AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు సెప్టెంబరు 2016

క్రీడలు సెప్టెంబరు 2016
ఆసియా బీచ్ కబడ్డీలో భారత్‌కు స్వర్ణం
 ఆసియా బీచ్ కబడ్డీ క్రీడల్లో భారత మహిళల జట్టు వరుసగా ఐదోసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్లో భారత్ 41-31 పాయింట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ఈ క్రీడల్లో 2008 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లూ థాయ్‌లాండ్‌పైనే భారత్ నెగ్గడం విశేషం.
భారత్‌కు అండర్-18 హాకీ ఆసియా కప్
ఆసియా కప్ అండర్-18 హాకీ టోర్నీలో భారత జట్టు విజయం సాధించింది. సెప్టెంబర్ 30న జరిగిన ఫైనల్‌లో 5-4తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్ గెలుచుకుంది. 4-4తో మరో 20 సెకన్లలో ఆట ముగియనుండగా అభిషేక్ యాదవ్ గోల్ చేసి భారత జట్టుకు టైటిల్ అందించాడు.

500వ టెస్టులో భారత్ విజయం
 న్యూజిలాండ్‌తో జరిగిన చరిత్రాత్మక 500వ టెస్టులో భారత క్రికెట్ జట్టు విజయం సాధించింది. సెప్టెంబర్ 26న కాన్పూర్‌లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 197 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది.

రవీంద్ర జడేజా కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు సహా మొత్తం మ్యాచ్‌లో 10 వికెట్లు తీశాడు. ఇలా అతడు ఒక మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టడం (ఐదు వికెట్లు - 19 సార్లు) ఇది ఐదోసారి. అశ్విన్ 37 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించగా, హర్భజన్ 60 టెస్టుల్లో సాధించాడు. అనిల్ కుంబ్లే 8 సార్లు 10 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.

చరిత్రాత్మక టెస్టుల్లో భారత ప్రదర్శన
టెస్టు
ప్రత్యర్థి
ఫలితం
ఏడాది
వేదిక
కెప్టెన్
1
ఇంగ్లండ్
ఓటమి
1932
లార్డ్స్
సీకే నాయుడు
100
ఇంగ్లండ్
ఓటమి
1967
బర్మింగ్‌హామ్
ఎంఏకే పటౌడీ
200
పాకిస్తాన్
డ్రా
1982
లాహోర్
గావస్కర్
300
దక్షిణాఫ్రికా
గెలుపు
1996
అహ్మదాబాద్
సచిన్
400
వెస్టిండీస్
గెలుపు
2006
కింగ్‌స్టన్
ద్రవిడ్
500
న్యూజిలాండ్
గెలుపు
2016
కాన్పూర్
కోహ్లి

భారత్‌కు పోలిష్ ఓపెన్ బ్యాడ్మింటన్ ట్రోఫీలు పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులకు మహిళ సింగిల్స్, డబుల్స్ ట్రోఫీలు లభించాయి. మహిళల సింగిల్స్ టైటిల్‌ను రితూపర్ణ దాస్, డబుల్స్ టైటిల్‌ను సంజన సంతోష్- ఆరతి సారా జంట గెలుచుకున్నారు. 

జూనియర్ ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో స్థానం అంతర్జాతీయ షూటింగ్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) నిర్వహించిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు మొత్తం 24 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈ టోర్నీలో 9 స్వర్ణాలు సహా భారత్ 24 పతకాలు (5 రజతాలు, 10 కాంస్యాలు) సాధించింది. మరోవైపు 25 పతకాలతో (12 స్వర్ణాలు) రష్యా అగ్రస్థానంలో నిలిచింది. 

సత్యన్ జ్ఞానశేఖరన్‌కు బెల్జియం ఓపెన్ టీటీ టైటిల్ భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు సత్యన్ జ్ఞానశేఖరన్‌కు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) నిర్వహించిన బెల్జియం ఓపెన్ వరల్డ్ టూర్ టైటిల్ దక్కింది. బెల్జియంలోని డీ హాన్ నగరంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సత్యన్ 4-0 (15-13, 11-6, 11-2, 17-15)తో సెడ్రిక్ న్యుటింక్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2010లో ఆచంట శరత్ కమల్ ఈజిప్టు ఓపెన్ గెలిచాక భారత్ నుంచి ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారుడు సత్యన్. 

సానియాకు ఎనిమిదో డబుల్ టైటిల్ చెక్ రిపబ్లిక్‌కు చెందిన కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవాతో కలిసి సానియా మీర్జా తాజాగా పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో ఆమెకు 2016లో ఎనిమిదో డబుల్ టైటిల్ దక్కింది. సెప్టెంబర్ 24న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ సానియా-స్ట్రికోవా ద్వయం 6-1, 6-1తో చెన్ లియాంగ్-జావోజువాన్ యాంగ్ (చైనా) జంటపై ఘనవిజయం సాధించింది. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 40వ డబుల్స్ టైటిల్. 

బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ భారత మాజీ క్రికెటర్, ఆంధ్రకు చెందిన మన్నవ శ్రీ కాంత్ (ఎమ్మెస్కే) ప్రసాద్ భారత సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఏడాది క్రితం సెలక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ తాజాగా ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీకి నేతృత్వం వహిస్తారు. భారత్ తరఫున ప్రసాద్ 6 టెస్టులు, 17 వన్డేలు ఆడారు. టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ముగ్గురు సభ్యులతో సెలక్షన్ కమిటీని ఎంపిక చేయాలని లోధా కమిటీ ప్రతిపాదించినప్పటికీ బీసీసీఐ ఐదుగురు సభ్యులతోనే కమిటీని ఏర్పాటు చేసింది. 

బిగ్ బాష్ లీగ్‌లోకి స్మృతి మందన మహిళల బిగ్ బాష్ లీగ్‌లో భారత బ్యాట్స్‌వుమన్ మందనకు చోటు దక్కింది. ఈ మేరకు బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ స్మృతి మందనతో ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్ తరపున ఆడుతుంది. 2016లో ఆస్ట్రేలియాతో హోబర్ట్‌లో జరిగిన తొలి వన్డేలో స్మృతి తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా వరుసగా 55, 55, 46 పరుగులతో రాణించడంతో ఆమెకు ఈ అవకాశం దక్కింది.

పారాలింపిక్స్‌లో దేవేంద్ర జజరియాకు స్వర్ణం పారాలింపిక్స్‌లో ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్‌లో రాజస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల దేవేంద్ర జజరియా స్వర్ణ పతకం సాధించాడు. ఈటెను 63.97 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును అధిగమిస్తూ ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన ఏకై క భారతీయ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. 2004 ఏథెన్‌‌స ఒలింపిక్స్‌లోనూ దేవేంద్ర ఇదే ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన రెండు ఒలింపిక్స్‌లోను జావెలిన్ త్రో ఈవెంట్‌ను తొలగించారు.

డేవిస్ కప్‌లో స్పెయిన్ విజయండేవిస్ కప్‌లో స్పెయిన్ జట్టు భారత్‌పై 5-0 తో విజయం సాధించి వరల్డ్ గ్రూప్ పోటీలకు అర్హత సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్‌లలో స్పెయిన్ విజయం సాధించింది. సెప్టెంబర్ 17న జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జంట 4-6, 7-6 (7/2), 4-6, 4-6తో లియాండర్ పేస్-సాకేత్ మైనేని జోడీపై గెలిచింది. అంతేకాక సెప్టెంబర్ 18న జరిగిన రివర్స్ సింగిల్స్‌లోనూ విజయం సాధించిన స్పెయిన్ భారత్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

1965 తర్వాత స్పెరుున్‌తో మళ్లీ తలపడిన భారత్ డేవిస్‌కప్‌లో 0-5తో వైట్‌వాష్ కావడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2003లో నెదర్లాండ్‌‌సతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లోనూ భారత్ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఓవరాల్‌గా డేవిస్ కప్‌లో చరిత్రలో 0-5తో భారత్ ఓడటం ఇది 21వసారి.

రోస్‌బర్గ్‌కు సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్సెప్టెంబర్ 18న జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో జర్మన్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. 61 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 55 నిమిషాల 48.950 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. రికియార్డో రెండు, హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. తాజా విజయంతో ఈ సీజన్‌లో రోస్‌బర్గ్ వరుసగా మూడు టైటిల్స్‌ను రెండోసారి సాధించాడు.

పారాలింపిక్స్‌లో చైనాకు అగ్రస్థానంరియోలో 11 రోజుల పాటు జరిగిన పారాలింపిక్స్ సెప్టెంబర్ 18న ముగిశాయి. ఈ పోటీల్లో చైనా 239 పతకాల (107 స్వర్ణం, 81 రజతం, 51 కాంస్యం)తో అగ్రస్థానంలో నిలిచింది. బ్రెజిల్ స్టార్ స్విమ్మర్ డానియల్ డయాస్ ఏకంగా నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో అత్యధిక పతకాలు సాధించాడు. 1500 మీ. రేసులో అబ్దెల్లతీఫ్ బాకా (అల్జీరియా) ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో విజేతగా నిలిచిన మాథ్యూ సెంట్రోవిజ్ కన్నా తక్కువ సమయంలోనే పరిగెత్తి రికార్డు సృష్టించాడు.

భారత అథ్లెట్లు రెండు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యంతో నాలుగు పతకాలు సాధించి ఓవరాల్‌గా పతకాల పట్టికలో 43వ స్థానంలో నిలిచారు.
దేశం
స్వర్ణం
రజతం
కాంస్యం
మొత్తం
చైనా
107
81
51
239
గ్రేట్ బ్రిటన్
64
39
44
149
ఉక్రెయిన్
41
37
39
117
అమెరికా
40
44
31
115
ఆస్ట్రేలియా
22
30
29
81
జర్మనీ
18
25
14
57
నెదర్లాండ్స్
17
19
26
62
బ్రెజిల్
14
29
29
72
ఇటలీ
10
14
15
39
పోలండ్
9
18
12
39
ఇండియా
2
1
1
4

భారతవిజేతల వివరాలు
అథ్లెట్
అంశం
పతకం
తంగవేలు మరియప్పన్
హైజంప్
స్వర్ణం
వరుణ్ సింగ్ భాటి
హైజంప్
కాంస్యం
దీపా మాలిక్
షాట్‌పుట్
రజతం
దేవేంద్ర జజరియా
జావెలిన్ త్రో
స్వర్ణం

ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత్‌కు 3 స్వర్ణాలుజూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు మూడు స్వర్ణాలు సాధించారు. సెప్టెంబర్ 18న జరిగిన పోటీల్లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో శుభాంకర్ ప్రమాణిక్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. సంభాజీ పాటిల్‌కు టీమ్ విభాగం, స్టాండర్డ్ పిస్టల్ విభాగంలో 2 స్వర్ణాలు దక్కాయి.

రియో పారాలింపిక్స్ ప్రారంభం
2016 పారాలింపిక్స్ క్రీడలు సెప్టెంబర్ 8న రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 18 వరకు జరగనున్న ఈ క్రీడల చరిత్రలో తొలిసారిగా 159 దేశాల నుంచి 4,342 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 17 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. డోపింగ్ ఆరోపణలతో రష్యా అథ్లెట్లను క్రీడల్లో పాల్గొనకుండా బహిష్కరించారు.
పారాలింపిక్స్‌లో మరియప్పన్ తంగవేలుకు స్వర్ణం
పారాలింపిక్స్‌లో సెప్టెంబర్ 11న జరిగిన పురుషుల హైజంప్ టి-42 లో తమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు స్వర్ణ పతకం సాధించాడు. దీంతో ఒలిపింక్స్‌లో భారత్ నుంచి హైజంప్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే విభాగంలో నోయిడాకు చెందిన వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించాడు. తంగవేలు 1.89 మీ. ఎత్తుకు ఎగిరి అగ్రస్థానంలో నిలవగా భటి 1.86 మీ.తో మూడో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రెవే (1.86) రెండో స్థానంతో రజతం అందుకున్నాడు. ఇటీవల ట్యునీషియాలో జరిగిన ఐపీసీ గ్రాండ్ ప్రి ఈవెంట్‌లో తంగవేలు 1.78మీ. జంప్‌తో స్వర్ణం అందుకున్నాడు.
పారాలింపిక్స్‌లో దీపా మలిక్‌కు రజతం
పారాలింపిక్స్‌లో మహిళల షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి, 46 ఏళ్ల దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్లో దీపా ఇనుప గుండును 4.61 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఫాతిమా నెధమ్ (బహ్రెయిన్-4.76 మీటర్లు) స్వర్ణం సాధించగా... దిమిత్రా కొరోకిడా (గ్రీస్-4.28 మీటర్లు) కాంస్యం సంపాదించింది.
దీపా మలిక్ 2011 ప్రపంచ చాంపియన్‌షిప్ షాట్‌పుట్‌లో రజత పతకం, 2010 ఆసియా పారాగేమ్స్‌లో జావెలిన్ త్రోలో కాంస్యం సాధించింది. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున’ అందుకొని ఈ అవార్డు పొందిన పెద్ద వయస్కురాలిగా (42 ఏళ్ల వయసులో) గుర్తింపు పొందింది.
వావ్‌రింకా, కెర్బర్‌కు యూఎస్ ఓపెన్ టైటిల్స్
యూఎస్ ఓపెన్ 2016 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన స్టానిస్లాస్ వావ్‌రింకా తొలిసారిగా గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్లో మూడో సీడ్ వావ్రింకా 6 టాప్ సీడ్ జొకోవిచ్‌ను ఓడించాడు. వావ్రింకాకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు.

మహిళల సింగిల్స్ టైటిల్‌ను జర్మనీకి చెందిన 28 ఏళ్ల ఎంజెలిక్ కెర్బర్ తొలిసారిగా సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 11న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ కెర్బర్ పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. కెర్బర్ 2016 సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించగా, వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచింది.

పురుషుల డబుల్స్ టైటిల్‌ను జమీ ముర్రే (గ్రేట్ బ్రిటన్), బ్రూనో సోరెస్ (బ్రెజిల్); మహిళల డబుల్స్ టైటిల్‌ను బెథాన్ మాటెక్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్); మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను లారా సీజ్ మండ్ (జర్మనీ), మేట్ పావిచ్(క్రొయేషియా) దక్కించుకున్నారు.
ఇండియన్ రైల్వేస్‌కు మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టైటిల్
90వ ఆల్ ఇండియా ఎంసీసీసీ-మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను సెప్టెంబర్ 11 ఇండియన్ రైల్వేస్ గెలుచుకుంది.
6 రెడ్ చాంపియన్‌షిప్‌లో అద్వానీకి కాంస్యం
భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ ప్రతిష్టాత్మక 6 రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు.
డ్యూరాండ్ కప్ విజేత ఆర్మీ గ్రీన్
ఆసియాలో అతి పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన డ్యూరాండ్ కప్‌లో ఆర్మీ గ్రీన్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సెప్టెంబర్ 11న జరిగిన ఫైనల్లో ఆర్మీ గ్రీన్ ‘పెనాల్టీ షూటౌట్’లో 6-5తో నెరోకా ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఆర్మీ గ్రీన్ జట్టుకు రూ. 45 లక్షలు... రన్నరప్ నెరోకా జట్టుకు రూ. 20 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
1888లో మొదలైన డ్యూరాండ్ కప్‌లో మోహన్ బగాన్ క్లబ్, ఈస్ట్ బెంగాల్ క్లబ్ 16 సార్లు చొప్పున విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు నాలుగుసార్లు ఈ టోర్నీ టైటిల్‌ను సాధించింది.


వన్డేల్లో 444 పరుగులతో ఇంగ్లండ్ సరికొత్త రికార్డ్
వన్డే క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లండ్ రికార్‌‌డ నెలకొల్పింది. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఆగస్టు 30న ఇంగ్లండ్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 444 పరుగులు చేసింది. దీంతో 2006లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక చేసిన 443 పరుగుల రికార్డును అధిగమించింది.

టీ-20 సిరీస్‌ను దక్కించుకున్న వెస్టిండీస్
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ గెలుచుకుంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని వెస్టిండీస్ గెలుపొందగా, లాడర్‌హిల్ (ఫ్లోరిడా-అమెరికా)లో ఆగస్టు 28న జరిగిన రెండో వన్డే వర్షం వల్ల రద్దయింది. దీంతో సిరీస్ 1-0 తేడాతో విండీస్‌కు దక్కింది. 

లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్‌కు రజతం
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌కు కాంస్యం బదులు రజతం దక్కింది. ఆ ఒలింపిక్స్‌లో 60 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం సాధించిన రష్యా రెజ్లర్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో యోగే శ్వర్‌కు రజతం ఖాయమైంది.

ఇటలీ గ్రాండ్‌ప్రి విజేత నికో రోస్‌బర్గ్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్ 4న జరిగిన ఇటలీలో మోంజాలో జరిగిన గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ 53 ల్యాప్‌లను గంటా 17 నిమిషాల 28.089 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.

బ్రెజిల్ గ్రాండ్‌ప్రి విజేత సిక్కి రెడ్డి జంట
హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది. సెప్టెంబర్ 4న బ్రెజిల్‌లో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 21-15, 21-16తో రెండో సీడ్ టోబీ ఎన్జీ-రాచెల్ హోండెరిచ్ (కెనడా) జోడీపై విజయం సాధించింది. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన ఆనంద్ పవార్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ఆనంద్ పవార్ 21-18, 11-21, 17-21తో జుల్ఫాదిల్ జుల్కిఫిల్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. 

జర్మనీ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ ష్వాన్‌స్టైగర్ రిటైర్మెంట్
జర్మనీ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ బాస్టియన్ ష్వాన్‌స్టైగర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004లో తొలిమ్యాచ్ ఆడిన బాస్టియన్ 121 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం మూడు ప్రపంచకప్‌లు ఆడిన ఈ జర్మన్ 2014 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో వైస్‌కెప్టెన్‌గా ఉన్నాడు. టెన్నిస్‌లో మాజీ నం.1 క్రీడాకారిణి అనా ఇవనోవిచ్ (సెర్బియా)ను ష్వాన్‌స్టైగర్ 2016లో వివాహమాడాడు. 

ఎంసీసీ గౌరవ సభ్యునిగా జహీర్ ఖాన్ 
లండన్‌లోని ప్రఖ్యాత మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ గౌరవ జీవితకాల సభ్యునిగా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి ఈ గౌరవాన్ని 23 మంది పొందారు. జహీర్ తన కెరీర్‌లో 92 టెస్టులు, 200 వన్డేలను ఆడాడు. ఆగస్టులో వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇదే గౌరవాన్ని ఎంసీసీ అందించింది.

పద్మభూషణ్‌కు సుశీల్ పేరు ప్రతిపాదన
రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్ సింగ్‌ను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌కు ప్రతిపాదించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రకటించింది. సుశీల్‌తోపాటు మహిళా రెజ్లర్ అల్కా తోమర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత యశ్వీర్ సింగ్‌ను కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. ఇప్పటికే అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అందుకున్న సుశీల్‌కు గతంలో కేంద్రం పద్మభూషణ్‌ను తిరస్కరించింది.

సెరెనా విలియమ్స్ ప్రపంచ రికార్డు
అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. 307 విజయాలతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును సెరెనా 308వ విజయంతో అధిగమించింది.
1998 జనవరి 19న జరిగిన మ్యాచ్‌లో తొలి విజయం నమోదు చేసిన సెరెనా 18 ఏళ్లలో ఎన్నో రికార్డులు సృష్టించింది.

No comments:

Post a Comment