AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు మే 2017

వార్తల్లో వ్యక్తులు మే 2017
నేపాల్ ప్రధాని ప్రచండ రాజీనామా నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ మే 24న పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేబా ప్రధాని బాధ్యతలు చేపడతారు. 
నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ మధ్య ఒప్పందం మేరకు ప్రచండ రాజీనామా చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ కూటమి విజయం సాధించింది. దీంతో ప్రధానిగా ఏ పార్టీ నాయకుడిని ఎన్నుకోవాలనే సందిగ్ధత వల్ల స్థానిక ఎన్నికలు జరిగే వరకు ప్రచండని ప్రధానిగా ఉంచాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : నేపాల్ ప్రధాని రాజీనామా
ఎప్పుడు : మే 24 
ఎవరు : పుష్ప కమల్ దహల్ ప్రచండ
ఎందుక : నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ఒప్పందం మేరకు

జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా గయారుల్ జాతీయ మైనార్టీ కమిషన్ (ఎన్సీఎం)కు ఐదుగురు సభ్యులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మే 24న ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త గయారుల్ హసన్‌ను నియమించింది. కేరళకు చెందిన బీజేపీ నేత జార్జ్ కురియన్, మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి సులేఖా కుంభారే, గుజరాత్‌లోని జైన్ మతానికి చెందిన సునీల్ సింఘ్వీ, ఉద్వాడా అతోర్నన్ అంజుమన్ ముఖ్య మతాధికారి వడా దస్తూర్జీ ఖుర్షీద్‌లు ప్యానెల్ సభ్యులుగా నియమితులయ్యారు.
సాధారణంగా ఈ కమిషన్‌కు రిటైర్డ్ న్యాయమూర్తిగానీ, లేదా ఉన్నతాధికారినిగానీ చైర్‌పర్సన్‌గా నియమిస్తుంటారు. తొలిసారి ఈ సంప్రదాయానికి స్వస్తి పలికిన కేంద్రం క్షేత్రస్థాయిలో సమస్యల పట్ల అవగాహన ఉన్న సామాజిక కార్యకర్తలను ఎన్సీఎంకు ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : జాతీయ మైనారిటీ కమిషన్‌కు చైర్మన్ నియామకం
ఎప్పుడు : మే 24 
ఎవరు : గయారుల్ హసన్

పాకిస్తాన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఉజ్మా అహ్మద్ పాకిస్తాన్‌కు చెందిన తాహిర్ అలీ తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపించి.. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌లో ఆశ్రయం పొందిన ఢిల్లీకి చెందిన ఉజ్మ అహ్మద్ భారత్‌కు తిరిగొచ్చింది. పాక్ విడిచి స్వదేశానికి వెళ్లేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు ఆమెకు అనుమితి ఇచ్చిన నేపథ్యంలో భారత దౌత్యవేత్తలు, పాకిస్తాన్ పోలీసుల భద్రతా వలయంలో అమృత్‌సర్ సమీపంలోని వాఘా సరిహద్దు ద్వారా మే 25న దేశంలోకి అడుగుపెట్టింది. 
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఉజ్మా అహ్మద్‌ను భారత పుత్రికగా అభివర్ణించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత్‌కు తిరిగొచ్చిన ఉజ్మా అహ్మద్ 
ఎప్పుడు : మే 25 
ఎవరు : బలవంతపు పెళ్లితో పాకిస్తాన్‌లో చిక్కుకున్న బాధితురాలు 

ఐఏఎంఏఐ చైర్మన్‌గా రాజన్ ఆనందన్ గూగుల్ వైస్-ప్రెసిడెంట్‌గా (దక్షిణ-తూర్పు ఆసియా, ఇండియా) ఉన్న రాజన్ ఆనందన్ తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కొత్త చైర్మన్‌గా మే 25న నియమితులయ్యారు. ఫ్రీచార్జ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా వద్ద నుంచి ఈయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 
అలాగే ఐఏఎంఏఐ వైస్ చైర్మన్‌గా మేక్‌మైట్రిప్ చైర్మన్, సీఈవో దీప్ కల్రా ఎంపికయ్యారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐఏఎంఏఐ చైర్మన్ నియామకం 
ఎప్పుడు : మే 25 
ఎవరు : రాజన్ ఆనందన్ 

‘సూపర్‌కాప్’ కేపీఎస్ గిల్ మృతి పంజాబ్‌లో సిక్కు తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచిచేసి ‘సూపర్‌కాప్’గా పేరొందిన ఆ రాష్ట్ర మాజీ డీజీపీ కేపీఎస్ గిల్(82) మే 26న ఢిల్లీలో కన్నుమూశారు. కిడ్నీ వైఫల్యం, ఉదర, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఆయన సర్ గంగారాం ఆస్పత్రిలో తదిశ్వాస విడిచారు. పంజాబ్‌లో ఖలిస్తాన్ తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్న సమయంలో గిల్ 1988-1990, 1991-1995 మధ్య డీజీపీగా పనిచేశారు. 1995లో రిటైర్ అయ్యారు. 
ఇతర వివరాలు 
  • మిలిటెంట్లను చంపే పోలీసులకు రివార్డు ఇచ్చే సంప్రదాయాన్ని గిల్ నెలకొల్పారు.
  • 1988లో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం నుంచి తీవ్రవాదులను వెళ్లగొట్టేందుకు ఆపరేషన్ బ్లాక్ థండర్ చేపట్టారు.
  • 2002లో గుజరాత్‌లో గోధ్రా అనంతర అల్లర్ల తర్వాత ఆనాడు సీఎంగా ఉన్న మోదీ.. గిల్‌ను రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించుకున్నారు.
  • ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి గిల్ 2006-07 మధ్య భద్రతా సలహాదారుగా పనిచేశారు. కొన్నాళ్లు భారత హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. - 1989లో గిల్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత సూపర్ కాప్ మృతి
ఎప్పుడు : మే 26
ఎవరు : కేపీఎస్ గిల్ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా టెడ్రోస్ఇథియోపియా మాజీ మంత్రి టెడ్రోస్ అథనోమ్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డెరైక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు. బ్రిటన్, పాకిస్థాన్ అభ్యర్థుల్ని ఓడించి ఈ పదవిని దక్కించుకున్నారు. అథనోమ్ 2017 జూలై నుంచి ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

జామియా మిలిమా వర్సిటీ చాన్‌‌సలర్‌గా హెప్తుల్లాన్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా కేంద్ర విశ్వవిద్యాలయం నూతన చాన్‌‌సలర్‌గా మణిపూర్ గవర్నర్,, కేంద్ర మైనారిటీ శాఖ మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా నియమితులయ్యారు. 1920లో స్థాపించిన ఈ వర్సిటీకి చాన్‌‌సలర్ పదవిని మహిళ చేపట్టడం ఇదే తొలిసారి. ఐదేళ్లపాటు ఆమె చాన్‌‌సలర్ పదవిలో కొనసాగుతారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నూతన వీసీ 
ఎప్పుడు : మే 29
ఎవరు : నజ్మా హెప్తుల్లా 
ఎక్కడ : న్యూఢిల్లీ 

ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా కఠారియాషెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) కమిషన్ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి రామ్ శంకర్ కఠారియా పేరుని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వైస్ చైర్మన్‌గా బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎల్ మురుగన్‌ను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు వీరి పేర్లను రాష్ట్రపతి ఆమోదానికి పంపినట్లు సామాజిక న్యాయ, సాధికారిక శాఖ తెలిపింది. కమిషన్ సభ్యులుగా కె.రాములు(తెలంగాణ), యోగేశ్వర్ పాశ్వాన్ (బిహార్), స్వరాజ్ విద్వాన్ (ఉత్తరాఖండ్)లను కేంద్రం ప్రతిపాదించింది. కఠారియా ఆగ్రా నుంచి బీజేపీ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎస్సీ కమిషన్‌కు నూతన చైర్మన్ 
ఎప్పుడు : మే 30
ఎవరు : రామ్ శంకర్ కఠారియా

ఫోర్బ్స్ గ్లోబల్ గేమ్ చేంజర్ ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ రూపొందించిన ‘గ్లోబల్ గేమ్ చేంజర్స్’ జాబితాలో రిలయన్‌‌స ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజల జీవనంలో మార్పులు తీసుకురావడం, పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ధైర్యంగా చొరవచూపినందుకు గుర్తింపుగా ముకేష్ అంబానీని ఎంపిక చేసినట్లు ఫోర్బ్స్ మే 17న ప్రకటించింది. రిలయన్స్ జియోతో భారతదేశంలో అత్యధిక మొత్తంలో ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించినందుకు గాను ఆయనకు ఈ గుర్తింపు లభించింది. 
25 మంది ధైర్యవంతులైన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులతో ఈ జాబితాను రూపొందించారు. గ్లోబల్ గేమ్ చేంజర్స్ జాబితాను ఫోర్బ్స్ రూపొందించడం ఇది రెండోసారి.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఫోర్బ్స్ గ్లోబల్ గేమ్ చేంజర్స్ 
ఎప్పుడు : మే 17
ఎవరు : అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ 

కేంద్ర మంత్రి అనిల్ దవే కన్నుమూతకేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే(60) మే 18న న్యూఢిల్లీలో కన్నుమూశారు. జూలై 6, 1956న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బర్నాగర్ గ్రామంలో జన్మించిన దవే పెళ్లి చేసుకోలేదు.
పర్యావరణ పరిరక్షణకు అహర్నిశలు పాటుపడ్డ ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడిగా ఎన్నో ఏళ్లు సేవలందించారు. 2003 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ వ్యూహకర్తగా పనిచేసి బీజేపీకి అధికారం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన 2016లో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కేంద్ర మంత్రి అనిల్ దవే కన్నుమూత
ఎప్పుడు : మే 18
ఎక్కడ : న్యూఢిల్లీలో 

‘నేషనల్ జాగ్రఫిక్ బీ’గా ప్రణయ్ వరదాఅమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘నేషనల్ జాగ్రఫిక్ బీ’ పోటీల్లో భారత సంతతి విద్యార్థి ప్రణయ్ వరదా విజేతగా నిలిచాడు. తక్లీమకన్ ఏడారిని టిబెట్ పీఠభూమి నుంచి వేరు చేస్తున్న పర్వతాలు ఏవి? అని అడిగిన ప్రశ్నకు కున్‌లున్ పర్వతాలు అని సమాధానం చెప్పి ఈ బహుమతి గెలుచుకున్నాడు. దీంతో 14 ఏళ్లకే 50 వేల డాలర్ల అమెరికా బంపర్ ఫ్రైజ్‌ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. 
గత పదేళ్లుగా అమెరికాలో భారత సంతతి విద్యార్థులే ఈ ప్రైజ్‌ను గెలుచుకుంటున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ‘నేషనల్ జాగ్రఫిక్ బీ’గా ప్రణయ్ వరదా
ఎప్పుడు : మే 18
ఎక్కడ : అమెరికా 

మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ విజేత నీతు మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ - 2017 కిరీటాన్ని నీతూ కైవసం చేసుకుంది. ఈ మేరకు మే 20న ముంబైలో జరిగిన ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో జ్యోతి, ఖుష్బూజాని రన్నరప్‌లుగా నిలిచారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : మిసెట్ ఇండియా ఇంటర్నేషనల్ - 2017
ఎప్పుడు : మే 20
ఎవరు : విజేత నీతు
ఎక్కడ : ముంబైలో 

ఎవరెస్టు అధిరోహణలో అన్షు జమ్‌సేన్‌పా రికార్డు 
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అన్షు జమ్‌సేన్‌పా(32) కేవలం అయిదురోజుల వ్యవధిలో ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన తొలి మహిళగా ప్రపంచ రికార్డు సాధించింది. ఈ మేరకు మే 19న ఉదయం ఫురి షెర్పాతో కలిసి ఎవరెస్ట్ ఎక్కడం ప్రారంభించిన అన్షు మే 20న ఉదయం 8 గంటల సమయంలో 8,848 మీటర్ల ఎత్తై శిఖరంపైకి చేరుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లైన అన్షు ఇప్పటివరకూ ఎవరెస్టును అయిదుసార్లు అధిరోహించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : 5 రోజుల్లో రెండు సార్లు ఎవరెస్టును అధిరోహించిన మహిళ
ఎప్పుడు : మే 20
ఎవరు : అన్షు జమ్‌సేన్‌పా

జేమ్స్‌బాండ్ హీరో రోజర్‌మూర్ కన్నుమూత
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించిన ‘జేమ్స్ బాండ్’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ బ్రిటిష్ నటుడు రోజర్ మూర్ (89) కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుడున్న ఆయన చికిత్స పొందుతూ స్విట్జర్‌లాండ్‌లో మరణించారు.
సైన్యం నుంచి సినిమాల దాకా..
  • 1927లో లండన్‌లో జన్మించిన మూర్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1946లో బ్రిటిష్ సైన్యంలో చేరారు.
  • కొన్నాళ్లు జర్మనీలో పనిచేసి కెప్టెన్ హోదా పొందారు. తర్వాత రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్‌‌ట్సలో శిక్షణ పొంది సినీరంగంలో ప్రవేశించారు.
  • 1973-1985 మధ్య విడుదలైన జేమ్స్ బాండ్ సిరిస్‌లోని ‘లివ్ అండ్ లెట్ డై’, ‘ద మేన్ విత్ ద గోల్డెన్ గన్’, ‘ద స్పై హూ లవ్‌‌డ మి’, ‘మూన్‌రేకర్’, ‘ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’, ‘ఆక్టోపస్సీ’, ‘ఎ వ్యూ టు కిల్’ వంటి మొత్తం ఏడు సినిమాల్లో నటించారు.
  • 1991లో యూనిసెఫ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.
  • బాండ్ సినిమాలపై రెండు పుస్తకాలు రాసిన మూర్ తన ఆత్మకథ ‘మై వర్డ్ ఈజ్ మై బాండ్’ను 2008లో వెలువరించారు.
  • మూర్ తల్లి లిలియన్ కోల్‌కతాలో జన్మించారు. 2005లో అయోడైజ్డ్ ఉప్పు ప్రచారం కోసం మూర్ యూనిసెఫ్ రాయబారిగా భారత్‌కు వచ్చారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : నటుడు రోజర్ మూర్ కన్నుమూత 
ఎప్పుడు : మే 23
ఎవరు : జేమ్స్ బాండ్ చిత్రాల కథానాయకుడు 
ఎక్కడ : స్విట్జర్లాండ్ 

మాజీ బాక్సర్ డెన్నిస్ స్వామి మృతితొలి తరం అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, ఆంధ్రప్రదేశ్ తరఫున తొలి అర్జున అవార్డు (1968) గ్రహీత డెన్నిస్ స్వామి (75).. మే 16న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన 1960 నుంచి 1970 వరకు వరుసగా పదేళ్లపాటు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. 

బాలీవుడ్ నటి రీమా లాగూ మృతిప్రముఖ బాలీవుడ్ నటి రీమా లాగూ(59) మే 18న ముంబైలో గుండెపోటుతో చనిపోయారు. మరాఠీ రంగ స్థలం నుంచి బాలీవుడ్‌లో ప్రవేశించిన ఆమె.. తల్లి పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఫ్రాన్సికో, జసింతాలకు సెయింట్ హోదా పోర్చుగల్ దేశంలోని ఫాతిమా పట్టణంలో వందేళ్ల క్రితం కన్నె మేరీ దర్శనమైన ఇద్దరు చిన్నారుల్ని పోప్ ఫ్రాన్సిస్ సెయింట్(పునీత)లుగా ప్రకటించారు. ఈ మేరకు మే 13న ఫాతిమాలోని వైట్ బాసిలికా చర్చి ముందు ఫ్రాన్సికో మార్టో, జసింతా మార్టోల్ని సెయింట్‌లుగా ప్రకటించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు వాటికన్ ప్రకటించింది. 
1917 మే నుంచి అక్టోబర్ మధ్యలో జసింతా(7), ఆమె సోదరుడు ఫ్రాన్సికో(9), సోదరి లూసియా(10)లకు కన్నె మేరీ ఆరుసార్లు కనిపించి మూడు భవిష్యత్ దర్శనాల్ని వారికి చూపించినట్లు క్యాథలిక్కులు భావిస్తారు. 1919లో ఫ్రాన్సికో, తర్వాతి సంవత్సరం జసింతా మరణించారు. 2005లో లూసియా మరణించగా.. ఆమెను కూడా పునీతగా ప్రకటించే కార్యక్రమం ఇప్పటికే మొదలుపెట్టారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఇద్దరు చిన్నారులకు సెయింట్ హోదా
ఎప్పుడు : మే 13
ఎవరు : ఫ్రాన్సికో మార్టో, జసింతా మార్టో
ఎక్కడ : పోర్చుగల్ 

ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ ఉద్వాసన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డెరైక్టర్ జేమ్స్ కొమెను పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ మే 10న ప్రకటించారు. ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కొమెను తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా అటార్నీ జనరల్ జెఫ్ సెస్సన్స్‌, డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోసెన్‌స్టెయిన్ సంయుక్తంగా ప్రెసిడెంట్‌కు లేఖ రాయడంతో, వారి వినతిని ట్రంప్ ఆమోదించారని సీన్ స్పైసర్ వెల్లడించారు. 
ప్రస్తుతం డిప్యూటీ డెరైక్టర్‌గా ఉన్న ఆండ్రూ మెక్‌కాబెను యాక్టింగ్ డెరైక్టర్‌గా నియమించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 ఎఫ్‌బీఐ డెరైక్టర్ ఉద్వాసన 
ఎప్పుడు : మే 10
ఎవరు : జేమ్స్ కొమె
ఎక్కడ : అమెరికాలో 

డబ్ల్యూహెచ్‌వో అంబాసిడర్‌గా అమితాబ్ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నియమితులయ్యారు. ఆగ్నేయాసియాలో హెపటైటిస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటామని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా రీజనల్ డెరైక్టర్ పూనం ఖేత్రాపాల్ సింగ్ మే 12న తెలిపారు. 
హెపటైటిస్ వల్ల గర్భస్థ శిశుమరణాలు సంభవిస్తున్నాయి. అమితాబ్ సహకారంతో 2030 కల్లా హెపటైటిస్ ప్రభావాన్ని తగ్గించడానికి కృషి చేస్తామని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : డబ్ల్యూహెచ్‌వో అంబాసిడర్‌గా అమితాబ్
ఎప్పుడు : మే 12 
ఎందుకు : ఆగ్నేయాసియాలో హెపటైటిస్ నివారణకు కృషి చేసేందుకు 

తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన లారెన్స్‌ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ తన తల్లి కన్మణికి ఆలయాన్ని నిర్మించారు. అంబత్తూర్ సమీపంలోని తిరుముల్ లైవాయిల్‌లో ఇంతకు ముందు శ్రీరాఘవేంద్రస్వామి ఆలయాన్ని నిర్మించిన లారెన్స్‌ ఆ పక్కనే తల్లికి గుడి కట్టించారు. మే 14న మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని తల్లి విగ్రహంతో పాటు గాయత్రిదేవి విగ్రహాన్ని, శివలింగాన్ని కూడా ప్రతిష్టించారు. అనంతరం వెయి్య మంది మహిళలకు చీరలు దానం చేశారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : తల్లి విగ్రహ ప్రతిష్టాపన
ఎప్పుడు : మే 14 
ఎవరు : రాఘవ లారెన్స్ 
ఎక్కడ : తమిళనాడులోని తిరుముల్ లైవాయిల్‌లో

ఎవరెస్ట్‌ని 8వ సారి అధిరోహించిన లాక్పా షెర్పానేపాల్‌కు చెందిన 44 ఏళ్ల మహిళ లాక్పా షెర్పా మౌంట్ ఎవరెస్ట్‌ను 8వ సారి ఎక్కి సరికొత్త రికార్డు నెలకొల్పారు. మే 13న ఆ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి ఎవరెస్ట్‌ను అధిక సార్లు ఎక్కిన మహిళగా నిలిచారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన లాక్పా షెర్పా.. ఎలాంటి శిక్షణ లేకుండానే 2000లో తొలిసారి మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎవరెస్ట్‌ని 8వ సారి అధిరోహించిన మహిళ
ఎప్పుడు : మే 13
ఎవరు : లాక్పా షెర్పా

ఫ్రాన్స్‌ ప్రధానిగా ఎడోవర్డ్ ఫిలిప్ఫ్రాన్స్‌ ప్రధాన మంత్రిగా పార్లమెంట్ సభ్యుడు ఎడోవర్డ్ ఫిలిప్ (ది రిపబ్లికన్ పార్టీ) మే 15న నియమితులయ్యారు. ఈ మేరకు ఆ దేశ కొత్త అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఆయన నియామకాన్ని ప్రకటించారు. 46 ఏళ్ల ఫిలిప్.. ప్రస్తుతం లీ హావర్ పట్టణానికి మేయర్‌గా కూడా పనిచేస్తున్నారు. 
మెక్రాన్, ఫిలిప్‌లు ప్రఖ్యాత ఎకోల్ నేషనల్ డి అడ్మినిస్ట్రేషన్ కాలేజీలో చదువుకున్నారు. తొలుత సోషలిస్టులతో కలసి పనిచేసిన ఫిలిప్ తర్వాత సంప్రదాయవాద రిపబ్లికన్లలో చేరారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 ఫ్రాన్స్‌కు కొత్త ప్రధాని 
ఎప్పుడు : మే 15
ఎవరు : ఎడోవర్డ్ ఫిలిప్

గవర్నెన్స్ విత్ డిఫరెన్స్ పుస్తకావిష్కరణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్‌వో జ్వాల నర్సింహారావు గవర్నెన్స్ విత్ డిఫరెన్స్ అనే శీర్షికతో పుస్తకాన్ని రచించారు. ఈ మేరకు పుస్తకం తొలి ప్రతిని ఆయన సీఎం కేసీఆర్‌కు మే 5న అందజేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను, వాటి అమలు కోసం చేసిన ప్రత్యేక చొరవను ఈ పుస్తకంలో జ్వాలా పొందుపరిచారు. ప్రతీ పథకం రూపకల్పనకున్న నేపథ్యాన్ని, అమలులో ఉన్న సమస్యలను అధిగమించడానికి చేసిన ప్రయత్నాలను వివరణాత్మకంగా పేర్కొన్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : గవర్నెన్స్ విత్ డిఫరెన్స్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : మే 5 
ఎవరు : జ్వాలా నర్సింహారావు 

తొలి మహిళా సీజే జస్టిస్ లీలాసేథ్ కన్నుమూతభారత్‌లో హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ లీలాసేథ్(86) మే 6న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆమె లండన్ బార్ పరీక్షలో ప్రథమ స్థానం సాధించిన తొలి భారత మహిళగా కూడా నిలిచారు. ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నిర్భయ ఉదంతం తరువాత, లైంగిక నేరాలకు పాల్పడే వారిపై విచారణ త్వరగా పూర్తయ్యేలా న్యాయ శాస్త్రంలో సవరణల్ని సిఫార్సు చేయడానికి నియమించిన జస్టిస్ వర్మ కమిటీలో లీలా కూడా సభ్యురాలు. 
ఆమె స్వీయ చరిత్ర ‘ఆన్ బ్యాలెన్‌‌స’ బాగా అమ్ముడుపోయిన పుస్తకంగా నిలిచింది. లీలా సేథ్ కుమారుడు విక్రమ్ సేథ్ కూడా రచయితే. 
క్విక్ రివ్యూ:ఏమిటి : తొలి మహిళా సీజే కన్నుమూత
ఎప్పుడు : మే 6
ఎవరు : జస్టిస్ లీలాసేథ్ 
ఎక్కడ : నోయిడా (న్యూఢిల్లీ)

మేధస్సులో ఐన్‌స్టీన్‌ను మించిన రాజ్‌గౌరీ పవార్ మేధస్సును కొలిచేందుకు ఇటీవల నిర్వహించిన బ్రిటీష్ మెన్సా ఐక్యూ పరీక్షలో బ్రిటన్‌కు చెందిన భారత సంతతి చిన్నారి రాజ్‌గౌరీ పవార్(12) 162 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. తద్వారా ప్రఖ్యాత బ్రిటీష్ మెన్సా సొసైటీలో సభ్యత్వం పొందింది. పరీక్షలో ఆమె సాధించిన స్కోర్ గతంలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లు సాధించిన దానికన్నా రెండు పాయింట్లు ఎక్కువ. చెస్‌హైర్ కౌంటీకి చెందిన రాజ్‌గౌరీ ప్రస్తుతం అల్ట్రిన్‌చమ్ గ్రామర్ స్కూల్‌లో చదువుతోంది. 
సాధారణంగా మెన్సా ఐక్యూ పరీక్షలో 140 పాయింట్లు సాధించిన వారిని మేధావులుగా పరిగణిస్తారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐక్యూ పరీక్షలో రాజ్‌గౌరీ పవార్‌కు మొదటిస్థానం 
ఎప్పుడు : 2017 మే 
ఎవరు : బ్రిటీష్ మెన్సా
ఎక్కడ : లండన్ 

బ్రిటన్ సంపన్నుల్లో హిందుజా బ్రదర్స్ టాప్బ్రిటన్‌లో అత్యంత సంపద కలిగిన వారిగా హిందుజా సోదరులు అగ్ర స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు ‘ద సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2017’ ను మే 7న విడుదల చేసింది. మొత్తం వెయ్యి మందితో కూడిన ఈ జాబితాలో హిందుజా సోదరులతో పాటు భారత సంతతికి చెందిన వారు 40 మందికి పైనే ఉన్నారు. 
హిందుజా సోదరుల సంపద 16.2 బిలియన్ పౌండ్లుగా అంచనా వేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే వీరి సంపద 3.2 బిలియన్ పౌండ్లు వృద్ధి చెందింది. 14 బిలియన్ పౌండ్ల సంపదతో డేవిడ్, సైమన్ రూబెన్ మూడో స్థానంలో, 13.3 బిలియన్ పౌండ్లతో లక్ష్మీ నివాస్ మిట్టల్ నాలుగో స్థానంలో ఉన్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ద సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2017
ఎప్పుడు : మే 6 
ఎక్కడ : బ్రిటన్‌లో సంపన్నుల జాబితా 
ఎవరు : హిందుజా బ్రదర్స్ టాప్

బ్రిటన్ రాయల్ సభ్యులుగా భారతీయ శాస్త్రవేత్తలు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉండే బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీలో ముగ్గురు భారత సంతతి శాస్త్రవేత్తలు సభ్యులుగా ఎన్నికయ్యారు. కేంబ్రిడ్‌‌జ వర్సిటీకి చెందిన క్రిష్ణ చటర్జీ, న్యూయార్క్ వర్సిటీకి చెందిన సుభాష్ కోఠ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన యద్వీందర్ మల్హీలకు ఈ గౌరవం దక్కింది. అకాడమీ సభ్యులుగా 2017 సంవత్సరానికిగానూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నికై న 50 మంది శాస్త్రవేత్తల బృందంలో వీరికి స్థానం లభించింది. 
భారత సంతతికి చెందిన వెంకటరామ రామక్రిష్ణన్ ( నోబెల్ ప్రైజ్ విజేత - రసాయనశాస్త్రం) రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : భారతీయ శాస్త్రవేత్తలకు బ్రిటన్ రాయల్ సభ్యత్వం 
ఎప్పుడు : 2017 మే
ఎవరు : బ్రిటన్ రాయల్ కమిటీ 
ఎక్కడ : లండన్ 

ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మేక్రన్యూరోపియన్ యూనియన్ అనుకూలవాది, స్వతంత్ర అభ్యర్థి ఇమ్మాన్యుయేల్ మేక్రన్ (39) ఫ్రాన్‌‌స అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈ మేరకు మే 8న వెలువడిన ఫలితాల్లో మేక్రన్ 66.1 శాతం ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి లీపెన్‌కు 33.9 శాతం ఓట్లు వచ్చాయి. తద్వారా మేక్రన్ అతి పిన్నవయసులో అధ్యక్షుడిగా ఎన్నికై ఫ్రాన్‌‌స రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. 
దేశంలో స్వతంత్ర అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ఆధునిక ఫ్రాన్‌‌సను ఇంతవరకూ సోషలిస్టులు, సంప్రదాయ వాదులే పాలించారు. కాగా మేక్రన్ విజయంతో ఈయూలో ఇక నుంచి ఫ్రాన్‌‌స కీలకపాత్ర పోషించేందుకు మార్గం సుగమమైంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు 
ఎప్పుడు : మే 8
ఎవరు : అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మేక్రన్
ఎక్కడ : ఫ్రాన్స్ 

కేంద్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా గోవర్దన్కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ పరిధిలోని కనీస వేతనాల (కేంద్ర సలహా మండలి) బోర్డు చైర్మన్‌గా సంగారెడ్డికి చెందిన ఆవుల గోవర్దన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం మే 5న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం గోవర్దన్ బీజేపీ ఆజీవన సహయోగి నిధి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. నీటి కోసం- శాంతి కోసం రాయలసీమ పాదయాత్ర కార్యక్రమానికి, అల్- కబీర్ హఠావో ఉద్యమానికి గోవర్దన్ కన్వీనర్‌గా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : కేంద్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ నియామకం
ఎప్పుడు : మే 8
ఎవరు : చైర్మన్‌గా ఆవుల గోవర్దన్

‘ఐరాస నివాసాలకు’ భారత్ నేతృత్వం ప్రపంచవ్యాప్తంగా సుస్థిర మానవ నివాసాల ఏర్పాటును ప్రోత్సహించే ఐక్య రాజ్యసమితి విభాగమైన యూఎన్-హాబిటాట్‌కు భారత్ రెండేళ్లపాటు నేతృత్వం వహించనుంది. ఈ మేరకు కెన్యాలోని నైరోబీలో మే 8న ప్రారంభమైన ఈ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్ష స్థానానికి భారత్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ‘నూతన పట్టణ ఎజెండా - సమర్థవంతమైన అమలుకు అవకాశాలు’ అనే అంశంపై జరుగుతోన్న పాలకమండలి సమావేశాలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వం వహించారు. రెండేళ్లపాటు ఈ సంస్థ చర్చలకు వెంకయ్యే నాయకత్వం వహిస్తారు. యూఎన్-హాబిటాట్‌కు భారత్ నేతృత్వం వహించడం ఇది మూడోసారి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ‘ఐరాస నివాసాలకు’ భారత్ నేతృత్వం 
ఎప్పుడు : మే 8 
ఎవరు : రెండేళ్ల పాటు నేతృత్వం వహించనున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు 

భారత్‌లో పాక్ హైకమిషనర్‌గా సోహైల్భారత్‌లో పాక్ తదుపరి హైకమిషనర్‌గా సీనియర్ దౌత్యవేత్త సోహైల్ మహమూద్(55) నియమితులయ్యారు. ప్రస్తుతం టర్కీలో పాక్ రాయబారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన, మే చివరిలో లేదా జూన్ మొదటివారంలో బాధ్యతలు చేపడతారు. ఇందుకనుగుణంగా సోహైల్ వీసా దరఖాస్తును మే 5న ఆమోదించినట్లు పాక్‌లోని భారత హైకమిషన్ తెలిపింది. 
1985లో పాక్ విదేశాంగ శాఖలో చేరిన సోహైల్, చరిత్ర, అంతర్జాతీయ సంబంధాలపై మాస్టర్ డిగ్రీలు చేశారు. ప్రస్తుతం భారత్‌లో పాక్ హైకమిషనర్‌గా ఉన్న అబ్దుల్ బాసిత్ మూడేళ్ల పదవీకాలం ముగిసిపోవడంతో సోహైల్‌ను నియమించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత్‌లో పాక్ హైకమిషనర్
ఎప్పుడు : మే 8 
ఎవరు : సోహైల్ మహమూద్

సీబీడీటీ చీఫ్ సుశీల్ చంద్ర పదవీ కాలం ఏడాది పొడగింపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌గా సుశీల్ చంద్ర పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ఆయన పునర్‌నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ మే 8న ఆమోదం తెలిపింది. దీని ప్రకారం సుశీల్ చంద్ర 2017, జూన్ 1 నుంచి 2018, మే 31 వరకు పదవీలో కొనసాగనున్నారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన సుశీల్ చంద్ర 1980 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : సీబీడీటీ చీఫ్ సుశీల్ చంద్ర పదవీ కాలం 
ఎప్పుడు : మే 8
ఎవరు : కేబినెట్ నియామకాల కమిటీ

జస్టిస్ కర్ణన్‌కు 6 నెలల జైలు శిక్ష కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు ఆర్నెల్లు జైలుశిక్ష విధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మే 9న ఆదేశాలు జారీచేసింది. కాగా పదవిలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తికి కోర్టు ధిక్కరణ అభియోగాలపై ఇలాంటి శిక్ష విధించడం దేశంలో ఇదే తొలిసారి. 
జస్టిస్ కర్ణన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా పలువురు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ దేశ ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని సహా ఇతరులకు లేఖలు రాశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను కర్ణన్ బేఖాతరు చేయటాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : జస్టిస్ కర్ణన్‌కు 6 నెలల జైలు శిక్ష 
ఎప్పుడు : మే 9
ఎవరు : సుప్రీం కోర్టు 
ఎందుకు : కోర్టు ధిక్కారణ కేసులో 

దక్షిణ కొరియా అధ్యక్షుడిగా మూన్ జే ఇన్దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, మానవ హక్కుల న్యాయవాది మూన్ జే ఇన్ (64) ఘన విజయం సాధించారు. మే 9న వెలువడిన ఫలితాల్లో మూన్‌కు 41.08 శాతం ఓట్లు, సంప్రదాయవాది హంగ్ జూన్-ప్యోకు 24.03 శాతం, తటస్థ వాది అహన్ చియోల్ సూకు 21.41 శాతం ఓట్లు వచ్చాయి. భారీ విజయం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మూన్ ఉత్తర కొరియాతో శాంతి చర్చలు జరుపుతానని ప్రకటించారు. 
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్క్ గెన్ హేను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో తాజా ఎన్నికలు నిర్వహించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : దక్షిణ కొరియాకు కొత్త అధ్యక్షుడు 
ఎప్పుడు : మే 9
ఎవరు : మూన్ జే ఇన్

No comments:

Post a Comment