AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు జూన్ 2015

క్రీడలు జూన్ 2015
ఎన్‌బీఏ లీగ్‌కు సత్నామ్ సింగ్ ఎంపిక
అమెరికాలోని నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్(ఎన్‌బీఏ) లీగ్‌కు పంజాబ్‌కు చెందిన సత్నామ్ సింగ్ భమారా(19) ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడుగా ఆయనకు గుర్తింపు లభించింది. జూన్ 26న జరిగిన ఎన్‌బీఏ డ్రాఫ్ట్‌లో సత్నామ్‌ను డల్లాస్ మావెరిక్స్ ఎంపిక చేసుకుంది.
ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్
క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో 21వ శతాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. 2000 సంవత్సరం నుంచి ప్రదర్శన ప్రకారం 23 శాతం అభిమానులు సచిన్‌కు ఓటు వేయగా, ఆసీస్ స్టార్ పాంటింగ్ (11%)కు నాలుగో స్థానం మాత్రమే దక్కింది. సంగక్కర, గిల్‌క్రిస్ట్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు సచిన్‌ను ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెట్ అభివృద్ధి కమిటీలోకి తీసుకుంది.
తపలోవ్‌కు నార్వే చెస్ టైటిల్
నార్వే చెస్ 2015 టైటిల్‌ను వి.తపలోవ్ గెలుచుకున్నాడు. జూన్ 25న నార్వేలో ముగిసిన పోటీలో తపలోవ్ టైటిల్ సాధించగా, విశ్వనాథన్ ఆనంద్ రెండో స్థానంలో నిలిచాడు.
జ్వాలా - అశ్విని జోడీకి కెనడా ఓపెన్ టైటిల్
బ్యాడ్మింటన్ కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ మహిళల డబుల్స్ టైటిల్‌ను గుత్తా జ్వాలా- అశ్విని పొన్నప్ప(భారత్) గెలుచుకున్నారు. వీరు కెనడాలో జూన్ 29న జరిగిన ఫైనల్లో ఈఫ్జీ ముస్కెన్స్- సెలెనా ఫైక్ (నెదర్లాండ్స్) జంటను ఓడించారు.
ఎడ్మాంటన్ చెస్ టోర్నీ విజేత హరికృష్ణ
తెలుగు తేజం, భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఎడ్మాంటన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. కెనడాలో ముగి సిన ఈ టోర్నీలో హరికృష్ణ 7.5 పాయింట్లు సంపాదించి అగ్రస్థానాన్ని దక్కించున్నాడు. మొత్తం 10 మంది క్రీడాకారుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఆరు గేముల్లో గెలిచాడు.
కామన్వెల్త్ చెస్ చాంపియన్ అభిజిత్ గుప్తా
కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా చాంపియన్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు కాంస్య పతకాన్ని సాధించాడు. జూన్ 30న ముగిసిన ఈ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్లలో అభిజిత్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాత లలిత్ బాబు 7.5 పాయింట్లతో ఆర్గ్యా దీప్ దాస్ (భారత్), దీపన్ చక్రవర్తి (భారత్)తో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... ఆర్గ్యాదీప్‌కు రెండో స్థానం, లలిత్‌కు మూడో స్థానం, దీపన్‌కు నాలుగో స్థానం దక్కింది. ఇదే టోర్నమెంట్ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి.హర్షిత 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది.

యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లీ చోంగ్ వీ (మలేసియా) దక్కించుకున్నాడు. చోంగ్ వీ జూన్ 21న జరిగిన ఫైనల్లో హాన్స్ - క్రిస్టియన్ విటింగస్(డెన్మార్క్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను నొజోమి ఒకుహరా (జపాన్) ఫైనల్లో సయాకాసతో (జపాన్)ను ఓడించి గెలుచుకుంది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను లి జున్‌హుయ్ - యుచిన్ లియు (చైనా) జోడీ ఫైనల్లో మనూ అత్రి - సుమీత్ రెడ్డి (భారత్)ను ఓడించి కైవసం చేసుకుంది. 
సెర్బియాకు అండర్ - 20 ఫిఫా వరల్డ్ కప్
అండర్ - 20 ఫిఫా వరల్డ్ కప్‌ను సెర్బియా గెలుచుకుంది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జూన్ 20న జరిగిన ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లో సెర్బియా బ్రెజిల్‌ను ఓడించి టైటిల్‌ను సాధించింది. 
రోస్‌బర్గ్‌కు ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి టైటిల్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. స్పీల్‌బర్గ్‌లో జూన్ 21న జరిగిన రేసులో రోస్‌బర్గ్ మొదటి స్థానంలో నిలవగా, లూయిస్ హామిల్టన్ రెండో స్థానం సాధించాడు. 
రోజర్ ఫెదరర్‌కు గెర్రీ వెబర్ ఓపెన్ టైటిల్
గెర్రీ వెబర్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) హాలె (జర్మనీ)లో జూన్ 21న జరిగిన ఫైనల్లో ఆండ్రియాస్ సెప్పీ (ఇటలీ)ని ఓడించి దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా), రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) - ఫ్లోరిన్ మెర్జీ (రుమేనియా) జోడీని ఓడించి చేజిక్కించుకుంది. 
జోర్డాన్ స్పీథ్‌కు యూఎస్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్
యూఎస్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను జోర్డాన్ స్పీథ్ గెలుచుకున్నాడు. అమెరికాలో జూన్ 21న ముగిసిన పోటీలో జోర్డాన్ స్పీథ్ విజయం సాధించాడు. డస్టిన్ జోన్సన్ రెండో స్థానంలో నిలిచాడు. 
దక్షిణాసియా టీటీ టోర్నీలో వరుణికి టీమ్ స్వర్ణం
దక్షిణాసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి వరుణి జైస్వాల్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. బాలికల క్యాడెట్ విభాగంలో వరుణికి ఈ పతకం దక్కింది. ఇక్కడి తాల్కటోరా స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో భారత జట్టు నేపాల్, శ్రీలంకలను చిత్తు చేసి టీమ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. 
డోపింగ్‌లో భారత్‌కు మూడో స్థానం
2013 ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(World Anti-Doping Agency) నివేదిక ప్రకారం భారత్‌కు డోపింగ్‌లో మూడో స్థానం దక్కింది. తొలి రెండు స్థానాల్లో రష్యా, టర్కీ నిలిచాయి. ఆ ఏడాది భారత్ నుంచి 91 మంది అథ్లెట్లు నిషేధిక ఉత్ప్రేర కాలు వాడినట్టు తేలింది. ఇందులో 20 మంది మహిళలున్నారు. ఈనెల 15న వాడా ఈ నివేదికను వెల్లడించింది. రష్యా నుంచి 212 మంది అథ్లెట్లు డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలితే టర్కీ నుంచి 155 మంది డోపీలయ్యారు. మొత్తంగా 115 దేశాల నుంచి 89 క్రీడల్లో 2,07,513 శాంపిళ్లను పరీక్షించారు. ఇక భారత్ నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు 30 మంది డోపింగ్‌కు పాల్పడగా ఆ తర్వాతి స్థానాల్లో వెయిట్‌లిఫ్టింగ్ (19), పవర్‌లిఫ్టర్స్ (8), బాడీ బిల్డింగ్ (8), జూడో (7), బాక్సింగ్ (4), అక్వాటిక్స్ (2), సైక్లింగ్ (2), కబడ్డీ (2), క్రికెట్ (1), ఫుట్‌బాల్ (1), తైక్వాండో (1), వాలీబాల్ (1) నుంచి ఉన్నారు. 
ముస్తాఫిజుర్ ప్రపంచ రికార్డు
బంగ్లాదేశ్ యువ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ముస్తాఫిజుర్ మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఆస్ట్రేలియా బౌలర్ హారిస్ ఐదు వన్డేల సిరీస్‌లో 13 వికెట్లు తీశాడు. 
భారత్‌పై బంగ్లా తొలి సిరీస్ విజయం
భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. భారత్‌పై బంగ్లాదేశ్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ గెలవగా.. ఆఖరి వన్డేలో భారత్ గెలిచింది. బంగ్లాదేశ్‌కు స్వదేశంలో ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. మొర్తాజా నాయకత్వంలోని బంగ్లా జట్టు జింబాబ్వేపై 5-0, పాకిస్తాన్‌పై 3-0, భారత్‌పై 2-1తో వరుసగా మూడు సిరీస్‌లను సొంతం చేసుకుంది.

బోపన్న జోడీకి మెర్సిడెస్ కప్ డబుల్స్ టైటిల్
భారత టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న.. ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)తో కలిసి మెర్సిడెస్ కప్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. వీరు స్టుట్‌గార్ట్ (జర్మనీ)లో జూన్ 14న జరిగిన ఫైనల్లో అలెగ్జాండర్ పెయా(ఆస్ట్రియా)- బ్రూనో సోర్స్ (బ్రెజిల్) జంటను ఓడించారు. బోపన్నకు కెరీర్‌లో ఇది 14వ డబుల్స్ టైటిల్. సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్(స్పెయిన్) ఫైనల్లో విక్టర్ ట్రియెకి(సెర్బియా) ను ఓడించి గెలుచుకున్నాడు.
‘ఫోర్బ్స్’ సంపన్న క్రీడాకారుల్లో ధోని
ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని తొలి 100 సంపన్న క్రీడాకారుల జాబితాలో భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి 23వ స్థానం దక్కింది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారత క్రీడాకారుడు ధోనియే కావడం విశేషం. ఏడాదిలో ఆయన సంపాదన 31 మిలియన్ డాలర్లు(రూ.198.3 కోట్లు). గతేడాది ఆయన ర్యాంకు 22 కాగా.. ఈసారి ఒక స్థానం పడిపోయింది. అమెరికన్ బాక్సర్ లాయిడ్ మేవెదర్ ఈ జాబితాలో తొలిస్థానం దక్కించుకున్నారు. గోల్ఫర్ టైగర్ వుడ్స్, టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్, పోర్చుగీస్ సాకర్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో తదితరులు అగ్రస్థానాల్లో నిలిచారు. 2014 నుంచి 2015 జూన్ వరకు క్రీడాకారులు సంపాదించిన వేతనాలు, ప్రైజ్ మనీ, బోనస్‌ల ఆధారంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. 300 మిలియన్ డాలర్ల(రూ.1919.17 కోట్లు) సంపాదనతో బాక్సర్ మేవెదర్ జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు.

వావ్రింకా, సెరెనాకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్స్‌ను వావ్రింకా, సెరెనా గెలుచుకున్నారు. పారిస్‌లో జూన్ 7న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను వావ్రింకా (స్విట్జర్లాండ్) ఓడించి టైటిల్ సాధించాడు. ఇది వావ్రింకాకు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి సెరెనా విలియమ్స్ (అమెరికా) టైటిల్ దక్కించుకుంది. సెరెనాకు ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ఈమె మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్) ఫైనల్లో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్(అమెరికా)ను ఓడించి సాధించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను లూసీ సఫరోవా(చెక్ రిపబ్లిక్)-బెథానీ మాట్(అమెరికా) ఫైనల్లో డెలాక్వా(ఆస్ట్రేలియా)- ష్వేదోవా(రష్యా) జోడిని ఓడించి సాధించారు.
హామిల్టన్‌కు కెనడా గ్రాండ్‌ప్రీ
ఫార్ములా వన్ కెనడా గ్రాండ్‌ప్రీ టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మాంట్రియల్‌లో జూన్ 8న ముగిసిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, నికో రోస్ బర్గ్ రెండో స్థానం సాధించాడు.
ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్
చైనాలోని వుహాన్‌లో జూన్ 7న ముగిసిన 21వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 4 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 13 పతకాలు గెలుచుకుంది. చైనా 15 స్వర్ణ పతకాలతో మొదటి స్థానంలో ఉండగా, కతార్ 7 స్వర్ణ పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. షాట్‌పుట్‌లో ఇందర్‌జీత్ సింగ్ తొలి స్వర్ణం సాధించాడు. భారత్‌కు చెందిన అథ్లెట్లు జూన్ 6న మహిళల 3వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో లలితా బాబర్, డిస్కస్ త్రోలో వికాస్ గౌడ స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 800 మీటర్ల రేసులో టింటూ లూకా స్వర్ణ పతకం సాధించింది.

బీసీసీఐ సలహాదారులుగా సచిన్, గంగూలీ, లక్ష్మణ్
 భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ)లో నూతనంగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో క్రికెట్ దిగ్గజాలకు చోటు లభించింది. క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లను సభ్యులుగా నామినేట్ చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ జూన్ 1న ప్రకటించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత క్రికెట్ జట్టుకు, బీసీసీఐకి వీరు సహాయ సహకారాలు అందిస్తారు.

ఫిఫా అధ్యక్షుడిగా బ్లాటర్ ఎన్నిక.. రాజీనామాఅంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడిగా సెప్ బ్లాటర్(79) తిరిగి ఎన్నికయ్యారు. జ్యూరిచ్‌లో మే 29న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోర్డాన్ ప్రిన్స్ బిల్ అల్ హుస్సేన్‌పై బ్లాటర్ విజయం సాధించారు. గత పదిహేడేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న ఆయన అయిదోసారి ఎన్నికయ్యారు.
ఇదిలా ఉండగా.. బ్లాటర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జూన్ 2న ప్రకటించారు. 1998లో తొలిసారి ఫిఫా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బ్లాటర్... 17 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగారు. అయితే ఇప్పుటికిప్పుడు ఆయన ఫిఫాను వదిలి వెళ్లే అవకాశాల్లేవు. నిబంధనల ప్రకారం డిసెంబర్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి డిసెంబర్-మార్చి మధ్యలో మళ్లీ ఎన్నికలు జరిపి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునే వరకు ఆయనే పదవిలో కొనసాగుతారు. 

ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇందర్‌జీత్‌కు స్వర్ణంఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చైనాలోని వుహాన్‌లో జూన్ 3న జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో ఇందర్‌జీత్ సింగ్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. హర్యానాకు చెందిన 27 ఏళ్ల ఈ షాట్‌పుటర్ ఇనుప గుండును 20.41 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు. ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఇందర్‌జీత్ తాజా ప్రదర్శనతో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఎనిమిదో భారతీయ షాట్‌పుటర్‌గా నిలిచాడు. గతంలో జగ్‌రాజ్ సింగ్ (1973), బహదూర్ సింగ్ (1975), బల్వీందర్ సింగ్ (1985, 1989), శక్తి సింగ్ (2000), నవ్‌ప్రీత్ సింగ్ (2007), ఓంప్రకాశ్ సింగ్ (2009) ఈ ఘనత సాధించారు.

No comments:

Post a Comment