AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జూలై 2017

వార్తల్లో వ్యక్తులు జూలై 2017
రామేశ్వరంలో కలాం స్మారకం ప్రారంభం తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని పేయికరుంబూరులో నిర్మించిన భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారక మండపాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూలై 27న జాతికి అంకితం చేశారు. కలాం వీణ వాయించే విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ.. కలాం సమాధి వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. 
రూ.15 కోట్లతో నిర్మించిన ఈ స్మారకానికి కలాం తన జీవితకాలంలో ఎక్కువ శాతం గడిపిన డీఆర్‌డీవోనే రూపకల్పన చేసింది. కలాం శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో రూపొందించిన మిస్సైళ్లు, రాకెట్ల నమూనాలను ఇందులో ఏర్పాటు చేశారు.కలాంకు చెందిన 900 పెయింటింగ్‌లు, 200 అరుదైన ఛాయాచిత్రాలను ఉంచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అబ్దుల్ కలాం స్మారక కేంద్రం ప్రారంభం 
ఎప్పుడు : జూలై 27
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎక్కడ : పేయికరుంబూరు, రామేశ్వరం, తమిళనాడు

వీలర్ ఐలాండ్‌కు అబ్దుల్ కలాం పేరుఒడిశా తీరంలోని వీలర్ దీవికి (ఐలాండ్) ఆ రాష్ట్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ జూలై 27న అధికారికంగా ప్రకటించారు. అబ్దుల్ కలాం క్షిపణి శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో ఒడిశాలోని భద్రక్ జిల్లా ఛాంద్‌బలిలోని క్షిపణి ప్రయోగశాలను పలుమార్లు సందర్శించారు. ఆ సమయంలో బంగాళాఖాతంలోని వీలర్ దీవిని గుర్తించి..క్షిపణి ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. అనంతరం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిస్సైల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

డిప్యూటీ కలెక్టరుగా పీవీ సింధుప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుని డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం జూలై 27న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సింధుకు అందజేశారు. 
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా నిబంధనలు సడలించింది. దీంతో సింధును డిప్యూటీ కలెక్టరుగా నియమిస్తూ రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రైనింగ్ పోస్టింగ్ కోసం 30 రోజుల్లోగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ఆమె రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డిప్యూటీ కలెక్టర్‌గా పీవీ సింధు 
ఎప్పుడు : జూలై 27 
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ 
ఎందుకు : రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించినందుకు 

విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్ ఆరోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్ జూలై 28న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. కీలకమైన పరీక్షలో 131-108 ఓట్ల తేడాతో గెలుపొందారు. సభలో 131 మంది (జేడీయూ 70, బీజేపీ 52, హెచ్‌ఏఎమ్ 1, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 2, ఎల్‌జేపీ 2, స్వతంత్రులు 4, స్పీకర్ ఓటు వేయలేరు) నితీశ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విపక్షాల సభ్యులు (ఆర్జేడీ 79, కాంగ్రెస్ 26, సీపీఐ-ఎమ్‌ఎల్ 3) 108 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బిహార్‌లో మూడేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం కొనసాగేందుకు మార్గం సుగమమైంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విశ్వాస పరీక్ష నెగ్గిన సీఎం నితీశ్ కుమార్ 
ఎప్పుడు : జూలై 28
ఎక్కడ : బిహార్ 
ఎందుకు : ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణం చేసినందుకు

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ దీపక్ మిశ్రాసుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తదుపరి(45వ) భారత ప్రధాన న్యాయమూర్తి(సీజే) కానున్నారు. ఈ మేరకు తన వారసుడిగా సీజే పదవికి జస్టిస్ దీపక్ మిశ్రా పేరుని ప్రస్తుత సీజే జగదీశ్ సింగ్ ఖేహర్ సిఫార్సు చేశారు. జస్టిస్ ఖేహర్ ఆగస్టు 27న పదవీ విరమణ చేయనున్నారు. 
సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి సీజేగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం సీజేగా ఉన్న ఖేహర్ తర్వాత సీనియర్ దీపక్ మిశ్రానే కావడంతో ఆయన పేరుని సిఫార్సు చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 45వ భారత ప్రధాన న్యాయమూర్తి
ఎప్పుడు : ఆగస్టు 2017
ఎవరు : జస్టిస్ దీపక్ మిశ్రా 
ఎందుకు : ఆగస్టు 27న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ జేఎస్ ఖేహర్

డ్రగ్స్ కేసులో ‘ఫిలిప్పీన్‌‌స’ మేయర్ హతంమాదక ద్రవ్యాల కేసులతో సంబంధం ఉన్న మీండానోవ్ ద్వీపంలోని ఒజమిజ్ నగర మేయర్ రెనాల్డో పరోజి నోగ్‌ను ఫిలిప్పీన్‌‌స పోలీసులు జూలై 30న కాల్చిచంపారు. రెనాల్డో, ఆయన భార్య, సోదరుడు సహా మొత్తం 13 మంది పోలీసుల కాల్పుల్లో మరణించారు. మాదకద్రవ్యాల వ్యాపారులపై ఫిలిప్పీన్స్ పోలీసులు జరిపిన భారీ దాడుల్లో ఇది ఒకటి. మేయర్‌కు డ్రగ్స్ తో సంబంధం ఉందని ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే 2016లో బహిరంగంగానే ప్రకటించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఒజమిజ్ నగర మేయర్ రెనాల్డో పరోజి హతం
ఎప్పుడు : జూలై 30
ఎవరు : ఫిలిప్పీన్స్ పోలీసులు 
ఎందుకు : మాదక ద్రవ్యాల కేసులో

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై వేటుతప్పుడు వివరాలతో రాజ్యాంగాన్ని మోసగించిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ (పీఎంల్-ఎన్ పార్టీ).. ఆర్టికల్ 62, 63 ప్రకారం ఎంపీగా అనర్హుడని ఆ దేశ సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఈ మేరకు షరీఫ్‌ను అనర్హుడిగా పేర్కొంటూ ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం జూలై 28న ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ప్రమాణం కింద తప్పుడు వివరాల్ని సమర్పించారని, అందువల్ల రాజ్యాంగం ప్రకారం షరీఫ్ నిజాయితీపరుడు కాడని కోర్టు పేర్కొంది. దీంతో ఆయన ప్రధాని పదవికి అనర్హుడయ్యారు. ప్రధానిగా కొనసాగాలంటే పాక్ జాతీయ అసెంబ్లీలో సభ్యుడిగా ఉండడం తప్పనిసరి. 
పనామా పేపర్స్ కుంభకోణం..1990లో షరీఫ్ ప్రధానిగా ఉండగా మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. భారీ ఎత్తున డబ్బును విదేశాలకు తరలించి లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేశారు. 2016లో పనామా పేపర్స్ లీకేజీ సందర్భంగా ఈ వివరాలు వెలుగుచూశాయి. ఆరోపణలపై విచారణకు 2017 మేలో ఆరుగురు సభ్యులతో జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జిట్)ను సుప్రీంకోర్టు నియమించింది. జులై 10న సుప్రీంకోర్టుకు జిట్ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా సుప్రీం తీర్పునిచ్చింది. షరీఫ్, అతని కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మర్యంపై అవినీతి కేసులు నమోదు చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లోగా కేసులు నమోదు చేసి.. ఆరు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సూచించింది. షరీఫ్‌కు అత్యంత విధేయుడు, పాక్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్, షరీఫ్ అల్లుడు, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు కెప్టెన్ ముమహ్మర్ సఫ్దర్‌లను కూడా సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించింది. 
తదుపరి ప్రధానిగా షరీఫ్ సోదరుడుప్రధానిగా షరీఫ్ అనర్హుడవడంతో ఆయన సోదరుడు, పంజాబ్ సీఎం షెహ్‌బాజ్ షరీఫ్ తర్వాతి ప్రధాని కావచ్చు. ఆయన పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు కానందున ఇప్పటికిప్పుడే ప్రధాని అవలేరు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా షరీఫ్ విధేయుల్లో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. షెహ్‌బాజ్ ఎంపీగా గెలిచాక ఆయన ప్రధాని బాధ్యతలు చేపడతారని పీఎంల్-ఎన్ పేర్కొంది.
మూడుసార్లు అర్ధంతరంగానే.. పంజాబ్ సింహంగా పేరుపడ్డ షరీఫ్ ప్రధానిగా మూడోసారి కూడా పదవీకాలం పూర్తి చేసుకోలేదు. 1990లో మొదటిసారి ప్రధాని అయ్యాక 1993లో అర్ధంతరంగా వైదొలి గారు. రెండోసారి 1997లో మళ్లీ ప్రధాని కాగా.. 1999లో అప్పటి ఆర్మీ చీఫ్ ముషర్రఫ్ సైనిక కుట్రతో పదవీచ్యుతుడ య్యారు. పాకిస్తాన్ చరిత్రలో పదవిలో కొనసాగుతున్న ప్రధానిని అనర్హుడిగా ప్రకటించడం ఇది రెండో సారి.. 2012లో అప్పటి ప్రధాని యూసఫ్ రజా గిలానీని కోర్టు ధిక్కార నేరంపై సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై వేటు
ఎప్పుడు : జూలై 28
ఎవరు : పాకిస్తాన్ సుప్రీంకోర్టు 
ఎక్కడ : పాకిస్తాన్ 
ఎందుకు : పనామా పేపర్స్‌లో వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణల కారణంగా 

పాక్ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీపాకిస్తాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా పీఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) సీనియర్ నేత, మాజీ పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖక్కన్ అబ్బాసీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షహబాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలో జూలై 29న సమావేశమైన పీఎంఎల్-ఎన్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 
పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి నవాజ్ షరీఫ్ ఎన్నికల సంఘానికి తప్పుడు వివరాలు సమర్పించారంటూ పాక్ సుప్రీంకోర్టు జూలై 28న ఆయనను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించగా, ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. 
పాక్ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రధాని పదవి చేపట్టాలంటే ముందుగా వారు జాతీయ అసెంబ్లీలో సభ్యులై ఉండాలి. అయితే ప్రస్తుతం పాక్‌లోని పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న షహబాజ్ పార్లమెంటు సభ్యుడు కాదు. ఈ నేపథ్యంలో షహబాజ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా షాహిద్ అబ్బాసీని నియమించాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. షహబాజ్ ఎన్నిక కాగానే అబ్బాసీ రాజీనామా చేస్తారు. దాదాపు 45 రోజులపాటు అబ్బాసీ పదవిలో ఉండే అవకాశం ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి 
ఎప్పుడు : జూలై 30 
ఎవరు : షాహిద్ ఖక్కన్ అబ్బాసీ
ఎక్కడ : పాకిస్తాన్ 
ఎందుకు : నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టు అనర్హత వేటుతో 

పాక్ ప్రధానిగా అబ్బాసీ ప్రమాణంపాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత షాయీద్ కఖాన్ అబ్బాసీని దేశ ప్రధానిగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆగస్టు 1న ఎన్నుకుంది. నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. సభలో మొత్తం 321 ఓట్లకు గాను అబ్బాసీకి 221 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన నవీద్‌కు 47 ఓట్లు, తెహ్రికీ ఇన్సాఫ్ నేత రషీద్ అహ్మద్‌కు 33 ఓట్లు, జామాత్ ఈ ఇస్లామీ నేత తరీఖుల్లాకు నాలుగు ఓట్లు పోలయ్యాయి. అనంతరం అధ్యక్షుడి భవనంలో జరిగిన కార్యక్రమంలో అబ్బాసీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాక్ తాత్కాలిక ప్రధాని ప్రమాణ స్వీకారం 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : షాయీద్ కఖాన్ అబ్బాసీ
ఎక్కడ : పాకిస్తాన్ 
ఎందుకు : నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో

నీతి ఆయోగ్ పదవి నుంచి వైదొలగనున్న పనగడియా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు అరవింద్ పనగడియా ప్రకటించారు. ఆగస్ట్ 31న బాధ్యతల నుంచి తప్పుకొని తిరిగి కొలంబియా యూనివర్సిటీకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇండో-అమెరికన్ అయిన అరవింద్ పనగడియా 2015 జనవరిలో నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తర్వాత భారత్‌లో ఒక ఉన్నత స్థాయి పదవిని వదులుకొని మళ్లీ టీచింగ్ ప్రొఫెషన్‌కు వెళుతున్న ఆర్థిక వేత్త పనగడియానే. కొలంబియా యూనివర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్ అయిన ఈయనకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నిర్ణీత పదవీ కాలం అంటూ ఏమీ లేదు. యూనివర్సిటీ వారు సెలవె పొడిగింపు ఇవ్వలేదని.. అందుకే ఆగస్ట్ 31న నీతి ఆయోగ్‌ను వదిలి వెళ్లాలనుకున్న విషయాన్ని రెండు నెలల ముందే ప్రధాని మోదీకి తెలియజేశానని పనగడియా తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పదవి నుంచి వైదొలగనున్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ 
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : అరవింద్ పనగడియా 
ఎందుకు : కొలంబియా యూనివర్సిటీ సెలవు పొడిగించనందుకు 

ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్నుమూతప్రఖ్యాత శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డెరైక్టర్ ప్రొఫెసర్ పుష్పమిత్ర భార్గవ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వయోభారం, తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 1న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన కొడుకు మోహిత్ భార్గవ కెనడాలో ఉంటున్నారు. కూతురు వినీత గుంటూరులో ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నారు. 
‘హెడిల్‌బర్గర్’ వ్యవస్థాపకుల్లో ఒకరు..1928 ఫిబ్రవరి 22న రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో భార్గవ జన్మించారు. ఆయన తండ్రి రామచంద్ర భార్గవ, తల్లి గాయత్రీ భార్గవ. వారణాసి బీసెంట్ థియోసాఫికల్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన భార్గవ.. లక్నో విశ్వవిద్యాలయం నుంచి 1946లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పట్టా పొందారు. 21వ ఏటనే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశంపై పీహెచ్‌డీ పరిశోధన చేశారు. 1950 నుంచి 1953 వరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో, అదే సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. 1953 నుంచి 1956 వరకు అమెరికాలోని విస్కాన్సన్ వర్సిటీలో పని చేశారు. అక్కడే హెడిల్‌బర్గర్ లేబొరేటరీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా నిలిచారు. 
జ్యోతిష్య శాస్త్రం కోర్సుపై సుప్రీంకు..ఆధునిక జీవశాస్త్రానికి ఆర్కిటెక్ట్‌గా ప్రశంసలందుకున్న భార్గవ.. సీసీఎంబీ వ్యవస్థాపక డెరైక్టర్‌గా 13 ఏళ్ల పాటు విశేష సేవలందిం చారు. 2006లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 220 విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని కోర్సుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినప్పుడు నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, సైన్స్ టెంపర్ పెంచేందుకు 500కు పైగా వ్యాసాలు రాశారు. నేషనల్ నాలెడ్‌‌జ సెంటర్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. 
చేప మందుకు వ్యతిరేకంగా..హైదరాబాద్‌లో బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందు శాస్త్రీయతను సవాల్ చేస్తూ 2008 నుంచి జన విజ్ఞాన వేదిక చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాల్లో భార్గవ పాల్గొన్నారు. హైకోర్టుకు వెళ్లారు. చివరకు దాన్ని చేప మందుగా పరిగణించరాదని, చేప ప్రసాదంగానే భావించాలని కోర్టు పేర్కొంది. చేప మందే కాకుండా హోమియో వైద్యమూ మూఢ నమ్మకమేనని భార్గవ కొట్టిపారేశారు. శాస్త్రవేత్తగా ఆయన కృషికి 1986లో ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. కానీ 2016లో దేశవ్యాప్తంగా రచయితలు, మేధావి వర్గంపై జరిగిన దాడులు, అసహనానికి వ్యతిరేకంగా అవార్డు తిరిగిచ్చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్నుమూత 
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : సీసీఎంబీ వ్యవస్థాపక డెరైక్టర్ 
ఎక్కడ : హైదరాబాద్‌లో

భారత 14వ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  భారతదేశ 14వ రాష్ట్రపతిగా ఎన్డీయే పక్షాల అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ భారీ మెజార్టీతో గెలుపొందారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌పై ఆయన 65.6శాతం ఓట్లతో విజయం సాధించారు. తద్వారా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టబోతున్న తొలి బీజేపీ నాయకుడుగా రామ్‌నాథ్ కోవింద్ రికార్డు సృష్టించారు. 
జూలై 17న జరిగిన రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూలై 20న జరిగింది. మొత్తం ఎనిమిది రౌండ్లలో చేపట్టిన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రామ్‌నాథ్‌కు 2,930 ఓట్లు పోలవ్వగా (వాటి విలువ 7,02,044), విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌కు 1,844 ఓట్లు (వాటి విలువ 3,67,314) పోలైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికలో 77 ఓట్లు చెల్లలేదని తెలిపారు. భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ ఎన్నికై నట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా మీడియాకు అధికారికంగా వెల్లడించారు.

23న ప్రణబ్‌కు వీడ్కోలు ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. జూలై 23న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు లోక్‌సభ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. పార్లమెంట్‌లోని సెంట్రల్ హాలులో నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికార, విపక్ష నేతలంతా పాల్గొంటారు. 

25న కోవింద్ ప్రమాణస్వీకారం జూలై 25న రామ్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ కోవింద్‌తో రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ వేడుకకు అన్ని రాష్ట్రల గవర్నర్‌లు, ముఖ్యమంత్రులతోపాటు పలు దేశాలకు చెందిన ప్రముఖులకు హాజరవుతారు. 
పారాంఖ్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు...
  • రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా, దేహాత్ జిల్లా, దేరాపూర్ తాలూకా పారాంఖ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు.
  • కాన్పూర్ వర్సిటీ నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు.
  • రైతు కుటుంబంలో పుట్టిన కోవింద్‌కు 1974 మే 30న సవితతో పెళ్లయింది. వారి సంతానం ప్రశాంత కుమార్, స్వాతి.
  • సివిల్ సర్వీస్ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు.
  • ఢిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా, 1980 నుంచి 1993 వరకు సుప్రీంకోర్టులో స్టాండింగ్ కౌన్సెల్‌గా ఉన్నారు.
  • 1977 నుంచి కొంతకాలం అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఆర్థిక శాఖకు సంబంధించి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.
  • బీజేపీలో చేరాక యూపీలో కల్యాణ్‌సింగ్, రాజ్‌నాథ్‌సింగ్ ప్రభుత్వాలకు అనధికార న్యాయసలహాదారుగా వ్యవహరించారు.
  • 1986లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగల్ ఎయిడ్ బ్యూరో సెక్రటరీగా పనిచేశారు.
  • 1994 నుంచి 2006 వరకూ రెండుసార్లు యూపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగానూ అఖిల భారత కోలీ సమాజ్ అధ్యక్షుడి గానూ సేవలందించారు.
  • వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రామ్‌నాథ్ ప్రసంగించారు.
  • 2016 ఆగస్టు 16 నుంచి 2017 జూన్ 20 వరకు బిహార్ గవర్నర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత దేశ 14వ రాష్ట్రపతి 
ఎప్పుడు : జూలై 20
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్ 
ఎందుకు : రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్ 

నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్ ప్రమాణంఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ ముఖ్యమంత్రిగా జెలియాంగ్ తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు. జులై 19న అసెంబ్లీలో షుర్హోజెలీ లీజిత్సు బలనిరూపణ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండగా ఆయన హాజరుకాలేదు. దీంతో నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. ఈ మేరకు జెలియాంగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జులై 22లోగా బలనిరూపణ చేసుకోవాలని తెలిపారు.
దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరో పిస్తూ ఆయనను పార్టీ నుంచి ఎన్‌పీఎఫ్ బహిష్కరించింది. పురపాలక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంపై ఆం దోళనలు చెలరేగడంతో ఫిబ్రవరిలో సీఎం పదవికి జెలియాంగ్ రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జూలై 19
ఎవరు : టీఆర్ జెలియాంగ్
ఎందుకు : బలనిరూపణ పరీక్షకు షుర్హోజెలీ లీజిత్సు హాజరు కానందుకు

‘తమిళ్ తలైవాస్’ అంబాసిడర్‌గా కమల్ హాసన్ప్రొ కబడ్డీ లీగ్‌లో తొలిసారి పాల్గొంటున్న ‘తమిళ్ తలైవాస్’ జట్టుకు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ‘తమిళ్ తలైవాస్’ జట్టు తమ జెర్సీని జులై 20న చెన్నైలో ఆవిష్కరించి బ్రాండ్ అంబాసిడర్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్నారు. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 5 జూలై 28న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ‘తమిళ్ తలైవాస్’ బ్రాండ్ అంబాసిడర్
ఎప్పుడు : జూలై 19 
ఎవరు : కమల్‌హాసన్

మిస్‌వరల్డ్ కెనడా ఫైనల్‌లో ‘శ్రావ్య’ప్రతిష్టాత్మకమైన ‘మిస్ వరల్డ్ కెనడా-2017’పోటీల్లో ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన కల్యాణపు శ్రావ్య ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న ఈ పోటీల్లో ప్రతిభ కనబరచి ఫైనల్ పోటీకి ఎంపికైంది. వైరాకు చెందిన అగ్రికల్చర్ ఆఫీసర్ రవికుమార్ కూతురైన శ్రావ్య స్థానికంగా ఏడో తరగతి వరకు చదివింది. ఉన్నత విద్యను ఆదిలాబాద్‌లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం కెనడాలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. 
ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో ‘మిస్ నార్తర్న్ ఆల్బర్టా వరల్డ్- 2017’కిరీటాన్ని దక్కించుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిస్‌వరల్డ్ కెనడా ఫైనల్‌లో తెలుగు అమ్మాయి 
ఎప్పుడు : జూలై 20
ఎవరు : కల్యాణపు శ్రావ్య 
ఎక్కడ : కెనడా 

బలపరీక్షలో నెగ్గిన జెలియాంగ్నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో మొత్తం 59 మంది సభ్యులుండగా.. జెలియాంగ్‌కు అనుకూలంగా 47 మంది ఓటేశారు. వీరిలో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు 36 మందితో పాటు నలుగురు బీజేపీ సభ్యులు, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. మాజీ సీఎం లీజిట్సుకు 11 ఓట్లు పడగా.. వారిలో 10 మంది ఎన్పీఎఫ్, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. 2018లో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బలపరీక్ష నెగ్గిన సీఎం జెలియాంగ్ 
ఎప్పుడు : జూలై 21
ఎక్కడ : నాగాలాండ్

బ్రిటన్ సుప్రీంకోర్టు అధ్యక్షురాలిగా బ్రెండా మజోరి బ్రిటన్ సుప్రీంకోర్టు తొలి మహిళా అధ్యక్షురాలిగా సీనియర్ న్యాయమూర్తి బ్రెండా మజోరి నియమితులయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లార్డ్ న్యూబర్గర్ 2017లో సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బ్రెండా అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్రిటన్ సుప్రీంకోర్టు తొలి మహిళా అధ్యక్షురాలు 
ఎప్పుడు : జూలై 21
ఎవరు : బ్రెండా మజోరి 
ఎక్కడ : బ్రిటన్ 

వయొలిన్ విద్వాంసుడు కొమండూరి కన్నుమూతప్రముఖ వయొలిన్ విద్వాంసుడు కొమండూరి కృష్ణమాచార్యులు జూలై 22న కన్నుమూశారు. కొమండూరి 1936లో పశ్చిమ గోదావరి జిల్లా ఐ.భీమవరంలో జన్మించారు. ద్వారం నరసింహనాయుడు వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో క్యాజువల్ ఆర్టిస్టుగా కొంతకాలం పనిచేసిన ఆయన 1974లో విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా చేరి 1994 వరకు ఇక్కడే పనిచేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వయొలిన్ విద్వాంసుడు కొమండూరి కృష్ణమాచార్యులు కన్నుమూత
ఎప్పుడు : జూలై 22 
ఎక్కడ : హైదరాబాద్

రాష్ట్రపతి కార్యదర్శిగా సంజయ్ కొఠారీభారత కొత్త రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కార్యదర్శిగా పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) చైర్మన్ సంజయ్ కొఠారీని కేంద్రం నియమించింది. ప్రెస్ కార్యదర్శిగా సీనియర్ పాత్రికేయుడు అశోక్ మాలిక్, సంయుక్త కార్యదర్శిగా గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ అటవీ శాఖ అధికారి భరత్ లాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాష్ట్రపతి కొత్త కార్యదర్శి నియామకం
ఎప్పుడు : జూలై 22
ఎవరు : సంజయ్ కొఠారీ

రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చివరి ప్రసంగంభారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చివరిసారిగా ప్రసంగించారు. ఈ మేరకు జూలై 24న పదవీ విరమణ చేసిన ప్రణబ్ రాష్ట్రపతి భవన్‌లో జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా, పార్లమెంట్‌ను ఆలయంగా భావించానన్నారు. భారతదేశం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతమే కాదు ఇది ఉన్నత ఆలోచనలు, తత్త్వజ్ఞానం, వివేకం, పారిశ్రామిక మేధస్సు, ఆవిష్కరణలు, ఎన్నో అనుభవాల సమాహారం అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రమాణాల స్థాయికి చేరేలా దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రణబ్ జీవిత చరిత్రప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా పనిచేశారు.
రాజకీయ జీవితం
  • 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక
  • 1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక.
  • 1980-85 వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత
  • 1973-74 కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా
  • 1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా...
  • 1974-75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా..
  • 1975-77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా..
  • 1980-82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా..
  • 1982-84లో ఆర్థికమంత్రిగా..
  • 1991-96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా..
  • 1993-95లో వాణిజ్యశాఖ మంత్రిగా..
  • 1995-96లో విదేశాంగమంత్రిగా.. విధులు నిర్వర్తించారు.
  • జంగీపూర్ నుంచి 2004లో లోక్‌సభకు ఎన్నిక
  • 2004-06లో రక్షణశాఖ మంత్రిగా..
  • 2006-09లో విదేశాంగమంత్రిగా..
  • 2009-2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చివరి ప్రసంగం
ఎప్పుడు : జూలై 24
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ
ఎందుకు : పదవీకాలం ముగిసినందున

ఇస్రో మాజీ చైర్మన్ యూఆర్ రావు కన్నుమూతఇస్రో మాజీ చైర్మన్, తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ సూత్రధారి ఉడిపి రామచంద్ర రావు జూలై 24న బెంగళూరులో కన్నుమూశారు.
రావు 1932 మార్చి 10న కర్ణాటక ఉడిపి జిల్లాలోని అడమూరు గ్రామంలో జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసిన రావు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ చేశారు. కాస్మిక్ రే (విశ్వకిరణ) శాస్త్రవేత్తగా కెరీర్‌ను ప్రారంభించి కొన్నాళ్లు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్సాస్ వర్సిటీల్లో అధ్యాపకుడిగా చేశారు. 1966లో సారాభాయ్‌తో పాటు భారత్‌కు తిరిగివచ్చి ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో ప్రొఫెసర్‌గా చేరారు. 1972లో ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్టులో డెరైక్టర్‌గా చేరారు. 1984లో భారత అంతరిక్ష కమిషన్ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రావు రాకెట్ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి కృషి చేశారు.
కాస్మిక్ రేస్, ఖగోళ భౌతికశాస్త్రం, ఉపగ్రహాలు తదితర అంశాలపై 350 పరిశోధన పత్రాలు సమర్పించిన రావు పలు పుస్తకాలు రాశారు. 25 వర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రభుత్వం ఆయనను 1976లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’ తోపాటు మెక్సికోలోని ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యత్వం పొందిన తొలి భారత అంతరిక్ష శాస్త్రవేత్తగా కూడా రావు రికార్డు సృష్టించారు. 
రావు ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పాలకమండలి చైర్మన్, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ చాన్‌‌సలర్ పదవుల్లో కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత అంతరిక్ష శాస్త్రవేత్త యూఆర్ రావు కన్నుమూత
ఎప్పుడు : జూలై 24
ఎక్కడ : బెంగళూరు

రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్‌నాథ్ కోవింద్ దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ (71) ప్రమాణ స్వీకారోత్సవం సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరిగింది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జూలై 25న నిర్వహించిన కార్యక్రమంలో కోవింద్‌తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణం చేయించారు. న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి, రాజకీయ నాయకుడిగా ఎదిగిన కోవింద్.. రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టిన మొదటి బీజేపీ నేతగా, రెండో దళిత వ్యక్తిగా నిలిచారు. 
మధ్యాహ్నం 12.15 గంటలకు.. 
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 25న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోవింద్‌ను అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. వాహన శ్రేణితో పాటు అశ్వదళం వెంటరాగా దారి పొడవునా త్రివిధ దళాలకు చెందిన జవాన్లు సైనిక వందనం సమర్పించారు. జాతీయ గీతాలాపన తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ గెలుపొందినట్లు ఈసీ విడుదల చేసిన ప్రకటనను కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రిషి చదివి వినిపించారు. అనంతరం రాష్ట్రపతిగా ఎన్నికై న కోవింద్‌తో మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణస్వీకారం చేయించారు.
కోవింద్‌కు కొత్త ట్వీటర్ అకౌంట్, వెబ్‌సైట్
నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కేటాయించిన కొత్త ట్వీటర్ అకౌంట్ @RashtrapatiBhvn పనిచేయడం ప్రారంభించింది. ప్రమాణ స్వీకారోత్సవం తరువాత ఆయన చేసిన ప్రసంగం విషయాలను ఆ ట్వీటర్ హ్యాండిల్‌లో చూడొచ్చు. పదవీ విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీ వినియోగించిన అధికార ట్వీటర్ చరిత్రను @ POI13 అనే హ్యాండిల్ పేరిట రికార్డుల్లో భద్రపరిచారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా పునర్వ్యవస్థీకరించి అందుబాటులోకి తెచ్చారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రమాణస్వీకారం చేసిన దేశ 14వ రాష్ట్రపతి
ఎప్పుడు : జూలై 25
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్ హాల్, న్యూఢిల్లీ 

విద్యావేత్త యశ్‌పాల్ కన్నుమూతఅంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ విద్యావేత్త, భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్‌పాల్ సింగ్ (90) జూలై 24న కన్నుమూశారు.
ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1926లో జన్మించిన యశ్‌పాల్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం అమెరికా వెళ్లి మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తిరిగి భారత్‌కు వచ్చిన ఆయన టీఐఎఫ్‌ఆర్‌లో తన ఉద్యోగాన్ని కొనసాగించారు. 1986-91 మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గాను యశ్‌పాల్ పనిచేశారు. విశ్వకిరణాల (కాస్మిక్ రేస్)పై అధ్యయనంలో యశ్‌పాల్ కీలక పాత్ర వహించారు. భారతీయ విద్యావిధానంలో పలు సంస్కరణలకు ఆయన ఆద్యుడిగా నిలిచారు. ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలతో గౌరవించింది. 
విద్యా విధానం రూపకల్పనలోనూ యశ్‌పాల్ విశేష కృషి చేశారు. జాతీయ విద్యా విధానంపై.. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఏర్పాటు చేసిన కమిటీకి యశ్‌పాల్ నేతృత్వం వహించారు. 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన సంస్కరణలపై యశ్‌పాల్ సారథ్యంలో ఓ కమిటీని నియమించింది. ఇది యశ్‌పాల్ కమిటీగా పేరుగాంచింది. సైన్సుకు ప్రాచుర్యం కల్పించినందుకుగాను ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆయనకు ‘కళింగ ప్రైజ్’ను ప్రదానం చేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విద్యావేత్త యశ్‌పాల్ కన్నుమూత
ఎప్పుడు : జూలై 24
ఎవరు : విద్యావేత్త, భౌతిక శాస్త్రవేత 
ఎక్కడ : నోయిడా, న్యూఢిల్లీ

ఆల్ఫాబెట్ బోర్డ్‌కు ఎంపికైన సుందర్ పిచాయ్ భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(45) గూగుల్ పేరెంటల్ కంపెనీ, గ్లోబల్ టెక్ దిగ్గజం అల్పాబెట్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌కు ఎంపికయ్యారు. యూ ట్యూబ్, గూగుల్ యాజమాన్య సంస్థ అయిన ఆల్ఫాబెట్ బోర్డుకు పిచాయ్ నియమితులయ్యారు. గూగుల్ సీఈవోగా సుందర్ మంచి కృషిని కొనసాగిస్తున్నారని, భాగస్వామ్యాలు, అద్భుతమైన నూతన ఆవిష్కరణలతో బలమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నారని ఆల్ఫాబెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ఫాబెట్ ఇంక్ జూలై 24న ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయంలో 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 
సుందర్ పిచాయ్ 2004లో గూగుల్ చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆల్ఫాబెట్ బోర్డుకు ఎంపికైన సుందర్ పిచాయ్ 
ఎప్పుడు : జూలై 25
ఎవరు : గూగుల్ సీఈవో

ముస్లిం రిజర్వేషన్లపై షబ్బీర్ అలీ పుస్తకం ముస్లిం రిజర్వేషన్లపై తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రచించిన ‘ముస్లిం తహఫుజాహత్ జిద్దొ జెహాత్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడంవల్ల కలిగిన ప్రయోజనాలను షబ్బీర్ అలీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముస్లిం తహఫుజాహత్ జిద్దొ జెహాత్ పుస్తకం 
ఎప్పుడు : జూలై 12
ఎవరు : షబ్బీర్ అలీ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : ముస్లిం రిజర్వేషన్లపై 

నోబెల్ గ్రహీత లియు జియావోబో కన్నుమూతచైనా ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల కార్యకర్త లియు జియావోబో(61) జూలై 13న మృతి చెందారు. ఆయన కొంత కాలంగా కాలేయ కేన్సర్‌తో బాధపడుతున్నారు. నెల క్రితమే ఆయన్ని జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. విదేశాల్లో వైద్యం పొందేందుకు లియుని విడుదల చేయాలన్న అంతర్జాతీయ సమాజం విన్నపాలను చైనా తిరస్కరిస్తూ వచ్చింది. 
మానవ హక్కులను పరిరక్షించాలని, చైనా రాజకీయ వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ ‘చార్టర్ 8’ని రచించినందుకు ఆయన్ని 2008లో అరెస్ట్ చేశారు. 2009లో 11 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. 1989లో తియనాన్మెన్ స్క్వేర్ నిరసనల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 2010లో నోబెల్ ప్రదానోత్సవ కార్యక్రమానికీ లియుని హాజరు కానీయలేదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నోబెల్ గ్రహీత లియు జియావోబో కన్నుమూత
ఎప్పుడు : జూలై 13
ఎక్కడ : చైనాలో

యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా లిల్లీ సింగ్యునిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా యూట్యూబ్ స్టార్, సూపర్ ఉమన్‌గా పేరు పొందిన భారత సంతతికి చెందిన కెనడా యువతి లిల్లీ సింగ్ (28) నియమితులయ్యారు. ‘గర్ల్ లవ్’ పేరుతో లిల్లీ సింగ్ బాలల హక్కులపై అనేక రకాల వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి లక్షలాది మందికి చేరువయ్యారు. యునిసెఫ్ ‘యూత్ ఫర్ చేంజ్’ కార్యక్రమంలో భాగంగా బాల కార్మిక వ్యవస్థ, లింగ సమానత్వం వంటి సమస్యలపై ఆమె అవగాహన కల్పించనున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యునిసెఫ్ అంబాసిడర్ 
ఎప్పుడు : జూలై 15
ఎవరు : లిల్లీ సింగ్ 
ఎందుకు : యూత్ ఫర్ చేంజ్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించేందుకు 

ఎన్‌డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు(68) పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయనను తమ అభ్యర్థిగా నిర్ధారిస్తూ జూలై 17న బీజేపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకుంది. విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని ఎదుర్కొనేందుకు రాజకీయ, పరిపాలన రంగాల్లో విశేష అనుభవమున్న వెంకయ్యే సరైన వ్యక్తి అని పార్టీ భావించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. 
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందే వెంకయ్య కేంద్ర ప్రభుత్వ పదవులు, పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో సమాచార, ప్రసారశాఖతోపాటు గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి 
ఎప్పుడు : జూలై 17
ఎవరు : ఎం. వెంకయ్యనాయుడు

టీఎస్ అడ్వొకేట్ జనరల్‌గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డితెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేయడంతో న్యాయశాఖ జూలై 17న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విశ్వాసం ఉన్నంత వరకు ఆయన ఏజీగా కొనసాగుతారు. ప్రకాశ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండవ అడ్వకేట్ జనరల్. రాష్ట్ర మొదటి ఏజీగా రామకృష్ణారెడ్డి సేవలు అందించారు. 
ప్రకాశ్‌రెడ్డి వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో 1955 డిసెంబర్ 31న మురళీధర్‌రెడ్డి, అనసూయాదేవి దంపతులకు జన్మించారు. 1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 1998 వరకు సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేసి తర్వాత తిరిగి హైకోర్టుకు వచ్చారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా నియమితులయ్యారు. 2004 మే వరకు ఆ పోస్టులో కొనసాగారు. 2000 సంవత్సరంలో హైకోర్టు ఆయనకు సీనియర్ హోదా ఇచ్చింది. అలాగే హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రకాశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : రాష్ట్రానికి నూతన ఏజీ
ఎప్పుడు : జూలై 17
ఎవరు : దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి 
ఎక్కడ : తెలంగాణలో 

అతితక్కువ ప్రజాదరణ పొందిన ట్రంప్మొదటి 6 నెలల పాలనలో అతి తక్కువ ప్రజాదరణ పొందిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు సృష్టించారు. ‘వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్’ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు కేవలం 36 శాతం అమెరికన్లే మద్దతు తెలిపారు. గత 70 ఏళ్లలో ఇదే అతి తక్కువని ఏబీసీ న్యూస్ పేర్కొంది. 
ట్రంప్ 100 రోజుల పాలనపై ‘వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్’ నిర్వహించిన సర్వేలో 42 శాతం ప్రజాదరణ దక్కగా 80 రోజుల వ్యవధిలో అది 6 శాతం తగ్గింది. దాదాపు 48 శాతం అమెరికన్లు ట్రంప్ నిర్ణయాల్ని తీవ్రంగా తప్పుపట్టారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డొనాల్డ్ ట్రంప్‌కు అతి తక్కువ ప్రజాదరణ 
ఎప్పుడు : జూలై 17
ఎవరు : వాషింగ్టన్ - ఏబీసీ న్యూస్ 
ఎక్కడ : అమెరికాలో 

ఐటీబీపీ డీజీగా ఆర్‌కే పచ్‌నంద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) 29వ డెరైక్టర్ జనరల్‌గా 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆర్‌కే పచ్‌నంద జూలై 17న బాధ్యతలు చేపట్టారు. తద్వారా అన్ని కేంద్ర బలగాల్లో పనిచేసిన అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ఇంతకముందు బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌పీజీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, సీబీఐ సంస్థల్లో పనిచేశారు. పచ్‌నంద కన్నా ముందు కృష్ణ చౌదరి ఐటీబీపీ డీజీగా పనిచేశారు. 
పచ్‌నంద రచించిన "Terrorism and Response to Terrorist Threat" పుస్తకం 2001లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐటీబీపీకి నూతన డీజీ 
ఎప్పుడు : జూలై 17
ఎవరు : ఆర్‌కే పచ్‌నంద

రాజ్యసభ సభ్యత్వానికి మాయావతి రాజీనామా
బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జూలై 18న రాజ్యసభలో సహరాన్‌పూర్ అల్లర్లపై తన ప్రసంగాన్ని అడ్డుకోవటంతో మనస్తాపం చెందిన మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆమెకు 2018 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా 
ఎప్పుడు : జూలై 18
ఎవరు : మాయావతి 
ఎందుకు : రాజ్యసభలో సహరాన్‌పూర్ అల్లర్లపై తన ప్రసంగాన్ని అడ్డుకోవటంతో

గణిత మేధావి మిర్జాఖానీ మృతిగణితశాస్త్ర ప్రావీణ్యురాలు, ఇరాన్ సంతతికి చెందిన మరియమ్ మిర్జాఖానీ(40).. కేన్సర్‌తో బాధపడుతూ జూలై 14న అమెరికాలో మరణించారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె గణితంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఫీల్డ్స్ మెడల్ అందుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందారు.

సిక్కిం మాజీ సీఎం నార్ బహదూర్ భండారి మృతిసిక్కిం మాజీ సీఎం నార్ బహదూర్ భండారి (77) జూలై 15న ఢిల్లీలో మరణించారు. ఆయన తొలిసారి 1979లో, తర్వాత 1984, 1989లో సిక్కిం సీఎంగా ఎన్నికయ్యారు.

ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) నూతన ప్రెసిడెంట్‌గా 2017-18 సంవత్సరానికిగాను గౌర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఎండీ గౌర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రవీంద్ర మోదీ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ప్రెసిడెంట్‌గా గౌర శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన కెమికల్స్, పాలిమర్స్, మెటల్స్, కంప్యూటర్ సొల్యూషన్‌‌స, రియల్టీ, కన్‌స్ట్రక్షన్, ఫార్మా, ఎన్‌బీఎఫ్‌సీ, ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగ సంస్థల్లో కీలక పదవులు చేపట్టారు. మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లో 40 ఏళ్లకుపైగా అనుభవం ఆయన సొంతం. ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చార్టర్డ్ అకౌంటెంట్ అరుణ్ లుహారుకా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫ్యాప్సీ నూతన ప్రెసిడెంట్ 
ఎప్పుడు : జూలై 5
ఎవరు : గౌర శ్రీనివాస్ 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 

మదర్ థెరిసా చీరకు మేధో హక్కుజీవితాంతం మదర్ థెరిసా ధరించిన నీలి అంచు తెల్ల చీరకు సంబంధించిన మేధో హక్కును మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సొంతం చేసుకుంది. ఏడాది క్రితమే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ద ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ’ ఈ గుర్తింపును జారీ చేసిందని మేధో హక్కుల న్యాయవాది బిస్వజిత్ సర్కార్ జూలై 9న తెలిపారు. మదర్ థెరిసాను పునీతగా ప్రకటించిన 2016, సెప్టెంబర్ 4నే మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు ఈ ఘనత దక్కిందని, ఆ సంస్థకు ప్రచారమంటే ఇష్టలేకపోవడంతో విషయం బయటకు రాలేదన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ డిజైన్‌ను వ్యాపార ధోరణి కోసం వాడుతున్నారని, అలా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విషయం బయటపెడుతున్నామని సర్కార్ చెప్పారు. చీర ట్రేడ్‌మార్క్ ధ్రువీకరణ కోసం డిసెంబర్ 12, 2013న దరఖాస్తు చేసుకున్నారని, దాదాపు మూడేళ్ల పరిశీలన అనంతరం మేధో హక్కును కేటాయించారని తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మదర్ థెరిసా చీరకు మేధో హక్కు
ఎప్పుడు : 2016లో 
ఎవరు : మిషనరీస్ ఆఫ్ చారిటీస్ 
ఎక్కడ : కోల్‌కత్తా 
ఎందుకు : జీవితాంతం మదర్ థెరిసా ధరించిన నీలి అంచు తెల్ల చీరకు

జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కొత్త చీఫ్కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) ఇంటెలిజెన్‌‌స ఏజెన్సీ కొత్త చీఫ్‌గా జాన్ జోసెఫ్ నియమితులయ్యారు. సీనియర్ అధికారి అయిన జోసెఫ్‌ను జీఎస్టీ ఇంటలిజెన్‌‌స డెరైక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం జూలై 9న ఉత్తర్వులు జారీ చేసింది.
పన్ను ఎగవేత, పన్ను అమలు తదితర పర్యవేక్షణలను ఈ జీఎస్టీ ఇంటెలిజెన్‌‌స నిర్వహిస్తుంది. అలాగే.. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి అయిన దాస్‌ను డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటి లిజెన్స్ (డీఆర్‌ఐ) డెరైక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జీఎస్టీ ఇంటెలిజెన్‌‌స ఏజెన్సీకి కొత్త అధిపతి 
ఎప్పుడు : జూలై 9
ఎవరు : జాన్ జోసెఫ్

షరీఫ్‌పై అవినీతి కేసుల నమోదుకు జిట్ సిఫారసు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి కేసులు నమోదు చేయాలని సంయుక్త విచారణ బృందం (జిట్) సిఫారసు చేసింది. పనామాగేట్‌లో షరీఫ్ పేరు బయటకు రావడంతో 2016లో పాక్ సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో జిట్‌ను ఏర్పాటు చేసింది. షరీఫ్, కుటుంబ సభ్యుల పేర్లపై లెక్క చూపని విలువైన ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని గుర్తించిన జిట్.. ఇందుకు సంబంధించిన నివేదికను జూలై 10న కోర్టుకు సమర్పించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నవాజ్ షరీఫ్‌పై అవినీతి కేసుల నమోదుకు సిఫారసు 
ఎప్పుడు : జూలై 10
ఎవరు : సంయుక్త విచారణ బృందం 
ఎక్కడ : పాకిస్తాన్‌లో 
ఎందుకు : పనామాగేట్ వ్యవహారంలో

పాపకు జన్మనిచ్చిన బ్రిటన్ యువకుడుతాను గర్భం దాల్చానని 2017 జనవరిలో ప్రకటించిన బ్రిటన్‌కు చెందిన హెడన్ క్రాస్(21) జూన్ 16న గ్లోసెస్టర్ షైర్ రాయల్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చాడు. తద్వారా లింగమార్పిడి చేయించుకొని ఓ పాపకు జన్మనిచ్చిన తొలి పురుషుడిగా హెడన్ రికార్డులకెక్కాడు. ఆ పాపకు పైగే అని పేరు పెట్టుకున్నాడు. 
మహిళగా పుట్టిన హెడెన్ అనంతరం పురుషుడిలా మారాలన్న కోరికతో లింగమార్పిడి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పురుషుడిగా మారేందుకు హార్మోన్ల మార్పిడి చికిత్స చేయించుకుంటున్నాడు. దీంతో భవిష్యత్తులో బిడ్డలను కనలేనని ముందుగానే బిడ్డను పొందాలని నిర్ణయించుని ఫేస్‌బుక్‌లో తనకు వీర్యం దానం చేయాల్సిందిగా పోస్ట్ చేశాడు. ఓ దాత ఇచ్చిన వీర్యంతో హెడెన్ గతేడాది గర్భం దాల్చాడు. అయితే 2008లోనే ప్రపంచంలోనే తొలిసారిగా గర్భం దాల్చిన వ్యక్తిగా అమెరికాకు చెందిన థామస్ బెయిటీ నిలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాపకు జన్మనిచ్చిన తొలి యువకుడు 
ఎప్పుడు : జూన్ 16
ఎవరు : హెడన్ క్రాస్
ఎక్కడ : బ్రిటన్‌లో 

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ జాతిపిత మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాల కృష్ణ గాంధీని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 18 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. సమావేశంలో ఒకేఒక్క పేరు చర్చకు వచ్చిందని, జేడీయూ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు 71 ఏళ్ల గోపాల కృష్ణకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జూలై 11న చెప్పారు. సమావేశం అనంతరం గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి(సీపీఎం), డెరెక్ ఓబ్రెయిన్ (తృణమూల్) గోపాలకృష్ణకు ఫోన్ చేశారని, తమ అభ్యర్థిగా ఉండటానికి ఆయన అంగీకరించారని తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి
ఎప్పుడు : జూలై 11
ఎవరు : గోపాల కృష్ణ గాంధీ 

మంగోలియా అధ్యక్షుడిగా ఖల్ట్‌మా బట్టుల్గా మంగోలియా 5వ అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఖల్ట్‌మా బట్టుల్గా ఎన్నికయ్యారు. ఈ మేరకు జూలై 10న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 50.7 శాతం ఓట్లతో బట్టుల్గా విజయం సాధించారు. మంగోలియా 4వ అధ్యక్షుడిగా సఖియాజీన్ ఎల్బెగ్‌డార్జ్ వ్యవహరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మంగోలియా నూతన అధ్యక్షుడు 
ఎప్పుడు : జూలై 10
ఎవరు : ఖల్ట్‌మా బట్టుల్గా 
ఎక్కడ : మంగోలియా 

వైవీ రెడ్డి పుస్తకం ‘అడ్వైజ్ అండ్ డిసెంట్’ ఆవిష్కరణరిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ వైవీ రెడ్డి రాసిన ‘అడ్వైజ్ అండ్ డిసెంట్: మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్’ పుస్తకాన్ని జూలై 6న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అంతర్జాతీయ ఆర్థిక విధానాలను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) జూన్ 28న ముంబై జైలులో మరణించాడు. దావూద్ ఇబ్రహీంకు దోసా అత్యంత సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని టాడా ప్రత్యేక కోర్టు ఈ నెల 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ముంబైలో మారణహోమం సృష్టించడానికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్ నుంచి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా దిఘీకి, పాకిస్తాన్‌కు దోసా సరఫరా చేశాడు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముస్తఫా దోసా మృతి
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : 1993 ముంబై పేలుళ్ల దోషి
ఎక్కడ : ముంబైలో 

ఇస్రో మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య మృతిభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య(75)జూన్ 29న బెంగళూరులో మృతి చెందారు. ఆయన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సోదరుడు. వెంకటయ్య అంతరిక్ష పరిశోధన సంస్థలో డెరైక్టర్‌గా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బృందంలో శాస్త్రవేత్తగా సేవలందించారు. 
చుక్కా వెంకటయ్య జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 1937 జూన్ 30న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గూడూరులో జరిగింది. రామయ్య సహకారంతో చదువులో బాగా రాణించారు. హైదరాబాద్‌లో పదో తరగతి చదివారు. వెంకటయ్య ఈ ప్రాంతం నుంచి ఐఐటీలో సీటు సాధించిన మొదటి వ్యక్తి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చుక్కా వెంకటయ్య కన్నుమూత 
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : ఇస్రో మాజీ డెరైక్టర్ 
ఎక్కడ : బెంగళూరులో 

ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్’ పేరుతో స్టేట్స్‌మన్ గ్రూప్ ప్రచురించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2న రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ప్రధానిగా విధులు నిర్వహించడంలో ప్రణబ్ నుంచి సాయం అందుకునే అదృష్టం తనకు దక్కిందన్నారు. గత మూడేళ్లలో తమ మధ్య జరిగిన భేటీల్లో ఆయన తనను కొడుకులా ఆదరించారని పేర్కొన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ 
ఎప్పుడు : జూలై 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాష్ట్రపతి భవన్‌లో 

నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ నూతన అటార్నీ జనరల్(15వ)గా 86 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వేణుగోపాల్ నియామకానికి జూన్ 30న ఆమోదం తెలిపారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు ఉంటారు. ఇంతకముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ జూన్ 18న పదవీ విరమణ చేశారు. రాజ్యాంగ నిపుణుడైన వేణుగోపాల్ గతంలో పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నూతన అటార్నీ జనరల్ నియామకం 
ఎప్పుడు : జూన్ 30 
ఎవరు : కేకే వేణుగోపాల్
ఎందుకు : ఇంతకముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ పదవీకాలం జూన్ 18న ముగిసినందుకు

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ జ్యోతి21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అచల్‌కుమార్ జ్యోతిని కేంద్రం నియమించింది. ప్రధాని మోదీ సీఎంగా ఉన్న సమయంలో జ్యోతి గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సీఈసీగా నసీం జైదీ పదవీకాలం జూలై 6తో ముగియడంతో అచల్‌ను నియమిస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. 
గుజరాత్ సీఎస్‌గా రిటైర్ అయిన జోతి గుజరాత్ విజిలెన్‌‌స కమిషనర్‌గా, 1999- 2004 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్టు చైర్మన్‌గా, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ 
ఎప్పుడు : జూలై 6 
ఎవరు : అచల్ కుమార్ జ్యోతి 
ఎందుకు : జూలై 6న పదవీ విరమణ చేసిన నసీం జైదీ 

పెరూలో అమెరికా రాయబారిగా కృష్ణభారత సంతతికి చెందిన సీనియర్ దౌత్య అధికారి, తెలుగు తెలిసిన వ్యక్తి కృష్ణ ఆర్ ఆర్స్.. పెరూలో అమెరికా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. ఆయనకు అమెరికా విదేశాంగ శాఖలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1986 నుంచి దౌత్య అధికారిగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు.

ఐటీబీపీ డెరైక్టర్ జనరల్‌గా పచ్‌నందఇండో టిబెటన్ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి ఆర్.కె.పచ్‌నంద జూన్ 30న బాధ్యతలు చేపట్టారు. ఆయన 1983 బ్యాచ్ పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. పచ్‌నంద 2018 అక్టోబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

No comments:

Post a Comment