AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు అక్టోబరు 2015

అవార్డులు అక్టోబరు 2015
రైఫ్ బదావీకి ఐరోపా మానవహక్కుల అవార్డు 
సౌదీ బ్లాగర్ రైఫ్ బదావీకి ప్రతిష్టాత్మక సఖరోవ్ మానవహక్కుల పురస్కారం లభించింది. అక్టోబరు 29న ఐరోపా పార్లమెంట్ బదావీకి ఈ అవార్డును ప్రకటించింది. వాక్ స్వాతంత్య్రం కోసం బదావీ పోరాడారు. సౌదీ లిబరల్ నెట్‌వర్క్ అనే చర్చావేదికను ఏర్పాటు చేసి ప్రజా జీవితంపై మత ప్రభావాన్ని అరికట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. 2012లో ఆయనను అరెస్ట్ చేసి వెబ్‌సైట్‌ను మూసివేశారు.

కశ్మీర్ గాయకుడికి సంగీత నాటక అకాడమీ అవార్డు
కశ్మీర్ జానపద గాయకుడు అబ్దుల్ రషీద్ హఫీజ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో అక్టోబర్ 23న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మొత్తం 40 మంది కళాకారులకు అకాడమీ అవార్డులను రాష్ర్టపతి అందజేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మూడో కశ్మీర్ వ్యక్తి హఫీజ్.
దలైలామాకు లిబర్టీ మెడల్
ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు లిబర్టీ మెడల్‌ను ప్రదానం చేశారు. పెన్సిల్వేనియా దేశంలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన తరఫున హాజరైన ప్రతినిధులకు ఈ మెడల్ అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాల ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ప్రజల స్వేచ్ఛా సంరక్షణకు కృషి చేసిన వ్యక్తులకు కాన్‌స్టిట్యూషన్ సెంటర్ ప్రతి ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. బహుమతి కింద లక్ష డాలర్ల నగదు అందజేస్తారు. నోబెల్ గ్ర హీత మలాలా యూసఫ్‌జాయ్, ప్రముఖ రాక్ సింగర్, మానవతావాది బోనో ఈ మెడల్ అందుకున్న వారిలో ఉన్నారు.

కైలాష్ సత్యార్థికి హార్వర్డ్ పురస్కారం
నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థికి ఈ ఏడాది హార్వర్డ్ వర్సిటీ మానవతావాది (హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ 2015) పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం భారత్‌లో ఆయన చేస్తున్న సేవలకు గుర్తుగా ఈ అవార్డు ఇచ్చినట్లు హార్వర్డ్ ఫౌండేషన్ పేర్కొంది. 
ఎల్‌ఐసీకి గోల్డెన్ పీకాక్ అవార్డు
భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కు 2015 సంవత్సరానికిగాను గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎల్‌ఐసీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు పొందింది. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ తరఫున ఎల్‌ఐసీ ఇంటర్నేషనల్ చీఫ్ మేనేజర్ కేఆర్ అశోక్ ఈ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ కేబినెట్ మంత్రి, డ్యూష్ ఆఫ్ లాన్‌కాస్టర్ చాన్సలర్ ఆలీవర్ లిట్‌విన్ అవార్డులను ప్రదానం చేశారు.

సాహిత్యంలో స్వెత్లానా అలెక్సియేవిచ్‌కు నోబెల్
2015 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సియేవిచ్(67)కు ప్రకటించారు. ఆమె విభిన్న స్వరాల రచనలు మన కాలంలో బాధలకు, సాహసానికి ప్రతీకలని అభివర్ణిస్తూ.. ఆమెను నోబెల్ బహుమతితో గౌరవిస్తున్నట్లు స్వీడన్‌లోని నోబెల్ అకాడమీ అక్టోబర్ 8న ప్రకటించింది. చెర్నోబిల్ విపత్తు, రెండో ప్రపంచ యుద్ధంపై ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా స్వెత్లానా చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. నోబెల్ సాహిత్య బహుమతి అందుకున్న రచయిత్రుల్లో స్వెత్లానా 14వ వ్యక్తి. ఈ బహుమతి కింద ఆమెకు సుమారు రూ. 6.31 కోట్లు బహూకరిస్తారు.
టునీసియా ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్’కు శాంతి నోబెల్
‘మల్లెల విప్లవం’ అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)’కు 2015 శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ ‘క్వార్టెట్’ కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది. 2011లో టునీసియాలో నిరంకుశ ప్రభుత్వంపై చెలరేగిన తిరుగుబాటు.. ఆ తర్వాత వరుసగా అరబ్ దేశాల్లో విప్లవాలకు దారితీసింది. దీనినే ‘మల్లెల విప్లవం (జాస్మిన్ రివల్యూషన్)’గా పిలుస్తారు. దీని కారణంగా చాలా అరబ్ దేశాల్లో నిరంకుశ ప్రభుత్వాలు కూలిపోయి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటుకావడానికి మార్గం ఏర్పడింది. అయితే ఈ తిరుగుబాటు అనంతరం టునీసియాలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశానికి చెందిన ‘టునీసియన్ జనరల్ లేబర్ యూనియన్, టునీసియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ హాండిక్రాఫ్ట్స్, టునీసియన్ హ్యూమన్ రైట్స్ లీగ్, టునీసియన్ ఆర్డర్ ఆఫ్ లాయర్స్’ సంస్థలు కలసి 2013లో ‘నేషనల్ డైలాగ్ క్వార్టెట్’గా ఏర్పడ్డాయి. ఇస్లామిక్ వాదుల ఆధిపత్యంలోని ప్రభుత్వానికి, తిరుగుబాటు లేవదీసిన విపక్షాలకు ఈ ‘క్వార్టెట్’ మధ్యవర్తిత్వం వహించింది. విస్తృత చర్చల ద్వారా అన్నివర్గాల మధ్య రాజీ కుదిర్చి.. శాంతికి, ప్రజాస్వామ్యానికి బాటలు వేసింది.
ఆంగస్ డేటన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్
పేదరికం, సంక్షేమం, వినియోగ అంశాలపై విస్తృత అధ్యయనాలు చేసినందుకు బ్రిటన్-అమెరికన్ ఆర్థికవేత్త ఆంగస్ డేటన్ (69) 2015 సంవత్సరం ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత వినియోగ నిర్ణయాలు, వాటి ఫలితాలు ఆర్థిక రంగంపై చూపే ప్రభావాల గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆధునిక సూక్ష్మ ఆర్థిక, స్థూల ఆర్థికశాస్త్రాల్లో మార్పుకు, ఆర్థికశాస్త్ర అభివృద్ధికి దోహదపడ్డాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 12న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఏపీ జెన్‌కో ఎండీకి బెస్ట్ బ్యూరోక్రాట్ అవార్డు
ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ విజయానంద్ ఉత్తమ ఉన్నతాధికారి (బెస్ట్ బ్యూరోక్రాట్) అవార్డుకు ఎంపికయ్యారు. ఏపీ జెన్‌కోకు అత్యుత్తమ సామర్థ్యం గల సంస్థగా అవార్డు లభించింది. ఢిల్లీకి చెందిన జాతీయ సంస్థ ఎనర్షియా ఈ అవార్డులను ప్రకటించింది. ఈ సంస్థ ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థల పనితీరుపై అధ్యయనం చేసి, అవార్డులను ప్రకటిస్తుంది.
పార్వతి బారువాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
అసోంకు చెందిన వన్యప్రాణి సంరక్షకురాలు పార్వతి బారువాను లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. కోల్‌కతాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ వైల్డ్‌లైఫ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో అక్టోబర్ 12న ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఆమె గౌరీపూర్ బారువాస్ రాజకుటుంబానికి చెందిన వారు. వన్యప్రాణి సంరక్షణకు ఆమె చేసిన నిర్విరామ కృషికి ఈ అవార్డు లభించింది. ఆమె జీవిత కథ ఆధారంగా బీబీసీ రూపొందించిన ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ డాక్యుమెంటరీతో ఆమె వెలుగులోకి వచ్చారు.
ఆదూర్ గోపాలకృష్ణన్‌కు పరబ్రహ్మ చైతన్య పురస్కారం
సాంస్కృతిక రంగంలో విశిష్ట సేవలకుగాను ప్రముఖ సినిమా దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్... 2015 పరబ్రహ్మ చైతన్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జ్యూరీ చైర్మన్, కేరళ చలనచిత్ర అకాడమీ మాజీ అధ్యక్షుడు కేఆర్ మోహనన్ అక్టోబర్ 13న వెల్లడించారు. ఓంటకూరలోని పడనిలం పరబ్రహ్మ ఆలయ యాజమాన్యం ఏర్పాటుచేసిన ఈ అవార్డు కింద ఓ ప్రశంసాపత్రంతోపాటు రూ. 25 వేల నగదు అంద జేస్తారు. ఈ ఏడాది నవంబర్ 17వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అదూర్‌కు అందజేస్తారు. 
పీవీ రాజగోపాల్‌కు ఇందిరా సమైక్యత అవార్డు
ప్రముఖ గాంధేయవాది పీవీ రాజగోపాల్.. 29వ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారానికి ఎంపికయ్యారు. దేశ సమైక్యత విషయంలో ఆయన సేవలకు గుర్తింపుగా 2013-14 సంవత్సరానికి గానూ ఈ పురస్కారానికి ఎంపికచేసినట్లు అవార్డు అడ్వైజరీ కమిటీ అక్టోబర్ 14న విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ అవార్డును అందజేయనున్నారు. అవార్డు కింద జ్ఞాపికతోపాటు రూ. 10లక్షల నగదు బహుమతిగా ఇస్తారు.
జమైకా రచయితకు మాన్ బుకర్ ప్రైజ్
ప్రతిష్టాత్మక మాన్ బుక్ ప్రైజ్ 2015ను జమైకా రచయిత మార్లన్ జేమ్స్(44) అందుకున్నారు. ఆయన రాసిన ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్’ నవల ఈ అవార్డుకు ఎంపికైంది. జమైకా రచయితకు బుకర్ ప్రైజ్ దక్కడం ఇదే ప్రథమం. బ్రిటన్‌లో స్థిరపడిన భారతీయుడు సంజీవ్ సహోటా రచించిన ‘ది ఇయర్ ఆఫ్ రన్ అవేస్’ నవల తుది జాబితాలో నిలిచింది. అక్టోబర్ 13న లండన్‌లోని గిల్డ్‌హాల్‌లో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు.

2015 నోబెల్ బహుమతులు 
 వైద్య శాస్త్రం: వైద్య శాస్త్రంలో అద్భుత కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. ఐర్లాండ్‌కు చెందిన విలియం క్యాంబెల్, జపాన్‌కు చెందిన సతోషీ ఒమురా, చైనాకు చెందిన తు యూయూలు నోబెల్‌కు ఎంపికయ్యారు. బోదకాలు, రివర్ బ్లైండ్‌నెస్, మలేరియా వ్యాధులపై వీరు చేసిన పరిశోధనలకు అవార్డు లభించింది. ఏలిక పాములు.. ఇతర పరాన్న జీవుల వల్ల కలిగే బోదకాలు, రివర్ బ్లైండ్‌నెస్ వ్యాధులు.. వాటి చికిత్సలపై చేసిన పరిశోధనలకు క్యాంప్‌బెల్, ఒమురాలకు నోబెల్‌ను ప్రకటించారు. తు యూయూ మలేరియాపై చేసిన పరిశోధనతో పాటు ఇతర ఉష్ణమండల వ్యాధుల నివారణకు మందులు కనుగొన్నందుకు నోబెల్ లభించింది.

భౌతిక శాస్త్రం: భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. టకాకి కజితా (జపాన్), ఆర్థర్ బి మెక్‌డొనాల్డ్ (కెనడా)లు న్యూట్రినోలపై చేసిన పరిశోధనకు గానూ భౌతిక శాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.

రసాయన శాస్త్రం: దెబ్బతిన్న డీఎన్‌ఏను మానవ శరీరం ఎలా మరమ్మతు చేసుకుంటుందనే అంశంపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ వరించింది. స్వీడన్‌కు చెందిన థామస్ లిండాహ్, అమెరికాకు చెందిన పాల్ మాడ్రిక్, టర్కిష్ అమెరికన్ అజీజ్ సంకార్‌లకు సంయుక్తంగా నోబెల్ అందుకోనున్నారు. జీవకణాల పనితీరు ఏ విధంగా ఉంటుందనేది వీరి పరిశోధనతో వెల్లడైంది.

జాకొబ్ సిమెర్మన్‌కు శాస్త్ర రామానుజన్ ప్రైజ్2015 సంవత్సరానికి శాస్త్ర (ఎస్‌ఏఎస్‌టీఆర్‌ఏ) ప్రైజ్‌కు కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయానికి చెందిన జాకొబ్ సిమెర్మన్ ఎన్నికయ్యారు. ఈ అవార్డును కుంభకోణం (తమిళనాడు)లోని శాస్త్ర విశ్వవిద్యాలయంలో జరిగే నంబర్ థియరీ అంతర్జాతీయ సదస్సులో బహూకరిస్తారు

ముగ్గురికి రైట్ లైవ్లీహుడ్ అవార్డుస్వీడన్ మానవ హక్కుల అవార్డు రైట్ లైవ్లీ హుడ్‌కు ముగ్గురి పేర్లను స్టాక్‌హోమ్ జ్యూరీ ప్రకటించింది. ఇనూట్ జాతి గిరిజన జీవితాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు కృషి చేసిన కెనడాకు చెందిన షీలా వాట్-క్లౌటీర్, ఉగాండాకు చెందిన కాషా జాక్విలైన్ నబాగెసెరా, ఇటలీకి చెందిన వైద్యుడు గినో స్ట్రాడాలు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

ఆస్ట్రేలియన్ రచయితకు బెస్ట్ క్రైమ్ రైటింగ్ అవార్డుఆస్ట్రేలియాకు చెందిన రచయిత మైఖెల్ రోబోథామ్ ‘యూకే క్రైమ్ రైటర్స్ అసోసియేషన్’ అందించే ప్రతిష్టాత్మక ‘గోల్డ్ డగ్గర్ అవారు’్డను అందుకున్నారు. దీంతో రోబోథామ్ 2015 సంవత్సరానికి ‘బెస్ట్ క్రైమ్ రైటర్’గా నిలిచారు. ఆయన రచించిన ‘లైఫ్ ఆర్ డెత్’ నవలకు ఈ అవార్డు లభించింది. హ్యారీ పోటర్ సీరీస్‌తో ఖ్యాతి పొందిన జేకే రౌలింగ్, రాబర్ట్ గాల్‌బ్రైత్, స్టీఫెన్ కింగ్ వంటి వారిని వెనక్కు నెట్టి రోబోథామ్ ఈ అవార్డును అందుకున్నారు. విడుదల కావడానికి ఒక రోజు ముందు జైలు నుంచి తప్పించుకు పారిపోయే టెక్సన్ ఖైదీ కథే ‘లైఫ్ ఆర్ డెత్’ నవల.

భారతీయ సంస్థకు ఎమ్‌ఐటీ క్లైమేట్ కోల్యాబ్ అవార్డునానో టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న భారతీయ కంపెనీ ‘నువాల్గీ’ ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్‌ఐటీ) క్లైమెట్ కోల్యాబ్ అవార్డును గెలుచుకొంది. మురుగునీటి శుద్ధి ప్రక్రియలో విద్యుత్, ఇంధన వినియోగం తగ్గించడం, ‘నువాల్గీ’ అనే స్మాల్ స్కేల్ ప్రొడక్ట్ చుట్టూ చేరే నీటి పునర్వినియోగానికి సంబంధించి నువాల్గీ రెండు ప్రతిపాదనలు పంపింది. అక్వేరియం నుంచి సముద్రాల వరకు అన్ని పరిమాణాల్లోని నీటిలో డయాటమ్ ఆల్గేను పెంచేందుకు నువాల్గీని ఉపయోగిస్తారు.

అహ్మద్ మన్సూర్‌కు మార్టిన్ ఎన్నల్స్ అవార్డుప్రతిష్టాత్మక ‘మార్టిన్ ఎన్నల్స్ అవార్డు’ యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్‌ను వరించింది. మానవ హక్కుల కోసం పోరాడే వారికి అందించే ఈ అవార్డును 2015 సంవత్సరానికి గాను మన్సూర్‌కు అందజేస్తారు. దీన్ని నోబెల్ బహుమతితో సమానంగా పరిగణిస్తారు. యూఏఈలో భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజకీయ, పౌరుల హక్కుల కోసం మన్సూర్ 2006 నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాజీ సెక్రటరీ జనరల్ మార్టిన్ ఎన్నల్స్ పేరిట 1993లో ఈ అవార్డును నెలకొల్పారు.

No comments:

Post a Comment