AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు డిసెంబరు 2016

అవార్డులు డిసెంబరు 2016
పాపినేని శివశంకర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ కవి డా.పాపినేని శివశంకర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన ‘రజనీగంధ’ కవితా సంకలనానికి గాను ఆయనను 2016 సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన నాగళ్ల గురు ప్రసాద్‌రావ్‌కు భాషా సమ్మాన్ అవార్డును ప్రకటించారు. డిసెంబర్ 21న కేంద్ర సాహిత్య అకాడమీ కవిత్వం నుంచి ఎనిమిది మందికి, ఏడుగురు కథకులకు, ఐదుగురు నవలా రచయితలకు, ఇద్దరు విమర్శకులకు, ఒక వ్యాసకర్తకు, ఒక నాటక రచయితకు కలిపి మొత్తం 24 మందికి 2016 వార్షిక అవార్డులను ప్రకటించింది.

పాపినేని శివశంకర్ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో 1953 నవంబరు 6న జన్మించారు. 1977 నుంచి తాడికొండలోని వీఎస్‌ఎస్‌బీ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు. మూడున్నర దశాబ్దాలుగా కథ, కవిత్వం, విమర్శ అనే మూడు ప్రక్రియల్లో ప్రతిభావంతమైన కృషి చేస్తున్నారు. ఆయనకు దేవరకొండ బాలగంగాధర తిలక్ అవార్డు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, డాక్టర్, అవంత్స సోమసుందర్ కవితా పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది విశిష్ట పురస్కారం లభించాయి. స్తబ్ధతా చలనం, ఒక సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం-ఒక పుష్పం, రజనీగంధ వంటివి రాసిన ప్రసిద్ధ కవితా సంపుటాలు.
ఆస్కార్ జాబితాలో ‘ఎంఎస్ ధోని’ 
క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ’ చలన చిత్రం ఆస్కార్ అవార్డు అర్హత చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.

దీంతో పాటు ఐశ్వర్యారాయ్, రణదీప్ హుడా నటించిన సరబ్‌జిత్ సినిమా కూడా ఆస్కార్ అర్హత జాబితాలో స్థానం దక్కించుకుంది.
బెంగాలీ కవి శంఖఘోష్‌కు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
ప్రసిద్ధ బెంగాలీ కవి, విమర్శకుడు శంఖఘోష్‌కు 2016 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘జ్ఞాన్‌పీఠ్’ పురస్కారం దక్కింది. ఈ అవార్డు కింద సరస్వతి దేవి కాంస్య విగ్రహంతో పాటు నగదు బహుమతి అందిస్తారు. ఈ మేరకు 52వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని జ్ఞాన్‌పీఠ్ కమిటీ డిసెంబర్ 24న ప్రకటించింది.

ఆధునిక బెంగాలీ కవి, విద్యావేత్త అయిన శంఖ ఘోష్ 1932లో జన్మించారు. ప్రయోగాత్మక కవిత్వ రూపాలతో అరుదైన శైలిలో రచనలు చేశారు. అదిమ్ లతాగుల్మోమే, ముర్ఖా బారో, సమాజిక్ నే, కబీర్ అభిప్రాయ్, ముఖ్ దేఖే జే బిగ్యాపనే, బాబరర్ ప్రార్థనా’ వంటివి ఘోష్ రచనలు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు నర్సింగ్‌దాస్ పురస్కార్, సరస్వతి సమ్మాన్, రవీంద్ర పురస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఘోష్ అందుకున్నారు. 
మేరీకోమ్‌కు ఏఐబీఏ లెజెండ్స్ అవార్డు
భారత స్టార్ బాక్సర్లు మెరీకోమ్, వికాస్ కృష్ణన్‌లకు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య అవార్డులు దక్కాయి. మేరీకోమ్‌కు ఏఐబీఏ లెజెండ్స్ పురస్కారం లభించగా, వికాస్‌కు ఏఐబీఏ ప్రో బాక్సింగ్ ఉత్తమ బాక్సర్ అవార్డు దక్కింది. డిసెంబర్ 21న స్విట్జర్లాండ్‌లోని మాంట్రిక్స్‌లో ఏఐబీఏ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.

సింధుకు బీడబ్ల్యూఎఫ్ అవార్డు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్‌లో డిసెంబర్ 13న జరిగిన ఓ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) నుంచి అత్యంత పురోగతి సాధించిన షట్లర్ పురస్కారం అందుకుంది.
యూఎన్‌హెచ్‌సీఆర్‌కిఇందిరాగాంధీ శాంతి బహుమతి 
ఇందిరాగాంధీ శాంతి బహుమతిని యునెటైడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్)కి భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ డిసెంబర్ 16న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.
స్టార్‌డస్ట్ అవార్డులు 2016
‘స్టార్‌డస్ట్ అవార్డ్స్ 2016’ లో ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్ (పింక్), ఫారుఖ్ ఖాన్ (ఫ్యాన్) ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ఐశ్వర్యరాయ్ (సరబ్‌జిత్), గ్లోబల్ ఐకాన్‌గా ప్రియాంక చోప్రా నిలిచారు. ఉత్తమ చిత్రంగా సుల్తాన్ నిలవగా, ఉడ్తా పంజాబ్ చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డుకు ఎంపికైంది.
డాక్టర్ వినోదినికి చాసో పురస్కారం
పముఖ రచయిత్రి, విమర్శకురాలు డాక్టర్ ఎం.ఎం.వినోదిని చాసో 22వ స్ఫూర్తి పురస్కారాన్ని అందుకోనుంది. గుంటూరు జిల్లాకు చెందిన వినోదిని కడప యోగి వేమన వర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2017 జనవరి 17న నిర్వహించే చాసో 102వ జయంతి వేడుకల్లో స్ఫూర్తి సాహిత్య ట్రస్ట్ ఆమెకు అవార్డును అందచేయనుంది.

సాక్షి టీవీకి ‘యునిసెఫ్’ అవార్డు
సాక్షి టెలివిజన్‌కు ప్రతిష్టాత్మక యునిసెఫ్ అవార్డు దక్కింది. ‘ఆడపిల్లలను కాపాడుకుందాం... బతుకమ్మ సాక్షిగా వారిని బతకనిద్దాం’ అనే సందేశంతో ‘సాక్షి’ టీవీలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రసారమైన కథనానికి గాను ఉత్తమ సందేశం విభాగంలో ఈ అవార్డు లభించింది. అవార్డుల కోసం పలు టీవీ చానళ్ల నుంచి 187, పత్రికల నుంచి 172 ఎంట్రీలు వచ్చాయి.


గోవా ఇఫిలో ఉత్తమ చిత్రంగా డాటర్
47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగింది. ఈ చిత్రోత్సవంలో 88 దేశాలకు చెందిన 194 చలనచిత్రాలను ప్రదర్శించారు. చలన చిత్రోత్సవం ‘ఆఫ్టర్ ఇమేజ్’ చిత్ర ప్రదర్శనతో ప్రారంభమైంది. ఈసారి కొత్తగా ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డును అందించారు. అంతర్జాతీయ పోటీ విభాగంలో ఇండియన్ పనోరమా నుంచి రెండు భారతీయ సినిమాలతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 15 సినిమాలను ప్రదర్శించారు. శాంతి, సహనం, అహింస సిద్ధాంతాలను ప్రతిబింబించిన టర్కీ చిత్రానికి ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ అవార్డును అందించారు.

అవార్డులు- విజేతలు
ఉత్తమ చిత్రం :
 డాటర్ (ఇరానీ చిత్రం, దర్శకుడు రెజా మిర్ కరీమి)
ఉత్తమ దర్శకుడు: బారిస్ కాయా, సీనెర్ (టర్కీ చిత్రం: రౌఫ్)
ఉత్తమ నటుడు: పర్హాద్ అస్లానీ (చిత్రం: డాటర్)
ఉత్తమ నటి: ఎలీనా వాస్కా (లాట్వియా చిత్రం: మెల్లోముడ్)
యునెస్కో గాంధీ అవార్డు: కోల్డ్ ఆఫ్ క్యాలండర్ (టర్కీ చిత్రం)
తొలి చిత్ర దర్శకుడి అవార్డు: పెపాసాన్ మార్టిన్ (అర్జెంటీనా చిత్రం: రారా)

హాల్‌కు అసోచామ్ కార్పొరేట్ ఎక్స్‌లెన్స్ అవార్డుహిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డును అసోచామ్ బహూకరించింది. రూ.500కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన ప్రభుత్వ రంగ అన్‌లిస్టెడ్ కంపెనీ విభాగంలో 2015-16 సంవత్సరానికి గాను హాల్‌కు ఈ అవార్డు దక్కింది.

కెహకాషన్ బసుకు అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన పదహారేళ్ల భారతీయ సంతతి బాలిక, పర్యావరణ కార్యకర్త కెహకాషన్ బసుకు అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం లభించింది. వాతావరణ సమన్యాయం, పర్యావరణ క్షీణతపై చేసిన పోరాటానికిగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ పురస్కారం కోసం 49 దేశాల నుంచి 120 నామినేషన్లు రాగా అందులో గ్రీన్‌హోప్ వ్యవస్థాపకురాలైన బసు ఎంపికైంది. నెదర్లాండ్‌‌సలోని హేగ్ పట్టణంలో బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన గ్లోబల్ చిల్డ్రన్‌‌స ఎయిడ్ గ్రూప్ 2005 నుంచి ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

లీలాధర్‌కు గంగాధర్ నేషనల్ అవార్డుప్రముఖ హిందీ కవి లీలాధర్ జాగూరి 2016కు గాను ప్రతిష్టాత్మక గంగాధర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు కింద రూ.50,000 నగదు పురస్కారంతో పాటు మెమెంటో అందచేస్తారు. ఉత్తరాఖండ్‌కు చెందిన లీలాధర్ జాగూరి తన రచనలకుగాను ఇప్పటికే పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ, రఘువీర్ సహాయ్ సమ్మాన్, శతదళ్ వంటి పురస్కారాలు అందుకున్నారు.

భారతీయ భాషలపై అనేక పరిశోధనలు చేసి, వాటికి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఒడిశా కవి గంగాధర్ మెహర్ స్మారకార్థం 1989 నుంచి ఈ అవార్డును అందజేస్తున్నారు.

No comments:

Post a Comment