AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు సెప్టెంబరు 2015

అవార్డులు సెప్టెంబరు 2015
శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు 11 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేసింది. జీవశాస్త్రంలో బాలసుబ్రమణియన్ గోపాల్ (ఐఐఎస్సీ- బెంగళూరు), రాజీవ్ కుమార్ వర్షణే (ఇక్రిశాట్), భూ, వాతావరణ, సాగర, గ్రహ విజ్ఞాన శాస్త్రం: జ్యోతిరంజన్ శ్రీ చందర్ రే (ఫిజికల్ సైన్స్ లేబరేటరీ- అహ్మదాబాద్), ఇంజనీరింగ్ సెన్సైస్: యోగేష్ జోషి (ఐఐటీ- కాన్పూర్), గణిత శాస్త్రం: రితబ్రత మున్షీ (టీఐఎఫ్‌ఆర్- ముంబై), కె.సందీప్ (టీఐఎఫ్‌ఆర్- బెంగళూరు), భౌతిక శాస్త్రం: బేదంగదాస్ మొహంతీ (ఎన్‌ఐఎస్‌ఈఆర్- భువనేశ్వర్), మందర్ దేశ్‌ముఖ్ (టీఐఎఫ్‌ఆర్- ముంబై), వైద్యశాస్త్రం: విదితా వైద్య (టీఐఎఫ్‌ఆర్-ముంబై), రసాయన శాస్త్రం: డి.శ్రీనివాసరెడ్డి (సీఐఎస్‌ఆర్-పూణె), ప్రద్యుత్ ఘోష్ (ఐఎసీఎస్- జాదవ్‌పూర్).
గౌతమ్ నారాయణ్‌కు హ్యారీ మెసెల్ అవార్డు
అసోంకు చెందిన వన్యప్రాణి సంరక్షకులు గౌతమ్ నారాయణ్ ప్రతిష్టాత్మక హ్యారీ మెసెల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు నారాయణ్. అంతరించిపోయే దశలో ఉన్న ‘పిగ్మీ హాగ్’ సంరక్షణ కోసం ‘పిగ్మీహాగ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్’(పీహెచ్‌సీపీ) ద్వారా ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ప్రాణుల సంరక్షణకు విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు హ్యారీ మెసెల్ అవార్డును అందజేస్తారు.
సైఫుద్దీన్‌కు విశ్వశాంతి అవార్డు
మానవ హక్కులు, సామాజిక న్యాయం రంగాల్లో విశిష్ట సేవలందించిన దావూదీ బోహ్రా ముస్లిం వర్గం ఆధ్మాత్మిక నాయకుడు సైద్నా ముఫద్దల్ సైఫుద్దీన్‌కు 2015 సంవత్సరానికి గాను విశ్వశాంతి అవార్డు దక్కింది. అఖిల భారత మానవ, పౌర హక్కులు, సామాజిక న్యాయ మండలి (ఐఏసీహెచ్‌ఎల్‌ఎస్) చైర్మన్ జోగిందర్ సింగ్ బడోరియా సెప్టెంబర్ 23న సైఫుద్దీన్‌కు ఈ అవార్డు ప్రదానం చేశారు. అంతర్జాతీయ ఆహార పంపిణీ కార్యక్రమానికి సహకరించడంతోపాటు వేలాది కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందడానికి సైఫుద్దీన్ కృషి చేశారు. మహిళలు స్వయంసమృద్ధి సాధించడానికి కూడా శ్రమించారు. ఐఏసీహెచ్‌ఎల్‌ఎస్ అవార్డుకు 144 దేశాల్లో గుర్తింపు ఉంది.

సిడ్బీకి ప్రతిష్టాత్మక పురస్కారం
రాజ్‌భాషా కీర్తి పురస్కార్ పథకం కింద భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (ఎస్‌ఐడీబీఐ-సిడ్బీ) ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందింది. ఇందుకు సంబంధించి ద్వితీయ బహుమతిని సిడ్బీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కె. శివాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. అధికార భాష అమలుకు సంబంధించి 2014-15 ఏడాదికి గాను సిడ్బీకి ఈ పురస్కారం లభించడం ఇది మూడోసారి. 
నూయీ, భారతీయలకు యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు
పెప్సికో సీఈఓ ఇంద్రా నూయీ, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ శోభనా భారతీయలకు 2015 సంవత్సరానికి గాను యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్‌ఐబీసీ) గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును ప్రదానం చేసింది. ప్రపంచ సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి మహిళా నాయకురాళ్లుగా వీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. సెప్టెంబర్ 21న వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్‌ఐబీసీ వార్షిక వేడుకల్లో వారికి ఈ అవార్డులను అందజేశారు. యూఎస్‌ఐబీసీ అనేది అమెరికాలోని భారత, అమెరికా కంపెనీలకు సంబంధించిన అత్యున్నత న్యాయ సంఘం.
డాక్టర్ ఎస్వీకి జాషువా సాహితీ పురస్కారం
సుప్రసిద్ధ అభ్యుదయ కవి, విమర్శకులు, సాహిత్య పరిశోధకులు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ కవి కోకిల గుర్రం జాషువా సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. గుంటూరులోని సెప్టెంబర్ 26న జరగనున్న పద్మభూషణ్ గుర్రం జాషువా 120వ జయంతి ఉత్సవంలో డాక్టర్ ఎస్వీకి జాషువా సాహితీ పురస్కారంతో పాటు రూ.10వేల నగదును పారితోషికంతో సత్కరించనున్నారు.
ఒడిశా బాలికకు స్వచ్ఛభారత్ హరిత పురస్కారం
ఒడిశాకు చెందిన 16 ఏళ్ల బాలిక స్వచ్ఛభారత్ హరిత పురస్కారాన్ని అందుకుంది. ఓఎల్‌ఎక్స్ ఐడియాథాన్-2015 పేరిట నిర్వహించిన ఈ పోటీలో పర్యావరణానికి మేలు చేసేలా కూరగాయలను ఎరువుగా మార్చే విధానాన్ని వివరించిన జైపూర్‌కు చెందిన జెశ్వాంత్ జెంబాలీ ఈ అవార్డుకు ఎంపికైంది. సెప్టెంబరు 17న భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా చేతుల మీదుగా జెంబాలీ ఈ అవార్డు అందుకుంది.

నాల్కోకు ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డు
నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) ఐఐఐఈ ప్రతిష్టాత్మక ‘పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2014’కు ఎంపికయ్యింది. చక్కటి పనితీరు ప్రదర్శించిన కంపెనీలకు గుర్తింపుగా ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈ అవార్డును నెలకొల్పింది. దుబాయ్‌లో అక్టోబర్ 8, 2015వ తేదీన జరిగే 19వ సీఈఓల సదస్సులో ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది.
రోశయ్యకు ఎన్జీరంగా అవార్డు ప్రదానం
ఆచార్య ఎన్జీ రంగా స్మారక అవార్డును తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అందుకున్నారు. సెప్టెంబర్ 13న గుంటూరు జిల్లా తెనాలిలో రోశయ్యకు అవార్డును ప్రదానం చేశారు. నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేకసభలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ చక్రపాణి చేతులమీదుగా ఈ అవార్డును రోశయ్య స్వీకరించారు.
సతీశ్ రెడ్డికి మోక్షగుండం స్మారక అవార్డు
రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి.సతీశ్ రెడ్డిని మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డుతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సత్కరించింది. ఈసీఐఎల్ చైర్మన్, ఎండీ పి.సుధాకర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందజేశారు. సతీశ్‌రెడ్డితో పాటు ఎస్వీ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎస్.నారాయణరెడ్డి, ట్రాన్స్‌కో హెచ్‌ఆర్‌డీ కన్సల్టెంట్ ఎం.సాంబయ్య, డీఎంఆర్‌ఎల్ శాస్త్రవేత్త అమిత్ భట్టాచారి.. ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. 
‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’గా బంగ్లా ప్రధాని
ఐక్యరాజ్యసమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్(యుఎన్‌ఈపీ) అందించే అత్యున్నత పర్యావరణ అవార్డు ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’కు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఎంపికయ్యారు. 2015 సంవత్సరానికి గాను పాలసీ లీడర్‌షిప్ విభాగంలో ఆమెకు ఈ అవార్డు లభించింది.
అఖీల అసిఫికి నాన్‌సేన్ రెఫ్యూజీ అవార్డు
పాకిస్తాన్‌లోని అప్గానిస్తాన్ శరణార్థి బాలికల విద్యాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన అఖీల అసిఫి అనే ఉపాధ్యాయురాలికి ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ అందించే నాన్‌సేన్ రెఫ్యూజీ అవార్డు వరించింది. అఫ్గాన్ నుంచి 1992లో కుటుంబంతో సహా పాకిస్తాన్‌కు వలస వచ్చిన అసిఫి, అఫ్గాన్ శరణార్థి బాలికల విద్యకు నిర్విరామ కృషి చేశారని యునెటైడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(యుఎన్‌హెచ్‌సీఆర్) ప్రశంసించింది.

భారత్‌కు యునెస్కో అవార్డు
కేరళలోని త్రిసూర్‌లో గల వడక్కునాథన్ ఆలయ పరిరక్షణకు తీసుకున్న చర్యలకు గానూ భారత్‌కు ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) మొత్తం 5 దేశాలలోని(భారత్, చైనా, లావోడిపిఆర్, ఆస్ట్రేలియా, థాయిలాండ్) 12 ప్రాజెక్టులకు వివిధ కేటగిరీల్లో 2015 సంవత్సరానికి అవార్డులను ప్రకటించింది. 

ఝంపా లాహిరికి నేషనల్ హ్యుమానిటీస్ మెడల్భారతీయ అమెరికన్, పులిట్జర్ బహుమతి గ్రహీత ఝంపా లాహిరికి 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అమెరికా నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ లభించింది. మానవ సంబంధాలను అద్భుత రీతిలో ఆవిష్కరించినందుకు ఈ అవార్డుకు ఆమెను ఎంపికచేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. ఆమె తన రచనల ద్వారా భారతీయ అమెరికన్ల అనుభవాలను అద్భుతంగా ఆవిష్కరించినట్లు తెలిపింది. ఈ అవార్డును ఆమెకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సెప్టెంబరు 10న బహూకరిస్తారు.

ఇండియన్ అమెరికన్‌కు విశిష్ట ఉపాధ్యాయ అవార్డుభారత సంతతికి చెందిన అమెరికన్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రీతికా కుమార్ 2015 సంవత్సరానికి గాను ‘సి.హోమ్స్ మెక్‌డొనాల్డ్ విశిష్ట ఉపాధ్యాయ’ పురస్కారానికి ఎంపికయ్యారు. విచితా స్టేట్ యూనివర్సిటీలో ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బోధిస్తున్నారు.

హరిప్రసాద్ చౌరాసియాకు కొప్పరపు కవుల పురస్కారంప్రఖ్యాత వేణుగాన విద్వాంసుడు పద్మవిభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియాకు కొప్పరపు కవుల ప్రతిభా జాతీయ పురస్కారాన్ని అందజేయనున్నారు. సెప్టెంబర్ 9, 2015వ తేదీన విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. కొప్పరపు కవుల కళాపీఠం ఈ పురస్కారాన్ని నెలకొల్పింది.

అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కాళోజీ పురస్కారాన్ని తొలిసారిగా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్‌కు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సెప్టెంబర్ 9, 2015వ తేదీన ప్రజా కవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారంతో సత్కరించారు. పురస్కారం కింద జ్ఞాపికతోపాటు రూ.లక్షా వేయి నూటపదహార్ల నగదు బహుమతి లభించింది.

ఇస్రోకు గాంధీ శాంతి బహుమతి ప్రదానంభారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు 2014 ఏడాదికి గాను ప్రకటించిన గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. సెప్టెంబర్ 9, 2015వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డును బహూకరించారు. ఈ అవార్డు కింద రూ.కోటి నగదు, జ్ఞాపిక, ప్రశంసా ప్రతాన్ని అందజేశారు.

No comments:

Post a Comment