AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు జనవరి 2015

క్రీడలు జనవరి 2015
పతక విజేతలకు పెరిగిన నగదు బహుమతి
ఒలింపిక్, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకానికి ఇచ్చే రూ. 50 లక్షలను రూ. 75 లక్షలకు పెంచారు. రజతానికి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షలకు, కాంస్య పతకానికి రూ. 20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఆసియా, కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి స్వర్ణ పతకానికి రూ.30 లక్షలు, రజతానికి రూ.20 లక్షలు, కాంస్య పతకానికి రూ.10 లక్షలు అందజేస్తారు. గతంలో ఇవి వరుసగా రూ. 20 లక్షలు, రూ.10 లక్షలు, రూ. ఆరు లక్షలుగా ఉండేవి. 2016లో రియోడి జెనీరోలో ఒలింపిక్స్ జరగనున్నాయి.
భారత్‌లో 2016-టీ 20 ప్రపంచకప్
క్రికెట్ టీ 20 ప్రపంచకప్-2016 భారత్‌లో జరగనుంది. దుబాయ్‌లో జనవరి 29న జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. 2016లో మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి.
ప్రపంచకప్‌కు భారత మేనేజర్‌గా అయూబ్
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌కు వెంటనే మరో అరుదైన అవకాశం లభించింది. వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుకు అయూబ్ మేనేజర్‌గా ఎంపికయ్యారు.
భారత హాకీ జట్టు కోచ్‌గా పాల్ వాన్ యాస్
భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా నెదర్లాండ్స్ మాజీ కోచ్ పాల్ వాన్ యాస్‌ను... మహిళల టీమ్‌కు ఆంథోని థోర్న్‌టన్ (న్యూజిలాండ్)ను ఎంపిక చేశారు. టెర్రీ వాల్ష్, నీల్ హావ్‌గుడ్ స్థానంలో ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకుంటారు. మూడేళ్ల పాటు (2018) ఈ ఇద్దరు కాంట్రాక్ట్‌లో ఉండనున్నారు.
ఆసియా కప్ విజేత ఆస్ట్రేలియా
తొలిసారి ఫుట్‌బాల్ ఆసియా కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. జనవరి 31న జరిగిన ఫైనల్లో కొరియాపై విజయం సాధించింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు
పురుషుల సింగిల్స్:ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 1న జరిగిన ఫైనల్లో జొకోవిచ్ ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ రికార్డు సాధించాడు. మొత్తంమీద జొకోవిచ్ కెరీర్‌లో ఇది ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్.పురుషుల డబుల్స్: సిమోన్ బొలెలీ-ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) జంట విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్:అమెరికా టెన్నిస్ క్రీడాకారిని సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ మరియా షరపోవా (రష్యా)పై విజయం సాధించింది. 33 ఏళ్ల సెరెనాకిది ఆరో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్.మహిళల డబుల్స్:బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్) జంట విజయం సాధించింది.మిక్స్‌డ్ డబుల్స్:లియాండర్ పేస్(భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం.. డిఫెండింగ్ చాంపియన్ జంట డానియల్ నెస్టర్(కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించింది.
తిరువనంతపురంలో 35వ జాతీయ క్రీడలు
35వ జాతీయ క్రీడలు కేరళలోని తిరువనంతపురంలో జనవరి 31న ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ క్రీడల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 10 వేల మంది పాల్గొంటున్నారు. ఈ జాతీయ క్రీడల అధికారిక మస్కట్ ది గ్రేట్ ఇండియన్ హార్న్‌బిల్.

సింగిల్స్ చాంప్స్‌గా సైనా, కశ్యప్
సయ్యద్ మోదీ స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. జనవరి 25న లక్నోలో జరిగిన ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)పై విజయం సాధించింది. 2009, 2014లోనూ సైనాకు ఈ టైటిల్ లభించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ కిడాంబి శ్రీకాంత్‌పై గెలిచాడు. 2012లోనూ కశ్యప్ ఈ టైటిల్ నెగ్గాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన డివిలియర్స్
 దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. జొహన్నెస్‌బర్గ్‌లో జనవరి 18న వెస్టిండీస్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో వన్డేలో డివిలియర్స్ 31 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఈ వన్డేలో మొత్తం 44 బంతుల్లో 149 పరుగులు చేశాడు. గతంలో న్యూజిలాండ్ క్రికెటర్ కోరె అండర్సన్ వెస్టిండీస్‌పై 36 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు ఉంది.
పంకజ్‌కు జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్
జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌ను పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. జనవరి 17న కోల్‌కతాలోని బెంగాల్ రోయింగ్ క్లబ్‌లో జరిగిన ఫైనల్లో ధ్రువ్ సిత్వాలాను అద్వానీ ఓడించాడు. ఇది పంకజ్‌కు ఏడో జాతీయ బిలియర్డ్స్ టైటిల్.
అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, మాడ్రిడ్ క్లబ్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా నిలిచి 2014 బలాన్ డియోర్ అవార్డుకు ఎంపికయ్యాడు.
సానియా జోడీకి ఏపియా ఇంటర్నేషనల్ డబుల్స్ టైటిల్
ఏపియా ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను సానియా జోడీ గెలుచుకుంది. జనవరి 16న సిడ్నీలో జరిగిన ఫైనల్లో అబిగైల్ స్పియర్స్-రకెల్ కోప్స్ జోన్స్ జోడీపై సానియామీర్జా, అమెరికాకు చెందిన బెథానీ మాటెక్ జోడీ విజయం సాధించింది. సానియా కెరీర్‌లో ఇది 23వ టైటిల్. 
సౌమ్యజిత్, మౌమాదాస్‌లకు జాతీయ టేబుల్ టెన్నిస్ టైటిళ్లు
జాతీయ టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌమ్యజిత్ ఘోష్ గెలుచుకున్నాడు. పుదుచ్చేరిలో జనవరి 17న జరిగిన ఫైనల్లో జి.సాథియన్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మౌమాదాస్ గెలుచుకుంది.
చరిత్ర సృష్టించిన సంధూ
ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ భారత ఫుట్‌బాల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. 79 ఏళ్ల తర్వాత తొలి అంచె యూరోపియన్ క్లబ్‌లో ఆడిన భారత ఆటగాడిగా తను రికార్డులకెక్కాడు. 2014 ఆగస్టులో సంధూ.. నార్వేయన్ టిప్పెలిగేన్ క్లబ్‌లో ఆడే స్టాబేక్ ఎఫ్‌సీ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత శనివారం ఫోలో ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 ఏళ్ల సంధూ తొలిసారిగా బరిలోకి దిగాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో తేడాతో గెలుచుకుని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. సిడ్నీలో జనవరి 10న ముగిసిన చివరి టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఎంపికయ్యాడు.
ఫెడరర్ 1000వ విజయం
స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్ బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు. జనవరి 11న బ్రిస్బేన్‌లో జరిగిన ఫైనల్లో మిలోస్ రావ్‌నిక్ (కెనడా) పై గెలిచాడు. ఈ గెలుపుతో 33 ఏళ్ల ఫెడరర్ ఓపెన్ శకంలో (1968 తర్వాత) 1000 విజయాలు సాధించిన మూడో క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (1,253), ఇవాన్ లెండిల్ (1,071) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 1998లో టులూజ్ ఓపెన్‌లో గిలెమ్ రవూక్స్ (ఫ్రాన్స్)పై నెగ్గి ఫెడరర్ తొలి విజయాన్ని సాధించాడు. కెరీర్‌లో 125 ఏటీపీ టోర్నీ ఫైనల్లో పాల్గొన్న ఫెడరర్‌కు ఓవరాల్‌గా ఇది 83వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. 2001 నుంచి ప్రతి ఏడాది ఫెడరర్ ఒక్క టైటిలైనా గెలుస్తూ వస్తున్నాడు. కాగా బ్రిస్బేన్ టోర్నమెంట్ మహిళల టైటిల్‌ను మరియా షరపోవా (రష్యా) గెలుచుకుంది.
చెన్నై ఓపెన్ టెన్నిస్
స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రింకా చెన్నై ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) జోడీ గెలుచుకుంది.

సంగక్కర ఖాతాలో 12 వేల పరుగులు
శ్రీలంక క్రికెటర్ కుమార్ సంగక్కర టెస్టు కెరీర్‌లో 12 వేల పరుగులు పూర్తిచేసుకున్న ఐదో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్‌లో జనవరి 3న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని స్క్వేర్ దిశగా మళ్లించి రెండు పరుగులు తీయడం ద్వారా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గతంలో ఈ రికార్డు సాధించిన వారిలో సచిన్ టెండూల్కర్ (15,921), రికీ పాంటింగ్ (13,378), జాక్వెస్ కలిస్ (13,289), రాహుల్ ద్రావిడ్ (13,288) ఉన్నారు.

భారత్‌కు 14 పతకాలుఆసియా యూత్, జూనియర్ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 14 పతకాలు సాధించింది. భారత్ నుంచి మొత్తం 20 మంది బరిలోకి దిగగా... 14 మంది పతకాలు నెగ్గారు. మిగతా ఆరుగురు టాప్-6లో నిలిచారు.

No comments:

Post a Comment