AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు అక్టోబరు 2015

వార్తల్లో వ్యక్తులు అక్టోబరు 2015
ప్రముఖ చిత్రకారుడు శంషాద్ హుస్సేన్ అస్తమయం 
ప్రసిద్ధ చిత్రకారుడు శంషాద్ హుస్సేన్ అక్టోబర్ 24న ఢిల్లీలో కేన్సర్‌తో మరణించారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెద్దకుమారుడైన శంషాద్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళాప్రదర్శనలు నిర్వహించారు. లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఫైన్ ఆర్ట్స్ పట్టా పొందిన ఆయన హైదరాబాద్‌లోనూ తన కళను కొనసాగించారు.
సంస్కృత విద్యాపీఠం చాన్స్‌లర్‌గా గోపాలస్వామి
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం చాన్స్‌లర్‌గా భారత ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎన్. గోపాలస్వామి నియమితులయ్యారు. ఐదు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో చాన్స్‌లర్‌గా పనిచేసిన జేబీ పట్నాయక్ 2015 మార్చిలో విద్యాపీఠంలో గుండెపోటుకు గురై మృతిచెందారు. ఆ పదవిలో ఎన్. గోపాలస్వామిని నియమిస్తూ అక్టోబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అటామిక్ ఎనర్జీ కమిషన్ చీఫ్‌గా శేఖర్ బసు
భారత అటామిక్ ఎనర్జీ కమిషన్(ఏఈసీ) నూతన చైర్మన్‌గా ప్రముఖ అణు శాస్త్రవేత్త శేఖర్ బసు నియమితులయ్యారు. ప్రస్తుతం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న శేఖర్ బసును ఏఈసీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం అక్టోబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. మూడున్నరేళ్లుగా ఈ పదవిలో ఉన్న ఆర్‌కే సిన్హా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. 1975లో బార్క్‌లోని రీసెర్చ్ ఇంజినీరింగ్ విభాగంలో కెరీర్ ప్రారంభించిన బసు.. న్యూక్లియర్ సబ్‌మెరైన్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా కూడా పనిచేశారు. 2014లో పద్మశ్రీ పురస్కారంతో ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 
హాస్యనటుడు మాడా కన్నుమూత
ప్రముఖ హాస్యనటుడు, ‘పేడి’ క్యారెక్టర్లను పోషించడం ద్వారా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న అలనాటి నటుడు మాడా వెంకటేశ్వరరావు(65) కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మాడా.. అక్టోబర్ 24న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా దుళ్ల గ్రావుంలో 1950 అక్టోబర్ 10న జన్మించిన మాడా.. 300 పైగా సినివూల్లో నటించారు. అందాల రాముడు, ముత్యాల ముగ్గు, చిల్లర కొట్టు చిట్టెమ్మ వంటి చిత్రాలతో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 
మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్
అండర్‌వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్(55) అరెస్టయ్యాడు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఇండోనేసియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఆ దేశ పోలీసులు అక్టోబర్ 26న చోటా రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసులిచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జే అలియాస్ మోహన్ కుమార్ అలియాస్ నానా కోసం భారత్ గత రెండు దశాబ్దాలుగా గాలిస్తోంది. ఆయనపై 20కి పైగా హత్యకేసులు, డ్రగ్స్ దందా, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు, అక్రమంగా ఆయుధాలు కలిగిఉండటం సహా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
పాక్ నుంచి భారత్ చేరుకున్న గీత
దాదాపు పదిహేనేళ్ల కిందట తప్పిపోయి పాకిస్తాన్ చేరిన మూగ, చెవిటి బాలిక గీత(23) స్వదేశానికి వచ్చింది. అక్టోబర్ 26న కరాచీ నుంచి బయల్దేరి న్యూ ఢిల్లీ చేరుకుంది. ఇన్నాళ్లూ పాక్‌లో ఆమెకు ఆశ్రయం కల్పించిన ఈది ఫౌండేషన్‌కు చెందిన ఐదుగురు సభ్యులూ గీతతోపాటు వచ్చారు. స్వదేశానికి తిరిగి వచ్చిన గీతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కలుసుకొని స్వాగతం చెప్పారు.
త్రిపుర హెచ్‌ఆర్సీ తొలి చైర్మన్‌గా జస్టిస్ జ్యోతిసేన్‌గుప్తా
త్రిపుర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా వ్యవహరించనున్నారు. ముగ్గురు సభ్యులు కలిగిన ఈ కమిటీకి నేతృత ్వం వహిస్తున్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌తోపాటు సభ్యులను ఎంపిక చేశారు. అక్టోబర్ 19, 26వ తేదీల్లో జరిగిన సమావేశాల్లో జస్టిస్ సేన్‌గుప్తాను చైర్మన్‌గాను, న్యాయశాఖ మాజీ కార్యదర్శి ఆర్‌పీ మీనాను కమిషన్ సభ్యుడిగాను నియమించాలని కమిటీ నిర్ణయించింది.
ప్రపంచ ఆరాధ్యుల్లో గాంధీ, మోదీ
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధ్యులైన వారి జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పదో స్థానం దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా దివంగత నేత నెల్సన్ మండేలా అగ్రస్థానంలో, భారత జాతిపిత మహాత్మాగాంధీ నాలుగో స్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 125 దేశాల్లోని 285 నగరాలకు చెందిన వెయ్యిమందికిపైగా యువత అభిప్రాయాలతో ‘గ్లోబల్ షేపర్స్ వార్షిక సర్వే-2015’ పేరుతో ఈ జాబితా రూపొందించింది. సర్వేలో పాల్గొన్నవారు డ బ్ల్యూఈఎఫ్ గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీ సభ్యులు. జాబితాలో రెండో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్, మూడో స్థానంలో టెల్సా మోటార్స్ సీఈఓ ఎలన్ మస్క్ ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(5), అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులున్నారు. సర్వేలో పాల్గొన్న మొత్తం 1,084 మందిలో మోదీకి 3 శాతం మంది మండేలాకు 20.1 శాతం, గాంధీకి 12.4 శాతం మంది ఓటేశారు. 
ఉక్కు శాఖ కార్యదర్శిగా అరుణ సుందరరాజన్
కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ సుందరరాజన్ నియమితులయ్యారు. ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఈ బాధ్యతలను అప్పగించింది. 1982 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ...ప్రస్తుతం టెలికమ్యూనికేషన్ విభాగంలోని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగే షన్ ఫండ్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్ పద విలో కొనసాగుతున్నారు.

ఆసియా ఉత్తమ ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ
ఆసియాలో ఉత్తమ ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ ఎంపికయ్యారు. ఈ మేరకు లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ మేగ జీన్ ‘ఎమర్జింగ్ మార్కెట్స్’ జైట్లీని ‘ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్,ఆసియా’గా ఎంపిక చేశామని తెలిపింది. 
మిస్ దివా 2015 గా ఊర్వశి రౌతెలా
అక్టోబర్ 19న ముంబైలో జరిగిన Yamaha Fascino Miss Diva 2015 పోటీల్లో ‘మిస్ దివా-2015’ కిరీటాన్ని బాలీవుడ్ నటి, మోడల్ ఊర్వశి రౌతెలా సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ 21 ఏళ్ల సుందరి భారత్ తరఫున 2015 మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పాల్గొననుంది. అలాగే బెంగళూరుకి చెందిన నటాషా అసది మొదటి రన్నరప్‌గా, ఔరంగబాద్‌కు చెందిన నవేలి దేశ్‌ముఖ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత
ప్రముఖ తెలుగు హాస్యనటుడు కళ్లు చిదంబరం(70) అనారోగ్యంతో అక్టోబర్ 19న తుదిశ్వాస విడిచారు. విజయనగరంలో 1948 ఆగస్టు 8న జన్మించిన కొల్లూరు చిదంబరం విశాఖ పోర్టులో ఉద్యోగం చేశారు. తర్వాత ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి 1989లో గొల్లపూడి రచనతో దర్శకుడు ఎం.వి.రఘు తీసిన ‘కళ్లు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అందులో అంధుని పాత్రలో మెప్పించారు. దీంతో ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. 300 చిత్రాల్లో నటించిన చిదంబరానికి కళ్లు, అమ్మోరు, జంబలకడి పంబ, ఆ ఒక్కటీ అడక్కు, మనీ మనీ మనీ, గోవింద గోవింద, కొండవీటి దొంగ వంటి చిత్రాలు గుర్తింపునిచ్చాయి. నాటకరంగ కళాకారుల కోసం 2009లో విశాఖలో 1,180 మంది కళాకారులతో ‘సకల కళాకారుల సమాఖ్య’ అనే సంస్థను స్థాపించి చిదంబరం పలు సేవలందించారు.

సెండ్ మై గిఫ్ట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్
బెంగళూరులో నూతనంగా ప్రారంభమైన ఈ కామర్స్ స్టార్టప్ ‘సెండ్ మై గిఫ్ట్’కు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరించనున్నాడు. మనం అనుకునే వారికి బహుమతులను చేర్చేలా ‘సెండ్ మై గిఫ్ట్’ పేరిట ఈ-కామర్స్ వెబ్‌పోర్టల్ అక్టోబర్ 22 నుంచి తన కార్యకలాపాలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికైనా బహుమతులను పంపగల సౌకర్యం ‘సెండ్ మై గిఫ్ట్’లో అందుబాటులో ఉంది.
జాతీయ మహిళా కమిషన్ సభ్యుడిగా అలోక్ రావత్
కేంద్ర మాజీ క్యాబినెట్ కార్యదర్శి అలోక్ రావత్‌ను జాతీయ మహిళా కమిషన్ సభ్యునిగా కేంద్రం నియమించింది. ఐదుగురు సభ్యులు గల బృందంలో రావత్ నాలుగో సభ్యుడు. ఈ కమిషన్‌లో సభ్యునిగా పనిచేయనున్న తొలి పురుషుడు రావత్. 1977 బ్యాచ్, సిక్కిం కేడర్‌కు చెందిన రావత్ కేంద్రంలో పలురకాల హోదాల్లో పనిచేశారు.

డేర్ డెరైక్టర్‌గా మహేశ్వర రెడ్డి
రక్షణ వైమానిక పరిశోధన సంస్థ (డేర్) డెరైక్టర్‌గా డాక్టర్ కె.మహేశ్వర రెడ్డి నియమితులయ్యారు. డీఆర్‌డీఓలోని ముఖ్యవిభాగమైన డేర్ భారత సాయుధ బలగాలకు అత్యాధునిక వైమానిక యుద్ధ వ్యవస్థలను, ఎలక్ట్రానిక్ పరికరాలను అందించేందుకు నిరంతరం పరిశోధనలను కొనసాగిస్తుంది. డాక్టర్ మహేశ్వర రెడ్డి రాడార్, లేజర్, మిస్సైల్ హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేశారు. విభిన్నమైన రాడార్ హెచ్చరిక స్వీకరణ వ్యవస్థలను అభివృద్ధి చేసినందుకు 2007, 2009లో ఆయన అవార్డులు అందుకున్నారు. 
యూఎన్ వాతావరణ మార్పు ప్యానెల్ చైర్మన్‌గా హోసుంగ్ లీ
ఐక్యరాజ్యసమితి (యూఎన్) వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్ ప్రభుత్వ ప్యానెల్‌కు (ఐపీసీసీ) చైర్మన్‌గా కొరియన్ ప్రొఫెసర్ హోసుంగ్ లీ అక్టోబరు 6న ఎన్నికయ్యారు. క్రోయేషియాలోని దుబ్రోవ్‌నిక్‌లో జరిగే సదస్సుకు ఆయన నేతృత్వం వహించనున్నారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆర్‌కే పచౌరీ (భారత్) ఈ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో హోసుంగ్ లీ ఎన్నికయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత రవీంద్ర జైన్ (71) అనారోగ్యంతో అక్టోబర్ 9న కన్నుమూశారు. ‘చోర్ మచాయే షోర్’, ‘గీత్ గాతా చల్’, ‘చిత్‌చోర్’, ‘సౌదాగర్’, ‘జంగ్‌బాజ్’, ‘పూలన్‌దేవి’, ‘ప్రతిఘాత్’, ‘పతీ పత్నీ ఔర్’ తదితర బాలీవుడ్ చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. తెలుగులో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రానికి స్వరాలు అందించారు. ప్రముఖ గాయకుడు జేసుదాసును బాలీవుడ్‌కు పరిచయం చేసింది రవీంద్ర జైన్ కావడం విశేషం. వివిధ భాషల్లో ఆయన 200 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. మహాభారతం సహా పలు ఆథ్మాత్మిక టీవీ సీరియళ్లకు నేపథ్య సంగీతం అందించారు. రవీంద్ర జైన్‌కు ఈ ఏడాది పద్మశ్రీ కూడా లభించింది. ఆయన పుట్టుకతో అంధుడు.
ప్రముఖ నటి మనోరమ కన్నుమూత
ప్రముఖ తమిళ నటి మనోరమ (78) అక్టోబర్ 10వ తేదీ అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 1500 సినిమాల్లో మనోరమ నటించారు. 1937 మే 26న తమిళనాడులోని మన్నార్‌గుడిలో జన్మించిన మనోరమ 1958లో పెరియ కోవిల్ అనే తమిళ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. 1980లో శుభోదయం సినిమాతో తెలుగులో రంగ ప్రవేశం చేశారు. 2002లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అత్యధిక చిత్రాల్లో నటించిన నటిగా మనోరమ గిన్నిస్ రికార్డు సృష్టించారు.

సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కిచ్చిన రచయితలు
 దేశంలో సాంస్కృతిక రంగంపై అకృత్యాలు పెరిగిపోవడం, జీవించే స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛపై దాడికి నిరసనగా ఇద్దరు రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మేనకోడలు, రచయిత్రి నయనతార సెహగల్‌తోపాటు ప్రముఖ హిందీ రచయిత, లలితకళా అకాడమీ మాజీ చైర్మన్ అశోక్ వాజ్‌పేయి తమ అవార్డులను వాపసు చేశారు. పట్టపగలు హత్యలకు గురవుతున్న రచయితలు, మేధావులకు సంఘీభావంగా అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు వారు ప్రకటించారు.

ఐడీఎస్‌ఏ డెరైక్టర్ జనరల్‌గా జయంత్ ప్రసాద్ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలసిస్ (ఐడీఎస్‌ఏ) డెరైక్టర్ జనరల్‌గా జయంత్ ప్రసాద్ సెప్టెంబరు 29న నియమితులయ్యారు. ఈయన గతంలో ఆఫ్ఘానిస్తాన్, నేపాల్‌లో భారత రాయబారిగా పనిచేశారు.

No comments:

Post a Comment