AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు ఏప్రిల్ 2015

క్రీడలు ఏప్రిల్ 2015
ప్రెసిడెంట్ కప్ బాక్సింగ్ టోర్నీలో విజేతగా భారత్
ప్రెసిడెంట్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఇండోనేషియాలో ఏప్రిల్ 27న ముగిసిన టోర్నమెంట్‌లో భారత్ నాలుగు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి మొత్తం 33 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ చాంపియన్‌గా నిలవడం ఇదే తొలిసారి. పురుషుల విభాగంలో రాకేశ్ కుమార్, హర్పాల్ సింగ్ స్వర్ణపతకాలు సాధించారు. మనీశ్ కుమార్‌కు కాంస్య పతకం దక్కింది. మహిళల విభాగంలో సర్జు బాల, పింకీ జాంగ్రా స్వర్ణాలు సాధించారు. ఈ టోర్నమెంట్‌లో 30 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పాల్గొన్నారు.
నేషనల్ సీనియర్ ర్యాంకింగ్ టోర్నీ
కోల్ ఇండియా నేషనల్ సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల టైటిల్‌ను గురుసాయిదత్త, మహిళల టైటిల్‌ను నేహా పండిట్ గెలుచుకున్నారు. బెంగళూరులో ఏప్రిల్ 18న ముగిసిన పోటీల్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో బి.సాయి ప్రణీత్ (పెట్రోలియం)ను గురుసాయిదత్త (పెట్రోలియం) ఓడించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను రూపేశ్ కుమార్ (పెట్రోలియం), సనావే థామస్ (కేరళ) ఫైనల్లో అరుణ్ జార్జ్ (కేరళ), నందగోపాల్(ఏఏఐ)లను ఓడించి టైటిల్ గెలుపొందారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రేష్మా కార్తీక్ (ఏఐ)ను ఓడించి నేహాపండిట్ (మహారాష్ట్ర) గెలుచుకుంది. మహిళల డబుల్స్ టైటిల్ ఫైనల్‌లో మేఘనా, కె.మనీషా.. ధన్యా నాయర్, మొహితా సహదేవ్‌లను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ ఫైనల్‌లో సన్యామ్ సుక్లా, కె.మనీషా.. శుక్లా రామచంద్రన్, జె.మేఘనలను ఓడించి టైటిల్ గెలిచారు.
లిన్‌డాన్‌కు బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లిన్ డాన్ (చైనా) గెలిచాడు. బీజింగ్‌లో ఏప్రిల్ 25న జరిగిన ఫైనల్లో తియాన్ హువైయీ (చైనా)ను లిన్ డాన్ ఓడించి టైటిల్ సాధించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను రచనోక్ ఇంతనోన్ (థాయిలాండ్) ఫైనల్లో లీ గ్సూయిరీ(చైనా)ని ఓడించింది.

జోర్డాన్ స్పీథ్‌కు మాస్టర్స్ గోల్ఫ్ టైటిల్
మాస్టర్స్ గోల్ఫ్ టైటిల్‌ను జోర్డాన్ స్పీథ్ (అమెరికా) గెలుచుకున్నాడు. ఆగస్టాలో ఏప్రిల్ 12న ముగిసిన పోటీలో స్పీథ్ టైటిల్ సాధించగా, ఫిల్ మైకెల్‌సన్ (అమెరికా) రెండో స్థానంలో నిలిచాడు. ఈ మాస్టర్ టైటిల్ స్పీథ్ గెలవడం ఇదే తొలిసారి.
హామిల్టన్‌కు బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ టైటిల్ గెలుచుకున్నాడు. మనామా (బహ్రెయిన్)లో ఏప్రిల్ 19న జరిగిన పోటీలో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, రైకోనెస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
యువ క్రికెటర్ అంకిత్ కేసరి మృతి
 మైదానంలో యువ క్రికెటర్ అంకిత్ కేసరి (20) మరణించారు. బెంగాల్ డివిజన్-1 నాకౌట్ పోటీల్లో భాగంగా ఏప్రిల్ 17న ఈస్ట్ బెంగాల్, భవానీపూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన బంతిని పట్టుకోవడంలో మరో క్రికెటర్ సౌరవ్ మొండెల్ ఒకరికొకరు ఢీకొనడంతో గాయపడ్డాడు. మూడు రోజుల అనంతరం కోల్‌కతలో చికిత్స పొందు తూ ఏప్రిల్ 20న మరణించాడు. అంకిత్ బెంగాల్ అండర్-19 జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
లారెస్ ప్రపంచ క్రీడా అకాడెమీలో సచిన్
భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ప్రముఖ లారెస్ ప్రపంచ క్రీడా అకాడెమీలో సభ్యత్వం దక్కింది. సచిన్‌తో పాటు చైనా బాస్కెట్‌బాల్ స్టార్ యావో మింగ్, జిమ్నాస్ట్ షియాపింగ్, స్కేటర్ యాంగ్ యాంగ్, కెన్యా మారథాన్ రన్నర్ టెగ్లా లోరోప్‌లు కూడా ఏప్రిల్ 15న ప్రకటించిన లారెస్ అకాడెమీ జాబితాలో ఉన్నారు. భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్‌లకు ఈ గౌరవం దక్కింది.
లారెస్ ఉత్తమ క్రీడాకారులుగా జొకోవిచ్, దిబాబా
16వ లారెస్ క్రీడా అవార్డులను ఏప్రిల్ 15న షాంఘైలో ప్రదానం చేశారు. పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్ (టెన్నిస్) ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా ఇథియోపియాకు చెందిన గెంజెబె దిబాబా(లాంగ్ డిస్టెన్స్ రన్నర్) ఎంపికయ్యింది. వరల్డ్ టీం ఆఫ్ ది ఇయర్‌గా జర్మనీ ఫుట్‌బాల్ టీం నిలిచింది.
కార్తికేయన్‌కు మూడో స్థానం
సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్‌లో భారత రేసింగ్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ మూడో స్థానంలో నిలిచాడు. సుజుకాలో ఏప్రిల్ 19న జరిగిన రేసులో అండ్రీ లోటెరర్ మొదటి స్థానం, కజుకి నకజిమా రెండో స్థానం సాధించారు. ఫార్ములా వన్ కాకుండా సింగిల్ సీటర్ సిరీస్‌లో టాప్-3కి చేరడం ఇదే తొలిసారి.
ఆసియా ఓషియానియా గ్రూప్-2లో భారత్ విజయం
ఫెడ్ కప్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏప్రిల్ 18న జరిగిన ఆసియా ఓషియానియా గ్రూప్-2 మహిళల టెన్నిస్ టోర్ని ఫైనల్ ప్లే ఆఫ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ ఫైనల్లో ఫిలిప్పీన్స్‌ను భారత్ ఓడించింది. దీంతో భారత్‌లో 2016లో జరిగే ఆసియా ఓషియానియా గ్రూప్-1కు అర్హత సాధించింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో భారత్
ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన భారత వన్డే జట్టు అంతర్జాతీయ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో తన రెండో స్థానాన్ని నిలుపుకుంది. ప్రస్తుతం 116 పాయింట్లతో ఉన్న ధోని సేన టాప్‌లో ఉన్న ఆసీస్ కన్నా ఆరు పాయింట్లు వెనుకబడి ఉంది. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా (112), ఆ తర్వాత శ్రీలంక (108), కివీస్ (107), ఇంగ్లండ్ (101), పాకిస్తాన్ (95) ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విభాగంలో కోహ్లి నాలుగో స్థానంలో ఉండగా ధావన్ ఆరు, కెప్టెన్ ధోని ఎనిమిదో స్థానంలో ఉన్నారు. డి విలియర్స్ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో మాత్రం భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేరు. ఆసీస్ పేసర్ మిషెల్ స్టార్క్ అగ్రస్థానంలో ఉన్నాడు.

టాప్ టెన్‌లో కోహ్లి, ధావన్, ధోని: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, కెప్టెన్ ఎం.ఎస్.ధోని టాప్ టెన్‌లో తమ ర్యాంకుల్లోనే కొనసాగుతున్నారు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి నాలుగవ, ధావన్ ఆరవ, ధోని ఎనిమిదో స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానాన్ని అలంకరించాడు. టాప్‌టెన్‌లో భారత బౌలర్లకు స్థానం దక్కలేదు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 116 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలుపుకుంది. కాగా ఆస్ట్రేలియా 122 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
సైనా మళ్లీ నెంబర్ 1
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సింగిల్స్‌లో మళ్లీ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (డబ్య్లూబీఎఫ్) ఏప్రిల్ 16న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 80191 పాయింట్లతో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న లీ జురుయ్ మూడో స్థానానికి పడిపోగా.. కరోలినా మారిన్ (స్పెయిన్) రెండో ర్యాంకుకు ఎగబాకింది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ సింగపూర్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో సైనాకు ఈ ర్యాంక్ ఖరారైంది. పీవీ సింధు టాప్‌టెన్‌లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ నాలుగవ, పారుపల్లి కశ్యప్ 14వ, హెచ్ ఎస్ ప్రణయ్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల -అశ్విని పొన్నప్ప జంట 18వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నెల తొలి వారంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన సైనా.. మలేసియా ఓపెన్ టోర్నీ సెమీస్‌లో నిష్ర్కమించడంతో రెండో ర్యాంకుకు పడిపోయిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ టోర్నీలో వైజాగ్ బాక్సర్‌కు స్వర్ణం
థాయ్‌లాండ్ అంతర్జాతీయ ఆహ్వానిత బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు.థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణంలో జరిగిన ఈ టోర్నీలో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 49 కేజీల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో శ్యామ్ 3-0 తేడాతో సురాజిత్ థోంగ్ ఆనంద్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. భారత్‌కే చెందిన రోహిత్ (60 కేజీలు), మంజిత్ (69 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెలిచారు. 
సంగక్కరకు ‘విజ్డన్ క్రికెటర్’ అవార్డు
శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ‘విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతనీ అవార్డును గెల్చుకోవడం ఇది రెండోసారి. భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తరవాత ఈ అవార్డును రెండుసార్లు అందుకున్నది సంగక్కరనే. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ ‘విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. 
ఎన్‌బీఏ లీగ్ ఆడిన తొలి భారత సంతతి క్రీడాకారుడు
భారత సంతతికి చెందిన బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు గుర్ సిమ్రాన్ సిమ్ భుల్లర్ కొత్త చరిత్రను సృష్టించాడు. భారతీయ నేపథ్యం ఉన్న ఒక ఆటగాడు ప్రఖ్యాత నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)లో ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏప్రిల్ 8న జరిగిన మ్యాచ్‌లో భుల్లర్ శాక్రమెంటో కింగ్స్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. 7 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్న భుల్లర్ కెనడాలో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు చాలా కాలం కిందటే పంజాబ్‌నుంచి వలస వచ్చారు. 
డబుల్స్‌లో సానియా నంబర్ వన్
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు మహిళల డబుల్స్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ స్థానం దక్కింది. అమెరికాలోని చార్ల్‌స్టన్‌లో ఫ్యామిలీ సర్కిల్ కప్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి కెసే డెలాక్వా (ఇటలీ)-డారిజా జురాక్(క్రొయేషియా) జంటను ఓడించి మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకోవడంతో ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంతవరకు భారత్‌కు చెందిన లియాండర్ పేస్, మహేశ్ భూపతి పురుషుల డబుల్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరగలిగారు.
షూటర్ అపూర్వీకి కాంస్యం
భారత షూటర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం సాధించింది. చాంగ్‌వన్ (కొరియా)లో ఏప్రిల్ 11న ముగిసిన పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించడంతో ఆమె రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. స్నెజానా పెజ్‌సిచ్ (క్రొయేషియా) స్వర్ణం, ఇవానా కఖ్‌సిమోవిచ్ (సెర్బియా) రజతం సాధించారు. ఇప్పటికే భారత్‌కు చెందిన జీతూ రాయ్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
అజ్లాన్‌షా హాకీ టోర్నీ విజేత న్యూజిలాండ్
అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంది. ఇపో (మలేసియా)లో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ ఓడించింది. భారత్, కొరియాను ఓడించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది.
ధ్రువ్ సిత్వాలాకు ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్
ముంబైకి చెందిన ధ్రువ్ సిత్వాలా ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. బీజింగ్‌లో ఏప్రిల్ 13న ముగిసిన ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీని ఓడించాడు. సిత్వాలాకు ఇది తొలి అంతర్జాతీయ టైటిల్.

గ్రహానికి విశ్వనాథన్ ఆనంద్ పేరు
ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పేరును ఒక చిన్న గ్రహానికి 4538 విషీ ఆనంద్ అని పెట్టినట్లు ఏప్రిల్ 1న మైనర్ ప్లానెట్ సెంటర్ తెలిపింది. ఈ గ్రహాన్ని 1998వ సంవత్సరంలో అక్టోబర్ 10న కెంజో సుజుకీ గుర్తించారు. ఇది అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలో ఉంది. సాధారణంగా కొత్తగా గుర్తించిన గ్రహాలకు వాటిని కనుగొన్న వారి పేర్లే పెడతారు. పదేళ్ల పాటు గ్రహానికి పేరు పెట్టకపోతే వేరే పేరును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఖరారు చేస్తుంది. విశ్వనాథన్ కన్నా ముందు రోజర్ ఫెదరర్, జెస్సీ ఓవెన్స్, డొనాల్డ్ బ్రాడ్‌మెన్‌లకు ఈ గౌరవం దక్కింది. 

చెన్ లాంగ్, మారిన్‌లకు మలేసియా ఓపెన్ టైటిల్స్మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) పురుషుల సింగిల్స్ టైటిల్‌ను, కరోలినా మారిన్ (స్పెయిన్) మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో లిన్ డాన్ (చైనా)ను చెన్ ఓడించాడు. భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లో జురుయ్ లీ చేతిలో ఓడిపోయింది.

మియామీ టైటిల్ సెరెనా కైవసంమియామీ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది. ఫ్లోరిడాలో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో కార్లా స్యురెజ్ నవారో (స్పెయిన్)ను ఓడించింది. సెరెనా ఎనిమిదోసారి ఈ టైటిల్ గెలుచుకుంది. ఇది తన కెరీర్‌లో 66వ సింగిల్స్ టైటిల్. మహిళల డబుల్స్: టైటిల్‌ను భారత్‌కు చెందిన సానియా మిర్జా.. మార్టీనా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి రష్యాకు చెందిన ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నియాను ఓడించి గెలుచుకుంది. పురుషుల సింగిల్స్: టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ ఆండీ ముర్రేను ఓడించి గెలుచుకున్నాడు. ఇది జొకోవిచ్‌కు ఐదో మియామి మాస్టర్స్ టైటిల్.

విశ్వవిజేత మరియాఅంతర్జాతీయ మాస్టర్ మరి యా ముజిచిక్ (ఉక్రెయిన్) ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. సోచి (రష్యా)లో ఏప్రిల్ 5న జరిగిన ఫైనల్లో నటాలియా పోగోనియా (రష్యా)ను మరియా ఓడించింది. సెమీఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్)కు కాంస్య పతకం దక్కింది.

ఐపీఎల్ చైర్మన్‌గా రాజీవ్ శుక్లాఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ కొత్త చైర్మన్‌గా రంజీబ్ బిస్వాల్ స్థానంలో రాజీవ్ శుక్లా ఎంపికయ్యారు. ఇందులో మాజీ ఆటగాళ్ల హోదాలో సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి ఉన్నారు.

No comments:

Post a Comment