AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు నవంబరు 2016

క్రీడలు నవంబరు 2016
రోస్‌బర్గ్‌కు ఎఫ్-1 డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ 2016 ఫార్ములావన్ (ఎఫ్1) విశ్వవిజేతగా నిలిచాడు. సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం పొందిన రోస్‌బర్గ్ మొత్తం 385 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ అబుదాబి రేసులో చాంపియన్‌గా నిలిచినప్పటికీ రోస్‌బర్గ్ టాప్-3లో నిలవడంతో హామిల్టన్ ఓవరాల్‌గా 380 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

రోస్‌బర్గ్ తండ్రి కెకె 1982లో ఎఫ్1 చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఎఫ్1లో చాంపియన్‌గా నిలిచిన రెండో తండ్రి-తనయుడు జంటగా రోస్‌బర్గ్ నిలిచాడు.
హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌లుగా సింధు, సమీర్ వర్మ
హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సమీర్ వర్మ, పి.వి.సింధు రజత పతకాలు సాధించారు. కౌలూన్‌లో నవంబర్ 27న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లాంగ్ ఆంగస్ (హాంకాంగ్) చేతిలో వర్మ ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధుపై తై జు ఝంగ్ (చైనీస్ తైపీ) గెలుపొందింది. సింధు, సమీర్ వర్మలకు 15,200 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రోల్టన్
ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ కరెన్ రోల్టన్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. ఈ మేరకు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్‌సన్ ఆమెకు పురస్కారంతో పాటు ప్రత్యేక క్యాప్‌ను నవంబర్ 24న అందజేశారు. ఐసీసీ విశిష్ట క్రికెటర్ల జాబితాలో స్థానం పొందిన వారిలో రోల్టన్ ఆరో మహిళా క్రికెటర్ కాగా ఓవరాల్‌గా 81వ ప్లేయర్.
హాకీ ఇండియా కొత్త అధ్యక్షురాలు మరియమ్మ
హాకీ ఇండియా (హెచ్‌ఐ) నూతన అధ్యక్షురాలిగా మరియమ్మ కోషీ ఎంపికయ్యారు. ఈ మేరకు హెచ్‌ఐ కార్యనిర్వాహక బోర్డు నవంబర్ 25న కోషిని అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు నరీందర్ బాత్రా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఐహెచ్‌ఎఫ్) చీఫ్‌గా ఎన్నికై నందున ఈ నియామకం అనివార్యమైంది. అలాగే హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) చైర్మన్‌గా మహ్మద్ ముస్తాక్ అహ్మద్‌ను నియమించారు. ముస్తాక్ ప్రస్తుతం హెచ్‌ఐ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.
మేరీకోమ్‌కు లెజెండ్స్ అవార్డు
భారత బాక్సర్ మేరీకోమ్‌ను అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) ‘లెజెండ్‌‌స అవార్డ్’తో సత్కరించనుంది. డిసెంబరు 20న ఆమెకు ఈ అవార్డు అందిస్తారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన ఈ మణిపురీ బాక్సర్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు కూడా. 
ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో సచిన్‌కు స్వర్ణం
భారత యువ బాక్సర్ సచిన్ సింగ్ సివాచ్ ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. నవంబర్ 26న జరిగిన 49 కేజీల విభాగం ఫైనల్లో సచిన్ 5-0 తేడాతో జోర్జి గ్రినాన్ (క్యూబా)పై విజయం సాధించాడు. ప్రపంచ యూత్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్ సచిన్. గతంలో నానో సింగ్ (2008లో), వికాస్ క్రిషన్ (2010లో) స్వర్ణాలు గెలిచారు. 
వికాస్ కు ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్ అవార్డు
హర్యానాకు చెందిన స్టార్ బాక్సర్ వికాస్ క్రిషన్‌కు 2016కు గాను ‘ఉత్తమ ప్రొఫెషనల్ బాక్సర్’ అవార్డు దక్కింది. ఈ మేరకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ నుంచి ఈ అవార్డు పొందిన తొలి బాక్సర్ వికాస్. డిసెంబర్ 20న జరిగే ‘ఐబా’ సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.హరియాణాకు చెందిన 24 ఏళ్ల వికాస్ రియో ఒలింపిక్స్‌లో 75 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు.
ఉత్తమ మహిళా బాక్సర్‌గా సిమ్రన్‌జిత్ కౌర్ 
జాతీయ మహిళా చాంపియన్‌షిప్‌లో 64 కిలోల విభాగంలో టైటిల్ గెలుచుకొని పంజాబ్‌కు చెందిన సిమ్రన్‌జిత్ కౌర్ ఉత్తమ బాక్సర్‌గా నిలిచింది. ఆమె హరిద్వార్‌లో నవంబర్ 24న జరిగిన పోటీలో జ్యోతి (హరియాణ)పై గెలుపొందింది. ఈ పోటీల్లో ఆరు స్వర్ణ పతకాలు సాధించిన హరియాణా టీమ్ చాంపియన్‌షిప్ దక్కించుకుంది. రెండు స్వర్ణ పతకాలతో రైల్వేస్ రెండో స్థానంలో నిలిచింది. 
అర్జెంటీనాకు డేవిస్ కప్టైటిల్
డేవిస్ కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అర్జెంటీనా గెలుచుకుంది. జాగ్రెట్ (క్రొయేషియా)లో నవంబర్ 28న జరిగిన ఫైనల్లో క్రొయేషియాపై విజయం సాధించింది. గతంలో అర్జెంటీనా 1981, 2006, 2008, 2011లలో ఫైనల్లో ఓడిపోయింది. 116 ఏళ్ల డేవిస్ కప్ చరిత్రలో విజేతగా నిలిచిన 15వ జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. అమెరికా అత్యధికంగా 35 సార్లు ఈ టైటిల్‌ను సాధించింది. 
అత్యధిక రంజీ మ్యాచ్‌లాడిన వ్యక్తి బుందేలా
83 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ దేవేంద్ర బుందేలా రికార్డు సృష్టించాడు. నవంబర్ 29న బరోడాతో జరిగిన మ్యాచ్ బుందేలాకు 137వది. ఇప్పటిదాకా అమోల్ మజుందార్ (136 మ్యాచ్‌లు) పేరిట ఈ ఘనత ఉంది. 40 ఏళ్ల ఈ సీనియర్ ఆటగాడు 19 ఏళ్ల వయస్సులో తొలిసారిగా 1995-96 రంజీ కెరీర్‌ను ఆరంభించాడు. సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీ సమకాలికునిగా క్రికెట్ ఆడాడు.
జాతీయ అండర్-15 చెస్ విజేత హర్షిత
జాతీయ సబ్ జూనియర్ అండర్-15 చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి.హర్షిత చాంపియన్‌గా నిలిచింది. బాలుర విభాగంలో 9.5 పాయింట్లతో మిత్రబా గుహ (బెంగాల్) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన ఎరిగైసి అర్జున్ 9 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు.
వెండీ జాన్స్‌కు ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ 2016 టైటిల్‌ను బెల్జియంకు చెందిన వెండీ జాన్‌‌స గెలుచుకుంది. నవంబర్ 29న జరిగిన ఫైనల్లో జాన్స్ 5-0 ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కు చెందిన అమీ కమానిపై గెలిచి వరుసగా ఐదోసారి విజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల కమాని స్నూకర్ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరినప్పటికీ పతకం దక్కించుకోలేకపోయింది. 

ఇదే టోర్నీలో మాస్టర్స్ విభాగంలో భారత్‌కు చెందిన ధర్మేందర్ లిల్లీ 6-2 ఫ్రేమ్‌ల తేడాతో ఇవాన్‌‌స (వేల్స్)ను ఓడించి విజేతగా నిలిచాడు. పురుషుల విభాగంలో సోహైల్ వహీది (ఇరాన్) 8-1తో పాజెట్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు.


సింధుకు చైనా ఓపెన్ టైటిల్
 భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ విజేతగా నిలిచింది. నవంబర్ 20న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11తో ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)పై విజయం సాధించింది. తద్వారా 30 ఏళ్ల చరిత్ర ఉన్న చైనా ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో చైనాయేతర క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందింది. గతంలో వోంగ్ మ్యూ చూ (మలేసియా-2007లో), సైనా నెహ్వాల్ (భారత్-2014లో) మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఆండీ ముర్రేకు ఏటీపీ వరల్డ్ టూర్ టైటిల్
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచాడు. నవంబర్ 21న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ముర్రే 6-3, 6-4తో నొవాక్ జొకోవిచ్ (నాలుగుసార్లు చాంపియన్) పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన ముర్రేకు 23 లక్షల 91 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.16 కోట్ల 29 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ముర్రేకిది వరుసగా 24వ విజయంతోపాటు వరుసగా ఐదో టైటిల్.
ధరమ్‌వీర్‌పై ఎనిమిదేళ్ల నిషేధం
రియో ఒలింపిక్స్‌కు ముందు డోపింగ్‌లో దొరికిన స్ప్రింటర్ (200 మీ.) ధరమ్‌వీర్ సింగ్‌పై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2016 జూలై 11న బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్‌లో ధరమ్‌వీర్ 20.45 సెకన్లలో పరుగు పూర్తిచేసి జాతీయ రికార్డు నెలకొల్పుతూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే ఇదే పోటీలో ధరమ్‌వీర్ నుంచి శాంపిల్ తీసుకొని పరీక్షించగా నిషేధిత ఎనబోలిక్ స్టెరాయిడ్ వాడినట్టు తేలింది. దీంతో అతను రియో ఒలింపిక్స్‌కు దూరం అయ్యాడు. తాజాగా అతనిని 8 సంవత్సరాలు నిషేధిస్తూ నాడా తీర్పునిచ్చింది.
భారత్‌కు మహిళల వన్డే సిరీస్
భారత్-వెస్టిండీస్ మహిళల వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. నవంబర్ 16న విజయవాడలో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించడంతో సిరీస్ 3-0 తేడాతో భారత్ వశమైంది.
వెస్టిండీస్‌కు మహిళల టి-20 సిరీస్
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మహిళల ద్వైపాక్షిక టీ-20 సిరీస్‌ను వెస్టిండీస్ 3-0తో గెలుచుకుంది. నవంబర్ 22న విజయవాడలో ముగిసిన మూడో టి-20 మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది.

జాతీయ మహిళల చెస్ చాంపియన్‌గా పద్మిని రౌత్
అంతర్జాతీయ చెస్ మాస్టర్ పద్మిని రౌత్.. జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. న్యూఢిల్లీలో నవంబర్ 14న ముగిసిన పోటీలో పద్మిని చాంపియన్‌గా నిలిచింది. ఆమె ఈ టైటిల్ గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి. ఎయిరిండియా క్రీడాకారిణి ఎస్.విజయలక్ష్మి (7.5) రెండో స్థానంలో నిలవగా, ఇషా కరవాడే కాంస్య పతకం గెలుచుకుంది. జాతీయ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా పద్మిని భారత జట్టులోకి ఎంపికైంది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్న ఈ జట్టు ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తలపడనుంది.
ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పసిడి పంట:
7వ ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు పసిడి పతకాలు లభించాయి. నవంబర్ 9న బర్మింగ్‌హామ్ (గ్రేట్ బ్రిటన్)లో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ఎస్.అపూర్వ- కాజల్ కుమారి (భారత్)ల జోడి స్వర్ణ పతకం నెగ్గింది. వీరు భారత్‌కే చెందిన పరిమళాదేవి-టుబా స్నేహర్ జోడీపై గెలుపొందారు. కాగా, టీం విభాగంలో మహిళలకు రెండో స్వర్ణం దక్కింది. మహిళల టీం ఈవెంట్ ఫైనల్లో అపూర్వ, కాజల్ కుమారి, పరిమళాదేవి, టుబా స్నేహర్‌లతో కూడిన భారత జట్టు శ్రీలంక జట్టును ఓడించి టైటిల్ గెలుచుకుంది. డబుల్స్ విభాగంలో భారత పురుషుల జట్టు స్వర్ణంతోపాటు రజత పతకం కూడా సాధించింది. డబుల్స్ ఫైనల్లో సందీప్-రియాజ్ (భారత్) జంట భారత్‌కే చెందిన శంకర్-ప్రశాంత్ జోడీపై గెలుపొందింది.
పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో భారత్‌కే చెందిన ప్రశాంత్ మోరే 25-22, 11-25, 25-12తో రియాజ్ అక్బర్ అలీ (భారత్)ను ఓడించి విజేతగా నిలిచాడు. 
గోల్ఫ్ యూరోపియన్ టూర్ టైటిల్ విజేత అదితి
గోల్ఫ్ మహిళల యూరోపియన్ టూర్‌లో భాగంగా జరిగిన ఇండియన్ ఓపెన్ టైటిల్‌ను అదితి (కర్ణాటక) గెలుచుకుంది. దీంతో ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారత గోల్ఫర్‌గా రికార్డులకెక్కింది. గుర్గావ్‌లో జరిగిన పోటీలో బ్రిటానీ లిన్సికోమ్ (అమెరికా)పై అదితి గెలుపొందింది. ఈ టైటిల్ విజయంతో ఆమెకు ప్రైజ్‌మనీగా 60 వేల డాలర్లు దక్కాయి.
లూయిస్ హామిల్టన్‌కు బ్రెజిల్ గ్రాండ్ ప్రి:
ఫార్ములావన్ బ్రెజిల్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. బ్రెజిల్‌లో నవంబర్ 14న జరిగిన రేసులో హామిల్టన్ టైటిల్ సాధించగా, మరో మెర్సిడెజ్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు.
పీబీఎల్ వేలంలో కరోలినా మారిన్‌కు రూ.61.5 లక్షలు
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్ వేలం కార్యక్రమం నవంబర్ 8న ముగిసింది. ఈ వేలంలో రియో ఒలింపిక్స్ సింగిల్స్ విజేత, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)కు అందరికంటే అత్యధిక మొత్తం లభించింది. ఈమెపై హైదరాబాద్ హంటర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 61.5 లక్షలు వెచ్చించింది. మారిన్ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ జీ హున్‌ను ముంబై రాకెట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్ ఆటగాడు జాన్ జార్గెన్ సన్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు రూ. 59 లక్షలకు సొంతం చేసుకుంది.
భారత్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ను అవధ్ వారియర్స్ రూ. 51 లక్షలకు కొనుగోలు చేసింది. పీవీ సింధును (రూ.39 లక్షలు) చెన్నై స్మాషర్స్ జట్టు, సైనా నెహ్వాల్‌ను (రూ. 33 లక్షలు) అవధ్ వారియర్స్ జట్టు దక్కించుకున్నాయి. పీబీఎల్-2 సీజన్ 2017 జనవరి 1 నుంచి 14 వరకు జరగనుంది.
పీబీఎల్-2 లో పాల్గొనే జట్లుఅవధ్ వారియర్స్
ముంబై రాకెట్స్
ఢిల్లీ ఏసర్స్
హైదరాబాద్ హంటర్స్
బెంగళూరు బ్లాస్టర్స్
చెన్నై స్మాషర్స్
అంధుల వరల్డ్‌కప్ అంబాసిడర్‌గా ద్రవిడ్
అంధుల టీ20 ప్రపంచకప్ రెండో ఎడిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. 2017 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ టోర్నీ జరుగనుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నేపాల్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాల్గొననున్నాయి. తొలిమ్యాచ్‌ను న్యూఢిల్లోలో, ఫైనల్‌ను బెంగళూరులో నిర్వహిస్తారు.

ఆండీ ముర్రేకు పారిస్ మాస్టర్స్ టోర్నీ టైటిల్
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నవంబర్ 6న జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జాన్ ఇస్నెర్‌పై ముర్రే గెలుపొందాడు. తాజా విజయంతో ముర్రే కెరీర్‌లో 14వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీ గెలుపొందింది. వీరు ఫైనల్లో పెర్రీ హూగ్స్ హెర్‌బర్ (ఫ్రాన్స్)-నికొలస్ మహుత్ (ఫ్రాన్స్)లను ఓడించారు.

బిట్‌బర్గర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత షి యుకీబిట్‌బర్గర్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యుకీ (చైనా) గెలుచుకున్నాడు. జర్మనీలోని సార్‌బ్రుకెన్‌లో నవంబర్ 6న జరిగిన ఫైనల్లో భారత్‌కు చెందిన సౌరభ్ వర్మపై షి యుకీ విజయం సాధించాడు.

కామన్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 8 స్వర్ణ పతకాలుకామన్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 8 స్వర్ణ పతకాలను గెలుచుకుంది. సింగపూర్‌లో నవంబర్ 6న ముగిసిన పోటీల్లో భారత్‌కు చెందిన కుస్తీ క్రీడాకారులు 8 స్వర్ణ, 8 రజత పతకాలను సాధించారు. 

భారత మహిళల జట్టుకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీఆసియా చాంపియన్‌‌స ట్రోఫీని భారత మహిళల హకీ జట్టు తొలిసారిగా గెలుచుకుంది. సింగపూర్‌లో నవంబర్ 5న జరిగిన ఫైనల్లో భారత్ 2-1తో చైనాపై విజయం సాధించింది. 2013లో జరిగిన ట్రోఫీలో జపాన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల మలేసియాలో జరిగిన ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత్ జట్టు విజేతగా నిలిచింది. 

ప్రతుల్‌కు తొలి కెరీర్ టైటిల్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రతుల్ జోషి తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల ప్రతుల్ 21-17, 12-21, 21-15తో తన తమ్ముడు ఆదిత్య జోషిపై విజయం సాధించి తొలి టైటిల్ సొంతం చేసుకున్నాడు.

No comments:

Post a Comment