AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జూలై 2016

వార్తల్లో వ్యక్తులు జూలై 2016
ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి కన్నుమూత
ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతా దేవి(91) జూలై 28న మరణించారు. ఆమె తన రచనల ద్వారా అణచివేత, అన్యాయాలను ఎదిరిస్తూ బెంగాలీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. గిరిజన, పేద ప్రజల అభివృద్ధి కోసం సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ విభూషణ్, రామన్ మెగసెసె, జ్ఞాన్‌పీఠ్ అవార్డులను అందుకున్నారు.
తపాలా శాఖ డీజీగా బీవీ సుధాకర్‌రావు
భారత తపాలా శాఖ నూతన డెరైక్టర్ జనరల్‌గా ఏపీకి చెందిన బీవీ సుధాకర్‌రావు జూలై 29న బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన 1981లో ఇండియన్ పోస్టల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 
టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్‌గా అనురాగ్ ఠాకూర్
భారతీయ జనతా పార్టీ ఎంపీ, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ జూలై 29న టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్‌గా చేరారు. భారత సైన్యాధిపతి జనరల్ దల్బీర్‌సింగ్ ద్వారా టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ బాధ్యతలను చేపట్టారు. 
కేంద్ర జ్యుడీషియల్ అకాడమీ డెరైక్టర్‌గా జస్టిస్ రఘురామ్
కేంద్ర జ్యుడీషియల్ అకాడమీ డెరైక్టర్‌గా జస్టిస్ జి.రఘురామ్‌ను నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ జూలై 30న ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు.

హాకీ ఆటగాడు మొహమ్మద్ షాహిద్ మృతి
దిగ్గజ హాకీ ఆటగాడు మొహమ్మద్ షాహిద్ న్యూఢిల్లీలో జూలై 20న అనారోగ్యంతో మరణించారు. 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో షాహిద్ కీలక ఆటగాడుగా ఉన్నాడు. ఆయన 1981లో అర్జున, 1986లో పద్మశ్రీ అవార్డులు పొందారు.
చిత్రకారుడు ఎన్.హెచ్ రాజా మృతి
ప్రఖ్యాత చిత్రకారుడు సయీద్ హైదర్ రాజా (94) అనారోగ్యంతో న్యూఢిల్లీలో జూలై 23 మరణించారు. ఆయనకు బిందు, పురుష-ప్రకృతి, నారి వంటి వర్ణ చిత్రాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. 1981లో పద్మశ్రీ, 2007లో పద్మభూషణ్, 2013లో పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి.
16 ఏళ్ల దీక్ష విరమించనున్న ఇరోమ్ షర్మిల
మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఎత్తేయాలని 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల ఆగస్టు 9న తన సుదీర్ఘ దీక్షను విరమించనున్నట్లు ప్రకటించారు.ఆత్మహత్యాయత్నం ఆరోపణలపై ఇంఫాల్ కోర్టు విచారణకు హాజరైన 44 ఏళ్ల షర్మిల.. నిరాహార దీక్ష వల్ల సాధించేదేమీ లేదని భావిస్తున్నందున ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దుచేయించేందుకు త్వరలోనే రాజకీయాల్లో చేరనున్నట్లు ప్రకటించారు. 2017 ఆరంభంలో జరగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానన్నారు.
దీక్ష నేపథ్యం:
2000 నవంబర్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు సమీపంలోని ఓ గ్రామంలో అస్సామ్ రైఫిల్స్ బెటాలియన్ (సాయుధ బలగాలు) 10 మందిని హతమార్చారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (అనుమానం వచ్చిన వ్యక్తులను చంపినా.. దీనికి కోర్టులో విచారణ ఉండదు) కారణంగానే ఈ హత్యలు జరగటంతో ఈ చట్టాన్ని రద్దుచేయాలని షర్మిల అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. షర్మిల చేస్తున్న అహింసాయుత ఉద్యమానికి కొద్ది రోజుల్లోనే ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి మద్దతు లభించింది. 2006లో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగి ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునివ్వటంతో.. ఆమెను అరెస్టు చేసి వదిలిపెట్టారు. అనంతరం పలుమార్లు ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టు చేసి, విడుదల చేశారు.


బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా థెరిసా మే జూలై 13న ప్రమాణస్వీకారం చేశారు. మార్గరెట్ థాచర్ (1979-90) తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రెండో మహిళగా థెరిసా గుర్తింపు పొందారు. బ్రెగ్జిట్ ఫలితాల కారణంగా ప్రధాని పదవికి డేవిడ్ కామెరాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
సీబీఎస్‌ఈ చైర్మన్‌గా రాకేశ్ కుమార్ చతుర్వేది
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నూతన చైర్మన్‌గా రాకేశ్ కుమార్ చతుర్వేది జూలై 14న నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు.
మిసైల్, స్ట్రాటజిక్ సిస్టమ్స్ డెరైక్టర్ జనరల్‌గా సతీశ్‌రెడ్డి
రక్షణ రంగానికి చెందిన క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల (మిసైల్, స్ట్రాటజిక్ సిస్టమ్స్) డైరె క్టర్ జనరల్‌గా రక్షణశాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి జూలై 14న నియమితులయ్యారు. ఆయన అన్ని రకాల క్షిపణుల రూపకల్పన, తయారీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఆయన ప్రస్తుతం రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్‌గా ఉన్నారు.
సానియా మీర్జా ఆత్మకథ ఆవిష్కరణ
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ ‘ఏస్ ఎగెనెస్ట్ ఆడ్స్’ను జూలై 13న హైదరాబాద్‌లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఆవిష్కరించారు. ప్రముఖ సంస్థ హార్పర్ కొలిన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
డీఆర్‌డీఎల్ డెరైక్టర్‌గా తొలి తెలుగు వ్యక్తి
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ(డీఆర్‌డీఎల్) డెరైక్టర్‌గా ఎంఎస్‌ఆర్ ప్రసాద్ నియమితులయ్యారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థకు ఓ తెలుగు శాస్త్రవేత్త డెరైక్టర్‌గా నియమితులవడం ఇదే తొలిసారి. 1961లో జన్మించిన ప్రసాద్ మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివారు. తర్వాత ఐఐటీ బాంబేలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చదివి, 1984 నుంచి డీఆర్‌డీఎల్/డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ గ్రూప్ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్, నావికాదళం కోసం ప్రత్యేక క్షిపణులను డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు. దేశీ అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్ నుంచి ప్రయోగించగల కలాం శ్రేణి క్షిపణుల తయారీలోనూ ముఖ్య భూమిక పోషించారు. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగల కలాం-4 క్షిపణిని అభివృద్ధి చేసినందుకుగాను ప్రసాద్ బృందానికి డీఆర్‌డీవో 2015లో ప్రత్యేక అవార్డు ప్రకటించింది.
అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ
అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పెమా ఖండూ జూలై 17న ప్రమాణ స్వీకారం చేశారు. ఈటానగర్‌లోని రాజ్‌భవన్ కార్యాలయంలో గవర్నర్ తథాగత రాయ్.. ఖండూ చేత ప్రమాణం చేయించారు. దీంతో దేశంలోనే అతి పిన్న వయసు ముఖ్యమంత్రిగా ఖండూ రికార్డు సృష్టించారు. మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడైన 37 ఏళ్ల పెమా ఖండూ తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. దోర్జీ ఖండూ 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇంటికి పెద్ద కుమారుడైన పెమా ఢిల్లీలోని హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌పూర్తి చేశారు. తండ్రి మరణానంతరం మక్తో నియోజక వర్గం (ఎస్టీ రిజర్వ్‌డ్) నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జలవనరుల అభివృద్ధి, పర్యాటక మంత్రిగా పనిచేశారు. 2011 నవంబర్ 21 నుంచి నబమ్ టుకీ ప్రభుత్వంలో గ్రామీణ పనుల అభివృద్ధి, పర్యాటక మంత్రిగా పనిచేశారు. పౌర విమానయానం, కళలు సాంస్కృతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానూ పెమా పనిచేశారు. 
రాజ్యసభకు సిద్ధూ రాజీనామా
మాజీ క్రికెటర్, బీజేపీ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ(52) తన రాజ్యసభ సభ్యత్వానికి జూలై 18న రాజీనామా చేశారు. బీజేపీ సిద్ధూను రాజ్యసభకు నామినేట్ చేసి మూడు నెలలైనా గడవకముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ తక్షణం ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. సిద్ధూ 2004 నుంచి 2014 వరకూ అమృత్‌సర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కోసం సిద్ధూను అమృత్‌సర్ స్థానం నుంచి తప్పించారు. ఆ ఎన్నికల్లో జైట్లీ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సిద్ధూ బీజేపీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు.
భారతీయ బాలుడికి గూగుల్ పురస్కారం
ప్రతిష్టాత్మక ‘గూగుల్ కమ్యూనిటీ ఇంపాక్ట్’ అవార్డు తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన అద్వయ్ రమేశ్ అనే 14 ఏళ్ల బాలుడిని వరించింది. మత్స్యకారుల భద్రతకు ఉపకరించే ‘ఫిషర్‌మెన్ లైఫ్‌లైన్ టెర్మినల్’ అనే పరికరాన్ని తయారు చేసినందుకుగాను ఆసియా దేశాల నుంచి గూగుల్ ఇండియా సదరు బాలుణ్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ పరికరం జీపీఎస్ సాయంతో పనిచేస్తుంది. ఈ అవార్డు కింద 50వేల డాలర్లు (రూ. 33 లక్షల 57 వేలు) స్కాలర్‌షిప్‌ను గూగుల్ అందజేయనుంది. ఈ పోటీలో మొత్తం 107 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు.
మిస్టర్ వరల్డ్‌గా రోహిత్ ఖండేల్వాల్
మిస్టర్ వరల్డ్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు విజేతగా నిలిచాడు. జూలై 19న ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన ఫైనల్స్‌లో.. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాలకు చెందిన ఫైనలిస్ట్‌లతో పోటీపడి.. హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖండేల్వాల్ (26) మిస్టర్ వరల్డ్-2016 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల మోడలింగ్ ప్రపంచంలో ఇప్పటిదాకా భారత్‌కు దక్కిన మిస్టర్ వరల్డ్ టైటిల్ ఇదే. అవార్డుతో పాటు 50 వేల అమెరికన్ డాలర్ల నగదు బహుమతి రోహిత్ అందుకున్నాడు. మిస్టర్ వరల్డ్-2014 టైటిల్ విజేత నిక్లస్ పెడెర్సన్.. రోహిత్‌కు టైటిల్‌ను అందజేశారు. ప్యూర్టో రికోకు చెందిన ఫెర్నాండో అల్వరేజ్ (21), మెక్సికోకు చెందిన ఎస్పార్జా రామిరెజ్ (26) వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు.
భారత హాకీ దిగ్గజం మొహమ్మద్ షాహిద్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మొహమ్మద్ షాహిద్ అనారోగ్యంతో జూలై 20న న్యూఢిల్లీలో కన్నుమూశారు. భారత హాకీ జట్టు ఆఖరిసారిగా ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గిన 1980 జట్టులో షాహిద్ కీలక సభ్యుడు. ఆ తర్వాత మరో రెండు ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న షాహిద్, రెండు ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు గెలవడంలో తనదైన పాత్ర పోషించారు. 1979 నుంచి 1988 సియోల్ ఒలింపిక్స్ వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షాహిద్‌ను భారత ప్రభుత్వం అర్జున (1981), పద్మశ్రీ (1986) అవార్డులతో సత్కరించింది. వారణాసికి చెందిన షాహిద్ చనిపోయే సమయానికి భారత రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.

హిజ్బుల్ ముఖ్యనేత బుర్హాన్ ఎన్‌కౌంటర్
హిజ్బుల్ ముజాహిదీన్ కీలకనేత బుర్హాన్ ముజఫర్ (21)ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని కోకర్‌నాగ్ ప్రాంతంలో జూలై 8న జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.
నేపాల్‌కు తొలి మహిళా చీఫ్ జస్టిస్
నేపాల్‌కు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీలా కర్కి నియమితులయ్యారు. ఆమె జూలై 11న బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటికే నేపాల్‌కు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా విద్యాదేవి బండారి, పార్లమెంటులో తొలి మహిళా స్పీకర్‌గా ఒన్సారి ఘర్తి మగర్‌లు పదవుల్లో ఉన్నారు. మూడు నెలలుగా సుశీల తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించడంతో జూలై 11న పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆమె బెనారస్ హిందూ వర్సిటీలో రాజనీతి శాస్త్రం అభ్యసించారు.
టాప్100 సంపాదనపరుల్లో షారుక్, అక్షయ్
ప్రపంచంలో అధిక పారితోషికం అందుకుంటున్న తొలి 100 మంది ప్రముఖుల సరసన బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ నిలిచారు. అధిక పారితోషికం పొందిన ప్రముఖుల జాబితా - 2016ను అమెరికా మేగజీన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. షారుక్ 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 221 కోట్లు) సంపదతో 86వ స్థానం, అక్షయ్ 31.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.211 కోట్లు)తో 94వ స్థానంలో ఉన్నారు. అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ 170 మిలియన్ డాలర్ల (రూ.1,142 కోట్లు) సంపాదనతో అగ్రస్థానంలో నిలిచారు. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 88 మిలియన్ డాలర్ల సంపాదనతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అలాగే అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 81.5 మిలియన్ డాలర్లతో 8వ స్థానం సంపాదించాడు. 
కేంద్ర మంత్రులు నజ్మా, సిద్దేశ్వర రాజీనామా
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జీఎం సిద్దేశ్వర జూలై 12న తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు వీరు ప్రకటించారు. నజ్మా స్థానంలో మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి పూర్తి బాధ్యతలు (స్వతంత్ర హోదా) అప్పగించారు. బాబుల్ సుప్రియోను పట్టణాభివృద్ధి సహాయ మంత్రి నుంచి తప్పించి భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ భాధ్యతలు అప్పగించారు.
సానియా మీర్జా జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటో బయోగ్రఫీ ‘ఏస్ ఎగెనైస్ట్ ఆడ్స్’ను జూలై 13న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఆవిష్కరించారు. సానియా అనుమతిస్తే ఆమె జీవిత చరిత్రపై తాను సినిమా నిర్మిస్తానని షారుక్ వెల్లడించారు. గతంలో చాలా సందర్భాల్లో తాను చెప్పాలనుకొని ఆగిపోయిన అనేక అంశాలను ఈ పుస్తకంలో రాసినట్లు సానియా చెప్పారు. చాలా మంది తనపై అహంకారి, కఠినమైన వ్యక్తి అంటూ ముద్ర వేశారని, అయితే తానూ సాధారణ అమ్మాయినేనని, తనలో భావోద్వేగాలు ఉంటాయని ఈ పుస్తకం చదివితే తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. సానియా తన తండ్రి ఇమ్రాన్ మీర్జా, శివాని గుప్తాతో కలిసి రాసిన ఈ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ సంస్థ ప్రచురించింది.

డిజిటల్ విప్లవ దార్శనికుడు ఆల్విన్ టోఫ్లర్ కన్నుమూత
శాస్త్రసాంకేతిక రంగాల్లో వచ్చే మార్పులను దశాబ్దాల కిందటే ఊహించి చెప్పిన దార్శనికుడు, రచయిత ఆల్విన్ టోఫ్లర్ (87) లాస్‌ఏంజెల్స్‌లో జూన్ 27న కన్నుమూశారు. ఆయన 1980లో రాసిన థర్డ్ వేవ్ పుస్తకంలో ఈ- మెయిల్స్, ఇంటరాక్టివ్ మీడియా, ఆన్‌లైన్ చాట్‌రూమ్‌ల వినియోగం భవిష్యత్తులో విస్తృతమవుతుందని పేర్కొన్నారు. 

మెస్సీకి జైలు శిక్ష పన్ను ఎగవేత కేసులో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ, అతని తండ్రి జార్జ్ హోరాసియో మెస్సీని బార్సిలోనా కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో ఇద్దరికి 21 నెలల జైలు శిక్షతో పాటు మెస్సీకి 2.09 మిలియన్ యూరోలు (రూ. 15 కోట్లు), జార్జ్‌కు 1.6 మిలియన్ యూరోలు (రూ. 12 కోట్లు) జరిమానా విధించింది. అయితే స్పెయిన్‌లో అహింస నేరాలకు సంబంధించిన కేసులో రెండేళ్ల కంటే తక్కువ శిక్ష పడితే వాటిని ఉన్నత న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణం. బార్సిలోనా కోర్టు విధించిన శిక్షను కూడా స్పెయిన్ సుప్రీంకోర్టులో మెస్సీ, జార్జ్‌లు అప్పీలు చేయనున్నారు. 2007-09 వరకు ఇమేజ్ రైట్స్ (చిత్రం వాడుకున్నందుకు) వల్ల తనకు వచ్చిన ఆదాయం 4.16 మిలియన్ యూరో (రూ. 31 కోట్లు)లకు పన్ను చెల్లించలేదని కోర్టు తేల్చింది. బెలిజ్, బ్రిటన్, స్విట్జర్లాండ్, ఉరుగ్వేలోని పలు కంపెనీలను ఉపయోగించి తండ్రీకొడుకులు ఈ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించింది.

పిస్టోరియస్‌కు ఆరేళ్లు జైలు శిక్ష విధించిన దక్షిణాఫ్రికా కోర్టుప్రియురాలి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దక్షిణాఫ్రికా పారా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌కు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. రీవా స్టీన్‌కాంప్ హత్య కేసులో ప్రిటోరియా హై కోర్టు జూలై 6న తీర్పు వెలువరించింది. నిజానికి దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం హత్య కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉన్నా.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని పిస్టోరియస్‌కు తక్కువ శిక్షను విధిస్తున్నట్లు జడ్జి థోకోజిలే మసిపా వ్యాఖ్యానించారు. 2013 ప్రేమికుల రోజున తన ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడని భావించిన పిస్టోరియస్ బాత్రుమ్ తలుపు వెనుక నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అతని ప్రియురాలు రీవా మరణించింది.

No comments:

Post a Comment