AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు జూలై 2016

అవార్డులు జూలై 2016
రామలక్ష్మికి మాలతీ చందూర్ పురస్కారం
ప్రముఖ కథా, నవలా రచయిత్రి కె.రామలక్ష్మి 2016కు మాలతీ చందూర్ పురస్కారానికి ఎంపికయ్యారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ, చందూర్ కుటుంబం, స్నేహితులు సంయుక్తంగా 2014 నుంచి ఈ అవార్డును అందిస్తున్నారు. ఈ అవార్డు కింద రూ. 50,000 నగదు, జ్ఞాపికను ప్రదానం చేస్తారు.

బెజవాడ విల్సన్, టీఎం కృష్ణలకు రామన్ మెగసెసె అవార్డు
2016కు గానూ మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణజూలై 27న రామన్ మెగసెసె అవార్డులకు ఎంపికయ్యారు. కర్ణాటకలోని దళిత కుటుంబంలో పుట్టిన విల్సన్ కార్మికులు చేతులతో మల, మూత్రాలను శుభ్రం చేసే విధానాన్ని నిర్మూలించే ఉద్యమం చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ అనే సంస్థకు కన్వీనర్‌గా ఉన్నారు.

టీఎం కృష్ణకు సంస్కృతిలో సామాజిక సమ్మిళితానికి పాటు పడినందుకు ఈ అవార్డు లభించింది. చెన్నై బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కృష్ణ భారతీయ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, సామాజిక అంతరాలను తొలగించేందుకు సంగీతం కీలకమైన సాధనమని గుర్తించి.. ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన మరో నలుగురికి కూడా మెగసెసె అవార్డు దక్కింది.
మెగసెసె అవార్డును అందుకున్న భారతీయులు
ఆచార్య వినోభా భావే(1958), సి.డి. దేశ్‌ముఖ్(1959), మదర్‌థెరిస్సా(1962), వర్గీస్ కురియన్(1963), జయప్రకాశ్ నారాయణ్(1965), సత్యజిత్ రే(1967), ఎం.ఎస్. స్వామినాథన్(1971), ఎం.ఎస్.సుబ్బలక్ష్మి(1974), ఇలాభట్(1977), అరుణ్‌శౌరి(1982), ఆర్.కే.లక్ష్మణ్(1984), బాబా ఆమ్టే(1985), కిరణ్‌బేడి(1994), టి.ఎన్. శేషన్(1996), మహాశ్వేతాదేవి(1997), అరుణారాయ్(2000), రాజేంద్రసింగ్(2001), సందీప్‌పాండే(2002), శాంతాసిన్హా(2003), జేఎం లింగ్డో(2003), అరవింద్ కేజ్రీవాల్(2006), పాలగుమ్మి సాయినాథ్(2007), నీలిమా మిశ్రా(2011), కులంది ప్రాన్సిస్(2012), అన్షు గుప్తా, సంజీవ్ చతుర్వేది(2015).
మహిళా జర్నలిస్ట్ మాలినికి అంతర్జాతీయ అవార్డు 
భారత్‌కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మాలినీ సుబ్రమణియమ్.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డు (ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడం అవార్డు)-2016కు ఎంపికయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ పాత్రికేయుల సంరక్షణ కమిటీ (సీపీజే) జూలై 18న ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ వల్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఆమె వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మాలిని వేధింపులతోపాటు దాడులకు గురయ్యారు. మహ్మద్ అబౌ జీద్ (ఈజిప్ట్), కాన్ డ్యూండర్ (టర్కీ), ఆస్కార్ మార్టినెజ్ (ఎల్ సాల్వెడర్)లకు కూడా ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు సీపీజే పేర్కొంది.
అద్వై రమేశ్‌కు గూగుల్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు
చెన్నైకి చెందిన విద్యార్థి అద్వై రమేశ్‌కు ప్రతిష్టాత్మక గూగుల్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు లభించింది. దీని కింద 50 వేల డాలర్ల నగదు బహుమతిని అందిస్తారు. భావితరాలను శాస్త్రవేత్తలు, ఇంజనీర్లుగా ప్రోత్సహించే దిశగా గూగుల్.. ఈ ఏడాది సైన్స్ పోటీలను నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టులను ఆహ్వానించగా భారత్ నుంచి 100 ఆలోచనలు, 14 పథకాలు ఎంపికయ్యాయి. వాటిలో చెన్నైకు చెందిన అద్వై రమేశ్ రూపొందించిన ఫెల్ట్ (ఫిషర్‌మెన్ లైఫ్‌లైన్ టెర్మినల్) పరికరానికి పురస్కారం లభించింది. మత్స్యకారుల భద్రతకు ఉపయోగపడే ఈ పరికరం జీపీఎస్ విధానంలో పనిచేస్తుంది.

రాధిక మీనన్‌కు ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్ అవార్డు
ఇండియన్ మర్చంట్ నేవీకి చెందిన కెప్టెన్ రాధిక మీనన్‌కు సముద్ర శౌర్య అవార్డు లభించింది. దీంతో ప్రపంచంలోనే సముద్ర శౌర్యానికి అవార్డును అందుకున్న తొలి మహిళగా ఆమెకు గుర్తింపు దక్కింది. 
జాతీయ హ్యాండ్లూమ్ అవార్డుకు ఎంపికైన వరంగల్ చేనేత కార్మికుడు 
వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన పిట్ట రాములు జాతీయ హ్యాండ్లూమ్ అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో హ్యాండ్లూమ్ ధర్రీ (జంపకాన)కి జాతీయ అవార్డు రావడం ఇదే తొలిసారి. రాములు నాలుగు నెలలపాటు కష్టపడి మొగల్ సామ్రాజ్యవేట విధానాన్ని ధర్రీస్‌లో వేశారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

గూగుల్ సీఈవోకు ప్రతిష్టాత్మక గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు
 అమెరికాలో ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డుకు గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. ఈ ఏడాది 42 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేయగా.. అందులో పిచాయ్‌తోపాటు నలుగురు భారత-అమెరికన్లు ఉన్నారు.

డాక్టర్ బీసీ రాయ్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతిప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన 25 మంది డాక్టర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 1 ‘డాక్టర్ బీసీ రాయ్ అవార్డు’లను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 2008, 2009, 2010 సంవత్సరాలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. 2009 ఏడాదికి గాను హైదరాబాద్‌లోని ఏసియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో పనిచేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ జీవీ రావు అవార్డు అందుకున్నారు. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1976 నుంచి ఈ అవార్డులను అందజేస్తుంది. 

అవార్డు గ్రహీతలు:2008: డా. మమెన్ చాందీ, ప్రొ. రాజేశ్వర్ దయాళ్, డా. రోహిత్ వి. భట్, డా. నీలం మోహన్, డా. మోహన్ కామేశ్వరణ్, డా. హర్ష జౌహారి, డా. గోపాల్ హెచ్. బద్లానీ, డా. యశ్ గులాటి
2009: డా. కె.హెచ్. సచేతి, డా. అతుల్ కుమార్, డా. రేణు సక్సేనా, ప్రొ. డా. కనన్ ఎ. గెలికర్, డా. ఎ.కె. కృపలాణి, డా. జీవీ రావు, డా. హెచ్.ఎస్. భానుశాలి, డా. మోతీలాల్ సింగ్, డా. సి.ఎన్. పురందరే, ప్రొ. డా. సీవీ హరినారాయణ్
2010: డా. నిఖిల్ సి. మున్షి, డా. తేజీందర్ సింగ్, ప్రొ. ఒ.పి. కల్‌రా, డా. అమ్రీందర్ జిత్ కన్వార్, డా. సుభాష్ గుప్త, డా. రాజేంద్ర ప్రసాద్, డా. గ్లోరీ అలెగ్జాండర్

No comments:

Post a Comment