AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఫిబ్రవరి 2016

వార్తల్లో వ్యక్తులు ఫిబ్రవరి 2016
ఎన్.హెచ్.ఆర్.సి. చైర్మన్‌గా జస్టిస్ హెచ్.ఎల్ దత్తు
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.లక్ష్మీ నారాయణస్వామి దత్తు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఫిబ్రవరి 28న ఆయన్ను ఎంపిక చేసింది. జస్టిస్ దత్తు ఐదేళ్ల పాటు ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ పదవిలో కొనసాగనున్నారు.
ఫోర్బ్స్ ఆసియా జాబితాలో సానియా, కోహ్లి
అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ ఫోర్బ్స్.. ఆసియన్ క్రీడాకారుల్లో 30 ఏళ్ల లోపున్న అత్యంత ప్రతిభావంతుల జాబితాను విడుదల చేసింది. ఇందులో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, క్రికెటర్ విరాట్ కోహ్లి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌లకు చోటు దక్కింది. మొత్తం 300 మందిని ఎంపిక చేయగా భారత్ నుంచి 56 మందికి జాబితాలో చోటు దక్కింది.
ప్రముఖ సినీ రచయిత వేణుగోపాలాచార్యులు కన్నుమూత
ప్రముఖ సినీ రచయిత ఆచ్చి వేణుగోపాలాచార్యులు(91) ఫిబ్రవరి 26న అనారోగ్యంతో కన్నుమూశారు. పట్నంలో శాలిబండ, పదవే పోదాము గౌరీ, జయజయజయ శ్రీ వేంకటేశ, నమో వేంకటేశ.. నమో తిరుమలేశా తదితర పాటల ద్వారా వేణుగోపాలాచార్యులు తెలుగువారికి సుపరిచితులు. ఆధ్యాత్మిక వేత్తగా.. వేద పండితులుగా.. సినీ రచయితగా ఎంతో కీర్తి ప్రతిష్టలను ఆయన సొంతం చేసుకున్నారు. వేణుపాలాచార్యులు హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో జన్మించారు. తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రవీణులైన వేణుగోపాలాచార్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తిరీత్యా రచయిత. సంధ్యాదీపం, పచ్చని సంసారం, భాగ్యవంతుడు, అమరుడు తదితర మంచి చిత్రాల్లో పాటలను రాసి ఎంతో కీర్తి గడించారు. తెలుగుతో పాటు హిందీ చిత్రం నాసిక్‌లో కూడా ఆయన పాటలు రాశారు.
తూర్పు నావికా దళ చీఫ్‌గా బిస్త్
తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ హెచ్.సి.ఎస్. బిస్త్ ఫిబ్రవరి 29న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈఎన్‌సీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన వైస్ అడ్మిరల్ సతీష్‌సోనీ ఫిబ్రవరి 29న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో బిస్త్ బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి అయిన బిస్త్ 1979లో నావికాదళంలో చేరారు. రాయల్ నేవీ స్టాఫ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. నావికాదళంలోని పలు యూనిట్లలో సేవలందించిన ఆయన పదోన్నతిపై ఈఎన్‌సీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా కలిఖో పుల్ 
అరుణాచల్ ప్రదేశ్ కొత్త సీఎంగా కలిఖో పుల్ ఫిబ్రవరి 19న ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఎత్తేయాలని కేంద్ర కేబినెట్ చేసిన సిఫార్సును రాష్ట్రపతి ఆమోదించటంతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 60 మంది సభ్యులు గల శాసనసభలో బీజేపీ సభ్యులతో కలుపుకొని మొత్తం 31 మంది మద్దతుతో కలిఖో పుల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఐరాస మాజీ ప్రధాన కార్యద ర్శి బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ మృతి
ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యద ర్శి బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ (93) ఫిబ్రవరి 16న కైరోలో మరణించారు. ఆయన 1992 నుంచి 1996 మధ్య ఐరాస ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆఫ్రికా నుంచి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా ఘలీ గుర్తింపు పొందారు.
సంగీత విద్వాంసుడు ఉస్తాద్ అబ్దుల్ రషీద్‌ఖాన్ మృతి
ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్‌ఖాన్ (107) కోల్‌కతాలో ఫిబ్రవరి 18న మరణించారు. తాన్‌సేన్ వంశస్థుడైన ఉస్తాద్ 107 ఏళ్ల వయసులో కూడా గీతాలను ఆలపించారు. రసన్ పియా కలం పేరుతో రెండు వేల కవితలు రాశారు. ఆయనకు పద్మభూషణ్, సంగీత, నాటక అకాడెమీ అవార్డులు లభించాయి.
లిమ్కా బుక్‌లో సచిన్ పుస్తకం
మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ పెద్దల విభాగంలో భారత దేశంలో అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంగా రికార్డులకెక్కింది. మొత్తం లక్షా 50 వేల 289 కాపీల ఆర్డర్‌ను ఈ పుస్తకం సొంతం చేసుకుంది. 6 నవంబర్ 2014న ఈ పుస్తకం విడుదలైంది. 
కౌలాలంపూర్ పోలీస్ చీఫ్‌గా భారత సంతతి వ్యక్తి
భారత సంతతికి చెందిన అమర్‌సింగ్ కౌలాలంపూర్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. మలేసియాలో ఓ సిక్కు వ్యక్తి సాధించిన అత్యున్నత పోలీస్ పదవి ఇదే. సీఐడీ విభాగానికి బదిలీ అయిన తాజుద్దీన్ మహ్మద్ స్థానంలో అమర్‌సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అమర్‌సింగ్ గతంలో సీఐడీ డిప్యూటీ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అమర్‌సింగ్ కుటుంబానిది భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ నుంచి మలేసియా వెళ్లిన అమర్‌సింగ్ తండ్రి ఇషార్‌సింగ్ 1939లో అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు.
మూడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు
మేఘాలయ, కర్ణాటక, ఒడిశా రాష్ట్ర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను కేంద్ర న్యాయ శాఖ నియమించింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సుబ్రో కమల్ ముఖర్జీని అదే కోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కర్ణాటక హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ వినీత్ సరన్‌ను ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు

మలమాళీ రచయిత కురూప్ మృతి
ప్రముఖ మలయాళ రచయిత, పర్యావరణవేత్త ఓఎన్‌వీ కురూప్(84) అనారోగ్యంతో ఫిబ్రవరి 12న మరణించారు. ఆయన తన రచనల ద్వారా ప్రగతిశీల ఉద్యమాలకు ఊపిరి పోశారు. కురూప్ 2007లో జ్ఞాన్‌పీఠ్, 2011లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. 
భారత రాయబారి బీరజా ప్రసాద్ మృతి
తజికిస్తాన్‌లో భారత రాయబారిగా ఉన్న బీరజా ప్రసాద్ గుండెపోటుతో ఫిబ్రవరి 13న భువనేశ్వర్‌లో మరణించారు. 1998లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరిన ఆయన అనేక దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేశారు.
సెబీ చైర్మన్ సిన్హా పదవీకాలం పొడిగింపు
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్‌గా యూకే సిన్హా పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సెబీ చైర్మన్‌గా సిన్హా 2017 మార్చి 1 వరకు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే దాకా పదవిలో కొనసాగుతారు. మామూలుగా సెబీ చైర్మన్‌గా సిన్హా పదవీకాలం ఫిబ్రవరి 17తో ముగుస్తుంది. ఈయన 2011 ఫిబ్రవరి 18న సెబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. సిన్హా బిహార్‌కు కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్.
హెచ్‌పీసీఎల్ కొత్త సీఎండీ ఎం.కె. సురన
దేశీ మూడో అతి పెద్ద అయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కొత్త సీఎండీగా ఎం.కె.సురన నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ అనుబంధ కంపెనీ ప్రైజ్ పెట్రోలియం కార్పొరేషన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుత హెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. హెచ్‌పీసీఎల్ సీఎండీగా సురన ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపడతారు. పదవీకాలం ఐదేళ్లు.

ప్రముఖ కార్టూనిస్టు సుధీర్ తైలంగ్ మృతి
ప్రముఖ రాజకీయ కార్టూనిస్టు సుధీర్ తైలంగ్ (56) అనారోగ్యంతో గుర్గావ్‌లో 2016 ఫిబ్రవరి 6న మరణించారు. ఆయన వివిధ దినపత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేశారు. ఆయనకు 2004లో పద్మశ్రీ అవార్డు లభించింది.
వ్యోమగామి ఎడ్గార్ మృతి
చంద్రుడిపై నడిచిన ఆరో వ్యోమగామి ఎడ్గార్ మిచెల్ (85) మియామిలో ఫిబ్రవరి 4న మరణించారు. ఆయన 1971 జనవరి 31 నుంచి పిబ్రవరి 9 వరకు అపోలో-14 యాత్రలో పాల్గొన్నారు.
‘ముద్ర’ కృష్ణమూర్తి కన్నుమూత
దేశంలోనే ప్రచారరంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘ముద్ర’ ఏజెన్సీ వ్యవస్థాపకుడు ఎ.జి.కృష్ణమూర్తి (73) ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా వినుకొండ. 1968లో కాలికోమిల్స్‌లో కెరీర్‌ను ప్రారంభించిన కృష్ణమూర్తి.. 1972లో శిల్పి అడ్వర్టయిసింగ్ ఏజెన్సీని నెలకొల్పారు. 1982లో ‘ముద్ర’ కమ్యూనికేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. 1991లో ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్‌ను స్థాపించారు. తర్వాత దేశవ్యాప్తంగా ప్రచార రంగంలో తమ సేవలను విస్తరించారు. దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న కృష్ణమూర్తి కాలమిస్ట్‌గా, రచయితగా కూడా ప్రసిద్ధుడు. ఆంగ్లం, తెలుగులో పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. ఆయన పుస్తకాలు పలు భారతీయ భాషల్లో ప్రచురితమయ్యాయి.
నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా కన్నుమూత
నేపాల్ మాజీ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా(79) ఫిబ్రవరి 9న కన్నుమూశారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుశీల్ భారత్‌తో స్నేహసంబంధాలకు గట్టి మద్దతుదారుగా నిలిచారు. 2014 ఫిబ్రవరి - 2015 అక్టోబర్ మధ్య నేపాల్ ప్రధానిగా పనిచేశారు. అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్‌లో సుస్థిరత తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. భారత్‌తో చక్కని సంబంధాలను కొనసాగించారు. అయితే పదవీకాలం చివరిలో కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో 2015 అక్టోబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు. 1954లో రాజకీయాల్లోకి వచ్చిన సుశీల్ నేపాల్‌లో రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారు. అవివాహితుడైన ఆయన 16 ఏళ్లు భారత్‌లో ప్రవాస జీవితాన్ని గడిపారు.

సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా దుర్గాప్రసాద్
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా కె.దుర్గాప్రసాద్ ఫిబ్రవరి 1న నియమితులయ్యారు. దుర్గాప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ అధికారి.

ఎన్‌టీపీసీ సీఎండీగా గుర్‌దీప్ సింగ్గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్ప్ హెడ్‌గా వ్యవహరిస్తున్న గుర్‌దీప్ సింగ్‌ను దేశీ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీకి చైర్మన్, ఎండీగా (సీఎండీ) కేంద్ర ప్రభుత్వం తాజాగా నియమించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు సాధారణంగా పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు పర్యవేక్షణలో జరుగుతాయి. కానీ ఎన్‌టీపీసీ చైర్మన్ నియామకం మాత్రం దానికి భిన్నంగా జరిగింది. ఎన్‌టీపీసీ చైర్మన్ నియామకం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిఫారసు మేరకు గుర్‌దీప్ సింగ్‌ను నియమించారు. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా డాక్టర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్రంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమిస్తూ జీవో జారీ అయ్యింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు నిమ్మగడ్డ ఈ పదవిలో కొనసాగుతారు.

ఎస్‌ఎస్‌బీ చీఫ్‌గా తొలిసారి మహిళ సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ) డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చన రామసుందరం(58) ఫిబ్రవరి 1న నియమితులయ్యారు. ఒక పారా మిలటరీ విభాగానికి చీఫ్‌గా మహిళను నియమించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పెషల్ డెరైక్టర్‌గా ఉన్న అర్చన రామసుందరం.. 2017 సెప్టెంబర్ 30 వరకు ఎస్‌ఎస్‌బీ డీజీగా విధులు నిర్వర్తిస్తారు. నేపాల్, భూటాన్ సరిహద్దుల రక్షణ ఎస్‌ఎస్‌బీ ప్రధాన విధి. 

లోక్‌సభ మాజీ స్పీకర్ బలరాం జాఖఢ్ కన్నుమూతకాంగ్రెస్ కురువృద్ధ నాయకుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరాం జాఖఢ్ ఫిబ్రవరి 3న న్యూఢిల్లీలో కన్నుమూశారు. 92 ఏళ్ల జాఖఢ్ 1980 నుంచి 1989 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. అప్పటి ప్రధాని నరసింహారావు హయాంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, వర్కింగ్ కమిటీ సభ్యునిగా చేశారు. నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004-2009 కాలంలో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. పంజాబ్ అసెంబ్లీలో వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.

గుజరాత్ సీజేగా జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిఆంధ్రప్రదేశ్/తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డిని గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతిపై నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఫిబ్రవరి 3న ప్రకటన విడుదల చేసింది. పదవీబాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఆయన పదోన్నతి వర్తిస్తుంది.

No comments:

Post a Comment