విభాగంలో సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్, మహిళల విభాగంలో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్‌లను వరల్డ్ చాంపియన్స్‌గా ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) డిసెంబర్ 18న ప్రకటించింది. జొకోవిచ్ ఈ అవార్డును దక్కించుకోవడం ఇది నాలుగోసారి కాగా, సెరెనాకు ఐదోసారి.
బాక్సర్ సరితపై ఏడాది నిషేధం
ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) డిసెంబర్ 17న ఏడాదిపాటు నిషేధం విధించింది. దాంతోపాటు వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా వేసింది. నిషేధం 2015, అక్టోబర్ 1 వరకు అమల్లో ఉంటుంది. పతకం తిరస్కరించిన సందర్భంలో సరితకు మద్దతుగా నిలిచిన కోచ్ ఫెర్నాండెజ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది.
భారత్‌కు కబడ్డీలో డబుల్ ప్రపంచకప్
రికార్డు స్థాయిలో భారత పురుషుల జట్టు వరుసగా ఐదోసారి, మహిళల జట్టు నాలుగోసారి కబడ్డీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నాయి. డిసెంబర్ 20న పంజాబ్‌లోని గురుగోబింద్ సింగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో పురుషుల జట్టు, పాకిస్థాన్ జట్టును ఓడించింది. మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది.
‘కోల్‌కతా’కు ఐఎస్‌ఎల్ టైటిల్
తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టైటిల్‌ను అట్లెటికో డి కోల్‌కతా గెలుచుకుంది. డిసెంబర్ 20న ముంబైలో డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీను ఓడించింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ.8 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్ కేరళ బ్లాస్టర్స్‌కు రూ. 4 కోట్లు అందాయి. ‘గోల్డెన్ బూట్’ అవార్డును ఎలనో(చెన్నైయిన్) అందుకున్నాడు. కోల్‌కత, కేరళ జట్లకు గంగూలీ, సచిన్ టెండూల్కర్‌లు సహ యజమానులుగా ఉన్నారు.
చాంపియన్ చెన్‌లాంగ్
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో చెన్ లాంగ్ (చైనా), తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ) వరుసగా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. డిసెంబర్ 21న జరిగిన ఫైనల్స్‌లో చెన్ లాంగ్.. విటిన్‌గస్ (డెన్మార్క్)పై గెలుపొందగా, తాయ్ జు యింగ్.. సుంగ్ జీ హున్ (కొరియా)ను ఓడించింది. విజేతగా నిలిచిన చెన్ లాంగ్, తాయ్ జు యింగ్‌లకు 80 వేల డాలర్ల (రూ. 50 లక్షల 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.

గద్దె రుత్వికకు మహిళల సింగిల్స్ టైటిల్
టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్వికా శివాని మహిళల సింగిల్స్ టైటిల్ సాధించింది. ముంబైలో డిసెంబర్ 14న జరిగిన ఫైనల్లో రుత్విక.. మహారాష్ట్రకు చెందిన అరుంధతి పంతవానెపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో గురుసాయిదత్.. హెచ్.ఎస్.ప్రణయ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సుమీత్‌రెడ్డి-మను అత్రి, మహిళల డబుల్స్ టైటిల్‌ను అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ గెలుచుకున్నారు.
జర్మనీకి ‘చాంపియన్స్ ట్రోఫీ’
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జర్మనీ జట్టు విజేతగా నిలిచింది. డిసెంబర్ 14న భువనేశ్వర్‌లో కళింగ మైదానంలో జరిగిన ఫైనల్లో 2-1తో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది. 2007 తర్వాత మరోసారి టైటిల్‌ను సాధించిన జర్మనీకి ఇది పదో ట్రోఫీ. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఉత్తమ గోల్ కీపర్‌గా పి.శ్రీజేష్ ఎంపికయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీని అత్యధికంగా ఆస్ట్రేలియా 13సార్లు గెలుచుకుంది.
ఇండియన్ ఏసెస్‌కు ఐపీటీఎల్ టైటిల్
ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టైటిల్‌ను భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ గెలుచుకుంది. దుబాయిలో డిసెంబర్ 13న ముగిసిన పోటీల్లో యూఈఏ రాయల్స్ రెండో స్థానంలో నిలిచింది. ఈ పోటీలను నిర్వహించడం ఇదే తొలిసారి. టైటిల్ గెలుచుకున్న ఇండియన్ ఏసెస్‌కు రూ.6.26 కోట్ల నగదు బహుమతి దక్కనుంది.
ఆనంద్‌కు ‘లండన్’ టైటిల్
భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. లండన్‌లో జరిగిన పోటీలో బ్రిటిష్ గ్రాండ్ మాస్టర్ మైకేల్ ఆడమ్స్‌ను ఓడించాడు. ఈ టైటిల్‌ను ఆనంద్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఆనంద్‌కు రూ.39 లక్షల 20 వేలు నగదు బహుమతి లభించింది.

ఈస్ట్‌జోన్‌కు దేవధర్ ట్రోఫీ 
దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ క్రికెట్ జట్టు గెలుచుకుంది. ముంబైలో డిసెంబరు 3న జరిగిన ఫైనల్‌లో వెస్ట్‌జోన్‌ను ఓడించింది. 

భారత్‌కు అంధుల క్రికెట్ ప్రపంచకప్అంధుల క్రికెట్ ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో డిసెంబరు 7న జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది. భారత్ జట్టు కు శేఖర్ నాయక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు పాల్గొన్నాయి. 

గోల్ఫ్ హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్గోల్ఫ్ హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్ టైటిల్‌ను గ్లాడీస్ నోసెరా (ఫ్రాన్స్) గెలుచుకుంది. న్యూఢిల్లీలో డిసెంబరు 6న ముగిసిన పోటీలో ఆమె టైటిల్ సాధించింది. భారత్‌కు చెందిన వైశావి సిన్హా ఐదోస్థానంలో నిలిచింది.

No comments:

Post a Comment