AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు ఫిబ్రవరి 2016

క్రీడలు ఫిబ్రవరి 2016
ముంబైకి రంజీ ట్రోఫీ
రంజీ ట్రోఫీని ముంబై జట్టు గెలుచుకొంది. ఫిబ్రవరి 26న పుణెలో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించి ముంబై విజేతగా నిలిచింది. తాజా టైటిల్‌తో కలుపుకొని ఆ జట్టు 41 సార్లు రంజీ ట్రోఫీని దక్కించుకొంది.
‘ఫిఫా’ కొత్త అధ్యక్షుడిగా ఇన్‌ఫాన్‌టినో
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కొత్త అధ్యక్షుడిగా స్విట్జర్లాండ్‌కు చెందిన జియాని ఇన్‌ఫాన్‌టినో ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 26న జరిగిన ఎన్నికల్లో 45 ఏళ్ల ఇన్‌ఫాన్‌టినోకు అత్యధికంగా 115 ఓట్లు లభించాయి. మిగతా అభ్యర్థులలో షేక్ సల్మాన్‌కు 88 ఓట్లు, ప్రిన్స్ అలీకి నాలుగు ఓట్లు రాగా... జెరోమ్ షాంపేన్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. తొలి రౌండ్‌లో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో రౌండ్‌ను నిర్వహించగా ఇన్‌ఫాన్‌టినోను విజయం వరించింది. 
శ్రీలంకపై భారత్ క్లీన్‌స్వీప్
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. ఫిబ్రవరి 26న జరిగిన మూడో టి20లో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

మయూఖా జానీకి స్వర్ణం
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మయూఖా జానీ (మహిళల లాంగ్‌జంప్) స్వర్ణపతకం గెలుచుకొంది. మయూఖా 6.35 మీటర్ల దూరం దూకి తొలిస్థానంలో నిలిచింది. దీంతో ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల లాంగ్‌జంప్ విభాగంలో భారత్ నుంచి స్వర్ణం నెగ్గిన తొలి అథ్లెటిక్‌గా రికార్కుకెక్కింది.
టెస్టుల్లో మెకల్లమ్ ఫాస్టెస్ట్ సెంచరీ
అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్ చరిత్రలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ 54 బంతుల్లో సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మెకల్లమ్ ఫిబ్రవరి 20న ఆస్ట్రేలియాతో క్రైస్ట్‌చర్చ్ జరిగిన రెండో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో చెలరేగి ఆడి వివ్ రిచర్డ్స్ (56 బంతుల్లో), మిస్బా ఉల్ హక్ (56 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 
హాకీ ఇండియా లీగ్ చాంపియన్‌గా పంజాబ్
హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) నాలుగో సీజన్ విజేతగా పంజాబ్ నిలిచింది. రాంచీలో ఫిబ్రవరి 20న జరిగిన ఫైనల్లో కళింగ లాన్సర్స్‌ను పంజాబ్ ఓడించింది. చాంపియన్ పంజాబ్‌కు రూ. 2.50 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన కళింగ జట్టుకు రూ.రూ.1.75 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది.
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో చైనా... పురుషుల విభాగంలో ఇండోనేసియా విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 21న ముగిసిన ఈ ఈవెంట్‌లో మహిళల ఫైనల్లో చైనా 3-2తో జపాన్‌పై... పురుషుల ఫైనల్లో ఇండోనేసియా 3-2తో జపాన్‌పై విజయం సాధించాయి. పురుషుల విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత్‌కు కాంస్యం లభించింది.
భారత రెజ్లర్లకు 9 పతకాలు
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత కుస్తీ వీరులు తొమ్మిది పతకాలు సాధించారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ (57 కేజీలు) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఓంప్రకాశ్ వినోద్ కుమార్ (70 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ప్రియాంక ఫోగట్ (55 కేజీలు) రజతం నెగ్గగా... వినేశ్ ఫోగట్ (53 కేజీలు), అనితా తోమర్ (63 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్‌దీప్ సింగ్ (98 కేజీలు), గౌరవ్ శర్మ (59 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (80 కేజీలు), నవీన్ (130 కేజీలు) కాంస్య పతకాలు సంపాదించారు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ ఏడో స్థానంలో నిలిచింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు మెకల్లమ్ వీడ్కోలు
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ద్వారా మెకల్లమ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. 12 సంవత్సరాల సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో మెకల్లమ్ అరంగేట్రం నుంచి వరుసగా 101 టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించి రిటైరయ్యాడు. టెస్టు కెరీర్‌లో 106 సిక్సర్లతో రికార్డు, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (54 బంతులు) రికార్డులు కెరీర్ చివరి టెస్టులో సాధించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక న్యూజిలాండ్ క్రికెటర్ కూడా మెకల్లమే. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మెకల్లమ్ 101 టెస్ట్‌లు, 260 వన్డేలు, 71 టి20లు ఆడాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు రెండు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా కూడా రికార్డు సొంతం చేసుకున్నాడు. 
టెస్టుల్లో నంబర్‌వన్ ఆస్ట్రేలియా
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు నంబర్‌వన్‌గా నిలిచింది. ఫిబ్రవరి 24న న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా 112 పాయింట్లతో భారత్ (110)ను వెనక్కి నెట్టి ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. 2014 తర్వాత ఆసీస్ మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది.

టీ20 సిరీస్ గెలుచుకున్న భారత్
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు గెలుచుకుంది. ఫిబ్రవరి 13న విశాఖపట్నంలో జరిగిన మూడో మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ సిరీస్‌ను 2-1 తేడాతో దక్కించుకుంది.
సానియా జోడికి డబ్ల్యూటీఏ టైటిల్
సెయింట్ పీటర్స్‌బర్గ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) -సానియా మిర్జా (భారత్) జోడి గెలుచుకుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా)లో ఫిబ్రవరి 13న జరిగిన ఫైనల్లో వెరా దుషెవినా (రష్యా)- బార్బరా క్రిజ్‌సికోవా (చెక్ రిపబ్లిక్)ను సానియా జోడి ఓడించింది. సానియా-హింగిస్‌కు ఇది 13వ టైటిల్. వీరికి వరసగా 40వ విజయం. కెరీర్‌లో సానియాకు 36, హింగిస్‌కు 54వ డబుల్స్ టైటిల్.
అండర్-19 ప్రపంచ చాంపియన్‌గా వెస్టిండీస్
క్రికెట్ అండర్-19 ప్రపంచ కప్-2016ను వెస్టిండీస్ గెలుచుకుంది. మీర్‌పూర్‌లో ఫిబ్రవరి 14న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ భారత్‌ను ఓడించింది. ఈ టైటిల్‌ను వెస్టిండీస్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. భారత్ ఈ కప్‌ను మూడుసార్లు గెలుచుకుంది.
అంపైర్ రవూఫ్‌పై బీసీసీఐ ఐదేళ్ల నిషేధం
మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్‌పై బీసీసీఐ ఐదేళ్ల నిషేధం విధించింది. బోర్డు క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2013 ఐపీఎల్ సీజన్‌లో బుకీల నుంచి విలువైన బహుమతులను తీసుకుని మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను తెలిపినట్టు 59 ఏళ్ల రవూఫ్‌పై ఆరోపణలు వచ్చాయి. అంపైర్ విధుల నుంచే కాకుండా బీసీసీఐకి సంబంధించి ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేళ్ల నిషేధం విధించారు.
మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ విజేత జీఏ
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని జెమినీ అరేబియన్స్ జట్టు మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ టైటిల్ సాధించింది. ఫైనల్లో ఈ జట్టు లియో లయన్స్‌పై 16 పరుగుల తేడాతో గెలిచింది. జెమినీ అరేబియన్స్ ఆటగాడు సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఈ ఎంసీఎల్‌ను ప్రారంభించారు. తొలి సీజన్ టైటిల్‌నే సెహ్వాగ్ జట్టు సొంతం చేసుకుంది.
దక్షిణాసియా క్రీడల్లో భారత్ అగ్రస్థానం
ఈశాన్య నగరాలు గువాహటి, షిల్లాంగ్‌ల్లో ఫిబ్రవరి 5 నుంచి 16 వరకు జరిగిన 12వ దక్షిణాసియా క్రీడల్లో భారత్ 308 పతకాలు గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. వీటిలో 188 స్వర్ణాలు, 90 రజతాలు, 30 కాంస్యాలు ఉన్నాయి. దీంతో ఈ క్రీడా సంబంరంలో భారత్వరుసగా 11వ సారి అగ్రస్థానంలో నిలిచింది. 186 పతకాలతో శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ 106, ఆఫ్ఘానిస్తాన్ 35, బంగ్లాదేశ్ 75, నేపాల్ 60, మాల్దీవులు 3, భూటాన్ 16 పతకాలు సాధించాయి. 13వ దక్షిణాసియా క్రీడలు 2019లో నేపాల్ రాజధాని కాఠ్మండులో జరుగుతాయి.

దక్షిణాసియా క్రీడలు
ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న గువాహటిలో 12వ దక్షిణాసియా క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అస్సాం, మేఘాలయ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్బానంద సోనోవాల్, ఐవోఏ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్, సార్‌‌క దేశాల మంత్రులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16 వరకు జరిగే ఈ క్రీడల్లో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, భారత్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ క్రీడల మస్కట్ ‘టిఖోర్’. శాంతి, ప్రగతి, అభ్యున్నతి అనే ఇతివృత్తంతో దీన్ని రూపొందించారు.
ఐసీసీ అవినీతి వ్యతిరేక పర్యవేక్షణ బృందంలో ద్రవిడ్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కొత్తగా ఏర్పాటైన ఐసీసీ అవినీతి వ్యతిరేక పర్యవేక్షణ బృందంలో సభ్యుడిగా ఎంపికయ్యారు. క్రికెట్‌లో అవినీతిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలు తీరును ఈ బృందం పర్యవేక్షిస్తుంది. ఇందులో క్రికెటర్‌గా ద్రవిడ్‌కు చోటు దక్కగా... సర్ రోనీ ఫ్లనాగన్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్‌తో పాటు ఇద్దరు న్యాయ నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం సంవత్సరానికి ఒకసారి సమావేశమై క్రికెట్‌లో జరిగే అవినీతిపై సమీక్షిస్తుంది.
వన్డే కెరీర్‌ను ముగించిన మెకల్లమ్
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 55 పరుగుల తేడాతో గెలిచింది. ఇదే మెకల్లమ్‌కు ఆఖరి అంతర్జాతీయ వన్డే. ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ తర్వాత టెస్టులకు కూడా మెకల్లమ్ రిటైర్‌మెంట్ ప్రకటించనున్నాడు. 260 వన్డేలు ఆడిన మెకల్లమ్ 30.41 సగటుతో 6,083 పరుగులు చేశాడు. వీటిలో ఐదు సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా రైనా
ఐపీఎల్‌లో రాజ్‌కోట్ ఫ్రాంచైజీకి చెందిన జట్టును ‘గుజరాత్ లయన్స్’ పేరుతో ఫిబ్రవరి 2న ఆవిష్కరించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా, చీఫ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ బ్రాడ్ హాడ్జ్‌లను నియమించారు.

No comments:

Post a Comment