AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు మార్చి 2015

వార్తల్లో వ్యక్తులు మార్చి 2015
అఖిల్ శర్మకు బ్రిటీష్ ఫోలియో ప్రైజ్
భారత-అమెరికన్ నవలాకారుడు అఖిల్ శర్మకు 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక బ్రిటీష్ సాహిత్య అవార్డు ఫోలియో ప్రైజ్ లభించింది. 2014 సంవత్సరంలో వెలువడిన ఆయన నవల ‘ఫ్యామిలీ లైఫ్’కు ఈ బహుమతి దక్కింది. ఢిల్లీకి చెందిన శర్మ(42) ఓ పేద కుర్రాడి జీవితాన్ని కథా వస్తువుగా తీసుకొని తన స్వీయ అనుభవంలోని సంఘటనలను జోడించి ఈ నవలను రాశారు. ఫోలియో ప్రైజ్‌ను 2014లో తొలిసారి ప్రదానం చేశారు. 
విదేశాంగ శాఖ జేఎస్ వికాస్ స్వరూప్
విదేశాంగ శాఖలో అధికార ప్రతినిధిగా(జాయింట్ సెక్రెటరీ)గా వికాస్ స్వరూప్‌ను కేంద్రం మార్చి 25న నియమించింది. సయిద్ అక్బరుద్దీన్ స్థానంలో వికాస్ స్వరూప్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం యు.ఎన్ ప్రధాన కేంద్రంలో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. 
మిస్ ఇండియా వరల్డ్‌గా అదితి ఆర్య
చండీగఢ్‌కు చెందిన అదితి ఆర్య ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2015గా ఎంపికయ్యారు. మిస్ ఇండియా వరల్డ్‌గా నిలిచిన అదితి ఆర్య మిస్ వరల్డ్ కిరీటం కోసం జరిగే పోటీల్లో పాల్గొంటారు. 
దేశం విడిచి వెళ్లిపోయిన యెమన్ అధ్యక్షుడు
అధ్యక్ష భవనంపై తిరుగుబాటు దళాలు దాడి చేయ డంతో యెమన్ అధ్యక్షుడు అబెద్ రబ్బో మన్సౌర్ హాది మార్చి 25న సురక్షిత ప్రాంతానికి పారిపోయారు. షియా వర్గానికి చెందిన హుతి తిరుగుబాటుదారులు అడెన్‌లోని హాదీ నివాసభవనంపై క్షిపణి దాడులు జరిపారు. యెమన్ రక్షణ మంత్రి మహుద్ అల్ సుబైహిని బందీగా చేసుకున్నట్లు తిరుగుబాటుదారులు ప్రకటించారు. దేశంలో పరిస్థితి మరింత దిగజారక ముందే యెమన్‌ను కాపాడే బాధ్యత తీసుకోవాలని హాదీ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని కోరారు.

మాధవ్ గాడ్గిల్‌కు టైలర్ పురస్కారం
ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ 2015 సంవత్సరానికి పర్యావరణ విజయానికిచ్చే టైలర్ అవార్డుకు ఎంపికయ్యారు. గాడ్గిల్ పశ్చిమ కనుమల ఎకాలజీ ఎక్స్‌పర్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని సథరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ సహాయంతో టైలర్ ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 1973లో ఈ అవార్డును ఏర్పాటు చేసింది. గాడ్గిల్‌తో పాటు ఈ అవార్డుకు అమెరికన్ మెరైన్ ఎకాలజిస్టు జేన్ లుబ్‌చెంకో కూడా ఎంపికయ్యారు. వీరిద్దరికి రెండు లక్షల డాలర్ల నగదు బహుమతిని సమానంగా అందజేస్తారు.
బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షునిగా వెంకట్రామన్ రామకృష్ణన్
బ్రిటన్‌లోని ప్రముఖ సంస్థ రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ ఎన్నికయ్యారు. దీనికోసం జరిగిన ఎన్నికల ఫలితాలను మార్చి మూడో వారంలో ప్రకటించారు. రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వెంకట్రామన్ గుర్తింపు సాధించారు. 1660లో స్థాపించిన రాయల్ సొసైటీ అధ్యక్షుడు బ్రిటన్ ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరిస్తారు. రామకృష్ణన్ 2009లో మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.
సింగపూర్ జాతిపిత లీ క్వాన్ యూ మృతి
సింగపూర్ జాతిపిత, తొలి ప్రధాని లీ క్వాన్ యూ (91) సింగపూర్‌లో మార్చి 23న మరణించారు. మలేసియా నుంచి సింగపూర్ విడిపోవడంలో ప్రధానపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత సింగపూర్‌ను ప్రపంచస్థాయి వాణిజ్య, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు లీ క్వాన్ ఎంతో కృషిచేశారు. లీ 31 ఏళ్ల పాటు 1959 నుంచి 1990లో పదవి నుంచి వైదొలగే వరకు ప్రధానిగా పనిచేశారు. లీ కుమారుడు లూంగ్ సింగపూర్ ప్రధానిగా ఉన్నారు.
శ్రీలంక మాజీ సైన్యాధిపతి శరత్ ఫోన్సెకాకు ఫీల్డ్ మార్షల్ హోదా
శ్రీలంక అత్యున్నత సైనిక హోదా ఫీల్డ్ మార్షల్‌ను ఆ దేశ మాజీ సైన్యాధిపతి శరత్ ఫోన్సెకాకు మార్చి 22న కొలంబోలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనా ప్రదానం చేశారు. ఆయన ఈ హోదాను పొందిన తొలి శ్రీలంక జాతీయుడు. ఉగ్రవాదంపై సాధించిన విజయానికి ఆయనకు ఈ హోదా దక్కింది. 2009లో తమిళ టైగర్స్‌పై విజయం సాధించే దిశగా ఆయన సైన్యాన్ని నడిపారు. ఆయన్ను 2010లో అప్పటి ప్రభుత్వం రాజద్రోహం కింద జైలుకు పంపింది. ఆయన రెండేళ్లు జైలు జీవితం గడిపారు. అంతర్జాతీయ ఒత్తిడితో 2012లో విడుదలయ్యారు. జైలుశిక్ష వల్ల ఏడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత కోల్పోయారు.
అమెరికా విద్యామండలి అధిపతిగా భారతీయ మహిళ
అమెరికా విద్యా మండలి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల చైర్‌పర్సన్‌గా భారతీయ అమెరికన్ మహిళ రేణూ కట్టర్ ఎన్నికయ్యారు. మార్చి 16న వాషింగ్టన్‌లో జరిగిన విద్యామండలి 97వ వార్షిక సమావేశంలో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రేణూ 2008 నుంచి యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
నాణేల అధ్యయన సమితి అధ్యక్షునిగా రాజారెడ్డి
ప్రఖ్యాత న్యూరో సర్జన్, నాణేల అధ్యయన నిపుణులు డాక్టర్ దేమె రాజారెడ్డి భారత నాణేల అధ్యయన సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మార్చి 13న వారణాసిలో జరిగిన సొసైటీ కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్టు ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జయప్రకాశ్ సింగ్తెలిపారు. ఈ సంవత్సరాంతంలో జరిగే సొసైటీ సమావేశాలకు రాజారెడ్డి అధ్యక్షతవహిస్తారు. న్యూరో సర్జరీ, ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ కృషిలతో పాటు పురాతన నాణేల విశ్లేషణకువిశేష సేవలు అందించారు. నాణేల గొప్పతనం, చరిత్రలో వాటికి ఉన్న ప్రాధాన్యంపై పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆంధ్ర జనపదానికి చెందిన దాదాపు 70 వేల నాణేలను అధ్యయనం చేశారు. తెలుగు ప్రాంతంలో తవ్వకాల్లో బయటపడిన దాదాపు 4 లక్షల నాణేలు విశ్లేషణకు నోచుకోకుండా పడి ఉన్నాయని, వాటి మీద ప్రభుత్వం, పరిశోధకులు దృష్టి సారించాలని రాజారెడ్డి ఆకాంక్షిస్తున్నారు. 
‘కాయకల్ప కౌన్సిల్’ అధినేతగా రతన్ టాటా
భారతీయ రైల్వే వ్యవస్థను లాభాల బాట పట్టించేందుకు ఉద్దేశించిన కాయకల్ప కౌన్సిల్‌కు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా నేతృత్వం వహించనున్నారు. రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తన రైల్వే బడ్జెట్ ప్రసంగంలో కాయకల్ప కౌన్సిల్ ఏర్పాటు గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మండలి రైల్వేశాఖకు అవసరమైన సలహాలు అందిస్తుంది. లాభాల ఆర్జనకు చర్యలను సూచిస్తుంది. రతన్‌టాటాతోపాటు రైల్వే సంఘాల నాయకులు కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు.
గ్లోబల్ సర్వేలో మోదీ నంబర్ 1
దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిర్వహణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వల్ప తేడాతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. 

చైనాకు చెందిన సంస్థ చేసిన నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే-2014లో ఈ మేరకు వెల్లడైంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, భారత్, రష్యా, బ్రెజిల్, చైనాలలో 4500 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే చేశారు. ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. మొత్తం 5 పాయింట్లకు గాను మోదీ 3.74 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలవగా, జిన్‌పింగ్ 3.58 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. తొమ్మిది దేశాలలోని ప్రఖ్యాత నాయకులలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలవగా, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, జిన్‌పింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


కవి, శతావధాని రాళ్లబండి కవితాప్రసాద్ మృతి
ప్రముఖ కవి, శతావధాని రాళ్లబండి కవితా ప్రసాద్ (55) అనారోగ్యంతో హైదరాబాద్‌లో మార్చి 15న మరణించారు. సాంఘిక సంక్షేమ శాఖలో జాయింట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న కవితా ప్రసాద్ అసలు పేరు వేంకటేశ్వర ప్రసాదరాజు. ఆయన సుమారు 500 అవధానాలు చేశారు. అందులో అనేక ప్రయోగాలు చేశారు. అష్టావధానాలు, శతావధానాలు, ద్విశతావధానాలు వంటి అనేక ప్రక్రియలు నిర్వహించారు. అవధానంలో కథా, వచనాకవిత, గణితం వంటి అనేక నూతన ప్రక్రియలను చొప్పించారు. ఆయన వచన కవిత్వంలో అగ్నిహంస, ఒంటరి పూలబుట్ట, దోసిట్లో భూమండలం వంటి రచనలు చేశారు.

కేంద్రమంత్రి దాన్వే రాజీనామా
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దాదారావు దాన్వే మార్చి5న పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న దాన్వే ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ నియమావళికి అనుగుణంగా పదవి నుంచి తప్పుకున్నారు.

అమెరికాలో భారత రాయబారిగా అరుణ్‌సింగ్
 
అమెరికాలో భారత రాయబారిగా అరుణ్‌కుమార్ సింగ్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మార్చి 8న నియమించింది. 1979 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఫ్రాన్‌‌సలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. 2015 జనవరిలో ఎస్.జయశంకర్ విదేశాంగ కార్యదర్శిగా నియమితులవడంతో ఈ స్థానానికి అరుణ్ సింగ్‌ను ఎంపిక చేశారు.

జర్నలిస్టు వినోద్ మెహతా మృతి
 
ప్రముఖ జర్నలిస్టు, రచయిత వినోద్ మెహతా (73) అనారోగ్యంతో న్యూఢిల్లీలో మార్చి 8న మరణించారు. ఔట్‌లుక్ మేగజీన్ వ్యవస్థాపక సంపాదకుడైన మెహతా సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పయనీర్ లాంటి పత్రిక, మేగజీన్లను నడిపారు. 1995లో ప్రారంభించిన ఔట్‌లుక్ మేగజీన్‌కు 17 ఏళ్లపాటు ప్రధాన సంపాదకుడుగా పనిచేసి 2012లో రిటైరయ్యారు. లక్నోబాయ్ పేరుతో 2011లో స్వీయ చరిత్రను ప్రచురించారు.

భారత బిలియనీర్లలో ముకేశ్ అంబానీ టాప్భారత బిలియనీర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ 8వ సారి అగ్రస్థానంలో నిలిచారు. 21 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ ప్రపంచ జాబితాలో ముకేశ్ 39వ స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ శాంఘ్వీ 20 బిలియన్ డాలర్లతో 44వ స్థానంలో ఉన్నారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ 19 బిలియన్ డాలర్లతో 48వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 79.2 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 16వ సారి అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఈయన తర్వాతి స్థానంలో 77.1 బిలియన్ డాలర్లతో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ రెండో స్థానంలో, 72.7 బిలియన్ డాలర్లతో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు.

No comments:

Post a Comment