AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2013

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2013
నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడెరిక్ సాంజెర్ మృతి
రసాయన శాస్త్రవేత్త, రెండుసార్లు నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడెరిక్ సాంజెర్ (95) లండన్‌లో నవంబర్ 19న మరణించారు. జీనోమిక్స్ పితామహుడిగా పిలిచే ఫ్రెడెరిక్ సాంజెర్‌కు రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ బహుమతి లభించింది. 1958లో ప్రొటీన్ నిర్మాణ క్రమం, 1980లో న్యూక్లియిక్ యాసిడ్‌లపై చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి దక్కింది. రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన ఒకే ఒక శాస్త్రవేత్త సాంజెర్.

చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు సీఎన్‌ఆర్ రావు ఎన్నిక
చైనాకు చెందిన ప్రతిష్టాత్మక చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (సీఏఎస్)లో గౌరవ విదేశీ సభ్యుడిగా ఇటీవల భారతరత్న పురస్కారం పొందిన సీఎన్‌ఆర్ రావు ఎంపికయ్యారు. సీఏఎస్‌లో సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు సీఎన్‌ఆర్ రావు. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి విజేతలు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే రావుకు లండన్‌లోని రాయల్ సొసైటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ (అమెరికా)లతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక అకాడమీల్లో సభ్యత్వం ఉంది. 

మాల్దీవుల అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ ఎన్నిక
మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఆర్థికవేత్త అబ్దుల్లా యమీన్ గయూం(54) నవంబర్ 17న ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మహ్మద్ మౌమూన్ జమీల్ ప్రమాణం చేశారు. నవంబర్ 16న జరిగిన రన్ ఆఫ్ రౌండ్ పోలింగ్‌లో అబ్దుల్లా ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థిగా పోటీచేసి 51.39 శాతం ఓట్లు సాధించారు. మాజీ అధ్యక్షుడు మాల్దీవ్స్ డెమోక్రటిక్ అభ్యర్థి మహ్మద్ నషీద్‌కు 48.61 శాతం ఓట్లు లభించాయి. దాదాపు మూడు దశాబ్దాలపాటు మాల్దీవులను పాలించిన మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ సవతి సోదరుడు యమీన్.
ప్రముఖ రచయిత్రి డోరిస్ లెస్సింగ్ మృతి
నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ రచయిత్రి డోరిస్ లెస్సింగ్ (94) లండన్‌లో నవంబర్ 16న మరణించారు. ఆమెకు 2007లో సాహిత్యంలో నోబెల్ ప్రై జ్ దక్కింది. ఆమె ‘ది గోల్డెన్ నోట్‌బుక్’తోపాటు అనేక నవలలు, నాటకాలు రాశారు. 55 పుస్తకాలు ప్రచురించారు.
ప్రముఖ హిందీ రచయిత దేవ్‌సారే మృతి
ప్రముఖ హిందీ రచయిత హరికష్ణ దేవ్‌సారే (75) ఘజియాబాద్‌లో నవంబర్ 14న మరణించారు. పిల్లల సాహిత్యంలో ఆయన రచనలు బాగా పేరొందాయి. ఆయన 300 కు పైగా పుస్తకాలు రాశారు. హిందీ అకాడెమీ అందించే సాహిత్యకార్ సమ్మాన్‌తోపాటు అనేక పురస్కారాలను అందుకున్నారు.

తజికిస్థాన్ అధ్యక్షుడిగా ఇమోమలి రఖ్మాన్ ఎన్నిక
తజికిస్థాన్ అధ్యక్షుడిగా ఇమోమలి రఖ్మాన్ నవంబర్ 13న తిరిగి ఎన్నికయ్యారు. దీంతో 20 ఏళ్లుగా పాలిస్తున్న ఆయన మరో ఏడేళ్లపాటు అధికారంలో కొనసాగుతారు. రఖ్మాన్ 1992 నుంచి తజికిస్థాన్‌ను పరిపాలిస్తున్నారు. 4 మిలియన్ల ఓట్లలో ఆయనకు 83.1 శాతం ఓట్లు దక్కాయి. ఎన్నికల ప్రచారంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ప్రధాన ప్రతిపక్షం ఇస్లామిక్ రివైనల్ పార్టీ ఆఫ్ తజికిస్థాన్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి.
విశ్వసుందరిగా మారియా గాబ్రియెలా ఇస్లర్
మిస్ యూనివ ర్స్ కిరీటాన్ని వెనిజువెలా సుందరి మారియా గాబ్రియెలా ఇస్లర్(25) దక్కించుకుంది. నవంబర్ 9న రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఫైనల్‌లో మొత్తం 85 మంది పాల్గొన్నారు. 2, 3 స్థానాల్లో మిస్ స్పెయిన్ పాట్రిసియా, మిస్ ఈక్వెడార్ కాన్‌స్టాంజా నిలిచారు. టీవీ యాంకర్‌గా పనిచేస్తున్న మారియా.. స్పెయిన్ జానపద నృత్యం ఫ్లమెంకోలో దిట్ట. మన దేశానికి చెందిన మానసి మోగే టాప్-10లో ప్రవేశించినా.. టాప్-5లోకి చేరలేకపోయింది. భారత్ నుంచి చివరిసారిగా 2000లో లారాదత్తా మిస్ యూనివర్స్‌గా ఎంపికైంది.
ఆహార పుస్తక రచయిత్రి తర్లా దలాల్ మృతి
ప్రముఖ ఆహార పుస్తక రచయిత్రి, పాక శాస్త్ర ప్రవీణురాలు తర్లా దలాల్ (77) నవంబర్ 6న ముంబైలో మరణించారు. ఆమె భారత తొలి మాస్టర్ చెఫ్‌గా గుర్తింపు పొందారు. వంటలపై 100 కు పైగా పుస్తకాలు రాశారు. 2007లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.
వ్యాపార రంగంలో శక్తిమంతమైన మహిళ చందా కొచర్
భారత వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మ, క్యాప్‌జెమిని ఇండియా సీఈవో అరుణ జయంతి తర్వాత స్థానాల్లో నిలిచారు. 2013 సంవత్సరానికి సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. 
ఎల్‌ఐసీ ఎండీగా ఉషా సంగ్వాన్
దేశీయ అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కి మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉషా సంగ్వాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

పాక్ జానపద గాయని రేష్మా మృతి

పాకిస్థాన్ జానపద గాయని రేష్మా (66) లాహోర్‌లో నవంబర్ 3న మరణించారు. ఆమె 12 ఏళ్ల వయసులో పాడిన ‘లాల్ మేరీ’ పాటతో గుర్తింపు పొందారు. ఆమె పాక్, భారత్ సినిమాల్లో అనేక పాటలు పాడారు. సుభాష్ ఘాయ్ ‘హీరో’ సినిమాలో పాడిన ‘లంబీ జుదాయీ’ బాగా ప్రాచుర్యం పొందింది.

పాక్ తాలిబన్ అధినేత హకీముల్లా మృతిపాకిస్థాన్ తాలిబన్ అధినేత హకీముల్లా మెహసూద్ అమెరికా ద్రోణ్ విమానదాడిలో మరణించాడు. ఈ దాడి నవంబర్ 1న ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతం లో జరిగింది. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టి.టి.పి)కి హకీముల్లా నేతత్వం వహిస్తున్నాడు. ఆయనకు ముందు అధిపతిగా ఉన్న బైతుల్లా కూడా ద్రోణ్ దాడిలోనే మరణించాడు. హకీముల్లా తలపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది.

ఐటీబీపీ అధిపతిగా సుభాష్ గోస్వామి
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డెరైక్టర్ జనరల్‌గా 1977 బ్యాచ్‌కు చెందిన అస్సోం-మణిపూర్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సుభాష్ గోస్వామి నవంబర్ 2న నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా ఉన్నారు. ఆయన డిసెంబర్ 31, 2014 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. చైనాతో ఉన్న 4058 కి.మీ సరిహద్దు వద్ద భద్రత కల్పించే ప్రత్యేక పారామిలిటరీ దళం ఐటీబీపీ.

వైమానిక దళం కొత్త అధిపతిగా అరూప్ రాహా
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ అరూప్ రాహా అక్టోబర్ 29న నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్‌చీఫ్ మార్షల్ ఎన్‌ఏకే బ్రౌనీ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టే అరూప్ రాహా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం రాహా ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు.

No comments:

Post a Comment