AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు మే 2015

వార్తల్లో వ్యక్తులు మే 2015
యదువీర్‌కు పట్టాభిషేకం
మైసూరు రాజకుటుంబం వారసునిగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్(23)కు మైసూరులో మే 28న పట్టాభిషేకం జరిగింది. 27వ రాజుగా యదువీర్ కొనసాగుతారు. మహారాజు శ్రీకంఠదత్త నరసింహరాజు వడయార్ 2013లో మరణించారు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో ఆయన సతీమణి ప్రమోదాదేవి వడయార్ యదువీర్‌ను దత్తత తీసుకున్నారు. మైసూరు రాజ్యాన్ని వడయార్ రాజకుటుంబం 1399 నుంచి 1947 వరకు పాలించింది. 1947లో స్వాతంత్య్రం వచ్చాక రాజరికాలు రద్దయ్యాయి. తర్వాత మాజీ రాజకుటుంబ వారసులుగా శ్రీకంఠదత్త కొనసాగారు.
శివరామకృష్ణన్ కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపికకు కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ మే 28న కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, వాణిజ్య శాఖలో కార్యదర్శిగా, పర్యావరణ శాఖలో అదనపు కార్యదర్శిగా, కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా పనిచేశారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధికారత కోసం విశేష కృషి చేశారు. 73, 74వ రాజ్యాంగ సవరణలలో ముఖ్య భూమిక పోషించారు. 1992లో ఆయన పదవీ విరమణ పొందారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్నట్లుగా ఏపీ నూతన రాజధాని ప్రాంతాల అధ్యయనానికి కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు.
ప్రిన్సిపల్‌గా హిజ్రా మనబి బందోపాధ్యాయ్
హిజ్రా అయిన మనబి బందోపాధ్యాయ్ పశ్చిమ బెంగాల్‌లో ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఒక కళాశాల ప్రిన్సిపల్‌గా హిజ్రాను నియమించడం ఇదే తొలిసారి. పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో కృష్ణాగఢ్ మహిళా కళాశాలకు ప్రిన్సిపల్‌గా నియమితులైన మనబి జూన్ 9న బాధ్యతలు చేపడతారు. ఆమె ప్రస్తుతం మిందాపోర్‌లోని వివేకానంద శతవర్షికి మహావిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
మారీ ఎలెన్ మార్క్ మృతి
ప్రముఖ డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ మారీ ఎలెన్ మార్క్(75) మాన్‌హట్టన్‌లో మే 25న మరణించారు. ఆమె ముంబైలోని సెక్స్ వర్కర్స్, సీటెల్‌లోని ఇళ్లకు దూరమైన పిల్లలు, ఓరెగాన్‌లోని మానసిక వ్యాధిగ్రస్తులపై చిత్రీకరించిన డాక్యుమెంటరీలు ఆమెను ప్రముఖ ఫోటోగ్రాఫర్ స్థాయికి తీసుకెళ్లాయి.
రక్షణ మంత్రి సలహాదారుడుగా సతీశ్ రెడ్డి
రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ శాస్త్రీయ సలహాదారుగా సతీశ్‌రెడ్డి మే 28న నియమితులయ్యారు. ఈయన రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం సతీశ్ రెడ్డి హైదరాబాద్ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లోని పరిశోధనా కేంద్రం ఇమారత్‌కు డెరైక్టర్‌గా ఉన్నారు.
కేబినెట్ కార్యదర్శిగా ప్రదీప్ కుమార్
కేంద్ర కేబినెట్ నూతన కార్యదర్శిగా ప్రదీప్‌కుమార్ సిన్హా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సిన్హా 1977 బ్యాచ్‌కు చెందిన ఉత్తర ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. అజిత్ సేథ్ స్థానంలో నియమితులైన సిన్హా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
డీఆర్‌డీఓ డెరైక్టర్ జనరల్‌గా క్రిస్టోఫర్
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) డెరైక్టర్ జనరల్‌గా ఎస్.క్రిస్టోఫర్ మే 28న నియమితులయ్యారు. రెండు సంవత్సరాలపాటు ఈ పదవిలో కొనసాగుతారు. క్రిస్టోఫర్ ప్రస్తుతం డీఆర్‌డీఓలోని సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ విభాగానికి డెరైక్టర్‌గా ఉన్నారు.
షార్ డెరైక్టర్‌గా కున్నికృష్ణన్
నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నూతన డెరైక్టర్‌గా పీఎస్‌ఎల్‌వీ వెహికిల్ డెరైక్టర్‌గా వ్యవహరించిన కున్నికృష్ణన్ మే 28న నియమితులయ్యారు. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ స్థానంలో జూన్ 1న బాధ్యతలు చేపట్టారు. అలాగే తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్‌ఎస్‌సీ) నూతన డెరైక్టర్‌గా డాక్టర్ శివన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన తిరువనంతపురంలోనే ఉన్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్‌పీఎస్‌సీ) డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. వీఎస్‌ఎస్‌సీ అసోసియేట్ డెరైక్టర్(ప్రాజెక్ట్స్)గా పనిచేస్తున్న ఎస్ సోమనాథ్ ఎల్‌పీఎస్‌సీ డెరైక్టర్‌గా నియమితులయ్యారు.

రక్షణ శాఖ కార్యదర్శిగా మోహన్ కుమార్
సీనియర్ ఐఏఎస్ అధికారి జి.మోహన్ కుమార్ రక్షణ శాఖ నూతన కార్యదర్శిగా మే 22న నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన 1979 బ్యాచ్‌కు చెందిన ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రక్షణ ఉత్పత్తుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
నోబెల్ విజేత జాన్ నాష్ దుర్మరణం
అమెరికా గణిత, ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత జాన్ నాష్ మే 23న సాయంత్రం ఓ కారు ప్రమాదంలో భార్యతో సహా దుర్మరణం చెందారు. న్యూజెర్సీలో ఓ ట్యాక్సీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరగడంతో నాష్ (86), ఆయన భార్య అలీసియా(82) మరణించారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, ఎంఐటీలలో ప్రొఫెసర్‌గా పనిచేసిన జాన్ నాష్ ఆర్థికశాస్త్రంలో కీలకమైన ‘గేమ్ థియరీ- ద స్టడీ ఆఫ్ డెసిషన్ మేకింగ్’ అంశంపై చేసిన పరిశోధనకుగాను 1994లో ఆర్థికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలుపొందారు.

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మోర్సీకి మరణశిక్ష
పదవీచ్యుతుడైన ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ (63)కి కైరోలో మే 16న కోర్టు మరణశిక్ష విధించింది. 2011 జనవరిలో జరిగిన తిరుగుబాటు సమయంలో వేలాది మంది జైలు నుంచి పారిపోయేందుకు కారణమైన మోర్సీతో పాటు నిషేధిత ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ అధినేత మొహమ్మద్ బేడీ మరో 100 మంది ఇస్లామిస్టులకు కోర్టు మరణశిక్ష విధించింది. 2012లో అధ్యక్షుడైన మోర్సీ ఒక సంవత్సరం మాత్రమే పాలించారు. 2013 జూలైలో సామూహిక నిరసనల నేపథ్యంలో సైన్యం మోర్సీని పదవీచ్యుతుడిని చేసింది.
ఉత్తర కొరియా రక్షణ మంత్రికి మరణశిక్ష
ఉత్తర కొరియా రక్షణమంత్రి హైయోన్ యోంగ్-చోల్ (66)కు ప్రభుత్వం మరణశిక్ష విధించింది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్‌తో యోంగ్-చోల్‌ను కాల్చి చంపినట్లు ఉత్తర కొరియా నిఘా వర్గాలు మే 13న ప్రకటించాయి. దేశ నేత కిమ్ జాంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా యోంగ్-చోల్ పదేపదే ఫిర్యాదు చేయడం, ఉత్తర్వులు పాటించక పోవడం, సైనిక కార్యక్రమంలో నిద్రపోవడం ఆయన శిక్షకు ప్రధాన కారణాలని ప్రభుత్వం తెలిపింది.
స్వలింగ సంపర్క వివాహం చేసుకున్న లక్సెంబర్గ్ ప్రధాని
లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెట్టెల్ (42) తన సహచరుడు గాథియర్ డెస్టెనేను మే 15న వివాహం చేసుకున్నారు. ఇలాంటి వివాహం చేసుకున్న తొలి యూరోపియన్ యూనియన్ రాజకీయ నేతగా ఆయన గుర్తింపు పొందారు. బెట్టెల్ 2013 నుంచి లక్సెంబర్గ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆ దేశ పార్లమెంట్ 2014 జూన్‌లో స్వలింగ సంపర్కుల వివాహాలకు ఆమోదం తెలిపింది.
అస్తమించిన ‘అరుణ’
లైంగికదాడికి గురైనప్పుడు తీవ్రంగా గాయపడి, 42 ఏళ్లుగా కోమాలో ఉన్న మాజీ నర్సు అరుణా షాన్‌బాగ్ (65) మే 18న తుదిశ్వాస విడిచారు. ఆమెకు గత కొన్ని రోజులుగా న్యూమోనియా తీవ్రం కావడంతో వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స చేసినప్పటికీ ప్రయోజనయం లేకపోయింది. అరుణ మృతిపై రాజకీయ నాయకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు సంతాపం ప్రకటించాయి. ముంబైలోని కేఈఎం ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే అరుణపై 1973 నవంబరు 27న వార్డుబాయ్ సోహన్‌లాల్ లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చాడు. ఇనుప గొలుసుతో మెడను బంధించాడు. గొలుసును విడిపించుకునే ప్రయత్నంలో తలకు గట్టి దెబ్బ తగలడంతో, మెదడుకు రక్తసరఫరా నిలిచిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉంది. 1973 నుంచి సోమవారం వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే అరుణ ప్రాణాలు విడిచారు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు కోమాలో ఉన్న అరుణను కేఈఎం ఆస్పత్రి నర్సులు అణుక్షణం కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆమె 42 ఏళ్లపాటు మృత్యువుతో చేసిన పోరాటానికి వాళ్లంతా అండగా నిలిచి అన్ని రకాల సేవలను అందించారు.
సిక్కిం లోకాయుక్తగా కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా 
 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా మే 18న సిక్కిం లోకాయుక్త చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గాంగ్‌టక్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీనివాస్ పాటిల్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.కె. సిన్హా తదితర ప్రముఖులు హాజరయ్యారు.

రాష్ట్రపతి ప్రణబ్‌కు రష్యా గౌరవ డాక్టరేట్
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రష్యా మే 8న మాస్కోలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రష్యా విక్టరీ డే పెరేడ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రష్యాలో పర్యటించారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన 26 మిలియన్ల మందికి ఈ పెరేడ్‌లో నివాళులు అర్పిస్తారు. విక్టరీ డేలో పాల్గొనాలని రష్యా 60 దేశాలకు ఆహ్వానం పంపగా కేవలం 25 దేశాల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. ఉక్రెయిన్‌లో రష్యా చర్యలకు, గత సంవత్సరం క్రిమియాను ఆక్రమించినందుకు నిరసనగా అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు విక్టరీ డే వేడుకలను బహిష్కరించాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు చైనా, క్యూబా, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బ్రిక్స్ బ్యాంకు అధ్యక్షునిగా కె.వి.కామత్
 బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలు ఏర్పాటుచేస్తున్న న్యూ డెవలప్‌మెంటల్ బ్యాంకుకు ప్రముఖ బ్యాంకరు కె.వి.కామత్‌ను భారత్ మే 11న నామినేట్ చేసింది. ఆయన ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌లలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో ఉన్నారు. ఒక సంవత్సరంలో బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. కామత్ అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగవచ్చు.
యూపీఎస్సీ సభ్యుడిగా ప్రదీప్ కుమార్ జోషీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషీ మే 11న నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్‌గా దీపక్ గుప్తా వ్యవహరిస్తుండగా, కమిషన్‌లో 10 మంది సభ్యులకు గాను తొమ్మిది మందే ఉన్నారు. జోషీ నియామకంతో మొత్తం సభ్యుల నియామకం పూర్తయింది. జోషీ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. యూపీఎస్సీలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జోషీ పదవీకాలం మొదలవుతుందని సిబ్బంది, శిక్షణ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనల ప్రకారం యూపీఎస్సీ సభ్యుడి పదవీకాలం ఆరేళ్లు. అయితే, అంతకుముందే సభ్యుడికి 65 ఏళ్ల వయసు వస్తే అప్పుడే పదవీకాలం ముగిసిపోతుంది. 
కామెరూన్ కేబినెట్‌లో ప్రీతీ పటేల్
భారతీయ సంతతికి చెందిన పార్లమెంటు సభ్యురాలు ప్రీతీ పటేల్‌కు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మంత్రివర్గంలో చోటు లభించింది. ఆమెను ఉద్యోగ కల్పన శాఖ మంత్రిగా నియమించారు. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో ఎస్సెక్స్‌లోని విథామ్ నుంచి ఆమె భారీ మెజారిటీతో నెగ్గిన సంగతి తెలిసిందే. అదే ఎన్నికల్లో ఓటమి పాలైన ఉద్యోగ కల్పన మంత్రి ఈస్తర్ మెక్ వీ స్థానంలో ప్రీతీ పటేల్‌కు మంత్రి పదవి దక్కింది.

న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా రాజరాజేశ్వరి
భారత్ సంతతికి చెందిన రాజ రాజేశ్వరి (43) న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా 2015 ఏప్రిల్ 27న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె న్యూయార్‌‌క సిటీలో న్యాయమూర్తిగానియమితులైన తొలి భారత సంతతి మహిళ. గత 16 సంవత్సరాలుగా వివిధ న్యాయ విభాగాల్లో, రిచ్‌మండ్ కంట్రీ డిస్ట్రిక్ట్ అటార్నీగా కూడా పనిచేశారు.

సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
 
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో ఆయన దోషేనని కోర్టు తేల్చింది. మద్యం మత్తులో, నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా కారు నడిపి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడని సల్మాన్‌పై నమోదైన అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. ప్రమాద సమయంలో వాహనం నడుపుతోంది తన డ్రైవర్ అశోక్‌సింగ్ అన్న సల్మాన్ వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు. ఈ తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆయనకు రెండ్రోజుల ఊరట లభించింది. తీర్పు సమగ్ర కాపీని నిందితుడికి ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ మే 8 వరకు సల్మాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

No comments:

Post a Comment