AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు జూన్ 2014

అవార్డులు జూన్ 2014
ప్రభుత్వ మొబైల్ సేవా కార్యక్రమానికి యూఎన్ అవార్డు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ చేపట్టిన మొబైల్ సేవా అప్లికేషన్‌కు ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ అవార్డు లభించింది. 2014 పౌరసేవల పురస్కారాల్లో రెండో శ్రేణి విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఈ కార్యక్రమం కింద ప్రజాసేవలను మొబైల్‌ఫోన్ల ద్వారా ఈ సేవల రూపంలో అందిస్తున్నారు. భారత్‌తో పాటు బహ్రెయిన్, బ్రెజిల్, కామెరూన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్పెయిన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. 
భారత సంతతి మహిళకు అంతర్జాతీయ రేడియో అవార్డు
భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా మహిళ మన్‌ప్రీత్ కౌర్‌సింగ్‌కు అంతర్జాతీయ రేడియో అవార్డు లభించింది. కుటుంబ, గృహహింసపై తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని భారత సంతతి కుటుంబాల్లో గృహహింస, కుటుంబ సమస్యలపై ది ఎనిమీ వితిన్ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీని నిర్మించారు. మన్‌ప్రీత్ ప్రస్తుతం ఎస్‌బీఎస్ పంజాబీ రేడియో చానల్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 
సుదర్శన్ పట్నాయక్‌కు పీపుల్స్ ఛాయిస్ పతకం
భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు 2014 సంవత్సరానికి పీపుల్స్ ఛాయిస్ పతకం లభించింది. అమెరికాలోని అట్లాంటాలో జూన్ 27న జరిగిన ప్రపంచ సైకత శిల్ప పోటీల్లో ఆయన ఇసుకతో రూపొందించిన వృక్ష సంరక్షణ-భవిష్యత్ పరిరక్షణ అనే శిల్పానికి ఈ బహుమతి లభించింది.

నార్వే మాజీ ప్రధానికి ఆసియా నోబెల్
నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లేమ్ బ్రంట్ ల్యాండ్‌కు ఆసి యా నోబెల్‌గా పేర్కొనే తాంగ్ ప్రైజ్ లభించింది. సుస్థిర అభివృద్ధి-అమలు, నాయకత్వం, నవకల్పనలకు గాను అవార్డుల కమిటీ ఆమెను ఎంపిక చేసింది. బ్రంట్‌లాండ్ గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి ప్రపంచ కమిషన్ అధిపతిగా పనిచేశారు. పారితోషికంలో నోబెల్ కంటే విలువైన తాంగ్ తొలి బహుమతిని బ్రంట్ ల్యాండ్‌కు ప్రకటించారు. ఈ బహుమతి మొత్తం విలువ రూ. 10 కోట్లు. తాంగ్ ప్రైజ్ వ్యవస్థాపకుడు తైవాన్ దేశానికి చెందిన డాక్టర్ శామ్యూల్ ఇన్. రెండేళ్లకు ఓసారి ఈ అవార్డును ప్రకటిస్తారు. 

మురళీమనోహర్‌జోషికి రష్యా పురస్కారంభారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి రష్యా అత్యున్నత పౌర పురస్కారంగా పిలిచే ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్‌ను అందుకున్నారు. ఈ పురస్కారాన్ని రష్యా విదేశీయులకు అందిస్తోంది. భారత్‌లో జూన్ 18,19 తేదీల్లో పర్యటించిన రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్ అవార్డును జోషీకి అందజేశారు. 

భారత శాస్త్రవేత్తకు ప్రపంచ ఆహార పురస్కారంభారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సంజయ రాజారామ్ అనే వృక్షశాస్త్రవేత్త ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆహార పురస్కారం -2014కు ఎంపికయ్యారు. రాజారామ్ గోధుమ రకాలను సంకరీకరణం చేసి, విశిష్ట జన్యు లక్షణాలు గల అధిక ఉత్పత్తినిచ్చే గోధుమలను సృష్టించారు. ఆయన అభివృద్ధి చేసిన 480 గోధుమ రకాలను 51 దే శాల్లో విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో పుట్టిన రాజారామ్ మెక్సికోలో స్థిరపడ్డారు. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్‌తో కలిసి ఆయన పనిచేశారు. ప్రపంచ ఆహార పురస్కారాన్ని 1986లో నార్మన్‌బోర్లాగ్ నెలకొల్పారు. ఈ అవార్డును రాజారామ్ అక్టోబర్‌లో అందుకోనున్నారు. 

హిందీ కవి కేదార్‌నాథ్‌కు జ్ఞాన్‌పీఠ్2013 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారం (49వది) ప్రముఖ హిందీకవి కేదార్‌నాథ్ సింగ్‌కు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో జన్మించిన 80 ఏళ్ల కేదార్‌నాథ్ కవిత లతోపాటు పలు వ్యాసాలు, కథలు రాశారు. అభీ బిల్‌కుల్ అభీ, యహ సే దేఖో రచనలు ఆయనకు పేరు తెచ్చిపెట్టారు. ఈ అవార్డుకు ఎంపికైన హిందీ రచయితల్లో కేదార్‌నాథ్ పదో వ్యక్తి. అవార్డు కింద రూ. 11 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు. 1965 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 2012 సంవత్సరానికి రావూరి భరద్వాజకు ఈ పురస్కారం లభించింది. 

సల్మాన్ రష్దీకి పెన్‌పింటర్ ప్రైజ్భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన పెన్ పింటర్ ప్రైజ్ కు ఎంపికయ్యారు. సాహిత్యసేవ, భావ ప్రకటనకు ఇచ్చిన మద్దతుకుగాను ఈ బహుమతి లభించింది. ఈ మేరకు అవార్డులను ప్రదానం చేసే రైటర్ చారిటీ ఇంగ్లిష్ పెన్ అనే సంస్థ జూన్ 20న లండన్‌లో ప్రకటించింది. ఈ బహుమతిని 2009లో నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత హెరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం నెలకొల్పారు.

No comments:

Post a Comment