AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు జూలై 2015

క్రీడలు జూలై 2015
తొలిసారి టి20 ప్రపంచకప్‌కు ఒమన్
మధ్య ప్రాచ్య దేశం ఒమన్ క్రికెట్ జట్టు సీనియర్ స్థాయి క్రికెట్‌లో తొలిసారి ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనబోతుంది. 2016లో భారత్‌లో జరిగే టి20 వరల్డ్ కప్‌కు ఒమన్ క్వాలిఫై అయింది. జూలై 23న జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఒమన్ 5 వికెట్ల తేడాతో నమీబియాను ఓడించింది. టి20 ప్రపంచకప్‌కు ఆప్ఘనిస్తాన్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, హాంకాంగ్ కూడా అర్హత సాధించాయి
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును కొట్టేసిన ఢిల్లీ కోర్టు
క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని ఢిల్లీ కోర్టు తేల్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలతోపాటు 36 మందిపై నమోదైన అభియోగాలను జూలై 25న కోర్టు కొట్టేసింది. ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2013 మే 16న క్రికెటర్లతోపాటు కొందరు బుకీలు అరెస్టయ్యారు.
ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నీ
ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. అస్తానా (కజకిస్థాన్) లో జూలై 26న ముగిసిన టోర్నమెంటులో మొత్తం తొమ్మిది పతకాలతో భారత్ రన్నరప్‌గా నిలచింది. కజకిస్థాన్ మొదటి స్థానం, మంగోలియా మూడో స్థానాల్లో ఉన్నాయి.
స్క్వాష్ టాస్మేనియన్ ఓపెన్ టోర్నీ టైటిల్
టాస్మేనియన్ ఓపెన్ టోర్నమెంట్ స్క్వాష్ టైటిల్‌ను భారత్‌కు చెందిన కుష్ కుమార్ గెలుచుకున్నాడు. ఇది ఆయనకు తొలి ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) టైటిల్. జూలై 26న ఆస్ట్రేలియాలో ముగిసిన ఫైనల్లో జేమీ హేకాక్స్(ఇంగ్లండ్)ను కుష్ కుమార్ ఓడించాడు.
వెటెల్‌కు హంగేరీ గ్రాండ్ ప్రి టైటిల్
ఫార్ములా వన్ హంగేరీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) గెలుచుకున్నాడు. బుడాపెస్ట్‌లో జూలై 26న ముగిసిన పోటీలో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, క్వియాట్ (రెడ్ బుల్) రెండో స్థానం పొందాడు.
సీపీఎల్ చాంపియన్ ట్రినిడాడ్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టైటిల్‌ను ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్ జట్టు గెలుచుకుంది. జూలై 27న జరిగిన ఫైనల్లో ట్రినిడాడ్ జట్టు 20 పరుగుల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్స్‌ను ఓడించింది. ట్రినిడాడ్ కెప్టెన్ డ్వేన్ బ్రేవో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్... సీపీఎల్‌లో ఈ ఏడాది ట్రినిడాడ్ జట్టులో వాటా కొనుక్కుంది.
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ క్లైవ్ రైస్ కన్నుమూత
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో జూలై 28న మృతి చెందారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికా జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించడంతో దాదాపు 20 ఏళ్ల పాటు రైస్ కెరీర్ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైంది. 1991లో దక్షిణాఫ్రికాపై నిషేధం ఎత్తివేసిన తర్వాత భారత్‌తో జరిగిన తొలి వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా రైస్ ప్రపంచ క్రికెట్‌కు చిరపరిచితుడు. 42 ఏళ్ల వయసులో ఆ సిరీస్‌లో ఆడిన మూడు వన్డేల అనంతరం ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేకపోవడంతో రైస్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. మొత్తం 482 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్లైవ్ రైస్ 40.95 సగటుతో 48 సెంచరీలు సహా 26,331 పరుగులు చేశారు. తన పేస్ బౌలింగ్‌తో 22.49 సగటుతో 930 వికెట్లు పడగొట్టారు.

లాగోస్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాట్మింటన్ చాంపియన్‌షిప్
మహిళల డబుల్స్ టైటిల్‌ను సిక్కి రెడ్డి, ప్రద్న్యా గాద్రె (భారత్) గెలుచుకున్నారు. నైజీరియాలో జూలై 19న జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో ఒజ్గె బరాక్, నెష్లిహాన్ యిగిట్ (టర్కీ)లను సిక్కీ జోడీ ఓడించింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సుమీత్ రెడ్డి, మను అత్రీ(భారత్) జోడీ గెలుచుకుంది. రాబర్ట్ మతెమయెక్, నదియా జీబా(పోలండ్)లు ఫైనల్లో సిక్కి రెడ్డి, తరుణ్ కోనా(భారత్)లను ఓడించి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించారు.
దులీప్ ట్రోఫీని నిలిపేసిన బీసీసీఐ
క్రికెట్ జోనల్ టోర్నమెంట్ దులీ్‌ప్ ట్రోఫీని ప్రస్తుత సీజన్‌లో కొనసాగించరాదని బీసీసీఐ జూలై 20న ప్రకటించింది. 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ట్రోఫీని ఈ ఏడాది నిర్వహించకూడదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. 1961-62లో దులీప్ ట్రోఫీ మొదలైంది.
గోల్ఫర్ శుభమ్ సంచలనం
భారత జూనియర్ గోల్ఫ్ ఆటగాడు శుభమ్ జగ్లాన్ సంచలనం సృష్టించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఐఎంజీ అకాడమీ ప్రపంచ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో పదేళ్ల ఈ ఢిల్లీ బాలుడు విజేతగా నిలిచాడు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన శుభమ్ ఈసారి చాంపియన్‌గా అవతరించాడు. 
ఫార్ములావన్ డ్రైవర్ బియాంచి మృతి
తొమ్మిది నెలలుగా మృత్యువుతో పోరాడుతున్న ఫార్ములావన్ డ్రైవర్ జూలెస్ బియాంచి జూలై 17న మరణించాడు. గతేడాది అక్టోబర్ 5న జపాన్ గ్రాండ్‌ప్రిలో వర్షంలో దూసుకెళుతున్న అతని కారు అదుపు తప్పి ట్రాక్ పక్కనున్న రికవరీ వెహికల్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో రేసులో మనోర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 25 ఏళ్ల బియాంచి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఈ ఫ్రెంచ్ డ్రైవర్ నైస్ పట్టణంలోని తన ఇంటికి దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫార్ములావన్ చరిత్రలో ఇప్పటికి 36 మంది డ్రైవర్లు తమ ప్రాణాలు వదలగా... చివరిసారిగా 1994లో ప్రఖ్యాత డ్రైవర్ అయిర్టన్ సెన్నా దుర్మరణం చెందాడు. 2013, 2014 సీజన్లలో మనోర్ జట్టు తరఫున బియాంచి 34 రేసులను పూర్తి చేశాడు. గతేడాది మొనాకో గ్రాండ్‌ప్రిలో తొమ్మిదో స్థానంలో నిలిచి తమ జట్టుకు తొలిసారిగా చాంపియన్‌షిప్ పాయింట్లను అందించాడు. 
టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మౌరెస్మో
ప్రపంచ మహిళల టెన్నిస్ మాజీ నంబర్‌వన్ అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్)కు అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం లభించింది. మౌరెస్మోతోపాటు పారాలింపిక్ ప్లేయర్ డేవిడ్ హాల్ (ఆస్ట్రేలియా), నాన్సీ జెఫెట్ (అమెరికా)లకు కూడా ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు కోచ్‌గా వ్యవహరిస్తున్న 36 ఏళ్ల మౌరెస్మో 2006లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను సాధించింది. అదే ఏడాది 36 వారాలపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగింది. కెరీర్ మొత్తంలో 25 టైటిల్స్ నెగ్గిన ఆమె 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది.
ముగ్గురు ఆర్చర్లపై మూడేళ్ల నిషేధం
ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో కాంస్య పతక పోరుకు ఆలస్యంగా చేరుకొని అనర్హతకు గురైన ముగ్గురు ఆర్చర్లు గుర్విందర్ సింగ్, కన్వల్‌ప్రీత్ సింగ్, అమన్.. జట్టు అధికారి జీవన్‌జ్యోత్ సింగ్‌లపై భారతీయ యూనివర్సిటీల సంఘం (ఏఐయు) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ నలుగురిపై ఇంటర్ యూనివర్సిటీ, అంతర్జాతీయ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొనకుండా మూడేళ్లపాటు నిషేధం విధించింది. దాంతోపాటు ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా వారిపై వెచ్చించిన సొమ్మును (ఒక్కొక్కరిపై సుమారు రూ. 5 లక్షలు) వారి నుంచే రాబట్టాలని నిర్ణయం తీసుకుంది.

భారత్‌కు న్యూజిలాండ్ సిరీస్
భారత్, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. బెంగళూరులో 2015, జూలై 8న ముగిసిన ఐదో వన్డేను భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 3-2 తేడాతో భారత్‌కు దక్కింది.
వింబుల్డన్ చాంపియన్‌షిప్ 2015 విజేతలు
వింబుల్డన్ చాంపియన్‌షిప్ 2015 పోటీలు జూలై 12తో ముగిసాయి. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ దక్కించుకుంది. చాంపియన్‌షిప్‌లో విజేతకు 18 లక్షల 80 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 48 లక్షలు), రన్నరప్‌కు 9 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.జొకోవిచ్‌కు మూడో వింబుల్డన్ టైటిట్జూలై 12న జరిగిన ఫైనల్‌లో రెండో సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను నొవాక్ ఓడించి మూడో సారి వింబుల్డన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో జొకోవిచ్ 200వ విజయాన్ని సాధించాడు. ఈ ఏడాది ఆడిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అతను, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆరోసారి వింబుల్డన్ విజేతగా సెరెనాఅమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆరోసారి వింబుల్డన్ విజేతగా నిలిచింది. జూలై 11న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో స్పెయిన్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజాను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో సెరెనా 2002, 2003, 2009, 2010, 2012లలో ఈ టైటిల్‌ను సాధించింది. ఇప్పటి వరకు సెరెనా మొత్తం 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుపొందింది. స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ-1988లో) తరవాత ఒకే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణి సెరెనాయే.సానియా జోడికి డబుల్స్ టైటిల్వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మీర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి కైవసం చేసుకుంది. జూలై 11న జరిగిన ఫైనల్‌లో ఈ జోడి ఎకతెరీనా మకరోవా - ఎలీన వెస్నినా (రష్యా) జోడిని ఓడించింది. విజేతకు 3 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 3 కోట్ల 34 లక్షలు), రన్నరప్‌కు లక్షా 70 వేల పౌండ్లు (రూ. కోటీ 67 లక్షలు) ప్రైజ్ మనీగా లభించాయి.మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ విజేత పేస్ జోడిభారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలసి వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. దీంతో తన ఖాతాలో 16వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఫైనల్లో పేస్-హింగిస్ జంట పెయా (ఆస్ట్రియా)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్‌గా పేస్ కెరీర్‌లో ఇది నాలుగో వింబుల్డన్ మిక్స్‌డ్ టైటిల్.పురుషుల డబుల్స్ టైటిల్వింబుల్డన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను రోజర్ (నెదర్లాండ్స్), హోరియా టీకా (రోమానియా) జోడి గెలుపొందింది. ఫైనల్లో జేమీ ముర్రే (బ్రిటన్), జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడిని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
నేషనల్ సీనియర్ స్క్వాష్ టైటిల్
63వ నేషనల్ సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌ను సౌరవ్ ఘోసల్, మహిళల టైటిల్‌ను జోస్నా చిన్నప్పలు గెలుచుకున్నారు. వీరిద్దరూ తమిళనాడుకు చెందినవారు. జూలై 12న తిరువనంతపురంలో ముగిసిన ఫైనల్లో హరీందర్ పాల్ సింగ్ సంధూ (తమిళనాడు)ను ఘోసల్ ఓడించగా, హర్షిత్ కౌర్ జవందా(ఢిల్లీ)ను జోస్నా చిన్నప్ప ఓడించారు.
ఇండియన సూపర్ లీగ్‌లో చెత్రికి రూ.1.20 కోట్లు
భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర పలికింది. జులై 10న జరిగిన ఈ వేలంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌కు చెందిన ముంబై సిటీ ఎఫ్‌సీ ఫ్రాంచైజీ చెత్రిని కోటీ 20 లక్షలకు (కనీస ధర రూ.80 లక్షలు) కొనుగోలు చేసింది. మొత్తం పది మంది భారత ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు.
సోమ్‌దేవ్ రికార్డు
భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కొత్త రికార్డు సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టూర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ ఫైనల్ ఆడి గెలిచిన క్రీడాకారుడిగా సోమ్‌దేవ్ గుర్తింపు పొందాడు. అమెరికాలోని వినెట్కాలో జరిగిన నీల్సన్ ప్రో టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో సీడ్ సోమ్‌దేవ్ డానియల్ ఎన్గుయెన్ (అమెరికా)పై గెలిచి విజేతగా నిలిచాడు. 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్ ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్‌లో సుదీర్ఘ సమయంపాటు జరిగిన ఫైనల్‌గా గుర్తింపు పొందింది. కెరీర్‌లో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్న అతను ఈ విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి 148వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 
చెన్నై, రాజస్థాన్‌పై రెండేళ్ల నిషేధం
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన జస్టిస్ లోధా కమిటీ తన తీర్పును వెలువరించింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను రెండేళ్ల పాటు నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల లోధా కమిటీ జూలై 14న ఈ విషయాలను వెల్లడించింది. అలాగే బెట్టింగ్‌కు పాల్పడినందుకు చెన్నై జట్టు టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్తాన్ సహ యజమాని రాజ్ కుంద్రాలను దోషులుగా నిర్ధారించింది. వారు అవినీ తికి పాల్పడినట్టు ఆధారాలున్నాయని ప్రకటించింది. ఇక భవిష్యత్‌లో వీరిద్దరు ఎలాంటి క్రికెట్ కార్యకలాపా లు చేపట్టకుండా జీవిత కాల నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.
జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్
జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను రహానే సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకుంది. చివరి వన్డేలో భారీ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 14న జరిగిన మూడో వన్డేలో భారత్ 83 పరుగులతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో అంబటి రాయుడు (124 నాటౌట్), ఆఖరి మ్యాచ్‌లో కేదార్ జాదవ్ (105 నాటౌట్) సెంచరీలు సాధించారు. సిరీస్‌లో అత్యధికంగా 165 పరుగులు సాధించిన రాయుడు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. 
దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ సిరీస్ విజయం
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా గెలవగా.. తరవాత రెండు వన్డేల్లో నెగ్గిన బంగ్లా ట్రోఫీని దక్కించుకుంది. ఈ ఏడాది సొంతగడ్డపై బంగ్లాకు ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. ఏప్రిల్‌లో పాకిస్తాన్‌పై, జూన్‌లో భారత్‌పై బంగ్లా సిరీస్ విజయాలు నమోదు చేసింది. బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ వన్డేల్లో 200 వికెట్లు, నాలుగువేల పరుగులు చేసి ప్రపంచ ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో నిలిచాడు.
చాంపియన్స్ లీగ్ టి20 రద్దు
భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డులు సంయుక్తంగా నిర్వహిస్తున్న చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని రద్దు చేస్తూ గవర్నింగ్ కౌన్సిల్ జూలై 15న నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. మూడు దేశాలు ఏకగ్రీవంగా దీనికి ఆమోద ముద్ర వేశాయి. టోర్నీకి సరైన ప్రజాదరణ లేదని గతంలోనే రద్దు ప్రతిపాదనలు వచ్చినా... స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్తాన్, చెన్నై ఫ్రాంచైజీలపై వేటు పడటంతో ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టింది. ప్రజాదరణ దృష్ట్యా తాము తీసుకున్న నిర్ణయం సరైందేనని కౌన్సిల్ తెలిపింది. సీఎల్‌టి20ని బీసీసీఐ, సీఏ, సీఎస్‌ఏలు కలిసి 2009లో ఏర్పాటు చేశాయి.
700 వికెట్ల క్లబ్‌లో హర్భజన్
భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 700 వికెట్ల క్లబ్‌లో చేరాడు. జింబాబ్వేతో జూలై 14న జరిగిన మూడో వన్డేలో సికిందర్ రజా వికెట్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 700 వికెట్లు తీసిన జాబితాలో 12వ స్థానంలో ఉన్న భజ్జీ భారత్ తరఫున రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఇతని కంటే ముందున్నాడు. టాప్-5లో ముత్తయ్య మురళీధరన్ (1347), షేన్ వార్న్ (1001), అనిల్ కుంబ్లే (956), మెక్‌గ్రాత్ (949), వసీమ్ అక్రమ్ (916) ఉన్నారు. 435 ఇన్నింగ్స్‌లో హర్భజన్ ఈ మార్క్‌ను సాధించగా, మురళీధరన్ 308 ఇన్నింగ్స్‌లోనే అందుకున్నాడు.

చిలీకి కోపా అమెరికన్ కప్
ఫుట్‌బాల్ కోపా అమెరికన్ కప్‌ను తొలిసారి చిలీ గెలుచుకుంది. ఈ కప్‌ను చిలీ 99 ఏళ్ల అనంతరం గెలుచుకోగలిగింది. జూలై 5న శాంటియాగో (చిలీ)లో జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను చిలీ ఓడించింది. 

ఒలింపిక్స్‌కు మహిళల హాకీ జట్టు అర్హత హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నమెంట్‌లో విజయం సాధించి భారత హాకీ మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. బెల్జియంలోని యాంట్‌వర్ప్‌లో జూలై 4న జరిగిన పోటీలో జపాన్ జట్టును ఓడించి భారత్ అయిదో స్థానం దక్కించుకుంది. దీంతో 35 సంవత్సరాల తర్వాత భారత మహిళల జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

భారత్‌కు ఎస్‌ఏబీఏ చాంపియన్‌షిప్ టైటిల్4వ దక్షిణాసియా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ (ఎస్‌ఏబీఏ) టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. బెంగళూరులో జూలై 5న జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. మూడో స్థానంలో నేపాల్, నాలుగో స్థానంలో బంగ్లాదేశ్, అయిదో స్థానంలో మాల్దీవులు, ఆరో స్థానంలో భూటాన్ నిలిచాయి. దీంతో భారత్ ఈ ఏడాది చివర చైనాలో జరిగే ఆసియన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అవకాశం లభించింది.

అమెరికాకు మహిళల ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టైటిల్మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను అమెరికా గెలుచుకుంది. వాంకోవర్‌లో జూలై 5న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌ను అమెరికా 5-2 తేడాతో ఓడించింది. ఈ కప్‌ను అమెరికా గెలుచుకోవడం ఇది మూడోసారి. గతంలో 1991, 1999లో గెలుచుకుంది. మూడుసార్లు గెలుచుకున్న తొలి జట్టుగా అమెరికా నిలిచింది.

బ్రిటిష్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్బ్రిటిష్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జులై 5న ఇంగ్లండ్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన ఈ రేసులో 52 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 31 నిమిషాల 27.729 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు.

మహిళల హాకీ వరల్డ్ లీగ్ విజేత నెదర్లాండ్స్మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ విజేతగా నెదర్లాండ్స్ నిలిచింది. జులై 5న జరిగిన ఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ దక్షిణ కొరియాపై 2-1తో విజయం సాధించింది. నెదర్లాండ్స్ తరఫున ఎల్లన్ హుగ్ (3వ నిమిషం), వాన్ మాసక్కర్ (44వ నిమిషం) గోల్స్ చేయగా, దక్షిణ కొరియా ప్లేయర్ కిమ్ బో మి 34 నిమిషంలో గోల్ చేసింది.

మిథాలీ రాజ్ @5 వేల పరుగులుభారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే చరిత్రలో 5 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌వుమన్‌గా.. తొలి భారత క్రికెటర్‌గా నిలిచారు.తొలి స్థానంలో చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) కొనసాగుతున్నారు. జూలై 6న న్యూజిలాండ్‌తో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు 157 వన్డేలు ఆడిన మిథాలీ 48.82 సగటుతో 5029 పరుగులు చేశారు. వీటిలో ఐదు సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి.

మేవెదర్ టైటిల్ వెనక్కిమ్యానీ పకియావోతో జరిగిన ‘శతాబ్దపు పోరు’లో దక్కించుకున్న వెల్టర్‌వెయిట్ ప్రపంచ టైటిల్‌ను ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ కోల్పోవాల్సి వచ్చింది. గత మేలో విజేతగా నిలిచిన మేవెదర్‌కు ఈ ఫైట్ ద్వారా రూ.1,040 కోట్లు దక్కించుకున్నాడు. అయితే ఈ బౌట్ ద్వారా బెల్ట్‌ను గెల్చుకున్నందుకు తను మంజూరు రుసుము కింద రెండు లక్షల డాలర్ల (రూ.కోటీ 27 లక్షలు)ను ప్రపంచ బాక్సింగ్ సంస్థ (డబ్ల్యుబీవో)కు చెల్లించాల్సి ఉంది. జూలై 3న ఈ గడువు ముగియడంతో వెల్టర్‌వెయిట్ బెల్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డబ్ల్యుబీవో నిర్ణయించింది. డబ్ల్యుబీవో నిబంధనల ప్రకారం బాక్సర్లు తాము గెలుచుకున్న మొత్తం నుంచి 3 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంటవాషింగ్టన్‌లో జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఈ గేమ్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 156 పతకాలు కొల్లగొట్టింది. ఇందులో 89 స్వర్ణాలు, 50 రజతాలు, 17 కాంస్యపతకాలు ఉన్నాయి.
ఇంతకుముందు 2013లో ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్‌లో జరిగిన ఈ క్రీడల్లో భారత్ సాధించిన 83 పతకాలే అత్యధికం. స్విమ్మింగ్ విభాగంలో సీఆర్‌పిఎఫ్‌కు చెందిన రీచా మిశ్రా ఏకంగా ఆరు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించి సత్తా చాటింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో పంజాబ్‌కు చెందిన కుల్విందర్ కౌర్ 5 బంగారు పతకాలు సాధించింది. 50 మందితో కూడిన భారత బృందం ఏడు విభాగాల్లో పోటీపడింది. వాటిలో అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, ఆర్చరీ, స్విమ్మింగ్, షూటింగ్ విభాగాలున్నాయి.

న్యూజిలాండ్‌తో 5 వన్డేల సిరీస్ భారత్ కైవసంన్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తో భారత్ సొంతం చేసుకుంది. జులై 8న జరిగిన చివరి వన్డేలో మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ 27.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 121 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దీంతో బీసీసీఐ భారత జట్టుకు ప్రోత్సాహకంగా బోర్డు తరఫున రూ. 21 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది.

No comments:

Post a Comment