AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఫిబ్రవరి 2015

వార్తల్లో వ్యక్తులు ఫిబ్రవరి 2015
కెమెరామెన్, దర్శకుడు ఎ.విన్సెంట్ మృతి
ప్రముఖ కెమెరామెన్, దర్శకుడు ఎ. విన్సెంట్ (87) చెన్నైలో ఫిబ్రవరి 25న మరణించారు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు పనిచేశారు. మలయాళంలో 45 చిత్రాలను రూపొందించారు. తెలుగులో కులగోత్రాలు, లేతమనసులు, సోగ్గాడు, సెక్రటరీ, ప్రేమనగర్, అడవి రాముడు, ఘరానా మొగుడు, సాహస వీరుడు - సాగరకన్య లాంటి సినిమాలను చిత్రీకరించారు.
సామాజికవేత్త మీరా కొసాంబీ మృతి
ప్రముఖ సామాజికవేత్త మీరా కొసాంబీ(75) పుణేలో ఫిబ్రవరి 27న మరణించారు. ప్రముఖ చరిత్రకారుడు, గణిత శాస్త్రవేత్త డి.డి. కొసాంబీ కుమార్తె అయిన మీరా ముంబై యూనివర్సిటీలో మహిళా అధ్యయనాల పరిశోధన కేంద్రం డెరైక్టర్‌గా పనిచేశారు. 15 పుస్తకాల రచన, సహరచన, ఎడిటింగ్ చేశారు.
అబూసలేంకు జీవితఖైదు
ఇరవైఏళ్ల నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు జీవితఖైదు పడింది. ఈ మేరకు శిక్ష ఖరారు చేస్తూ ముంబైలోని టాడా ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 25న తీర్పు వెలువరించింది. ఈ కేసులో సలేం మాజీ డ్రైవర్ మెహందీ హసన్‌కు సైతం జీవితఖైదు విధించింది. పోర్చుగల్‌తో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఖైదీల పరస్పర అప్పగింత ఒప్పందం ప్రకారం సలేంకు ఉరిశిక్షగానీ, 25ఏళ్లకు మించిన జైలు శిక్షగానీ విధించడానికి వీలు లేదని వాదనల సందర్భంగా సలేం తరపు న్యాయవాది సుదీప్ పస్బోలా వాదించారు.
సౌర విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ రంగ ఎన్‌టీపీసీ తలపెట్టిన 15,000 మెగావాట్ల గ్రిడ్ ఆధారిత సౌర విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ (ఎన్‌వీవీఎన్) మూడు దశల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే కిరోసిన్, డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గగలదు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఫిబ్రవరి 25వ తేదీన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సీపీఐ సీనియర్ నేత పన్సారే మృతి
మహారాష్ట్రకు చెందిన సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారే (78) ముంబైలో 2015 ఫిబ్రవరి 20న మరణించారు. రహదారి సుంకం (టోల్ చార్జెస్)కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనపై ఫిబ్రవరి 16న దుండగులు కాల్పులు జరిపారు. గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్‌గా తపన్ మిశ్రా
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థలో అత్యంత కీలకపాత్ర పోషించే స్పేస్ అప్లికేషన్ సెంటర్ (శాక్) డెరైక్టర్‌గా కోల్‌కతాకు చెందిన శాస్త్రవేత్త తపన్ మిశ్రాను నియమించినట్టు ఇస్రో ఫిబ్రవరి 21న అధికారికంగా ప్రకటించింది. స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్‌గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఏఎస్ కిరణ్‌కుమార్‌కు మూడేళ్లు పదవీ కాలాన్ని పొడిగించి ఇస్రో చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. గుజరాత్ రాష్ర్టంలోని అహమ్మదాబాద్‌లో ఉన్న శాక్ సెంటర్ డెరైక్టర్ పోస్టు సుమారు ఐదు నెలల పాటు ఖాళీగానే ఉండిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తపన్ మిశ్రాను ఈ సెంటర్ డెరైక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇస్రో అధికారికంగా పేరును ప్రకటించింది. 
నిర్మాత రామానాయుడు మృతి
ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు (78) హైదరాబాద్‌లో అనారోగ్యంతో ఫిబ్రవరి 18న మరణించారు. ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ఈయన మూవీ మొఘల్‌గా పేరుగాంచారు. 13 భాషల్లో 150 చిత్రాలు నిర్మించి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించారు. వీటిలో అత్యధికంగా తెలుగులోనే ఉన్నాయి. 1964లో ‘రాముడు-భీముడు’తో చిత్ర నిర్మాణం ప్రారంభించిన ఆయన సురేష్ ప్రొడక్షన్‌‌స పేరుతో చిత్ర నిర్మాణం చేపట్టారు. 1989లో హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోస్‌ను ప్రారంభించారు. ఆయన వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్, 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1999-2004 మధ్య కాలంలో బాపట్ల లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
కార్టూనిస్ట్ రాగతి పండరి మృతి
ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి (50) అనారోగ్యంతో విశాఖపట్నంలో ఫిబ్రవరి 19న మరణించారు. ఆమె పోలియోతో రెండు కాళ్లు పనిచేయని స్థితిలో ఆత్మవిశ్వాసంతో ఇంట్లోనే విద్యనభ్యసించారు. తొలి మహిళా కార్టూనిస్టుగా గుర్తింపు పొందారు. అనేక పత్రికలకు 16,000 పైగా కార్టూన్లు గీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం (2011) పొందారు.

రచయిత డాక్టర్ కేశవరెడ్డి మృతి
ప్రముఖ వైద్యుడు, రచయిత డాక్టర్ పి.కేశవరెడ్డి (69) నిజామాబాద్‌లో 2015 ఫిబ్రవరి 13న మరణించారు. ఆయన రచించిన ‘అతడు అడవిని జయించాడు’, ‘మూగవాని పిల్లనగ్రోవి’, ‘సిటీ బ్యూటిఫుల్’, ‘శ్మశానాన్ని దున్నేరు’, ‘చివరి గుడిసె’ లాంటి నవలలు అధిక ప్రాచుర్యం పొందాయి. వైద్యుడైన కేశవరెడ్డి కుష్టువ్యాధిపై రాసిన పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి.
తెలంగాణ గాంధీ కృష్ణమూర్తి మృతి
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ గాంధీగా పేరొందిన భూపతి కృష్ణమూర్తి (89) వరంగల్‌లో 2015 ఫిబ్రవరి 15న మరణించారు. ఆయన 1944 అక్టోబర్‌లో మహాత్మాగాంధీతో మహారాష్ట్రలోని వార్దా ఆశ్రమంలో గడిపారు. 1946లో ఖాదీ బోర్డు ప్రచార కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రజాకార్ల దాడులను ఎదుర్కొన్నారు. 1948లో గ్రంథాలయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రమించిన ఆయన తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.
ఐటీబీపీ డెరైక్టర్ జనరల్‌గా కృష్ణ చౌదరి
భారత్, టిబెట్ సరిహద్దు భద్రతా పోలీసు (ఐటీబీపీ) నూతన డెరైక్టర్ జనరల్‌గా 2015 ఫిబ్రవరి 10న సీనియర్ ఐపీఎస్ అధికారి కృష్ణ చౌదరి బాధ్యతలు స్వీకరించారు.

అమెరికా వాణిజ్య సలహా సభ్యుడిగా బంగా 
 
అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విధానాల సలహా కమిటీలో సభ్యుడిగా ప్రవాస భారతీయుడు అజయ్ బంగాను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. అజయ్ బంగా ప్రస్తుతం ఇండో- అమెరికన్ వాణిజ్య మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

హోం కార్యదర్శిగా ఎల్.సి.గోయల్కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్.సి.గోయల్‌ను అనిల్ గోస్వామి స్థానంలో హోంశాఖ నూతన కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 4న నియమించింది. గోయల్ కేరళ కేడర్‌కు చెందిన 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గోయల్ గతంలో హోంశాఖలో సంయుక్త కార్యదర్శి (అంతర్గత భద్రత)గా పనిచేశారు. శారదా కుంభకోణంలో కాంగ్రెస్ నేత మాతంగ్‌సిన్హ్ అరెస్ట్‌ను నిలువరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అనిల్ గోస్వామికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది.

బీడీఎల్ సీఎండీగా వారణాసి ఉదయ భాస్కర్భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎండీగా వారణాసి ఉదయ భాస్కర్ నియమితులయ్యారు. ఢిల్లీ ఐఐటీలో పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎం.టెక్ చదివిన ఈయనకు క్షిపణుల తయారీకి సంబంధించిన వివిధ విభాగాల్లో ఆయనకు 25 ఏళ్ల అనుభవం ఉంది. 2010-11 సంవత్సరానికి రక్షణ మంత్రి విశిష్ట అవార్డుకు కూడా ఉదయ భాస్కర్ ఎంపికయ్యారు.

No comments:

Post a Comment